Saturday, March 4, 2017

మా ద్వారకా యాత్ర - రెండవ భాగము

మా ద్వారకా యాత్ర - రెండవ భాగము

అందమైన అర్థము నిచ్చు పదములు అలంకారం రచనకి
మందమైన నడక నిచ్చు పదములు అలంకారం తరుణ రమణికి
డెందమును ఊయలలూపు పదములు అవసరం కవితకి
నంద గోపబాలుడు గోవిందుని పదములు అవసరం మనశ్శాంతికి

అవగాహన లేని జ్ఞాన సముపార్జనము
ఆచరణ లేని సదాచార శ్రవణము
ఉపాసన కాని విద్యాభ్యాసము
మూఢత నిండిన‌ గోవింద తత్త్వావలోకనము
పృథివిని నేడు ఆవరించి అలుముకున్నవి
గోవిందా! కలినేమి నీ ఈ వింత వింతలు జనార్దనా!

ద్వారకాధీశుని దివ్య దర్శనము‌ అయ్యాక కశ్యప్ మమ్మల్ని అమ్మవార్ల, శ్రీకృష్ణుని‌ రాణుల దేవాలయాల సందర్శనం చేయించాడు. ముందుగా‌ జాంబవతీ ఆలయం, పిదప రాధికా‌దేవి ఆలయం చూపించాడు. నాకు రాధ పదము కన్న రాధికా పదము మీద మోజు కొంచెం ఎక్కువ.

శ్రీలక్ష్మ్యార్ధనారాయణ దర్శనం

మనందరము‌ శివపార్వతుల అర్ధనారీశ్వర తత్త్వానికి, రూపానికి బాగా‌ అలవాటు పడ్డవాళ్ళము. ద్వారకలో లక్ష్మీదేవి‌ అర్ధ భాగమై ఉండగా‌ ఒకే‌ విగ్రహములో లక్ష్మీనారాయణులను చెక్కిన శిల్పానికి ఆలయం ఉంది. ఇది‌ వింతగాను, సరదాగాను, అర్ధనారీశ్వర తత్త్వాన్ని లక్ష్మీ నారాయణులకు అనువదించిన తీరు ముచ్చట గొలిపింది. ఆపై‌ రాధా‌మాధవుల గుడి, ద్వారకాధీశుని ప్రతిరూపమైన మరొక విగ్రహం కల ఆలయాన్ని‌, సత్యభామ ‌ఆలయాన్ని‌, సరస్వతీ దేవి ఆలయాన్ని చూశాము. బలరాముని, దేవకీ మాతల ఆలయాలను దర్శించాము.

ద్వారకా శంకర మఠ పీఠాధిపతి‌ ఆవాసము ఈ‌ ద్వారకాధీశుని ఆలయ ప్రాంగణం లోనే‌ ఉంది. ముందుగా, శారదాంబా విగ్రహము, ఆపై ద్వారకాపీఠ శంకరాచార్యుల వారు శ్రీ స్వరూపానందుల పటము, ఆది శంకరాచార్యుల విగ్రహము వరుసగా ఉన్నాయి. శంకరాచార్యులు శ్రీ స్వరూపానంద్ జీ మహరాజ్ పర్యటనలో ఉన్నారు.

ఆపై ఒక ఎత్తైన ప్రదేశంలో‌ శంకరాచార్యుల వారు పూజించే‌ చంద్రమౌళీశ్వర స్వామి, నవగ్రహముల రజత విగ్రహముల బొమ్మల కొలువు ఉంది. వారికి, వాటికి నమస్కరించి, గుడి బయటకు‌ మరొక వైపు నుంచి వచ్చాము.
మాతో సందర్శన చేయిస్తున్న క్షణం నుంచీ‌ కశ్యప్ ద్వారకను శ్రీకృష్ణుని కర్మభూమిగా పరిచయం చేస్తూ, కృష్ణభగవానుడు తన పాతికో ఏట ఇక్కడకు వచ్చి వంద సంవత్సరములు ద్వారకను పాలించి తన నూట పాతికో ఏట నిర్యాణం చెందాడని చెబుతూ వచ్చాడు. కృష్ణ పరమాత్మ పాతిక అడుగుల ఎత్తు ‌ఉండేవాడనీ‌, అ నీడలు (ఛాయలు) ఆలయ నిర్మాణంలో ప్రతిబింబిస్తున్నాయని, ఏవేవో పోలికలు చెప్పాడు. ఆలయానికి ఏడు‌ అంతస్తులు ఉన్నాయి. వాటికీ ఏదో చెప్పాడు.

కృష్ణుని లీలలు నంద వ్రజము, బృందావనం, మధురల లోనివి మనకు చాలా పరిచయము.‌ అంతకు‌ మించి ఎన్నో సంవత్సరాలు ద్వారకలో పాలన చేశాడు‌ కృష్ణుడు. యదువంశంలో ముసలం పుట్టి వారు‌ తమ వంశాన్ని నిర్మూలనం చేసికుంటున్నప్పుడు‌ శ్రీకృష్ణుడు, బలరాముడు ‌సోమవాథ్ పక్కన‌గల‌ ప్రభాస తీర్థం పరిసరాల అరణ్యము లోనికి వచ్చారు. అక్కడ బోయవాని బాణానికి కృష్ణుడు‌ నిర్యాణం చెందడానికి ముందుగా బలరాముడు‌ నిర్యాణం చెందాడు.

కృష్ణుడు‌ ఆ రోజులలో ఆహారం తీసికునే (భోజన) సమయానికి పూరీ జగన్నాథానికి వెళ్ళేవాడని (ద్వారకలో పంటలు పండవు, మంచి నీళ్ళు దొరకవు అని దూర్వాసుని శాపం ఉంది కదా) ఐతిహ్యాన్ని కశ్యప్ ఉటంకించాడు. అతని మాటల్లో చార్ ధామ్‌ అనే పదం చాలాసార్లు వచ్చింది.

ఆ నాలుగు ధామ్ లు - రామేశ్వరం, పూరీ జగన్నాథం, బదరి, ద్వారక. ఇందులో రామేశ్వరం జ్ఞానభూమి అనీ, జగన్నాథ పూరీ ఆహార భూమి అనీ, బదరి మోక్షభూమి అనీ, ద్వారక కర్మభూమి అనీ;

ద్వారకా దర్శనంతో‌ మనిషి ఇహలోక జీవితానికి పరిపక్వత వచ్చి, రాలిపోయే ముందు భగవద్దర్శనం చేసికొని పరమాత్మలో ఆనందరూపంలో కలిసిపోతాడని భగవంతుడు ‌మాతో అన్నట్టు‌ నాకు‌ అనిపించింది. నేను, మా ఆవిడ సంసార బాధ్యతలను శ్రద్ధగా వహిస్తూ, సంసార తాపత్రయాలను ‌నెమ్మదిగా‌ తగ్గించుకుంటూ వానప్రస్థాశ్రమం లోనికి బుడి బుడి‌ అడుగులు వేస్తున్నాం. ద్వారక తీర్థయాత్ర మాకు ‌ఆ అనుభవాన్ని, అవగాహనను రుచి చూపించింది.

ఎత్తులు పల్లములు సహజము రమణికి
మెత్తని పల్లవములు సహజము తరువునకు
తీయని జలములు సహజము నల్లని మబ్బుకు
హాయిని కలిగించుట సహజము నల్లనయ్య గోవిందునకు

ద్వారకను మరుభూమి‌ అని కూడా అన్నాడు‌ కశ్యప్. యాదవులందరూ మడిసిన భూమి కదా అది. మరుభూమిలో శరీరం తన ఆకృతిని భస్మం చేసి కుంటుంది. ఇక్కడ ద్వారకలో కూడా‌ మన శరీర స్పృహ, అహంకార మమకార స్మృతి భస్మీపటలం చెంది‌ మిగల కుండా, వాటి జనన ప్రదేశంలో‌ఉనికిని కోల్పోవడంగా ద్వారకాధీశుని సందర్శన ఫలంగానూ‌ చెప్పుకోవచ్చు.

మానసిక కార్యకలాపములు తమ జనన ప్రదేశమైన‌ బ్రహ్మములో లీనమవడంగా కూడా‌ ఈ ద్వారకాధీశ ‌దర్శనాన్ని‌ అన్వయించుకోవచ్చు.

అప్పుడు కశ్యప్ మమ్మల్ని ఒక శాల లోనికి తీసికొని వెళ్ళాడు. అక్కడ‌ ధాన్యములు, పంచదార, పప్పులు, నేయి లతో తులాభారం, అన్నదానం లకు ధన సమర్పణ వ్యవస్థలు కల ప్రదేశం. ద్వారకలో ఏ పంటలూ పండవు గనక (ఇప్పుడూ ద్వారక చుట్టు పక్కల అంతా‌ ఎరిడ్ (arid) గా‌ ఉంది. చవుడు నేల. చవిటి పర్ర. ఉప్పు నీరు. ఏ పంటలూ అస్సలు పండవు. సస్యశ్యామలతే లేదు. క్షార భూమి.

అందుకని పూర్వకాలంలో యాత్రీకులనుంచి ఈ ‌వస్తు సంగ్రహం చేయడానికి ఈ ‌వ్యవస్థ పెట్టారని నాకు అనిపించింది. ఇప్పుడు పరిస్థితులు మారినా ఈ పద్ధతి ఇంకా‌ పా టిస్తున్నారని నాకు అవిపించింది. ద్వారకాధీశుని ఆలయాన్ని పురోహితుల సంఘం నిర్వహిస్తుంది. వారి మనుగడకై ఆ రోజులలో ఈ ఏర్పాటు చేయబడింది. తమిళనాడు లోని చిదంబర ఆలయ నిర్వహణ కూడా గురుకులులు చేస్తారు.

మేము 45 రోజులకు అన్నదాన నిర్వహణ ఖర్చు నిమిత్తం ధన సమర్పణ చేశాము. ఈ ‌కార్యక్రమము‌ మనకు ఇష్టం కాని, నమ్మకం కాని లేని పక్షాన చేయనవసరం‌ లేదని నాకు అనిపించింది.

అటు పిమ్మట ఆలయ ఆ ద్వారం గుండా బయటకి‌ వచ్చి మెట్లు దిగితే గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం వస్తుంది. సాగర నదీజల వయ్యారపు సంగమం అక్కడనుంచి‌ కనిపించే‌ సుందర దృశ్యం. గోమతీ నది‌ లక్నో నగరం పక్కనుంచి ప్రవహిస్తుంది. ఈ గోమతి, ఆ గోమతి వేరు. గోమతీ నదీ జలంతో‌ ప్రోక్షణం చేసికొని, ద్వారక సందర్శన లోని స్నాన్ కార్యక్రమము పూర్తి చేసికొని,‌దాన్‌ ముందే‌ ఇచ్చి;

ఇప్పుడు జ్ఞాన్ ;

గోమతి నది ఘాట్ నుంచి ఆలయానికి‌ 56 మెట్లు ఎక్కుతూ ఓం‌ నమో భగవతే‌ వాసుదేవాయ అని స్మరించుకుంటూ, 56 వికారములను పోగొట్టమని నేను - 56 సంఖ్య కశ్యప్ చెప్పినది - (మా ఆవిడ మాత్రం ఏ వికారమూ కలగకూడదంటూ) కృష్ణపరమాత్మను వేడుకుంటూ జ్ఞాన సిద్ధికై ప్రార్ధిస్తూ యాత్రా సాఫల్యాన్ని కూర్చమనీ అచ్యుతుని అర్ధిస్తూ, స్వర్గ ద్వారమైన ఆ‌వైపు నుంచి మరల ఆలయ ప్రవేశం చేసి కృష్ణ‌పరమాత్మను మరొక సారి తనివితీరా దర్శించి కృతార్ధులమైనాము.

ఇంతటి దివ్యానుభవాన్ని పూర్తిగా తన గైడెన్స్ ద్వారా నే అని కాకుండా, తన మాటలతో‌ మా ఊహలకు రెక్కలనిచ్చి, మా అంతట మాకు అవగాహనకు వీలు కల్పించిన, మా యాత్రను అందగింపజేసిన ‌కశ్యప్ కు మనసారా దక్షిణ ‌అనుకున్నట్టు సమర్పించి, నమస్కరించి అతని నుంచి శలవు తీసికున్నాము.

వాదములు ప్రసంగములు వేదాంతములు
శుష్కాయాసములు; చూపించలేవు పరంధాముని;
నిరంతర గోవింద నామ స్మరణమున
శుద్ధమైన మనసు చూచును విశ్వాత్ముని

No comments:

Post a Comment