Saturday, March 4, 2017

మా ద్వారకా యాత్ర - నాలుగవ భాగము

మా ద్వారకా యాత్ర - నాలుగవ భాగము
 
లిపి తెలియక భాష చదవలేనటుల; పరిచయము లేక
నారీ హృదయము తెలియలేనటుల; ప్రాథమిక శిక్షణ లేక
విజ్ఞాన శాస్త్రములు, తత్త్వము అర్థము కానటుల; మీ పై
భక్తి, మీ కరుణ లేక మిమ్ము తెలియ లేము శంకరా!

భ్రమియించు భూమిపై భ్రమల సుడిగుండాల
చిక్కుకొని సంభ్రమము పొంది విభ్రమము మిగిలి
జీవితము భ్రాంతిగా తోచు మాకు భ్రమ విభ్రమములు
అంటని సంభ్రమము సంబరము నిండు శంకరా!

శ్రావ్యము కాని పాట విశ్వ శ్రేయము కాంక్షించని
కావ్యము, కన్నులకింపు గాని నృత్యము, ప్రజల బాధ
ల వ్యథల బాపి సేమము చూడని నాయకత్వము గోవిందుని
దివ్య నామము స్మరింపని హృదయము పృథివిని వృథా! వృథా!

నాగేశ్వర జ్యోతిర్లంగ దర్శనము కలిగించిన ఆహ్లాదాన్ని అనుభవిస్తూ, పార్వతీపరమేశ్వరుల ఆశీర్వచనమునకు సంతసపడుతూ, తరువాతి దర్శనయ స్థలానికి బయలు దేరాము. అది గోపీ తలాబ్ యదువంశ నిర్మూలనం మొదలయ్యే ముందు బృందావన గోపికలను రక్షణగా అర్జునుడు‌ ఉండి నంద వ్రజానికి తీసికెళుతున్నప్పుడు, అంతకు ముందు‌ ఈ తటాకానికి సంబంధించిన పురాణ కథ ఏదో చెప్పాడు బస్ లోని గైడ్. నాకేమీ‌ అర్థము కాలేదు. దానికి తగ్గట్టే ఆ గ్రామస్తులు ఆ తటాకాన్ని చూడడానికి 100 రూపాయలు ప్రవేశ రుసుము అన్నారు. మేము అంత ఆసక్తి చూపించ లేదు. తరువాతి చోటు బెట్ ద్వారక. గుజరాతీలో బెట్‌ అంటే‌ ద్వీపం.

గోమతి ద్వారక - బెట్ ద్వారక

ద్వారకాధీశుని ఆలయం ఉన్న ప్రదేశాన్ని‌ గోమతి ద్వారక అంటారు. అక్కడికి 30 కిలోమీటర్లలో ఓఖా ‌అనే ఊరు ఉంది. కృష్ణుడు రాజ్యపాలనం, రాజ్య సంబంధ విషయాలు గోమతి ద్వారకలో, పట్టపు రాణులతో ఆయన
నివాసము బెట్ ద్వారకలో ఉండేది. ఈ బెట్ ద్వారక చాలా భాగం తరువాత సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా భూ ప్రదేశం మిగిలి ఉంది. అక్కడి విశేషాలు, శేషాలు చూడడానికి బెట్ ద్వారకకు బయలుదేరాం.
ఓఖా నుంచి బోట్ లో సముద్రం మీద అరగంట ప్రయాణించి బెట్ ద్వారక చేరుకోవాలి. బస్ వాడు‌ మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళి రమ్మన్నాడు. అప్పుడు ‌సాయంకాలం నాలుగున్నర అయింది. ఆరున్నరకు ఠంచన్ గా బస్ ద్వారకకు బయలుదేరి వెళ్ళిపోతుందని‌ఆ లోపులో మేం వెనక్కి వచ్చెయ్యాలని పదే పదే హెచ్చరించాడు. మా బస్ బుకింగ్ టిక్కెట్లను ఇమ్మని‌ తీసేసుకున్నాడు.

దిగి బోట్ వైపు నడిచాము. జనం ఉన్నారు. ఒక్కో‌ బోట్‌ వస్తోంది, జనాలను ఎక్కించుకొని వెళ్ళిపోతోంది. బోట్ లోనే డబ్బులు తీసికుంటారు. ఆ బోట్ లో‌ 50 మందిని మాత్రమే ఎక్కించుకోమని, ప్రయాణీకుల వద్ద ఒక వైపుకి
పాతిక రూపాయలు ‌తీసికోమనీ గవర్నమెంట్‌వారి‌ ఆర్డరు.

కానీ బోట్ వాళ్ళు మాత్రం పది రూపాయలు తీసికొని 100-150 మధ్య ఎక్కించుకుంటారు. కొండొకచో ‌200 ల
మందిని కూడా ఎక్కించుకుంటూంటారుట. మనదేశంలో అన్ని విషయాలలోను ఇంతే. రూలు ఒకటి, ఆచరణ ఒకటి. రూలుకి పూర్తిగా వ్యతిరేకమైనా అంతే. ఓట్ బాంక్ లు, రాజకీయ‌ నాయకులు, వారి కుహనా ‌అనుచరులు,
పాలకులు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళకులపోళ్ళయిన మనోళ్ళు, డబ్బున్న వాళ్ళకి రూల్స్ ఏమీ లేవు. దేశ దుస్థితికి ఇందంతా ‌కారణమే.

మేము బోట్ ఎక్కడానికి వెళుతూంటే మరమరాలు, అటువంటివి కల పొట్లాలు అమ్ముతున్నారు. ఎందుకో‌ నాకు‌ అర్థము కాలేదు. దేవుడికి ఇచ్చి ప్రసాదంగా తెచ్చుకోవడానికా‌ అనుకున్నాను.
బోట్ ఎక్కాక తెలిసింది పావురాలకు వెయ్యడానికి అని. ఓఖా నుంచి బెట్ ద్వారకకు వెళ్ళే ప్రయాణ ‌సమయంలో
జనాలు కొన్న ఈ పొట్లాలలోనివి పావురాలకు వేశారు. బోట్‌ వెంబడి వచ్చే డజన్ల కొద్దీ పావురాలు సముద్రంలో‌ పడ్డ ఆ ఆహార పదార్ధాలను లాఘవంగా నోటికి కరుచుకొని పావురాలు తింటున్నాయి.

బోట్ లో ఓఖాలో కోస్ట్ గార్డ్ లో పనిచేస్తున్న ఒకాయన‌ పరచయమయ్యారు. అక్కడి విశేషాలు చెబుతూ‌ మాకు ఆనందం ‌కలిగించే ఒక మాట చెప్పారు. గోమతి ద్వారక, బెట్ ద్వారక ఒకే రోజు దర్శించుకుంటే భగవత్ ప్రసన్నత లభించినట్టే అని, ద్వారకకు మళ్ళీ దర్శనార్ధము ‌రానవసరము లేదని; అలా కాక వేరు వేరు రోజులలో దర్శనము చేసికుంటే మరల తప్పక ద్వారకా‌ యాత్ర చేయయవలసిన అవసరం ఉంటుందని. అప్పటికే‌ ప్రొద్దుట
గోమతీ ద్వారకలో పరమాత్మ దర్శనము చేసేసుకున్నాము, అదే‌ రోజు బెట్‌ద్వారకాధీశుని దర్శనం కూడా ‌అవుతున్వందుకు కృష్ణపరమాత్మ ప్రసన్నతకు, ప్రసాద దృష్టికి‌ మేము అర్హులమయ్యామని సంతృప్తి, సంతోషం కలిగాయి

ఆయన‌ విశాఖపట్టణంలో‌ రెండేళ్ళు పనిచేసారట. భార్యా భర్తలిద్దరికీ విశాఖపట్టణం, ఆ పరిసరాలు ఎంతో నచ్చాయట. బెట్ ద్వారక మీద 1971 యుద్ధంలో పాకిస్తాన్ నేవీ‌ శతఘ్నులను కురిపించిందిట. అప్పుడు మవ వాళ్ళు కరాచీ హార్బర్ పై దాడి చేసి ధ్వంసం చేశారట. అక్కడికి‌ పాకిస్తాన్ సముద్ర సరిహద్దు 140 కి. మీ. ఉందిట.
బెట్‌ ద్వారక లో 9000 మంది ముస్లిములు, 1000 మంది‌ హిందువులు నివసిస్తూంటారట. ద్వారక ప్రాంతం కలిసి ఈ ప్రాంతం‌అంతా‌ దేవభూమి ద్వారక జిల్లాగా ఉంది. బోట్‌ మీద ఆ సాయంకాలం సముద్రప్రయాణం ఎంతో హాయిని‌ గొలిపింది. సముద్రపు గాలి ఎంతో చల్లనిది. ‌సేద తీరుస్తుంది.

బోట్ దిగి ఒక 300 మీటర్లు నడిస్తే అక్కడి ద్వారకాధీశుని దర్శించాము. గుడి బాగానే ఉంది. సంసార పక్షంగా‌ఉంది. లోపల లక్ష్మీదేవి పటం, జాంబవతి, రుక్మిణి, సత్యభామల, శ్రీలక్ష్మ్యార్ధనారాయణ‌ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ, గోమతీ ద్వారకలోనూ సందర్శనానికి ఎందరో గ్రామీణులు వస్తున్నారు. వారి అమాయకపు భక్తి ఎంతో ముచ్చట గొలిపింది.
మరల వచ్చి బోట్ ఎక్కాము. మా బోట్ పై డజన్లకొద్దీ‌ పావురాలు మరల ఎగరడం మెదలు పెట్టాయి‌. మొదటి సారిలా ప్రయాణీకులు మరమరాలు అవీ‌ ఎక్కువగా వెయ్యలేదు. పాపం ఆ అరగంట‌ సేపూ ఆ పావురాలు ఆహారంపై ఆశతో ఎగురుతూ ఇటువైపు దాకా‌ వస్తూనే ఉన్నాయి. వాటికి రెక్కలు, కాళ్ళు బాగా‌ లాగి నెప్పెట్టేశాయేమో‌ అనిపించి బాధ కలిగింది నాకు. పాపం మూగజీవులు. ఏ ఆశ పెడితే ఆ‌ ఆశ.

మేము ఠంచన్‌ గా‌ 6-30 కి‌ బస్‌ దగ్గరకు వచ్చేశాము. లేకపోతే బస్‌ వెళ్ళిపోయేది. ఇంకో‌ బస్ ఎక్కిరావచ్చు. కాని మవిషికి టిక్కట్టు‌ 30 రూపాయలు. మా మొత్తం ట్రిప్ మనుషికి కి‌ 80 రూపాయలు.

ఆ రాత్రికి పూర్తి విశ్రాంతి తీసికున్నాము. మరునాడు కృష్ణుని మరొక సారి‌ దర్శించుకున్నాము. సాయంకాలం గుడి పక్కనే ఉన్న సుధామ సేతు - గోమతీ నదిపై ఉంది - అవతలికి వెళ్ళాము. అది కూడా‌ ఒక చిన్ని దీవి. ఇసక పర్ర. ఒక చిన్న లక్ష్మీనారాయణుల గుడి‌ ఉంది. ఐదుగురు‌ ఋషుల‌ పేర ఐదు నూతులు ఉన్నాయి. ‌నీళ్ళు మెట్ట ప్రాంతంలో నీటి వలె‌ చప్పగా ఉన్నాయి. చుట్టూ సముద్రం మధ్యలో ఈ నూతులు. అదీ ప్రత్యేకత. ఆ దీవిపై ఆ హాయినిచ్చే గాలిని అనుభవిస్తూ చాలాసేపు కూర్చున్నాము.

గోమతీ నది‌ జన్మస్థానము ఉప్పునీటి‌ కయ్యలాంటిది. నీళ్ళు సముద్రపు నీళ్ళ రుచిలో ఉంటాయి, దాని‌ జనన ప్రదేశం నుంచీ! గోమతి వెడల్పు చాలా తక్కువ. విజయవాడ కృష్ణా కాలువ కన్న తక్కువ. ద్వారక ఊరు కూడా చాలా చిన్నది. మన ‌కొవ్వూరు కన్న చాలా చిన్నది.

రాత్రి 8 గంటలకు ద్వారకాధీశుని హారతి సమయంలో తనివి తీరా దర్శించుకొని హోటల్ కి చేరాము. గుజరాతీ ధోక్లా తప్పక రుచి చూడమని మా కోడలు చెప్పింది. తనకి రకరకాల ప్రాంతాలలో ఏ యే ఆహార పదార్ధాలు తింటారు, ఏవి బాగుంటాయి అనే విషయంలో మంచి జ్ఞానము ఉంది. తను రకరకాల పదార్ధాలు బొంబాయిలో రుచి చూస్తూంటుంది. బొంబాయి మినీ ఇండియా కదా. అన్నిరకాలవి దొరుకుతాయి. ఏ ఊరు వెళ్ళినా అక్కడి స్పెషల్స మా ఆవిడ కోడలు నుంచి తెలుసుకుంటుంది. మేము రుచి చస్తాము. ఆ‌ ధోక్లా రుచి చూశాము. బాగుంది. కచౌరి అని మరొక ఆహార పదార్ధాన్ని ఆ షాపతను రికమెండు చేశాడు. తిన్నాము చాలా బాగుంది. మావాళ్ళకి బొంబాయి తెచ్చాము. అందరికీ ‌ఆ ద్వారక గుజరాతీ కచౌరి బాగా‌నచ్చింది. స్వీట్‌ అంతగా ఇష్టపడని. నేనూ‌ దానిని‌ ఇష్టంగా తిన్నాను.

అక్కడ ప్రసాద్ ఘర్ అని ఒక ధర్మశాలలో భోజన సదుపాయం ఉంది. ఇరవై రూపాయలు. ఒక హాట్- కారప్పూస లాంటిది, స్వీట్ బూందీ తో సహా‌ అన్నము, చపాతీలు అన్ లిమిటెడ్, సబ్జీ; పెరుగు, మజ్జిగ ఉండవు. అవి బైట కొనుక్కొని తీసికెళ్ళ వచ్చు. మేము మూడు పూటలు అక్కడ తిన్నాము. రాత్రిళ్ళు అదనంగా‌ ఇచ్చే స్వీట్ హాట్ ఉండవు. చాలా ‌భోజన శాలలు ,హోటళ్ళు ఉన్నాయి, ఎవరి స్థాయిని బట్టి వారు తినవచ్చు. మేము రెండు మధ్యాహ్నములు గుజరాతీ భోజనం మరొక హోటల్ లో చేశాము. బాగుంది.

ఆఖరున, 3-3-2017 ప్రొద్దున్న ఆటో ఎన్ గేజ్ చేసికొని ద్వారక లోకల ప్రదేశాలు చూశాము. అందులో సముద్రపు ఒడ్డున ఉన్నవే అన్నీ. గీతా మందిరం - మామూలు కట్టడము, ప్రత్యేకత ఏమీ‌లేదు- , భడకేశ్వర మహాదేవ్ మందిరము, గాయత్రీ‌ శక్తిపీఠ్, సిద్ధేశ్వర మహాదేవ్ మందిరము చూశాము. భడకేశ్వర్ మహాదేవ్ ఆలయం చాలా చిన్నది, ఒక ద్వీపకల్పము. మామూలుగానే శివలింగం వెనుక పార్వతీదేవి విగ్రహము. సిద్ధేశ్వర్ మహా‌దేవ్ ఆలయంలోనూ‌ అలాగే పార్వతీ‌దేవి శివలింగం వెనుక ఉంది. సోమనాథ్ నుంచీ‌ గర్భగుడిలో ఇలాగే సాంప్రదాయము. నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలోను ఇంతే. ఇది సౌరాష్ట్ర దేశ‌ సంప్రదాయమేమో.

భడకేశ్వర్ ఆలయం వద్ద సముద్రం సీనరీ చాలా బాగుంది. అక్కడ అరేబియా సముద్రం అందాలు డెందానికి పసందులు. గాయత్రీ శక్తిపీఠ్ లో విశేషమేమీ లేదు. సావిత్రీదేవి, గాయత్రీదేవి, కుండలినీదేవి ల చిన్న విగ్రహాలు ఒక వేదికపై ఉన్నాయి. సిద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో లింగము తెల్లగా ఉండి ముందువైపుకి బొడిప ఉంది. అక్కడ నీళ్ళు ఉంటాయి మనం కావలిస్తే లింగంపై నీరుపోసి అభిషేకం చేసికోవచ్చు. మళ్ళీ ద్వారకాధీశుని ఆలయం దగ్గర వదిలాడు ఆటోవాడు.

మేము దర్శనానికి వెళ్ళేసరికి మరల స్వామికి, రసావతారునికి‌ శృంగార హారతి సమయం. హారతి సనయంలో జనం ఎక్కువ ఉంటారు. పరమాత్మయైన రుక్మిణీ సత్యభామా వల్లభుని కనులార వీక్షించి తరించాము. భగవంతుని ఎన్ని సారులు చూచినా విగ్రహరూపము అచ్చుగుద్దినట్టు మనోఫలకము పై పడదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి దర్శనానికి వెళ్ళినపుడు రెండుమూడు సారులు భగవంతుని శిలా రూపాన్ని చూశాము. బయటకు రాగానే వెంటనే‌ ఫలకంపైనుంచి ఆ మూర్తిని మరచిపోతాం. ఎన్ని సారులు దర్శనం చేసికున్నా ఇంతే. అందుకే భగవద్గీతాచార్యుడిని ఒకటి వేడుకున్నా. ద్వారకాధీశుని దర్శనానికి రకరకాల భక్తి తెగల వారు, వీరిలో గ్రామీణులెక్కువ, పాటలు పాడుకుంటూ, నాట్యము చేస్తూ అలా ఆడుతూ పాడుతూ గుంపులు గుంపులుగా ద్వారకాధీశుని దర్శనానికి వస్తారు. వారందరినీ చూడడం ఒక వేడుకగా‌ఉంటుంది. వారి భక్తి ప్రపత్తులు మనలను తాకుతాయి. స్వామికి హారతి ఇచ్చినపిపడల్లా గపడిపైన ధ్వజాన్ని మారుస్తారు. హారతి చూసి దానిని చూడడానికి జనాలు వేచి ఉంటారు.

"తండ్రీ! నారాయణా‌ మనసుయొక్క ఈ బలహీనత నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యవయ్యా‌ అని. నారాయణ నామస్మరణాన్ని సతతము చేసేలా దాన్ని అనుగ్రహించవయ్యా" అని కృష్ణపరమాత్మను పదే పదే వేడుకున్నాను. వయసు మీద పడుతోంది కదా, చూపూ నెమ్మది నెమ్మదిగా మందగిస్తుంది. రూపము మీద మాత్రమే దృష్టి ఉంటే ఎలా?!

అలా నందనందనుని, యశోదా డింభకుని, గోవర్ధనగిరిధారిని, గోపికా వస్త్రాపహారిని, రాధికాప్రియుని, రుక్మిణీ, జాంబవతీ సత్యభామాపతిని కనులార వీక్షించి, మనసార దర్శించి బొంబాయుకి సౌరాష్ట్రా‌ మెయిల్ లో బయలుదేరాము. జాగ్రత్తగా ‌ఇంటికి చేరాము కూడా.

చేయుము నా మనసు స్వచ్ఛమైన
స్ఫటికముగ; ప్రతిఫలించనీయవోయి
నీ వాత్సల్య కరుణా ప్రకాశములు
విశ్వమంత కాంతులు నిండ గోవిందా!

ఉన్నతమైన ఆలోచనలు వాటికి తూగు
ఉత్తమమైన మాటలు, వాటికి సరిపడు
సదాచరణము; త్రికరణములు శుద్ధమై
సయోధ్యగ నుండు సౌభాగ్యము నిమ్ము గోవిందా!

వాడును తనువు; వసివాడదు
నిన్నెరిగిన బుద్ధి; జీవితాంతము
గుబాళించును నీపై భక్తి రక్తి
మనమున నీవు నిండిన గోవిందా!

స్మృతి తప్పనీయకుము నారాయణా!
మరణమాసన్నమైనపుడు; నీ నామ స్మరణము
చేయుచు, నీ చరణకమలముల దృష్టి నిలిపి
తుది శ్వాస వీడు భాగ్యమ్మునిమ్ము గోవిందా!

కాయము పలుకు మనసు ఇంద్రియములు బుద్ధి
ఆత్మ ప్రకృతి స్వభావము నీవెయై భాసింప గోవిందా!
కలవరములు కలతలు కష్టములు క్లేశములు లేవు నాకు
నీవే నేనను ఉపనిషద్వాక్యము మరల ఋజువైయ్యెన్

భావము మల్లె భక్తి సంపంగి
గురు భావము మందార స్నేహము విరజాజి
అనురాగము మరువము భక్తి సూత్రమున
నీకై కూర్చిన రాగమాలను స్వీకరించు గోవిందా!

సమస్త సన్మంగలాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!
సర్వే జనాః సుఖినో భవంతు!
ఏతత్ సర్వమ్ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు!

No comments:

Post a Comment