Saturday, March 4, 2017

మా ద్వారకా యాత్ర - మొదటి భాగము

మా ద్వారకా యాత్ర - మొదటి భాగము

ద్వారకాధీశుని దర్శనం

మరి మరి మ్రొక్కెద హరికిన్
కారుణ్యోత్తుంగ గిరికిన్
వాత్సల్యామృత ఝరికిన్
సిరి పెనిమిటికిన్ ముక్కంటి సరికిన్

అనుకున్నట్టు సోమనాథ్ - ఓఖా ఎక్స్ ప్రెస్ లో ద్వారక వచ్చాము. ఎందుకో నేను ద్వారక, ఓఖా ఒకే ఊరనుకున్నాను.‌ కాని కాదు. ద్వారక ముందు వస్తుంది, 30 కిలోమీటర్ల తరువాత ఓఖా వస్తుంది. ఓఖా ప్రత్యేకమైన, ప్రత్యేకత గల ఊరు. ఆ విషయాలు తరువాత ముచ్చటించుకుందాం.

మా అబ్బాయి ముందే రిజర్వ్‌ చేసిన హోటల్ కి చేరి స్నాన పానాదులు ముగించి ద్వారకాధీశుని దర్శనానికి బయలుదేరాము. ఊరు కాశీకి మల్లే పాతగా ఉంది. సందులూ కాశీ వలె ఇరుకు. పాత వాసనలతో బాగుంది. ద్వారకాధీశుని కోవెల మేమున్న హోటల్ కి కూత వేటు, అరకిలోమీటరు దూరములో ఉంది. శుభ్రంగా నడిచి వెళ్ళిపోయాము. ఇక్కడా సోమనాథ్ వలె మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు దేవస్థానము వారి కష్టడీకి‌ అప్పగించి లోనికి కదిలాము.

ఒక కుర్ర పురోహితుడు మమ్మల్ని కలిసి ఒక గైడ్ లా దేవాలయ దర్శనము చేయిస్తానని మాకు తోచినది ఇవ్వచ్చని అన్నారు. ఎంత అంటె రూపాయి అయినా రెండు వందలైనా అయినా సరే మీ ఇష్టం అన్నాడు. ఆయన పేరు కశ్యప్. 30-35 మధ్య వయస్కుడు. వాచకము బాగుంది. ఆంగ్లభాష చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ విషయం నాకు ఎంతో నచ్చింది.

అందుకనే గైడ్ ల సంస్కృతి పట్ల అంత ఆసక్తి లేని నేను అతని ప్రపోజల్ కి ఒప్పుకున్నాను. ఇలా పురోహితులు గైడ్ లా గైడ్ చేయడం ద్వారకకు శోభస్కరంగా ఉందేమో అనిపించింది. మనం ఏ పురోహితునీ ఏర్పరచుకోకుండా మనంత మనమూ దర్శనము చేసికోవచ్చు. కశ్యప్, మనకు తెలిసినదే అయినా భాగవత కథనం చేస్తూ కృష్ణ పరమాత్మ గురించి చెబుతూ ఆలయ సందర్శనం చేయించడం మాకు ఎంతో నచ్చింది.

మమ్మల్ని మేము వచ్చిన. వైపు ద్వారం గుండా. లోనికి తీసికొని వెళుతూ దీనిని మోక్షద్వారం అంటారని, ఆలయంలోకి స్వర్గద్వారం వైపునించి ప్రవేశించాలని, దర్శనం పూర్తి అవుతున్న సమయంలో అలా కూడా ప్రవేశిద్దామని కశ్యప్ చెప్పాడు.

ముందుగా క్షేత్రాధీశుడు కుశేశ్వర మహాదేవ్ దర్శనం చేయించాడు. ఆయన శివుడు. ముందుగా నంది లేని శివాలయము. కృష్ణ పరమాత్మ మధుర‌ నుంచి ద్వారకకు మకాం మార్చేటప్పుడు కృష్ణుని కోరిక మేరకు‌ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడున్నంత కాలం శ్రీకృష్ణుడు ఈ ఈశ్వరుని, పక్క గుడిలో ఉన్న అంబికా జీ (పార్వతీ దేవిని) రోజూ అర్చించేవాడు. ద్వారక చుట్టుపక్కల రాజ్యము ‌బలరాముని మామగారిది. రేవతీదేవి పుట్టినిల్లు. బలరాముడు అక్కడ ఉన్నాడని అన్నయ్య దగ్గరకు ‌వచ్చాడు కృష్ణుడు మధురను విడచి.

తరువాత ఎదురుగా ఉన్న గాయత్రీ‌ మాత ఆలయం చూపించాడు. పక్కనే ఉన్న ప్రద్యుమ్న, అనిరుద్ధుల ఆలయాలను చూపించాడు. ప్రద్యుమ్నుడు రుక్మిణీ కృష్ణుల సుతుడు, మన్మథావతారుడు, రతీపతి అంశజుడు, ప్రభావతీ కళత్రము ‌అని మనకు తెలుసు. అతని కొడుకు ‌అనిరుద్ధుడు. శ్రీకృష్ణునికి మనుమడు. ఉషా‌ మనో హరుడు, ప్రియుడు, భర్త అనీ‌ మనకు తెలుసు.

బాణాసురుడు అనిరుద్ధుని చెఱపట్టినపుడు అతనిని ‌విడిపించడానికి కృష్ణుడు శివునితో యుద్ధము చేయవలసి వచ్చినదనీ‌, బ్రహ్మాది దేవతలందరూ అడ్డుపడి‌ ఆ‌ విపరీతాన్ని, ప్రళయాన్ని‌ ఆపారని భాగవత పురాణము, హరివంశము ‌తెలుపుతున్నాయి. అనిరుద్ధ చరిత్ర ఒక తెలుగు కావ్యము. ఉషా పరిణయము కూచిపూడి భాగవతుల ప్రదర్శనలలో‌ అగ్రగణ్యము.

‌ముసలం‌ పుట్టి యాదవులందరూ ‌వారిని వారు నాశనము చేసికుంటున్నప్పుడు అనిరుద్ధుడు‌ అత్తవారి రాజ్యంలో‌ ఉండి మిగిలాడు. ఇది ఈజిప్టు (మిశ్ర రాజ్యము) అని కశ్యప్ అన్నాడు. ఇతని తరువాత ఇతని కొడుకు వ్రజనాథ్‌ సముద్రంలో మునుగక మిగిలిన ద్వారకను వృద్ధిచేసి, అభివృద్ధి పరిచాడని ఐతిహ్యం.

ఈ చూడడం అయ్యాక

భగవద్గీతాచార్యుడు, నరాద్వైతుడు, నీ నా జత, రుక్మిణీ సత్యభామా వల్లభుడు, ప్రహ్లాదాహ్లాదకారకుడు, అర్జున సఖుడు, బాంధవుడు, భక్త వరదుడు, ముక్తి ప్రదాత, శ్రీమన్నారాయణుడు, కందర్ప జనకుడు, కామినీ మనోహరుడు, ద్వారకాధీశుడు అయిన శ్రీకృష్ణభగవానుని, నల్లనివానిని, గోపికా‌ మానసచోరుడు, వస్త్రాపహారి, రాధా సఖుని దర్శనం చేసికున్నాము.

మా అదృష్టం కొద్దీ అవి సరస శృంగార మూర్తియైన కృష్ణ పరమాత్మకి శృంగార హారతి ఇచ్చే క్షణాలు. మనసు ఎంతో రంజనము పొందింది ఆ భాగ్యానికి. ఆ రస క్షణాలు మా. స్వంతం అయేలా కరుణించిన పర దైవతమునకు మనసారా నమస్కరిస్తూ ఆ అందమైన, ఆనందకరమైన క్షణాలను హృదయ రంజకముగా ఆస్వాదించాము. భగవంతునికి ప్రణమిల్లాము, మనసా, వచసా, కర్మణా.

ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు చతుర్భుజుడు. నీల మేఘశ్యాముని విగ్రహం నల్లనిది. నయనానందకరంగా ఉంది. పై రెండు చేతులలో గద, చక్రములు, క్రింది రెండు చేతులలో శంఖము, ముద్రలకు వెండి తాపడములు ఉన్నాయి. మా చర్మ చక్షువులు, మనో చక్షువు ఆ దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షించి తరించాయి. మనసు నిర్మలమై పరమాత్మానుభవాన్ని చవిచూసింది.

చందురుడందం పున్నమి రేయికి
ప్రభాకరుడందం ప్రతి పగటికి
తారకలందం అమవస నిశికి
గోవిందుడందం ప్రతి హృదయానికి

మన పురాణములు, భగవత్ కథలు నమ్మకము వలన మరింత రమ్యముగా, రంజకముగా ఉంటాయి. నమ్మకము లేకపోతే ఏవో అబద్ధాల పుట్టలుగా అనిపిస్తాయి. పురాణములు పుక్కిటివి అని కదా నానుడి.

తరవాత కశ్యప్ మాకు దూర్వాస మహాముని ఆలయం చూపించాడు. దూర్వాసుడు కృష్ణుని వంశం వారికి, హరి వంశీకులకు కులగురువు. శ్రీకృష్ణుడు, రుక్మిణి విదర్భ దేశంలోని కుండిన నగరం నుంచి పారిపోయి వస్తూ గాంధర్వ వివాహం చేసికొని తమ కులగురువైన దూర్వాసుని కూడా, తమతో కూడా ద్వారకకు రమ్మని ఆహ్వానించారు.
గుర్రములను తీసివేసి కృష్ణుడూ, రుక్మిణీ తామే గుర్రములై రథాన్ని లాగితే వస్తానన్నాడు. అలాగే అని దూర్వాసుని రథముపై ఆరోహింప జేసి, కృష్ణుడూ, రుక్మిణీ గుర్రములై రథాన్ని ద్వారకకు నడపసాగారు. ఆ శ్రమ వల్ల రుక్మిణికి తీవ్రమైన దాహం కలిగింది. తట్టుకోలేక పోయింది. మంచినీళ్ళతో దాహం తీర్చమని కృష్ణుని కోరుకుంది. అంతట ఆయన తన అంగుళీయకముతో నేలను తవ్వి గంగను రప్పించాడు. ఆ గంగోదకముతో రుక్మిణీ కృష్ణులిరువురు తమ దప్పిక తీర్చుకున్నారు.

ఇదంతా దూర్వాస మహర్షికి నచ్చలేదు. తన సహజ స్వభావం కొద్దీ ఎంతో కుపితుడైనాడు. గురువునైన నాకు ఆహార, పానీయముల వ్యవస్థ కల్పించకుండా మీరిరువురే దప్పిక తీర్చుకుంంటారా, అని కోపంలో మామూలుగానే, ఆ‌ ఆది దంపతులను శపించాడు.

"రుక్మిణీ కృష్ణులిద్దరూ పన్నెండేళ్ళ పాటు వియోగం అనుభవించాలని, ద్వారకలో మంచినీరు దొరకదని, పంటలు పండవని" ఆ శాప సారాంశం.

ఈ కథ కశ్యప్ చెప్పాడు. ఆ కథ చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉందని నాకు తరువాత అవగతమైంది. అదేమిటో ఆ సందర్భం వచ్చినపుడు రెండవ భాగంలో చెబుతాను. ఇప్పటికి స్వస్తి.

ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్ పద్మ మధ్యే సతతం వ్యవస్థితమ్
సమాహితానాం సతతాభయ ప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీం

No comments:

Post a Comment