Friday, March 10, 2017

మా తిరునారాయణపురం యాత్ర - మొదటి, రెండవ భాగములు

మా తిరునారాయణపురం యాత్ర

ఉప శీర్షిక: ఒక కాన్ఫరెన్స్ తిరునాళ్ళు

మొదటి భాగము

నారాయణ నామం నాకు ఎంతో ఇష్టమైనది. "ఓం నమో నారాయణాయ" నారాయణ అష్టాక్షరి అని చాలా మందికి
తెలుసు. శ్రీ రామానుజులకి ఈ అష్టాక్షరి ప్రాణం. తనకి తన గురువు ఉపదేశించిన ఈ తిరు మంత్రాన్ని భవ తారకమని గ్రహించి అందరికీ ఈ నామం అందాలని తలంచి, గురు ఆదేశానికి విరుద్ధంగా ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి ఈ అష్టాక్షరిని అందరికీ వినిపించేలా పలికారు. ఆయన గురువు గారికి విపరీతమైన కోపం వచ్చింది. అయినా రామానుజులు ఈ సాహసం చేశారు. తనకు ఏం జరిగినా పరవాలేదు; మానవాళికి మాత్రం మంచి జరిగి బాగు పడాలి అని ఆయన సామ్యవాదపు దృష్టి.

నవీన సామ్యవాదులు రావడానికి శతాబ్దాల ముందే భారతదేశంలో సామ్యవాదాన్ని రామానుజులు, బసవేశ్వరుడు, ఇతర వైష్ణవ, శైవ గురువులు అందించారు, ఆచరించారు. కొత్త కొత్త భాష్యాలు చెప్పారు.
కుల, జాతి, లింగ, ప్రాంత, దేశ, మీమాంస, తత్త్వ వివక్షలు లేక అందరూ తరించాలని వారి తపస్సు. "సర్వే జనాః సుఖినో భవంతు" అని వారి నినాదము. హృదయము. జీవిత ఆదర్శము. రామానుజులు, బసవేశ్వరులు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.

దురదృష్టవశాత్తు వారి సర్వ మానవ సమానత్వ భావము వారి అనుయాయులకు వంటబట్ట లేదు. తరువాతి వారు తమ తమ సంకుచిత స్వభావములతో, పరిమిత అవగాహనతో, చీలికలు, పీలికలై ఎన్నో తెగలుగా విడిపోయారు. రామానుజుల వైష్ణవము, వీర, మామూలు వైష్ణవములుగ తమిళనాట; బసవేశ్వరుల తత్త్వము శైవ, వీర శైవములుగ కర్ణాటకలోను ప్రస్తుతపు గురువుల, మఠాధీశుల, చేతులలో విల విలలాడుతున్నాయి. ఈ మఠాధీశుల, తత్త్వ గురువుల బాటలో నడచి, విభేదించి, వీరవైష్ణవాన్ని, వీర శైవాన్ని రెండు తెగలుగ, కులములుగ విడదీశారు.

వైష్ణవము జ్ఞాన ప్రధానముగ ఒక తెగగా ‌(శ్రీ వేదాంత దేశికులు), భక్తి ప్రధానముగ మరియెక తెగగా విడిపోయాయి. దానికి తగ్గట్టుగా మళ్ళీ కలవకుండా ఎవరి కుంపట్లు వారు పెట్టుకొని, ఆధ్యాత్మిక వారసత్వము కన్న ఆర్ధిక వారసత్వమునకై తన్నులాడుకొనుచు ఏదో బ్రతుకులు ఈడుస్తున్నారు.

వీరశైవంలో ఆ కులములు - లింగాయత్, వక్కలింగలు. ఆ భేదాన్ని కులవ్యవస్థ చేసి వాడుకుంటూ, ఆ భేదం చుట్టూ, ఎన్నో దశాబ్దాలనుంచి కర్ణాటకలో రాజకీయం నడుస్తోంది. ఆ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ ఈ భేదనీతిని నిస్సిగ్గుగా వాడుకుంటోంది, చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు చందాన.

ఇంతకు రామానుజుల విశిష్టాద్వైతము భారతదేశానికి ఒక భక్తి ఒరవడిని సృష్టించింది. తూర్పున చైతన్య ప్రభు, మధ్య భారతమున, విద్యాపతి, మొదలైనవారు విష్ణుభక్తిని, వైష్ణవాన్ని ప్రాచుర్యములోనికి తీసుకొచ్చారు.
నింబారకుడు, వల్లభాచార్యులు‌ మొదలైనవారు రామానుజుల ‌నుంచి స్ఫూర్తి పొందిన వారే.

ఇంతటి రామానుజులు, కులోత్తుంగ చోళుని అరాచకానికి, మతోన్మాదానికి, వైష్ణవద్వేషానికి బలి అయ్యి దుర్గమారణ్యములను దాటుకొని కన్నడదేశంలోనికి పారిపోయి రావాల్సి వచ్చింది. ఆ వచ్చిన ప్రాంతాన్ని ఒక జైన రాజు పరిపాలిస్తున్నాడు.

ఈ లోపుల నాకు ఈ కథకి సంబంధం ఏమిటో చెప్పాలిగా.

నేను పాండిచేరిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేసి 2015 నవంబరులో రిటైర్ అయ్యిపోయాను. తరువాత మా స్వగ్రామం భీమవరంలో సెటిల్ అయ్యి ఉంటున్నాను. చింత చచ్చినా పులుపు చావనట్టు, రిటైర్ అయ్యి పోయినా నా పరిశోధనా కుతూహలము తగ్గలేదు.

ఉపనిషత్తులలో, తత్సంబంధ ఇతర తత్త్వశాస్త్ర, షడ్ దర్శనములలో ఉన్న జ్ఞానబోధ మీమాంస (Cognitive Science) అంశములను వెలికితీయడం నా పరిశోధనా విషయము. ఇప్పటికే ఈ విషయం మీద చాలా పేపర్లు జర్నల్స్ లో ప్రచురించాను. సెమినార్లలో, కాన్ఫరెన్స్ లలో ప్రెజెంట్ చేశాను. రిటైర్ అయినా‌ ఆ పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నాను. ఉపనిషత్తులు మనస్తత్వ శాస్త్రము. బ్రహ్మజ్ఞానము లేక ఆత్మజ్ఞానము అద్వైత, ద్వైత సిద్ధాంతముల తోడ్పాటుతో, మనసు, ఇతర అంతఃకరణముల మానసిక కార్యకలాపముల గురించి విపులముగా విషయాన్ని అందించాయి. బౌద్ధము, జైనము, షడ్ దర్శనములు, రమణ మహర్షి వంటి తత్త్వజ్ఞులు ఈ అద్వైతసారాన్ని మరింత కాచి వడబోసి‌ మనకందించారు.

వీటన్నిటి సాయంతో నేను; బ్రహ్మము, ఆత్మ అంటే ఏమిటి, మానసిక కార్యకలాపములు ఏవిధముగా జరుగుతాయి, దీనిని consciousness, mind and its functions తో ఎలా కలపవచ్చు అనే విషయంపై ఒక పరిశోధనా వ్యాసము రాసి ISKCON వాళ్ళు 2016 ఆగస్టు చివరి వారంలో బెంగుళూరులో జరుపుతున్న అంతర్జాతీయ సదస్సుకు పంపాను. అది ప్రెజంట్ చెయ్యడానికి ఎన్నికయింది. అందుకని మహాబలేశ్వర్ యాత్ర అయిన వారానికి బెంగుళూరుకి బొంబాయినుంచి నేను మా ఆవిడ ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాము.

No comments:

Post a Comment