Tuesday, March 7, 2017

మనము - మన సాంప్రదాయములు ; శ్రీ సుబ్రహ్మణ్య ప్రశంస; వేంకటేశ్వర స్తవము

 మనము - మన సాంప్రదాయములు

మనకి స్మార్త, వైష్ణవ, మధ్వ సంప్రదాయాలు‌ఉన్నాయి. స్మార్తులకు తిథి ముఖ్యం. వైష్ణవులకు నక్షత్రం ముఖ్యం. ఇన్నాళ్ళూ తెలుగునాట స్మార్త సంప్రదాయము జరిగేది. ఇప్పుడు వైష్ణవ స్వాముల ప్రభ పెరిగి రగడలు మొదలయ్యాయి. మనలని భగవంతుణ్ణి‌ కూడా స్థిమితంగా‌ కొలుచుకోనివ్వరు ఈ స్వాములు. హిందూ మతంలో ఈ తెగల గొడవ వల్లే కూడా అనైక్యత. దీనికి తోడు‌ వీధి చివర కిళ్ళీ కొట్లలా ఆధ్యాత్మిక ఆశ్రమాలు, వాటిని ఆశ్రయించుకొని ఉన్న గురువులు హిందూ మతాన్ని‌ మరింత ఛిద్రం చేస్తున్నారు. భగవంతుని కొలవడంకన్న ఈ గురువులను కొలవడం ‌ఎక్కువ అయిపోయింది. అంతా వేళాకోళంగా, వెఱ్ఱి వెంగళప్పల సంఘంలా తయారయింది హిందువుల పరిస్థితి.

ఈ సంప్రదాయాల గురించి అవగాహన తక్కువ ఉన్నవారు అందరూ ఒకే తాటి మీదకు రావచ్చు కదా అంటారు. కాని అలా వచ్చే ప్రశ్న లేదు. అందరూ ఒకే భాష మాట్లాడడము ఎలా వీలు కాదో, అందరూ ఒకే సాంప్రదాయము పాటించడానికి అలా వీలుపడదు. వివిధ దృక్పథాలు, కాలమానములు, తప్పనివి. ఎటొచ్చీ వాటి గురించి కొట్టుకోవడం వేస్ట్. ఎవరి సాంప్రదాయము వారు పాటించుకుంటే మంచిది. మనది, కన్నడిగులది చాంద్రమానము. తమిళులు, మళయాళీలది సౌరమానము.‌ ఉత్తరాదిని బార్హస్పత్య మానము. తిథి, నక్షత్ర కాలముల లెక్కలు తేడా.
అందరూ‌ ఒకే మతం అనుసరించడం ఎలా పడదో, అందరూ ఒకే సాంప్రదాయము పాటించడం అలా కుదరదు. ఒకే పంచాంగము వాడలేరు. ఈ diversity తప్పని సరి తద్దినము. కాని అన్ని సాంప్రదాయాల వారు ఒకరినొెకరు గౌరవించుకుంటూ తమ తమ సంప్రదాయములను పాటించడం మేలు. బ్రాహ్మణానాం అనేకత్వం - ఇక్కడ బ్రాహ్మణులు అంటే scholars -‌ బ్రాహ్మణ కులస్థులు కారు. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సాంప్రదాయముల వారు హిందూ-ముస్లిముల కంటె ఎక్కువగా మత్సరము చూపించుకుంటారు. ఇది మింగుడు పడని వాస్తవము.

*************


స్నానము చేయడం వల్ల శరీరం శుభ్రపడి శుచిగా ఉంటుంది. భగవద్దర్శనము, భగవద్ధ్యానముల వలన మవసు శుభ్రపడి, పునీతమౌతుంది. నిర్మలమై శాంతానందములు నిండి ఉండగా మౌనియై, మానసిక కార్యకలాపముల విరమణ ‌వలన రామమై అలరారుతుంది. రామబ్రహ్మము, ఆత్మారామము అవుతుంది.
*******

తమిళనాట ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములున్నాయి. ఆరూ ప్రసిద్ధములు, భక్తుల పాలిట కల్పతరువులు.

శ్రీ సుబ్రహ్మణ్య ప్రశంస

ఆత్మజ్ఞానమున దిట్ట కుక్కుటధ్వజుడు కార్తికేయుడు
తండ్రికే తత్త్వోపదేశము చేసిన గట్టి పట్టి స్వామినాథుడు
స్వామిమలై వాసి సౌమ్యగుణరాసి శుద్ధజ్ఞానైకమూర్తి 


తిరుచెందూరు నందు కడలి తీరమున వసించుచు
భక్తుల అభీష్టముల తీర్చుచు బాలసుబ్రహ్మణ్యుడై వెలుగొందుచుండు

తిరుత్తణియందు సుబ్రహ్మణ్యుడు కుమారస్వామియై కులుకుచు
ముత్తుస్వామిదీక్షితర్ ముదమంద కలకండ నోటిలో పెట్టి
శ్రావ్య కీర్తనల మనకై వెలయింప జేసిన సత్ కళామూర్తి గురుగుహుడు

పళనియందు మలపై దండాయుధపాణియై మనల దీవించుచు
కాచుచు; జ్ఞానవేల్ శక్తివేల్ అయిన మురుగన్ జ్ఞానవైరాగ్యముల
పాయసము మనకందించు షణ్ముఖుడు; మన ప్రకృతికి పరమైన తత్పరుడు

తిరుప్పరన్ కున్డ్రమ్ పళముచ్చళ్చోళైలందు శ్రీవల్లీ దేవసేనలు
సతులై అందించు సరస రసానుభవసరసి యందు రాయంచయై క్రీడించు
శృంగారవేలన్ నిజదయితాయుతుడు మనలందర దంపతుల ఆనందశృంగారహేల

అట్టి సుబ్రహ్మణ్యుడు జ్ఞాన శృంగార రసాధిదేవుడు భవాబ్ధిపోతయై
కరుణాంతరంగుడై కేకి వాహనుడు కావలసినవాడై మనల కాచుగాత

*********

వేంకటేశ్వర స్తవము

నీట మునిగి తడువని వాడు, సంసార సాగరమున
ఈదుచు అలుపురాని వాడు ఉండరు;
క్షణక్షణమునకు కలతనొంది కములు మనసును
సతత ఉత్సాహయుత ప్రవాహపుధారగ చేసి
మీ మధుర నామ ధ్యానగతగ చేయుడు వేంకటేశ్వరా!


అన్నియు గణనకు తీసికొని
చక్కగ ఆలోచించి‌ సమయస్ఫూర్తిగ
వ్యవహరించినను జీవితమున విధి
వంచితులమగుట మీ కరుణ నిండుకొనుట వేంకటేశ్వరా!
 


No comments:

Post a Comment