Friday, March 31, 2017

మా తిరునారాయణపురం యాత్ర - మూడవ భాగము


మా తిరునారాయణపురం యాత్ర - మూడవ భాగము
 
ఉప శీర్షిక: ఒక కాన్ఫరెన్స్ తిరణాల

ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్ పద్మ మధ్యే సతతం వ్యవస్థితమ్
సమాహితానాం సతతాభయ ప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీం
 
నారాయణుడు సర్వవ్యాపకుడు. భక్తజన పరిరక్షకుడు. భక్త పరిపాలకుడు. భక్తుల పాలిటి జ్ఞానాధ్యాత్మిక పెన్నిధి. సిరికి పెనిమిటి. ధ్యాత, ధ్యేయము; ధ్యానములో కలసిపోయి, మనము ఆయనగా మారే సులువును మనకు జ్ఞాన, భక్తి, కర్మ మార్గముల ద్వారా ఒసగి; మన జీవితములను ధన్యము చేసికొనే వీలు కల్పించిన పరమాత్మ.
 
తన మనుమడైన నారద మహర్షి ద్వారా తన భక్తులకు నారాయణ నామోపదేశము చేయించిన ప్రజ్ఞానఘనుడు.
నారాయణ నామమును అలా ఆళ్వారుల వరకు చేర్చిన వ్యూహాత్మకుడు. నాథమునిని, యామునాచార్యులను, ఇతర ఆళ్వారులను, జ్ఞానులను, వివిధ కుల, లింగ, ప్రాంత, దేశ, తత్త్వములకు చెందిన "సామాన్యులను", వివక్షత లేక అసామాన్యులుగా భక్త శిరోమణులుగా మార్చిన దైవ వతంసము.
 
అటువంటి ఆళ్వారుల పరంపరలోని ఉద్యద్భానుడు, రామానుజులు. శ్రీ పెరంబదూరులో జనియించి, సకల వేద, శాస్త్ర, తత్త్వ పారంగతుడై కంచిలో ఒక అద్వైతాచార్యుల వద్ద శిష్యునిగా ఉండేవారు.
 
శ్రీ మహావిష్ణువును వర్ణించే "పుండరీకాక్ష" పదాన్ని, "కోతి పిరుదుల" వంటి కన్నులు కలవాడు అనే గురువు అనువాదానికి తట్టుకోలేక మిగుల దుఃఖించి, ఎంతో వేదనను అనుభవించారు రామానుజులు.
(పుండరీకాక్ష పదానికిి "పద్మముల వంటి కనులు కలవాడు" అని సమాసము చేసి ధన్యులయ్యారు.)
అటువంటి వాతావరణంలో ఇమడలేక దైవ సంకల్పంచే శ్రీరంగం చేరి, అప్పటి ప్రసిద్ధాళ్వారులకు శిష్యులై, శ్రీరంగ నాథుని సేవిస్తూ, గుర్వనుగ్రహముచే నారాయణ నామ మంత్రోపదేశమును పొంది ధన్యులయ్యారు. అక్కడా సామాన్యుల ఉద్ధరణకై గుర్వాదేశానికి విరుద్ధంగా నారాయణ అష్టాక్షరిని బట్టబయలు చేసి అందరినీ ఆకట్టుకున్న నామోపదేశంతో పునీతులను చేశారు.

ప్రస్థాన త్రయమునకు ( ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు,భగవద్గీతలను కలిపి ప్రస్థాన త్రయం అంటారు) నారాయణ పరంగా శ్రీ భాష్యము రచించి విశిష్టాద్వైత మత స్థాపనము చేశారు. శంకరుల అద్వైతాన్ని తమ దృష్టితో ఒప్పుకోక,
నిరాకరించి తమ వ్యాఖ్యానాన్ని, ధోరణిని ప్రాచుర్యం లోనికి తెచ్చారు.
 
అదే సమయంలో తమిళనాట శైవము విజృంభించి ఉంది.

శైవ, వైష్ణవ మతస్థులు విపరీతమైన ద్వేష భావంతో విద్వేషాలు పెంచుకొని తీవ్రంగా ఘర్షణలు పడుతూండే వారు. ఆ పరంపరలో శైవ మతావలంబి, తీవ్ర వైష్ణవ ద్వేషి అయిన కుళోత్తుంగ చోళుడు ఆ ప్రాంతానికి రాజు. వైష్ణవులను ఎంతో క్రూరంగా హింసిస్తూ ఉండేవాడు. అతడు రామానుజులను చంపించడానికి ప్రయత్నించాడు.
ఆ ఘటనలో రామానుజులు తప్పించుకొని అరణ్యముల ద్వారా పొరుగు దేశమైన కన్నడ దేశానికి అనుచరులతో పారిపయారు. చిక్కిన ఆయన ముఖ్య శిష్యునికి కన్నులు తీయించాడు కులోత్తుంగుడు. అది మత విద్వేష పూరిత
క్రూరత్వానికి పరాకాష్ట.
 
అలా రామానుజులు శిష్యులతో కన్నడ దేశానికి వచ్చారు. ఇది నేటి మేల్కొటే ప్రాంతము.

అప్పుడు ఆ ప్రాంతాన్ని బిజ్జలుడు అనే జైనరాజు పరిపాలిస్తున్నాడు​. ఆయనకు ఒక్కతే సంతానం. కానీ ఆమెకు ఏదో తెలియని తీవ్ర వ్యాధి. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఆమెపై ఆశలు వదులుకున్నారు. ఆ సమయంలో రామానుజులు ఆ రాజు వద్దకు వెళ్లి ఆయన కుమార్తెకు తన యోగ ప్రభావంతో​నయం చేశారు. బిజ్జలుని ఆనందానికి అవధులు లేక పోయాయి.
 
రామానుజుల గురుత్వంలో విశిష్టాద్వైతం స్వీకరించి వైష్ణవుడైనాడు. రామానుజుల గురుత్వంలో, ఆధ్వర్యంలో ఎన్నో విష్ణ్వాలయాల్ని నిర్మించాడు. జైన్ రాజ్యం వైష్ణవ రాజ్యం అయింది. బిజ్జలుడు విష్ణువర్ధనుడు అయ్యాడు.
బేలూరులో చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మించాడు.

ఆ ఆలయాన్ని అమరశిల్పి జక్కన్న ఎంతో అందంగా, వైభవంగా రమ్యశిల్పాలతో మలిచాడు. బేలూరు ఆలయం శ్రావణ బెళగొళ లోని జైన, హలేబీడు లోని శైవ ఆలయం నిర్మాణరీతులను పోలి ఉంటుంది. ఈ ఆలయాలకు శిఖరం
ఉండదు. పై కప్పు దీర్ఘచతురస్రంగా ఉంటుంది. ఆలయం పై శిల్పములు రమణీయంగా ఉండి కనుల విందుగా ఉంటాయి.
 
అప్పుడే బిజ్జలుని ముఖ్యనగరానికి దగ్గర్లో ఉన్న ఒక దట్టమైన అడవిలో పురాతనమైన, యుగముల ముందు
దివ్య, దైవ ప్రేరణతో మలచబడిన కృష్ణ ప్రతిమ ఉన్నట్టు రామానుజులకు స్ఫురిస్తుంది. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయగా పురాతన కృష్ణ ప్రతిమ లభిస్తుంది. అది ఎంతో అందంగా ఉంది. రామానుజులు ఆ ప్రాంతానికి తిరునారాయణపురం అని నామకరణం చేశారు. విష్ణుమూర్తికి పెద్ద ఆలయం కట్టించారు. ఆ గుడిలోనే తమకు అడవిలో లభించిన కృష్ణ ప్రతిమను ఉంచి ఆర్చిస్తూండేవారు. అక్కడి ఆలయం లోని మూల విరాట్ కి చెలువ 
 నారాయణుడు అని పేరు పెట్టారు.
 

గుడిలో జరగాల్సిన నిత్య ధూప, దీప, నైవేద్యాదులు, ఉత్సవాలు ఎలా నిర్వహించాలో నిర్దేశించారు.
వైష్ణవుల తత్త్వ గురువులు హయగ్రీవులను అక్కడ ప్రతి‌ష్టించారు.
 
ఇంతలో ఆ ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తాను జయించి, అపురూప, సుందర కృష్ణ ప్రతిమను ఢిల్లీ తీసుకుని పోతాడు. అతని కుమార్తెకు ఆ రమ్య కృష్ణ ప్రతిమ ఎంతో నచ్చుతుంది. దానిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకుంటుంది. 

రామానుజులు ఢిల్లీ వెళ్లి సుల్తానుని, అతని కూతురిని మంచి చేసికొని, మెప్పించి ఒప్పించి ఆ కృష్ణ ప్రతిమను తిరునారాయణపురం తెస్తారు. ఆ ప్రతిమను వదలి ఉండలేక సుల్తాన్ కూతురు కూడా తిరునారాయణపురం వచ్చేసి, మరణం పర్యంయమూ స్వామిని దర్శించుకుంటూ అక్కడే ఉండి పోయింది.

ఇంతలో తమిళ నాట రాజకీయ పరిస్థితులు మారాయి. కుళోత్తుంగచోళుడు భయంకరమైన వ్యాధి సోకి మరణించాడు. రామానుజులు తిరిగి శ్రీరంగం పయనం అయ్యారు. అక్కడి ఆయన శిష్యులు, అనుయాయులు ఆయన్ని కదలనివ్వలేదు. వారిని అనునయించి, తిరునారాయణపురంలో తాము లేకపోయినా లోటు లేని విధంగా ఏర్పాట్లు చేసి శిష్యులను ఆశీర్వదించి, దిశా నిర్దేశం చేసి శ్రీరంగం చేరారు. వారు ఆ నాడు నిర్దేశించినట్టు
గానే తిరునారాయణుని కొలవడం జరుగుతోంది.

ఈ విశేషాలు అన్నీ ఆలయంలోని ప్రధాన అర్చకులు బాగా మాకు హిందీలో​ వివరించారు. తిరునారాయణుని, లక్ష్మీ సహితంగా దర్శించాము. అందమైన కృష్ణ ప్రతిమను కనులారా వీక్షించాము. అప్పుడు స్వామివారికి అర్చన సమయం. అంతా శ్రద్ధగా, దగ్గరగా చూశాము.
 
జ్ఞానానంద మయం దేవమ్
నిర్మలం స్ఫటికాకృతిమ్
ఆధారం సర్వ విద్యానామ్
హయగ్రీవమ్ ఉపాస్మహే

రామానుజులచే ప్రతిష్టించబడిన హయగ్రీవులను దర్శించుకొని తిరు నారాయణ పురం అనబడే మేల్కొటే యాత్ర పరిసమాప్తి చేసి; నిర్వాహకులు తెచ్చిన ప్రసాదం భుజించి బెంగుళూరు తిరిగి వచ్చాము.

ప్రస్తుతం మేల్కొటేలో కర్నాటక సంస్కృత విశ్వవిద్యాలయం అధ్వర్యంలో ఒక సంస్కృత పరిశోధనా సంస్థ నడుప బడుతోంది. విశిష్టాద్వైత సిద్ధాంతంపై పరిశోధన జరుగుతోంది. 
 
రామదాసు బంగారు పలుకు శ్రీరామచంద్రుడు
క్షేత్రయ్య శృంగారపు కులుకు మువ్వ గోపాలుడు
పోతన్న హృదయంపు తళుకు నందాంగనా డింభకుడు
మనందరి హృదయాల కులుకు గోవిందుడు

పురందరదాసు హృదయస్పందనము పురందర విఠలుడు
అన్నమయ్య చిత్తప్రకంపనము అలమేలుమంగ పతి
త్యాగయ్య హృదయ నాదము సాకేత రాముడు
మనందరి మనసుల మౌన చలనము గోవిందుడు

నా తనువున అణువణువూ నారాయణ యని
కంపించుచూ; నా మనమున ప్రతి తలపూ మాధవునికై
తపించుచూ; చిత్తము హరి నామ స్మరణము చేయుచు;
అన్నియు లీనము కావలె నీలో; నే తరించవలె నీవై గోవిందా!
 
నీవు నాయందే నివసించి ఉండ కృష్ణా!
ఏల యాత్రలు, పూజలు, పునస్కారములు?
మాధవా! మనోబుద్ధ్యహంకారచిత్తములను
ఫలం, పత్రం, పుష్పం, తోయముల చేసి
నిన్ను అర్చించెదను తండ్రీ! నారాయణా!
కావుము నన్ను నీ వత్సను గోపాలా! గోవిందా!

మరునాడు ఉదయం శేషాద్రి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి భీమవరం చేరాము.