Sunday, March 22, 2015

అద్వైత - ద్వైత - తత్వములు



అద్వైత - ద్వైత - తత్వములు


అద్వైతము అంటే రెండు కానిది. ఒక్కటే అయినది.

ఏ రెండు కానిది? ఏ ఒక్కటే అయినది?

అహమ్ - ఇదమ్ అని రెండుగా అనిపించనది,కనిపించనదీను అద్వైతము.

అహమ్ నే అదః అని కూడా అంటారు.

శ్లో ll
  పూర్ణమ్ అదః పూర్ణమ్ ఇదమ్ 
పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే 
 పూర్ణస్య పూర్ణమాదాయ 
పూర్ణమ్ ఏవ అవశిష్యతే   

తాll  
 అదః పూర్ణమైనది. ఇదమ్ కూడా  పూర్ణమైనది.
పూర్ణము నుంచి పూర్ణము పుడుతుంది.
పూర్ణము నుంచి పూర్ణము పుట్టాక పూర్ణమే మిగిలి  ఉంటుంది.

అదః (అహమ్) శబ్దం ఆత్మని  సూచిస్తుంది. దానినే బ్రహ్మము అనీ అంటారు

అహమ్ లేక ఆత్మ లేక బ్రహ్మము  " గమనిక" ని తెలుపుతుంది.

ఇదమ్ అంటే మానసిక కార్యకలాపములు జరగడాన్ని లేదా విరమింపబడి ఉండడాన్ని తెలియజేస్తుంది.

ఇలా అహమ్-ఇదమ్ అని విడిగా తెలుస్తూంటే అది ద్వైత స్థితి.

ఇలా విడిగా విడిగా తెలియకుండా ఒక్కటే (ఆనందము, శాంతము,, శుద్ధ జ్ఞానము, మౌనము, భక్తి ) దృష్టి లో  లేక గమనికలో ఉండి అదే  సదా అనుభవముగా ఉండడాన్ని అద్వైత స్థితి అంటారు.
ఈ దశ లో తెలుసుకునేవాడు (జ్ఞాత) తెలుసుకోబడేది (జ్ఞేయము ) అని ఉండదు. దృష్టి అంతా ప్రజ్ఞానమయం గా (నిర్మలమైన గమనికగా లేదా మనసుగా) ఉంటుంది.

మన గ్రహింపులు,  ఆలోచనలు,భావనలు, అనుభవములు, అర్థ స్పృహలు, జ్ఞాపకములు, మమతలు, అహంకారములు దృష్టిలో ఉండవు. మనసు ప్రశాంతముగా ఉండి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ నిరామయంగా, నిరంజనముగా , నిర్లిప్తముగా, తత్పరముగా, భగవత్ శబ్ద తాత్పర్యముగా ఉంటుంది.

బ్రహ్మ సత్ జగత్ మిథ్యా 
జీవో బ్రహ్మ ఏవ  న అపరః 

ఈ శ్లోకము అద్వైత సిద్ధాంతానికి ప్రాణప్రదమైనది.

ఉన్నది బ్రహ్మము మాత్రమె. జగత్తు మిథ్య (వచ్చి పోతూంటుంది -- దృష్టి లోనికి).

వ్యక్తిత్వ స్థితి (జీవ స్థితి) పరమాత్మ స్థితి (బ్రహ్మ స్థితి ) ఒకటే. వేరు కాదు.

దృష్టి లో వ్యక్తిత్వము ఉండడము జీవస్థితిని సూచిస్తుంది. దీనినే ద్వైత స్థితి అంటారు.

దృష్టిలో ఏమీ (ఇదమ్) లేకపోవడం పరమాత్మ స్థితిని సూచిస్తుంది. దీనినే అద్వైత స్థితి అంటారు.

ద్వైత, అద్వైత స్థితులు ఒకేసారి ఉన్నప్పుడు (మనసు, ఇతర అంతఃకరణములు పనిచేస్తున్నప్పుడు, మెళకువ, కల మానసిక దశలలో) మనసు ఆ రెండు స్థితులలో సంచారము చేస్తూ మన మానసిక కార్య కలాపములన్నిటిని  నిర్వహిస్తుంది.

"నేను"ని శరీరము, మనస్తత్వము,  సాంఘిక స్థితి గతులతో (వ్యక్తీ, తత్సంబంధ విషయాలు) అన్వయించుకున్నప్పుడు  ఆ స్థితి ని జీవ లేదా జీవాత్మ స్థితి అంటారు. నేనుని గమనికతో (ఆత్మ, బ్రహ్మము, శుద్ధాహమ్ తో)  అన్వయించుకున్నప్పుడు ఆ స్థితిని భగవత్ లేదా పరమాత్మ స్థితి అంటారు.

మనం నేనుని శరీరము గా, మనస్తత్త్వముగా, తత్సంబంధ అనుభవములుగా, అనుబంధములు గా  భావిస్తున్నప్పుడల్లా భావ శరీరం ని పొందుతాము. దానినే జన్మ లేక పుట్టుక అంటారు.

నేనుని ఆత్మగా అన్వయించుకున్నప్పుడు జన్మలే ఉండవు . ఎందుకంటే ఆ అన్వయము జరిగినప్పుడు "నేను" వ్యక్తి గా ఉండదు. అందువల్ల తత్సంబంధ భవములు, తలపులు, అనుభవములు, అహంకార మమకారములు దృష్టి లేదా గమనికలోనికి రావు. వ్యక్తిత్వ విస్మరణమే మరణము  ఈ దశలో హాయి, ఆనందము, శాంతము, మౌనము, ప్రశాంతత, ప్రజ్ఞానము అనుభువములుగా ఉంటాయి.

అందుకే అద్వైత స్థితి శాంతానంద స్థితి. వ్యక్తి  కి సంబంధిచిన సుఖదు:ఖములు మరపులో ఉండి, దృష్టి లో ఉండవు. ఈ మరపే లేక వ్యక్తిత్వ విస్మరణమే సౌఖ్యాన్ని ఇస్తుంది.  ఈ స్థితి  స్థిరపడితే,  వ్యక్తి  తో ముడిపడిన సుఖ దుఃఖములు దృష్టిలోకి వచ్చినా మనసు దృఢముగా ఉండి సంయమనమును కొల్పొదు. నెమ్మదిని నేర్చి మది ఉనికిని కోల్పోతుంది దీనినే ముక్త స్థితి, మోక్ష స్థితి, నిర్వాణ స్థితి, దివ్య స్థితి అంటారు.. ఇలా ప్రజ్ఞానం ఒక్కటే అయి,ఒక్కటే గా, ఉన్నది అద్వైత స్థితి..


ఈ అద్వైత స్థితిని, మన ఇష్ట దైవము గా, స్థితి గా అనుకుంటే అది సగుణ బ్రహ్మ ఉపాసన. సగుణ  భక్తి కలిగి ఉండడము. అప్పుడు ద్వైత స్థితి మనిషి లేదా వ్యక్తి లేక జీవాత్మ స్థితి గా, అద్వైత స్థితి ని పరమాత్మ అయిన ఇష్ట దైవముగా చూడడము పరమాత్మ స్థితి లో ఉండడము.


ఈ అద్వైత స్థితినే ఆత్మ లేక బ్రహ్మ స్థితి గా చూస్తె అది నిర్గుణ బ్రహ్మ ఉపాసన.

ఎప్పటికి ఈ జీవ స్థితి పోయి, పరమాత్మ స్థితి గా ఒకటే ఉండడము, జరగదని మధ్వాచార్యులు వారు అన్నారు. ఎప్పుడూ ఈ ద్వైత (జీఎవాత్మ, పరమాత్మ విడిగా తెలుస్తూండడం ) భావము పోదు అని ద్వైతుల నమ్మకము. అలా పోయీ,పోక,  అద్వైత స్థితిని, మనిషి లేక జీవాత్మ లేక వక్తిత్వ స్పృహ కలిగి ఉంటూ, భగవంతుని కళ్యాణ గుణములలో మన వ్యక్తితత్వము లీనమయ్యి పరమపదాన్ని, శివ పదాన్ని, లేక విష్ణు పదాన్ని లేక ఇష్ట దైవ లేక, దేవతా పదాన్ని పొందడము విశిష్టాద్వైతము అంటారు. ఇది రామానుజులు ప్రచారము చేసారు. ఇందులో కూడా వ్యద్తిత్వ స్పృహ లీలగా ఉంటుంది అని వారి నమ్మకము.

వ్యక్తిత్వ స్పృహ పోయిన తత్క్షణమే మిగిలి ఉండేది పరమాత్మ స్థితి ఒక్కటే, కనక ప్రకృతి పరంగా ను నిర్మాణములోను,చేయబడిన వస్తువు అధారముగాను, వ్యక్తి లేదా జీవాత్మ, పరమాత్మ ఒకటే అని అద్వైతము చెబుతుంది. దీనిని  తత్వము అంటారు. మన ప్రకృతిని బట్టి, మానసిక పరిపక్వతని బట్టి మనకి సగుణ తత్వమో, నిర్గుణ తత్వమొ నచ్చుతుంది. ఆ ప్రకారముగా మనము మన ఆధ్యాత్మ పథాన్ని ఎంచుకుంటాము.


ఏదైనా, తత్వము యొక్క పరమార్ధము మనకు జీవన యానము లో సాయము చేయడము. జీవితములో కలిగే వడి దుడుకులకు, మనసు, మనము, లొంగి, క్రుంగ కుండా, అనవసరముగా పొంగకుండా, సంయమనము పాటిస్తూ, విధి నిర్వహణమును ప్రశాంత చిత్తంతో చేయడానికి ఈ తత్త్వ జ్ఞానము సాయపడుతుంది.


ఇదే తత్త్వము యొక్క పరమార్ధము. మరే ఇతరమూ కాదు. ఈ తత్త్వము అందరు స్త్రీ,  పురుషులకి ఉపయోగిస్తుంది, వారి వారి, ఇష్ట దైవములు, నమ్మకములు, ఇష్టాయిష్టములు ఏమైనా, ఎంతో వేరైనా.

No comments:

Post a Comment