Tuesday, March 17, 2015

నాయకస్వామ్యం

 

 

నాయకస్వామ్యం

దేశము పేరు చెప్పి సేవ చేసెదమని మప్పి
ప్రజల చెమటను, నమ్మకమును, దేశాభిమానమును
స్వార్థమునకు వాడుకొనుచు; అధికారము
నందుండి కుమార్గముల చేతికందినంత
వెనకేసికొనుట; ప్రజాస్వామ్యమునకు
మన నేతల నూతన వ్యాఖ్యానము

ప్రజలలో దురభిమానములు , పశు ఆవేశములు
రేకెత్తించి పదవి పొందుట ప్రియము ముందు
అల్లుడు, కొడుకు, భార్య, కూతురు, బావమరిది, తమ్ముడు
మనోళ్ళు ప్రియము అధికారము నందు

నాయకులయొక్క చదరంగపుటెత్తుల
పావుల వలె ఉపయోగపడి; నాయకుల చేత
అనేక కష్ట నష్టముల పొందుచు
నాయకుల కొఱకు మనం నిర్మించి ఇచ్చిన
సుందర హర్మ్యం మన ప్రజాస్వామ్యం

కేంద్రము వేరు, రాష్ట్రము వేరు
ప్రజలకు ఎవరు ఏమి కారు; వారు వీరు చేసికొందురు
మాటల ద్వంద్వయుధ్ధము; ప్రజల ఇక్కట్లు
అనవసరము ఎవరికీ; అధికారము ఎటులైన
నిలుపుకొనుటయే పరిపాలనము అందరికీ

మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి
ప్రజాప్రతినిధులు సభ్యతమరచి పరస్పరము
దూషించుకొనుట సంస్కారము లేక వర్తించుట
మన పాలకుల ప్రజాస్వామ్య నిర్వహణము

కేంద్రము, రాష్ట్రము, జిల్లా, మండల ప్రజా
పరిషత్ లు, చూచితిర! ఎందరు పాలకులొ!?
నగరములకు, పట్టణములకు మరల వేరే;
ఇందరు కలిసి తగలేసిన వంట మన ప్రజాస్వామ్యం

బడా వ్యాపారస్థుల, పారిశ్రామికవేత్తల
కనుసన్నల మెలగుచు వారె పాలకులుn
అనిపింపచేయు ప్రభుత్వములు
ప్రజలకు ఏమి ఒరగబెట్టును?

ప్రజల కష్టసుఖముల పాలుపంచుకొనక
వారి బాగోగుల విచారించక; సకాలమునకు
ఎన్నికలు నిర్వహించుట మాత్రమే ప్రజాస్వామ్యమను
భాష్యము, ప్రజాస్వామ్య పరిరక్షణమను భ్రాంతి
కరుగనీయరు మన కుటిల నాయకులు

ధనబలం, కులమదం, మతపిచ్చి, సిధ్ధాంత, ప్రాంతీయ
 దురభిమానములు; మత్త మదేభములైభీభత్సముగ
సంచరించు ఎన్నికల దుర్గమారణ్యమునసామాన్య పౌరులు
ప్రవేశించుటెట్లు? పరిపాలనమున పాల్గొనుటెట్లు?

నేరస్థులు, సంఘవిద్రోహులు, అవినీతిపరులు,
గూండాలు, ఉగ్రవాదులుప్రజాప్రతినిధులై,
ప్రజాస్వామ్యమును దమననీతితో కాలరాచు ఈ నాడు
ప్రజాస్వామ్యము ప్రజలకు గుదిబండ

ఊకదంపుడు ఉపన్యాసముల నిచ్చు
మన రాజకీయ ధురంధురలకు; కరుణ
సేవాభావము మృగ్యము; తెలియదు
మనలనందరల సమముగ ఆదరముగ చూచుట

ప్రజల స్థితి బాగుచేయుట కాదు; వారిని
వడదీయుట రాజకీయమని దృఢముగ నమ్ముచు
నమ్మించుచు; జనుల అజ్ఞానము, దురావేశములు
దురభిమానములె శ్రీరామరక్షగ, భేదనీతిని
తెల్లదొరల మించిన ఈ నల్ల నేతలు వదలరు అధికారసుఖము;
పడదు వీరి స్వార్థ, కపట నాటకములకు తెర

స్వాతిశయము, అహంభావము, వారసత్వపు హక్కులు
ఆధిపత్యకాంక్ష, అధికారదాహము మదిని దొలుచుచుండ
ప్రజల ఆకాంక్ష, వారి నిత్యావసరములు, సుఖశాంతులు
పట్టించుకొనక; దేశ, ప్రజా క్షేమమునకు అడ్డుపడు సైంధవులు
ఎటుల నూతన భారతమును నిర్మింపగలరు?

బోయీలు ఎన్నడు పల్లకి నెక్కరు
ప్రజలు ఎన్నడు ప్రభువులు కారు
ప్రజల ప్రలోభ పెట్టగల సంకుచిత
నాయకులు; ప్రజాస్వామ్యమున రాజులు

No comments:

Post a Comment