Monday, November 9, 2015

మా తలాకావేరి యాత్ర

 మా తలాకావేరి యాత్ర

నేను మొదటగా తలాకావేరి గురించి, అప్పటి కంచి జూనియర్ స్వామి జయేంద్ర సరస్వతి కంచి మఠము వదలి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి వారం తరవాత తలాకావేరిలో ఉన్నారని తెలిసినప్పుడు, విన్నాను. తరువాత తెలిసింది తలాకావేరి కావేరి నది జన్మస్థానము అని. ఆ ప్రదేశాన్ని చూడాలని ఎనాళ్ళనుంచో అనుకుంటూంటే మొన్న అక్టోబర్ మొదటి వారంలో వీలయింది. పాండిచ్చేరి నుంచి చెన్నై వెళ్లి అక్కడనుంచి శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో మైసూరు చేరాము నేను, మా ఆవిడ. అక్కడ మా పెద్దబ్బాయి స్నేహితుడు మనోహర్ మమ్మల్ని రిసీవ్ చేసికుని వాళ్ళ ఇంటికి తీసికుని వెళ్ళాడు. తను, అతని భార్య దీప్తి ఎంతో ఆదరముగా మమ్మల్ని చూసారు.

మధ్యాహ్నము రెండుగంటలకి చేరిన మేము కొంత విశ్రాంతి తీసికుని , అతని కారులో నంజెంగూడు వెళ్ళాము. అక్కడ నజుండేశ్వర స్వామి ఆలయము ఉంది. నంజుండేశ్వరుడు శివుడు. పురాతన కట్టడము. తప్పక చూడవలసిన ప్రదేశము. అక్కడ నుంచి మైసూరు కి తిరిగి వస్తూ చాముండేశ్వరిని సందర్శించి ఇంటికి చేరాము. ఇడ్లీలు తిని బజ్జున్నాము మరునాడు ప్రొద్దున్న మనోహర్ అరేంజి చేసిన కార్లో తలాకావేరికి బయలుదేరాము.

దారిలో 1950 నుంచి సెటిల్ అయిన టిబెటన్ల వాసస్థానములు చూసాము. నాలుగైదు పట్టణములు ఉన్నాయి. అక్కడ ఒక చోట వారి బౌద్ధ శాఖకి చెందిన ఒక పెద్ద బౌద్దారామము ఉంది. చాల అందమైన కట్టడము. వారి తెగకి చెందిన గురువుల, బుద్ధుని విగ్రహములు కనువిందుగా   ఉన్నాయి. పురాతన కాలము నుంచి భారత దేశానికి అన్యమతస్థులు శరణార్ధులుగా వచ్చి ఇక్కడి వారితో కలిసిపోయి, వారి ప్రత్యేకతని నిలుపుకుంటూ భారతదేశానికి వన్నె తెచ్చారు. కేరళ చేరిన యూదులు, కిరస్తానీ వారు, బొంబాయి ప్రాంతము చేరిన పర్షియన్ దేశస్థులు  - వారిని మనము ఇప్పుడు పార్శీలు అంటాము, ఇలా వచ్చిన వారే. వారి వారి ప్రాంతములలో, దేశములలో పాలకుల మత అసహిష్ణుత,  హింస భరించలేక మన దేశానికి వలస వచ్చి సుఖముగా తరతరాలుగా  బ్రతుకుతున్నారు. మత సహిష్ణుతకు భారత దేశము పేరు కన్నది. దురదృష్ట వశాత్తు ఇప్పుడు మతముల, కులముల గందరగోళము, గొడవ భరించలేక అతలాకుతలం అవుతోంది. మేధావులు భేదాలని తగ్గించడానికి ఏమీ చేయక ఈ నిప్పుని రాజేస్తున్నారు కూడాను.

తరువాత కుశాలనగర చూసాము. నేను పాండిచేరి ప్రాంతమైన మాహె లో ఉన్నప్పుడు హసన్ వెళ్ళాను. అప్పుడు హసన్ నుంచి విరాజ్పేట కుశాలనగర మీదుగా వెళ్లాను. ఇక్కడే మనకు కావేరి మొదటగా తగులుతుంది. గోదావరిని రాజమండ్రి చూసిన కళ్ళకు ఒక చిన్న గోస్తనదిలా కనిపించింది కావేరి. ప్రొద్దున్న తొమ్మిదికి బయలుదేరిన మేము 12 గంటలకు మడికేరి  చేరాము. దారిలో మన పూర్వపు ఆర్ధిక మంత్రి బినామీ పేరుతొ కూడబెట్టుకున్న 2 వేల ఎకరాల కాఫీ తోట చూసాము. మడికేరి, కూర్గ్ ఒకటే. అది కర్ణాటకలో ఒక జిల్లా. మడికేరి దాని ముఖ్యకేంద్రము. ఇక్కడకు తలాకావేరి 45 కిలోమీటర్లు. అక్కడ ఒక హోటల్లో బస చేసాము. చాలా చల్లగా ఉంది. వర్షమూ పడుతోంది. రూమ్ కి కన్ఫైన్ అయ్యిపోయాము.

మరునాడు ప్రొద్దున్న తలాకావేరికి బయలుదేరాము. అన్నీ కాఫీ తోటలు. కుశాలనగర నుంచి కూర్గు ప్రాంతము మొదలయినట్టే. కాఫీ తోటలు మొదలవుతాయి. 25 కిలోమీటర్ల తరువాత భాగమండల అనే ఊరు వచ్చింది. ఇక్కడ కావేరి నిడదవోలు దగ్గరి ఏలూరు కాలవ వెడల్పుకన్న తక్కువ వెడల్పుతో ఉంది. చిన్నకాలువలా  ఉంది. కాని పరిసరాలు ఎంతో ఆహ్లాదముగా ఉన్నాయి. ఇక్కడ కావేరితొ ఒక నది కలుస్తుంది. అందుకని దీనిని ప్రయాగ అంటారు. ఇక్కడ ఈ నది ఒడ్డున భంగేశ్వర స్వామి ఆలయం ఉంది. శివుడు, అమ్మవారు కొలువై ఉన్నారు. ఇది కేరళ సంప్రదాయములో కట్టబడిన గుడి. గుడి వాతావరణము, పరిసరములు ఎంతో ప్రశాంతముగా ఉన్నాయి. తప్పక చూడాల్సిన ఆలయము.
 
ఇక్కడ స్వామి దర్శనము చేసికుని తలాకావేరి బయలు దేరాము. చేరాము. ఇక్కడ తలాకావేరిలో కావేరి నది ఉదయించే ప్రదేశము చాలా బాగుంది. కర్నాటక ప్రభుత్వమువారు దీనిని శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. మేఘములతో మనము ఆడుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు దట్టమైన మేఘముల మధ్య కావేరి నది జన్మ స్థానము చూసాము. నది పుణ్య జలములను నెత్తిపై జల్లుకున్నాము. అక్కడే ఉండి పోవాలి అన్నంతగా ఆకట్టుకుంది తలాకావేరి. కాని అక్కడ ఉండడానికి ఏమీ లేదు. చిన్ని వర్తకులు ఒక పది మంది ఒకటి రెండు చిన్న హోటల్లు ఉన్నాయి. అక్కడ చాలాసేపు గడిపి మడికేరి చేరాము. ఇక్కడ మడికేరి చుట్టుపక్కల హోం స్టే లు చాలా ఉంటాయి. మా పెద్దబ్బాయి అటువంటి ఒక హోం స్టే లో మాకు ఒక రూం బుక్ చేసాడు. డబల్ రూం. కాఫీ తోటలమధ్యలో మడికేరికి 20 కిలోమీటర్లలో కాఫీ తోటల మధ్య ఉన్న ఒక హోం స్టే ఇది. రణగొణ ధ్వనులనుంచి వచ్చిన మనకు అది స్వర్గధామములా అనిపిస్తుంది.

అక్కడ నిశ్శబ్దము మనలను ఎంతో అలరిస్తుంది. ఫ్రెంచ్ భాషలో écoute ce silence -  listen to the silence అనే ఒక ఫ్రేజ్ (వాక్యము)  ఉంది. నిశ్శబ్దాన్ని వినడం అని దాని అర్థము. మేము అక్కడి ఆ నిశ్శబ్దాన్ని వింటూ ఆనందించాము. మాతో పాటు అక్కడ ఆవేళ ఒక మరాఠీ కుటుంబం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరస్పరము వియ్యంకులు - వియ్యపురాళ్ళు. కలిసే ఇలా అన్ని ప్రదేశాలు చూస్తూన్తారుట. అప్పుడే కబినా రిజర్వాయిర్ దగ్గర నాలుగు రొజూ గడిపి ఇక్కడికి వచ్చారు. వారి ఆ స్నేహము మాకు ఎంతో నచ్చింది. నేను సంస్కృతములో రాసిన పాండురంగ ప్రశంస అనే కవితని వారికి చదివి వినిపించాను. ఎంతో సంతోషించారు . పండరీపుర నాథుడంటే మరాఠీ వాళ్లకి ప్రాణము కదా.

అక్కడ స్టే హోం  లో అంతా పాత ఫర్నిచర్ ఏంటో అందముగా అమర్చారు. ఆ ఇల్లూ పాతకాలపుది. అన్నీ కలపతో చేసినవి. పూర్వము మన పల్లెటూళ్ళలో ఉండే అన్ని కలప సామానులు ఉన్నాయి అక్కడ. అప్పుడు నేనూ మా ఆవిడా అనుకున్నాము. రిటైర్ అయ్యాక భీమవరంలో ఇటువంటి ఇల్లుగా మా ఇంటిని మార్చాలి అని. హో స్టే గా కాదు. పాత కలప సామానులను అందముగా డిస్ప్లే చెయ్యాలని. పాతదనానికి ఉన్న అందము, ఆకర్షణలను  ఇప్పడు ఎక్కువ మంది ఆస్వాదించడానికి ఉత్సుకత చూపుతున్నారు.

అక్కడ ఒక రోజు గడిపి మరునాడు ప్రొద్దున్నే మడికేరి వచ్చాము. అక్కడ ఊరి మధ్యలో ఉన్న శివాలయాన్ని చూసాము. ఒక జలపాతము - మడికేరికి 9 కిలోమీటర్లు - (కావేరి నదిది) చూడాలి చూడలేకపోయాము.
మడికేరినుంచి బయలుదేరి అక్కడక్కడ కావేరిని చూసుకుంటూ నిసర్గధామము చేరాము. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది. కర్ణాటకా టూరిజం వాళ్ళు ఒక హామ్లెట్ లా చేసారు. ఇప్పుడు శిథిల స్థితిలో ఉంది. అది కావేరి నది ఒడ్డున ఉంది. ఇక్కడ కావేరి కాస్త వెడల్పుగా ఉంది. కుశాలనగర మీదుగా మైసూరు చేరాము.

ఇదివరకు వచ్చినప్పుడు బృందావనం గార్డెన్స్ చూసాము. ఇప్పుడు శ్రీరంగ పట్టణలో రంగనాథ స్వామి ఆలయం చూసాము. కావేరి నది శ్రీరంగ పట్టణలో 4 పాయలుగా చీలుతుంది. వాటిలో రెండు పాయల మధ్య రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఎంతో అందమైన నిర్మాణము. ఇక్కడ రంగనాథుని ఆది రంగడు అంటారు. కావేరి మరి రెండు చోట్ల దిగువన ఇలా పాయలుగా చీలుతుంది. అక్కడ కూడా రెండు పాయల మధ్య రంగనాథుని అలయములు ఉన్నాయి. అవి శివసముద్రము, శ్రీరంగము. శ్రీరంగములో రంగనాథుని నాలుగైదు పర్యాయములు చూసాము. శివసముద్రములొ ఉన్న రంగనాథుని మధ్య రంగడు, శ్రీరంగములోనున్న రంగనాథుని అంత్య రంగడు అంటారు. శివసముద్రములొ నున్న మధ్య రంగని దర్శనము చేయాలి. స్వామి సంకల్పము కలిగినప్పుడు ఆ దర్శనము అనుగ్రహిస్తాడు.

మైసూరు మళ్ళీ వచ్చి మా ఆవిడ మైసూరు సిల్క్ చీరలు కొనుక్కున్నాక, రైల్వే స్టేషన్ చేరి మళ్ళీ శతాబ్దిలో చెన్నై వచ్చి పాండిచేరి చేరాము. ఈ యాత్ర మాకు సంతోషాన్ని, శాంతిని కలిగించింది.

సర్వమ్  శ్రీ రంగనాథార్పణమస్తు!

No comments:

Post a Comment