Saturday, November 7, 2015

బోధనలు - ఆస్తిక నాస్తికత్వములు

బోధనలు - ఆస్తిక నాస్తికత్వములు


మంచి విషయాలు మనం వినము, మంచి ఆలోచనలు చేయము. మంచి పనులు చేయము. ప్రపంచాన్ని ఉద్ధరించాలని తపన. మనకు ఎవరిని వారు ఉద్ధరించుకోవడం తెలియదు. అందరూ అన్నీ కోల్పోయినట్టు మనం బాధ‌పడి పోతాము. వారికి సాయం చేయాలని అనుకున్న దాంటో సహస్రాంశం కూడా మనకు మనం సాయం చేసుకోవాలనుకోము. మనం శుద్ధులమని, ఇతరులకు మనమిచ్చే బోధనల అవసరం మనకి ఎంతమాత్రము లేదని మన నమ్మకము. మనము అనుసరించని బోధనలు చేయడం వృథా ప్రయాస.

భగవంతుడు ఉన్నాడని కొందరూ, లేడని కొందరూ వాదులాటలలో గడిపేస్తారు. భగవంతుడు మనిషిని సృష్టించాడని‌ కొందరు, మనిషే భగవంతుని సృష్టించాడని కొందరూ నమ్ముతూ‌‌ కిందా మీదా పడుతూంటారు. రెండూ నమ్మకములు మాత్రమే అని రెండు పక్షములకు తెలియదు. ఒకరిని మరొకరు సంస్కరించాలని ప్రయత్నాలు.
అందరూ ఒకే దేవుడిని కొలవాలని అనడం అందరూ ఒకే రకమైన‌ వరి వంగడం సాగు చేయాలనడం. అందరూ ఒకే ఆచార వ్యవహారాలను పాటించాలనడం అందరూ ఒకే రకమైన మామిడి పండుని తినాలనడం. ఈ మూర్ఖత్వాలను, మూఢత్వాలను భగవంతుడు హర్షించడు, మెచ్చడని ఎందరికో తెలియదు.

తనలో సమస్తమునూ చూడాలని, సమస్తములో తనను చూడాలని జ్ఞానులు చెప్పారు. భగవంతుడు మనిషే అన్నారు. దేవుడు లేడనే వాడు కూడా దివ్యత్వము లేదనలేడు. భగవంతుని కమనీయత్వాన్ని గానం‌ చేయడం‌ అందరి వల్లా కాదు. భక్తుని, భగవంతుని అనుబంధము ప్రత్యేకము. నాస్తికునికి కల తర్క సామర్ధ్యము కాసేపు ఆపితే మిగిలి ఉండేది దివ్యత్వము. తోటి మనిషికి సాయము చేయడమే దివ్యత్వము. ఇది సనాతన భారతీయులకు తెలుసు. దానితో పాటు ఇంగితమూ తెలుసు. ఇంత జ్ఞానమును, ఇన్ని విజ్ఞానములను అందించిన వారికి భగవంతుని అవసరమూ తెలుసు. ఆయన ఉనికీ తెలుసు. మానవ సేవయే మాధవ‌ సేవయని, మానవుడే మాధవుడనీ వారికి స్పష్టముగా, నిశ్చయముగా, నిర్ద్వందముగా తెలుసు.

గురు శబ్దానికి అందరూ తగరు. పాండిత్యము, జ్ఞానము, తత్త్వ గాఢ పరిచయము, ఇంగిత జ్ఞానము, భాషా పటిమ, వైజ్ఞానిక దృక్పథము, నమ్మకము, కరుణ, విచక్షణ కలవారే గురువులు. వీరు మాత్రమే ధర్మబోధకు అర్హులు. ధర్మము ధర్మ సూక్ష్మములలో ఇమిడి ఉంటుంది.

ఎవరు పడితే వారు, ఆస్తికులైనా, నాస్తికులైనా బోధకు అర్హులు కారు. తమ తమ ఇష్టాయిష్టములను అధిగమించి
అవగాహనను కలిగి ఉండాలి. మూసివేసిన మనసు, నిశితము గాని బుద్ధి ఆచార్యత్వము నీయదు.
సమాజమును నడపాలంటే బుద్ధి సూక్ష్మత అవసరం. బుద్ధి సూక్ష్మత లేని ఎందరో సమాజాన్ని శాసించడానికి నేడు నడుం కట్టుకున్నారు. వారి అధ్వర్యములో అంతా‌ అలజడే. గొడవ, గోలానే. ఆడలేక మద్దెల ఓటు అవ్నట్టు సాంప్రదాయాన్ని, సనాతనతను దుయ్యబట్టడం తప్ప మరే మంచిని సమాజానికి అందించలేని మేధావులు తామత తంపరగా పుట్టుకొచ్చారు. సమానత పదాన్ని చిలకలా వల్లించే కుహనా మేధావులు‌ సమానతను నిజంగా నమ్మరు. అలా నమ్మితే ఇతరులను అభిశంసించలేరు. తమ ఆలోచనలను ఒప్పుకునేవారే వారికి సమానులు.

భగవద్భక్తి, భగవచ్ఛక్తి‌‌ మానవ హృదయాంతరంగములు. నరుడు, నారాయణుడు, నరుడు, హరి నీరమున నీరము వలె కలిసుంటారు. ఒకటై విలసిల్లుతారు. సరియైన దృష్టి‌ ఏర్పడగానే అన్ని అలజడులు తొలగి ప్రశాంతత మనసంతా నిండి సర్వ మానవ సౌభ్రాతృత్వము జగతిలో వెలుగొందుతుంది. ఈ సత్యమే సతతమూ జగత్-జీవ-ఈశ్వరులై వెలుగుతుంది.

అసతోమా సద్గమయ!
తమసోమా జ్యోతిర్గమయ!
మృత్యోర్మా అమృతంమయ!

సర్వే జనాః సుఖినో భవంతు!

సమస్త సన్మంగళాని భవంతు!

No comments:

Post a Comment