Monday, October 19, 2015

అవార్డీల ఆగడములు


  అవార్డీల ఆగడములు


ఇప్పటి కవులు, రచయితలు, కథా, నవలాకారులు, సాహితీ విమర్శకులు, ఇతర సాహతీస్రష్టలు గమనించవలసిన ముఖ్యాంశం ఒకటున్నది. అది: ఒకే విషయాన్ని గురించి భిన్న దృక్పథాలు ఉంటాయి. సామరస్యముతో మాత్రమే సమాజంలో సుఖశాంతులు తీసికొనిరాగలము. నిజానికి సాంకేతికత ఇంతగా అందుబాటులోనున్న ఈవేళ సామరస్యము తేవడం చాలా తేలిక.

రచయితకు రాజకీయ ఇష్టాయిష్టములు ఉండవచ్చు, కాని రచనా వ్యాసంగాన్ని, సాహితీసృష్టులను రాజకీయం చేయకూడదు. ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధము లేని అకాడమీ అవార్డులు వెనక్కి ఇస్తే ఎవరికి నష్టం? ఇంతకు మించిన ఘోరాలు జరిగినపుడు ఈ ఆక్రోశాలు, ఆక్రందనలు, అసహనములు, ఆందోళనలు, ఆవేదనలు ఎందుకు చూపించబడలేదు? భారత దేశములో చాలా అవార్డులు ఎలా వస్తాయో అందరికీ తెలుసు. తామేదో పత్తిత్తులమనుకొని అవాకులు చెవాకులు పేలడం హాస్యాస్పదము. అమాయకత్వము. అవార్డులు వెనక్కి ఇవ్వడము పసితనము, కుఱ్ఱతనము కూడా.

ఇప్పటి ఈ అవార్డీలైన రచయితల తతంగాన్ని అన్నిటికీ అతీతులైన వారు గమనిస్తోంటే చిన్నపిల్లల ఉడుకుమోత్తనంలా ఉంది. ఈ వీరి తీరు, అపరిపక్వతను, పరిణితి శూన్యతను, అవగాహనా రాహిత్యాన్ని దండిగా చూపిస్తోంది. మిగతా సాహతీస్రష్టలకు, పండితులు, మేధావులు అయిన పౌరులకు ఈ అవార్డీల తీరు చిరాకుగా ఉంది.

వీరికి మాత్రమే గుణాగుణములను నిర్ణయించే శక్తి ఉన్నదా? అవార్డులు రాని గొప్పవారైన సాహతీస్రష్టలు ఎందరు లేరు? వారికీ మంచీ చెడూ నిర్ణయించే శక్తి సామర్ధ్యములు ఉన్నాయి. ఈ అవార్డీల దృష్టే అంత భారతదేశపు దృష్టీ కాదు. ఎందుకు వారిని వారు అవార్డీలు ఇలా పలుచన చేసికుంటున్నారో తెలియదు. ఇతర మేధావులకు, పండితులకు, సాహతీస్రష్టలకు, విమర్శకులకు వీరి ఆక్రోశాల వెనుక గల రాచకీయము తెలుసు. ఇది తెలుసుకొని, వారి రచనలు వారు చేసుకుంటూ అవార్డీలు జీవించడం మంచిది.

ఈ అవార్డీలకి భారతదేశము అందరి తరఫునా మాట్లాడే అధికారము కాని, అర్హత కాని లేవు. వారి పక్షపాత ధోరణిని ఎందరో పట్టించుకోరు. ఇదంతా ఒక రాజకీయ వ్యవహారము. సాహిత్యానికి, మేధకూ ఈ అలజడికి ఏమీ సంబంధము లేదు. విజ్ఞులందరికీ‌ ఈ తమాషా ఎందుకో, ఏమిటో పూర్తిగా తెలుసు!

No comments:

Post a Comment