Wednesday, April 19, 2017

భౌతికశాస్త్రం - అధ్యయనావగాహనలు - మొదటి, రెండవ భాగములు

భౌతికశాస్త్రం - అధ్యయనావగాహనలు - మొదటి భాగము

ప్రకృతి శాస్త్రాల అధ్యయనం, అవగాహన; వాటిలో పరిశోధన; తత్త్వశాస్త్ర అధ్యయనం​, తత్త్వ విచారము, అవగాహన, సమానంగా మనుషులను అంతర్దృష్టి మయులను చేస్తుంది. ధ్యాన పరులను చేస్తుంది. సంతృప్తి పరుస్తుంది. మహనీయులను చేస్తుంది. వేద ఋషులతో సమానమైన తత్త్వ దృష్టి విజ్ఞాన శాస్త్ర వేత్తలది. సాంఘిక శాస్త్రవేత్తలూ వారి జ్ఞానదృష్టిలో, జ్ఞాన సముపార్జనలో తత్త్వ వేత్తలకు సరిసమానులు. ఈ మాటల్ని ఛాందసులు
ఒప్పుకోకపోవచ్చు.


భారత దేశంలో తత్వం గురించి, సాంఘిక శాస్త్రాల గురించి విన్నంతగా భౌతికశాస్త్రం గురించి వినరు. పన్నెండవ తరగతి వరకు చాలా మందికి భౌతికశాస్త్రాధ్యయనం ఉంటుంది కాని అవగాహన ఉండదు. ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలొచ్చాక చదువుల రూపురేఖలే మారిపోయాయి.

దీక్షతో, పరిశీలనతో అర్థం అవ్వాలనే తలపుతో, కోరికతో, శ్రద్ధతో శాస్త్రాధ్యయనం జరగటం లేదు. భౌతిక శాస్త్రాధ్యయనం అసలు జరగటం లేదు. మనిషికి లలిత కళాప్రవేశం, వాటిలో కృషి, పరిపూర్ణత ఇచ్చిన ఆనందం
విజ్ఞాన శాస్త్రాధ్యయనం, వాటిలో కృషి, పరిశోధన వల్ల కూడా కలుగుతుంది.

ఎమ్సెట్ పరీక్ష కోసం, ఇతర సీట్ల ప్రవేశ పరీక్షల కోసం చదివే, "నేర్చే" చదువులు, బట్టీ మాత్రం పట్టి బుర్ర లోకి ఎక్కించాలనుకోవడం, పరీక్ష, రాయగానే చదివినది, "నేర్చినది" మర్చిపోవడాల వల్ల ఏ ఆనందం కలిగించలేదు.
కూలికి బరువు మోసే వాడు గమ్యస్థానం చేరగానే బరువు దింపేసి "హమ్మయ్య" అనుకున్నట్టు నేటి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం మాత్రమే భౌతిక శాస్త్రాధ్యయనం చేస్తున్నారు.

అంతటి అందమైన, బుద్ధికి పదును పెట్టే intellectual pleasure ఇచ్చే భౌతిక శాస్త్రాధ్యయనం ఈ పోటీ పరీక్షలకు మాత్రమే వెళ్ళేవాళ్ళకు, ఎద్దుకు అటుకుల రుచి తెలియనట్లు తెలియదు. అంతటి మహనీమైన భౌతిక శాస్త్రం ఉత్సుకత లేని పోటీ పరీక్షల విద్యార్థుల చేతిలో విలువ కోల్పోయింది. యవ్వనంలో ఉన్న అందమైన స్త్రీ దగ్గర కొచ్చి వగలుపోతూ, వయ్యారంగా చెంప గీటితే దాని భావం, సరసం తెలియని బాలుని వలె ఈ పోటీ పరీక్షల విద్యార్థుల చేతిలో భౌతిక శాస్త్రం, దాని అధ్యయనం రసాభాస పొందుతున్నాయి​.

జ్ఞానము బుద్ధి కుశలత కలవారినే వరిస్తుంది. బుద్ధి హీనులు ఆ సౌందర్యాన్ని, సొగసుని ఆస్వాదించలేరు.
ఇలాంటి చేతకాని, శ్రద్ధ లేని పోటీ పరీక్షల విద్యార్థుల చేతిలో రూపు, ఔన్నత్యం కోల్పోతున్న మహనీయ భౌతిక శాస్త్రం గురించి, దాని ఔన్నత్యం, ఉపయోగం గురించి కొన్ని కబుర్లు విజ్ఞానాత్మకంగా, బుధజన సహృదయ హృదయంగమంగా అందించడం ఈ వ్యాస పరంపర ఉద్దేశం.

ప్రొఫెసరు కందుల వి. ఎన్. శర్మగారు Kandula V N Sarma గారు ఈ విషయమై ఆసక్తికరమైన​పోస్ట్లు పెడుతున్నారు. వారు పాత, కొత్త భౌతిక శాస్త్రముల తారతమ్యం, ఆ అందాలు, "సమానత్వాలు", విభేదాల గురించి రమణీయంగా రాస్తున్నారు. వారి రచనలు నాకు ప్రేరణ నిచ్చి ఈ ప్రయత్నం చేయడానికి ఉత్సాహపరిచాయి. వారు IISc., Bangalore లో ప్రొఫెసరుగా ఉన్నవారు.

జ్ఞానమునకు, ఇంగితమునకు పేరెన్నికగన్న భారత దేశంలో ఇప్పటి చదువుల దుస్థితీ చర్చించబడుతుంది.

*************

భౌతిక శాస్త్రం - అధ్యయనావగాహనలు - రెండవ భాగము

విజ్ఞాన శాస్త్రం ఉపయోగాలు కోకొల్లలు. విజ్ఞాన శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానంగా మారినప్పుడు ఈ ఉపకారం జరుగుతుంది. ఫక్తు విజ్ఞాన శాస్త్రం చదివేవారు జిజ్ఞాసతో చదువుతారు. విజ్ఞాన శాస్త్రం లేక సాంకేతిక పరిజ్ఞానం లేదు. కాని సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న ప్రాచుర్యం, గౌరవం విజ్ఞాన శాస్త్రానికి సామాన్యులు ఇవ్వరు. బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత కలవారే విజ్ఞాన శాస్త్రాన్ని తపస్సు చేసినట్లు అధ్యయనం చేస్తారు. ఆ అధ్యయనం ఒక తత్త్వానుభవం. యోగ్యులకే ఆ అందం అందుతుంది. విజ్ఞాన శాస్త్రం చదవడం, అందులోని విషయాలను అర్థం చేసుకోవడం ఒక ఆనంద యోగం. విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేయడం దివ్యానుభవం పొందడం.

ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రంగా పిలువబడుతున్న ప్రకృతి శాస్త్రములు గ్రీక్ వేదాంతులు ప్లాటో, అరిస్టాటిల్ ల తో మొదలై​ ఇంత శాఖోపశాఖలుగా విస్తరించింది. గణితము, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, జీవభౌతిక, జీవరసాయన శాస్త్రములు ఆదిగా అభివృద్ధి చెందింది. వీటినుంచి ఎన్నో ఉపశాఖలు ఆవిర్భవించాయి. సాంకేతిక శాస్త్రపరంపరా ఈ ముఖ్యం విభాగాలనుంచే జనించింది. మహా మేధావి తత్త్వవేత్త అయిన సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో, అతని శిష్యుడైన అరిస్టాటిల్ మొదట్లో అన్ని విభాగాల్లో ప్రవేశం కలిగి వేదాంతం మొదలు ప్రకృతి శాస్త్రాలు వైద్య, శరీరశాస్త్రాలు అన్నింటికీ ఉపయోగకరమైన విషయాలను అందించారు.

అరిస్టాటిల్ గుండె అన్ని శరీర మానసిక కార్యకలాపాలకు కేంద్రం అని నమ్మాడు. ఇప్పుడు మనం మెదడు ఈ కార్యకలాపాలకు కేంద్రం అని చదువుకుంటున్నాము.

తత్త్వము, గణితము, వైద్యశాస్త్రం, ఫిజిక్స్ కెమిస్ట్రీ జీవశాస్త్రాలు అనే విభాగాలు రాను రాను ఏర్పడ్డాయి. ఇవి మరింతగా విడిపోయాయి. శాస్త్రవేత్తలు అలా‌ వారి పరిశోధనా రంగంలో సబ్జెక్ట్ పరిధి విషయంలో బాగా కుదించుకుపోయారు. ఎన్నో ప్రత్యేకత రంగాలు ఏర్పడ్డాయి. ఇవి చాలా చాలా సూక్ష్మమై పోయాయి. సబ్జెక్ట్లు బాగా కుంచించుకుపోయాయి.

దురదృష్టవశాత్తూ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు మేథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కావలసిన అవసరమైన ముఖ్యమైన సబ్జెక్టులు అనుకోరు. వాళ్ళ మీదకి బలవంతంగా రుద్దబడిన మోయలేని భారం అనుకుంటారు. ఆ సబ్జెక్టులకి, వాటిని బోధించేవారికి కూడా గౌరవం లభించడం ఒక అరుదైన విషయంగా తయారైంది. కొన్నాళ్ళలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ సబ్జెక్టులు తీసేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఎందుకంటే ఇదివరకు మెడిసిన్ చదివేవారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు చదివేవారు. మెడిసిన్ ఫీల్డ్లో రోగ నిర్ధారణకు ఎన్నో ఉపకరణాలు వాడతారు. అవన్నీ ఫిజిక్స్ కలిగించిన అవగాహన మీద ఆధారపడి అభివృద్ధి చేసినవే. ECG, Ultrasonics, electronics, X-RAY, many types of scanners, ఇలాంటి ఎన్నో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇచ్చిన అవగాహన మీద ఆధారపడి పనిచేసేవే. మందులన్నీ రసాయనములే. అవి పనిచేసే విధము కెమిస్ట్రీ చదివితే గాని అర్థం కాదు.
కాని ఎలా జరిగిందో, ఈ మెడికల్ కౌన్సిల్ అవీ ప్రేక్షకపాత్ర వహించి ఎందుకు ఊరుకున్నాయో మెడిసిన్ చదివేవారు ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవటం లేదు. వైద్యం చేసే డాక్టర్ అన్ని ఇన్స్ట్రుమెంట్ల, మందుల పనిచేసే విధము కూలంకషంగా తెలుసుకోనక్కరలేదు. కాని ఫండమెంటల్స్ తెలుసుకోవడం అవసరం.

కాని మన దేశంలో మనకి మనమే మినహాయింపులు ఇచ్చేసుకున్నాము. మిగతా దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, యూరప్, జపాన్ కొరియా చైనాలలో ఇంత ఉదాసీనత, బద్ధకం, చదువు పట్ల అగౌరవం, అలక్ష్యం, అశ్రద్ధ, చల్తా హై ధోరణి ఉండవు. అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేర్చుకుంటారు. అక్కడ ఎకడమిక్స్, దానికి సంబంధించిన చదువులు అందరూ చదవరు. 12వ తరగతి అయిపోగానే తమకు శ్రద్ధ, ఇష్టం ఉన్న ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఒక జీవికను ఏర్పరచుకుంటారు. ఆ జీవికనిచ్చే దానికోసమే శ్రమ పడతారు. డబ్బులు సంపాదించుకుంటారు, తమ ధోరణిలో జీవిస్తారు.

మనం, మన పిల్లలూ కూడా దేనికి రాజా లాంటి ఉద్యోగాలు వస్తాయి అందులో జేరాలి అనుకుంటాము.
ఆ కోర్సు మనకి ఇష్టం లేకపోయినా అమితంగా డబ్బు ఖర్చవుతున్నా గొఱ్ఱెదాటు వ్యవహారం గా కోచింగ్ లో చేరి
ఆ తర్వాత కోర్సు లో చేరి సర్టిఫికెట్ అనే కాగితం ముక్క సంపాదిస్తాము. అది ఉద్యోగం తెచ్చినా తేకపోయినా
గతిలేక నాలుగు వేలకో, ఐదు వేలకో ఓ "ఉద్యోగం" లో చేరతాము. కళ్ళుమూసుకుని విషంలా ఆ under and inadequate earning employment లో జీవితం గడిపేస్తాము.

రిజర్వేషన్లు ఉన్నవారు వాళ్ళ తాత తండ్రులు చేసిన వృత్తి ఆధారంగా, ఆ వృత్తితో ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగం లో చేరతారు. ఆ రిజర్వేషన్లు తమ పుత్ర పుత్రికా, పౌత్ర, పౌత్రి, దౌహిత్ర, దౌహిత్రి పర్యంతం అనుభవిస్తూ తమ కులంలో వెనుకబడిన వారు అలాగే అత్తెసరు బ్రతుకులు ఈడుస్తుంటే ఏమీ పట్టనట్టు, పట్టించుకోకుండా రిజర్వేషన్లు వాళ్ళకు అందకుండా తామే తరతరాలుగా అనుభవిస్తారు.

ఇదే విధంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగి మేథ్స్​ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్ని తీసేసినా నేను ఆశ్చర్యపోను. పరీక్షల్లో డిటెన్షన్ తీసేసేక భారత దేశంలో చదువులు వాటి ప్రభావం, ప్రాముఖ్యం అడుగంటాయి. చదువుల్లో చేరడమనేది ఉద్యోగం కోసం అని నిశ్చయించేసుకొని సబ్జెక్టులు ఏమీ నేర్చుకోకుండా ఒక కాగితం ముక్క చేతపట్టుకొని హై ఫై ఉద్యోగాలు వాళ్ళ జన్మహక్కనుకొని ప్రభుత్వాలను నిలదీయడం, ఈ ప్రభుత్వాలను నడిపే; ఏ విధమైన జ్ఞానం, పరిజ్ఞానం, చదువుపై అవగాహన, కనీస ఇంగిత జ్ఞానం లేని శుద్ధ ఎద్దు మొద్దు స్వరూపాలైన రాజకీయ నాయకులు ఈ పెడ ధోరణులకు వత్తాసు పలుకడం.

అర్హత లేకుండా అందలాలు ఎక్కాలనుకునే వారికి, కుల ప్రాంత, మత, లింగ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి గారాబం చేసే దౌర్భాగ్యపు వ్యవస్థ ఏలుతున్న నేడు సబ్జెక్ట్ కూడా నేర్చుకోండి అనడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరూ వినరు కూడా.

ఇటువంటి స్థితిలో మా లాంటి వాళ్ళం చదువు, విజ్ఞానము, వాటికి మర్యాద, గౌరవం ఇస్తూ, శ్రద్ధ, లక్ష్యం చూపిస్తూ చదువుకోమనడం, శాస్త్రాలు​ నేర్చుకోమనడం, వాటిపై అవగాహన, పట్టు కలిగి ఉండడం గురించి మాట్లాడటం చాదస్తమే.

అయినా ఎంత ఆకలేసినా, ఎవరేం చేసినా, అనుకున్నా ఆవు గడ్డి మేసే బ్రతుకుతుంది. మాంసం తినలేదు. అలాగే సింహమూ గడ్డి తిని బ్రతక లేదు.

No comments:

Post a Comment