Sunday, April 9, 2017

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - మూడవ, నాలుగవ భాగములు

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - మూడవ భాగము

కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భారత దేశం లోని ఎక్కువ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి తమ పిల్లలకు సర్వ మానవ సమానత్వం, సర్వ మత సహిష్ణుత ఉగ్గు పాలతో రంగరించి పోస్తారు. దుర్మార్గులైన, మూఢులైన ప్రభువులు, పాదుషాలు, సుల్తానులు, ఓట్లకోసం కక్కుర్తి పడే రాజకీయ నాయకులు ఈ వాతావరణాన్ని కలుషితం చేశారు. చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు. కాని సామాన్యులకు ఈ మూర్ఖత్వం, తీవ్ర వాదం అంటవు. ఈ పౌరులవల్లే భారత దేశం ఇంకా మనగలుగుతోంది. భారత దేశ పౌరులు శాంతి కాముకులు. వారు తమ మతాన్ని అనుసరిస్తూ, ఇతర మతాలను గౌరవిస్తూ జీవిస్తారు.

ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని సామాన్య ప్రజలు తాము జీవిస్తున్నారు. తమ తోటి వారిని జీవించనిస్తున్నారు. రాజకీయ నాయకుల; మత, కుల, ప్రాంతీయ, స్త్రీ, దళిత వాద మూర్ఖ శక్తుల, వీటిలోని తీవ్రవాదుల దారుణాలకు తట్టుకుని సర్వ మానవ సమానత్వ జెండాని సంయమనంతో వ్యవహరించి
ఎగరేస్తున్నారు.

ఆ సంస్కృతి, సాంప్రదాయాల నుంచి వచ్చిన నాకు ఈ సర్వ మానవ సమానత్వ దృష్టి, సర్వ మత సహిష్ణుత చిన్నప్పటి నుంచే అలవడ్డాయి. మా ఇంట్లోనూ ఈ నాగరికత పరిఢవిల్లేది. పరిఢవిల్లుతోంది. పరిఢవిల్లుతూనే
ఉంటుంది. అందుకని నాకు జైన దేవాలయ సందర్శనం విష్ణు, శివాలయ సందర్శనం​లాగే ఉంటుంది. మా ఆవిడకి, పిల్లలకూ అంతే. కోడళ్ళకు అంతే. మనవలు, మనుమరాండ్రకు అంతే.
దానితోపాటు మేము స్మార్తులము. మాకు శివ, కేశవ అభేదము. అందరు దేవుళ్ళని, దేవతలని, దైవాల్ని
సమానంగా అర్చిస్తాము. ప్రార్ధిస్తాము. తలుస్తాము. అన్ని దేవాలయాలని సమాన భక్తి శ్రద్ధలతో దర్శిస్తాము. అలా ఇతర మతాలను గౌరవిస్తూ ఆ యా ఆలయ సందర్శనం చేస్తూంటాము.

తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలంలో వైష్ణవ శైవ బౌద్ధ జైన చార్వాక మతాలు, వాటి మతస్థులు ఉండేవారు. అందుకే రాజరాజనరేంద్రుడు సనాతన ధర్మం వైపు మొగ్గినా, ఆయన తండ్రి విమలాదిత్యుడు తన జీవిత చరమాంకంలో జైనం స్వీకరించేంతగా జైనం ప్రాబల్యం ఉంది. రాజరాజనరేంద్రుని కులగురువు, పురోహితుడు,
ఆస్థాన కవి నన్నయ భట్టారకుడు మహాభారతాన్ని సనాతన ధర్మం ప్రకారం, సనాతన ధర్మప్రచారం కోసం ఆంధ్రీకరించినా, కన్నడ కవి త్రయములోని రన్న మహాభారతాన్ని భీముని నాయకుని చేసి జైనధర్మాన్ని చొప్పించి కన్నడ భాషలోకి అనువదించాడు. అప్పటి కన్నడ ప్రభువులు జైన ధర్మాన్ని రాజధర్మం చేసి పాలించేవారు.
అదే సమయంలో రాజస్తాన్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాలలో ఎన్నో జైన కట్టడాలు వెలిశాయి. ముందే చెప్పినట్టు శ్రావణ బెళగొళ లోని బాహుబలి దిగంబర విగ్రహం దాని చుట్టూ ఆలయాలు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దిలోనే నిర్మించబడ్డాయి. జైనం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు వెలసినది పాలీతానా ఆదినాథుని జైనాలయం అనుకోవచ్చు.

జైనులు మాత్రం దీన్ని ఎంతో పురాతన కట్టడంగా భావిస్తారు.
మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - నాలుగవ భాగము

భావనగర్ వద్ద సముద్రంలోని శివ లింగ దర్శనం

శివరూపాత్ జ్ఞానమహః త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్
శిఖి రూపాదైశ్వర్యం భవతశ్చ ఆరోగ్యమిచ్ఛామి.

ఇది సాంబ కృత ఆదిత్య స్తోత్రములోని ఒక శ్లోకం.

భక్తులు పరమశివుని జ్ఞానం కోసం, శ్రీమన్నారాయణుని ముక్తి కోసం, సుబ్రహ్మణ్య స్వామిని (అగ్నిదేవుని అని కొందరంటారు), సూర్యనారాయణ మూర్తి ని ఆరోగ్యం కోసం ప్రార్ధించాలి అని పెద్దల మాట.

పరమశివుడు భక్తజనకింకరుడు. భోళా దేవుడు. ఆడంబర రహితుడు.

ప్రణమామి శంకరం భక్తజన కింకరమ్
భవతిమిర భాస్కరం పార్వతీ సహచరమ్

అని స్తుతిస్తే ఎంతో పొంగిపోతాడు.

మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే
గండూషాంబ నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిత్ భక్షిత మాంస శేష కవలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్ అహో! వనచరో భక్తావతంసాయతే
 
శివానందలహరిలో శంకరుల ఆశ్చర్యం ఇది. నమ్మకం కూడాను.

భక్తి ఉంటే నడకకి ఉపయోగించే చెప్పు శివ నిర్మాల్యం తీసే కూర్చ (ఊడ్చేది) అవుతుంది. పుక్కిట పట్టి నోటితో ఎంగిలి
చేసిన లాలాజలము అభిషేక జలం అవుతుంది. కొంత కొరికిన మాంసపు ముక్క నైవేద్యం అవుతుంది. భక్తి చేయలేనిది ఏముంది? చెంచువాడిని భక్తవతంసుని చేస్తుంది.

చల్లని కొండ కైలాసము మీ నివాసము
చల్లని తల్లి హైమవతి మీ సగ భాగము
చల్లని రాజు చంద్రుడు, చల్లని నీటిని వహించు
పావని గంగా భవాని మీ శిరసున సహవాసులు
చల్లని చూపుల మమ్ము చల్లగ చూచు
చల్లని దేవులు మీరు శంకరా!

ఇటువంటి చల్లని దేవులు

రామ నామము జపియించుచు మీరు తల్లి పార్వతి తోడు కాగ
పాలింతురు సకల జగముల; ఆపన్నుల కాచుట ఆనంద తాండవము
మీకు; భోళా శంకరులు మీరు; ఎల్ల వేళల యందు మమ్ము
కరుణ చూచు మిమ్ము హృదయమున పూజింతు శంకరా!

ఇలా మనలను కాస్తూ ఉంటారు. ఆయన విగ్రహ సహితులు. విగ్రహ రహితులూను. నిరాకారమైన లింగ స్వరూపం ధరించి నిర్గుణ తత్త్వాన్నీ తెలియజేస్తారు.

పరమేశ్వరుడు జ్ఞాన కల్పవృక్షము. నాయనమారుల పట్ల ప్రేమాస్పదుడై ఉండి వారితో ఆడుకుంటూ వారికి
శివసాయుజ్యము నొసగిన కామధేనువు.

మేము భావనగర్ లోని మా అబ్బాయి బుక్ చేసిన Gen X హోటల్లో దిగాము. హోటల్ బాగుంది. ఆతిథ్యం, ఫుడ్ ఎంతో బాగున్నాయి. ప్రొద్దుట పదిగంటలకు భావనగర్ పర స్టేషన్లతో దిగాము. భావనగర్ టెర్మినస్ అని మరొక స్టేషనూ ఉంది. రెండూ ఊరికి దగ్గరే. కాకినాడలో లాగ కాకినాడ టౌన్, ఊర్లోను, పోర్ట్ స్టేషన్ ఊరిచివర లా ఉంటాయమో అనుకుని, పర స్టేషన్ కి రిజర్వ్ చేశాను. భావనగర్ టెర్మినస్ కే చేయించుకోవాలి.

హోటల్లో రిఫ్రెష్ అయిన వెంటనే మధ్యాహ్నం ఎండగా ఉన్నా, అక్కడికి​ 27 కిమీ దూరంలో ఉన్న సముద్రంలో శివలింగాన్ని చూడటానికి టాక్సీలో బయలుదేరాము.

అది ఫక్తు పల్లెటూరు. బీచ్ లేదు దగ్గర ఉండే షాపులు ఉన్నాయి. ఒడ్డునుంచి ఒకటిన్నర కిలోమీటర్ రెండు అడుగులు వెడల్పు కలిగిన నీటిజాలులో నడవాలి. మోకాళ్ళ దాకా నీళ్ళు రావు. కింద బురదగా ఉంటుంది కానీ కాళ్ళకు ఇసక తగులుతూ నడవడానికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఒక పేద్ద సిమెంట్ చప్టా మీద ఐదు శివలింగాలు ఉన్నాయి. మూడు పాత లింగాలు. రెండు కొత్తవి. ఈ ఐదు పాండవులచేత ప్రతిష్టింపబడ్డాయని ఐతిహ్యం.

ఇద్దరు పూజారులు ఉన్నారు. ఇంకే కట్టడాలు లేవు. సముద్రం ఆటులో ఉండడం వల్ల దూరంగా ఎక్కడో ఉంది.
నేను ఇంకా రమ్యంగా ఊహించుకున్నాను. దృశ్యం అంత రమ్యంగా లేదు. కొద్దిగా నిస్పృహ చెందాను.
సాయంత్రం 3 గంటల నుంచి పోటు మొదలై ఆ ప్రదేశమంతా సముద్రంలో మునిగి పోతుంది. మేము అప్పటి దాకా ఉండలేదు.

సముద్రపు గాలి చల్లగా ఉండడం వల్ల ఎండగా ఉన్నా వేడి తెలియలేదు. అలా అక్కడ ఒక గంట సేదదీరాక వెనక్కి భావనగర్ బయలుదేరాము. అక్కడ మా ఆవిడ ఫేవరెట్ అయిన చెఱకు రసం తాగాము. బాగుంది.
హోటల్ కి చేరి విశ్రాంతి తీసుకున్నాము. మరునాడు పాలీతానా సందర్శించి వద్దామని అనుకున్నాము.

No comments:

Post a Comment