Thursday, April 6, 2017

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - మొదటి రెండు భాగములు

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర

కాకినాడ-భావనగర్ వారానికోసారి వెళ్లే రైలు వేసినప్పటి నుంచీ నాకు ఆ రైలు మీద భావనగర్ వెళ్లి రావాలనే కోరిక ఉదయించింది. ఎందుకో తెలియదు. అది అంతే. నాకు ఇలాంటి కోరికలే కలుగుతాయి. ఇతరులకు నవ్వు పుట్టించ
వచ్చు. చిన్నప్పటి నుంచి నాకు రైలు ప్రయాణం, రైళ్ళను గురించి తెలుసుకోవడం ఇష్టం.

మా నాన్నగారు మలకపల్లి, వేగేశ్వరపురం లలో పనిచేస్తున్నప్పుడు బస్ మీద నిడదవోలు వచ్చి మా ఊరు భీమవరం వెళ్ళడానికి రైలు ఎక్కేవాళ్ళం. అప్పుడు అన్నీ పాసింజర్ రైళ్ళు. క్వార్టర్లీ, హాఫియర్లీ, వేసంకాలం శలవలకు భీమవరం వచ్చి శలవలు గడిపి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. అలా ప్రతి శలవలకు భీమవరం వచ్చి రోజూ ఓ సినిమా చూసినట్టు చూసే వాళ్ళం. ఎనిమిది టాకీసులుండేవి.

ఆ ప్రయాణాల్లో రైళ్ళ మీద ఆసక్తి కలిగింది. మా నాన్నగారు రైలు టైం టేబిల్ కొనేవారు. దాన్ని నేను బట్టీ పెట్టేవాడిని అంటే అతిశయోక్తి కాదు. ఏ రైలు ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతుంది, ఏ ఏ స్టేషన్లలో ఆగుతుంది, ఆ స్టేషన్ల గురించి చదివేవాడిని. అప్పుడు ప్రతి స్టేషన్ పేరు పక్కన కొన్ని గుర్తులు పెట్టేవారు. ఆ స్టేషన్లో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి ఆ గుర్తులు తెలిపేవి. త్రిభుజం ఉంటే కూలింగ్ వాటర్ దొరుకుతుందని, చతురస్రం ఉంటే రిటైరింగ్ రూమ్లు
ఉన్నాయని (సరిగ్గా జ్ఞాపకం లేదు), bk అని ఉంటే బుక్ స్టాల్ ఉందని, శాఖాహార, మాంసాహార భోజనశాలలకు
మరియొక గుర్తు, జం. అంటే జంక్షన్ ఇలా ప్రతి స్టేషన్ వివరం ఉండేది. అవన్నీ చదివి గుర్తు పెట్టుకునే వాణ్ణి.
అలా నా రైల్వే పరిజ్ఞానం శాఖోపశాఖలుగా విస్తరించింది​.

ఇంతకీ మేము భావనగర్ ఆ రైలులో వెళ్లలేదు. బొంబాయి నుంచి బాంద్రా టెర్మినస్-భావనగర్ టెర్మినస్ రైలులో వెళ్ళాము. మా అబ్బాయి బొంబాయిలో ఉంటాడు. వాడే మంచి హోటల్లో రెండు రోజులకి రూమ్ బుక్ చేశాడు. మేము సోమనాథ్ వెళ్లినప్పుడు లాగే నేను ఆన్ లైన్ లో రానూ పోనూ టిక్కెట్లు నాకు, మా ఆవిడకి​ బుక్ చేసికున్నాను. ఈమధ్య నేను నేర్చుకున్న విద్య ఇది.

మా భీమవరానికి రెండు కిలోమీటర్లలో పెదమిరం అనే ఊరు ఉంది. అక్కడ మొదటి జైన తీర్థంకరులైన ఆదినాథుని ఆలయం ఉంది. అక్కడికి​అప్పుడప్పుడు వెళుతూ ఉంటాము. ఆ వెళ్ళడాలలో భావనగర్ కి 60 కిలోమీటర్ల దూరంలో పాలీతానా అనే ప్రదేశంలో ఆదినాథుని జైన మందిరం ఉందని తెలిసింది. దానిని చూడాలనిపించింది. మొన్న సోమనాథ్ వెళుతున్నప్పుడు తోటి ప్రయాణీకుల మాటల్లో భావనగర్ పక్కనే అరేబియా సముద్ర తీరంలో ఒక శివాలయం ఉందని అది సముద్రం ఆటుపోట్లకు కనిపించి, మళ్ళీ సముద్రంలో మునిగిపోతుందని విన్నాము. ఇవి చూడటానికి బొంబాయి నుంచి భావనగర్ బయలుదేరాము.


భారత దేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లు. మరెన్నో మతాలకు మెట్టినిల్లు. ఉపనిషత్తులతో మొదలై, బౌద్ధ, జైన, చార్వాక, వైష్ణవ, శైవ, వీర వైష్ణవ, వీర శైవ, శాక్తేయ, సౌర, గాణాపత్య, సుబ్రహ్మణ్య మతములుగ పరిణమించి, పరిఢవిల్లిన తత్త్వమయ సమన్వయ, సామరస్య భూమి భారత దేశం. జొరాష్ట్రియన్ -పార్శీ, ఇస్లాం, క్రైస్తవ, యూదు మతములకు మెట్టినిల్లు.

మతం మత్తుమందని ఉద్ఘాటించి, తానే ఒక మతంగా మారిపోయిన కమ్యూనిజము, నక్సలిజం, రేషనలిజము, దళిత, స్త్రీవాద, వెనుకబడిన కులాల,జాతుల,వర్గవాద, నారాయణ గురు, పెరియార్, అంబేద్కర్, ఇలా సాంఘిక విప్లవకారులకు, మరెన్నో కుల, జాతి, వర్గ, ప్రాంతీయ వాదముల భూయిష్ఠమైన నాస్తికత్వము, కొండొకచో అస్తిత్వములకు, ఇలాగే ఎన్నెన్నో మతాలకు, ఇజాలకు, వర్గ వాదాలకూ నిలయం భారతదేశం.

భారతీయ తత్త్వ జ్ఞానము, సంస్కృతి ఉపనిషత్తులతో మొదలై, బౌద్ధ జైన చార్వాక వైష్ణవ శైవ వీర వైష్ణవ వీర శైవ శాక్తేయ సౌర గాణాపత్య సుబ్రహ్మణ్య మతములుగ, పైన నుడివిన ఆస్తిక, నాస్తిక వాదములుగ పరిణమించి, సాంఘిక సంక్షేమ కాంక్షులైన విప్లవకారులకు, కవులకు, రచయితలకు, వివిధ లలితకళా నిపుణులకు ఆలవాలమైంది.
 
క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుంచి ఇప్పటి దాకా ఈ అన్ని వైరుధ్యభూయిష్ఠమైన తత్త్వాలు, మతాలు, వాదాలు, విప్లవాలు పరస్పరం సహకరించుకుంటూ, కలహించు కుంటూ భారతదేశంలో సహజీవనం చేస్తున్నాయి, వివాహం బంధంలో ఇరుక్కుపోయిన భార్యాభర్తల్లా, ఇష్టం లేకపోయినా, కష్టమైనా.

ఉపనిషత్తుల కాలం నుంచి నేటిదాకా పయనించిన భారతీయుల నాగరికత సంస్కృతి, భారతీయుల జీవితం, జీవన విధానం ఎన్నో ఒడిదుడుకులకి, మార్పులకు లోనయ్యాయి. ఏ ప్రభువుకు ఏ మతం, తత్త్వం, సంస్కృతి ఇష్టమైతే వాటికి ఆలంబన లభించింది. ఇతర మతాలు, తత్త్వాలు, సంస్కృతులు ప్రజాబలంతో నిలిచే ఉన్నాయి. దానికి తోడు ప్రభువులు తామే మతాన్ని, తత్త్వాన్ని అభిమానించి, ఆదరించినా, వీలైనంత వరకు సర్వమత సమానత్వాన్నిఆదరించారు. రాజకీయంగా, ఇతర కారణాల వల్ల ఇలా జరిగింది.

తూర్పుచాళుక్యులను చోళులు ఓడించినా, అప్పటి రాజనీతి ప్రకారం సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. అలా రాజరాజచోళుడు తూర్పు చాళుక్య వేంగీ రాజైన విమలాదిత్యునికి తన కుమార్తె నిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకే రాజరాజనరేంద్రుడు జన్మించాడు. చోళులు హిందూ మతావలంబులు. కానీ అప్పటికీ, అప్పటికే భారత దేశం అంతటా బౌద్ధ జైనాలు వ్యాపించి ఉన్నాయి. వాటి ఆరామాలూ ఎన్నో చోట్ల ఉన్నాయి. ప్రజల్లోనూ ఆ మతావలంబకులున్నారు. అవీ సజీవంగానే ఉన్నాయి.

తూర్పు పశ్చిమ కోస్తాలలో అప్పటికే నిర్మించబడిన ఆరామాలలో ఆ మతాలు తమ తమ మతానుసరణం, వ్యాప్తిలలో అగ్రగణ్యంగానే ఉన్నాయి. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాలలో బౌద్ధ జైనాలు పరిఢవల్లాయి. ఎన్నో ఆలయాలు, ఆరామాలు నిర్మించబడ్డాయి. వాటిలో ప్రముఖమైనది పాలీతానా దగ్గరి ఆదినాథుని జైనాలయం.

ఆదినాథునికి ఆలయములు అరుదు.
 
కర్ణాటక లోని శ్రావణ బెళగొళ లోని బాహుబలి దిగంబర విగ్రహం ఎంతో ఎత్తైనదీ, శిల్పకళా చమత్కృతిలో ఎన్నికైనది. శ్రావణ బెళగొళ దర్శనీయ స్థలాల్లో ​ఒకటి. శ్రావణ బెళగొళ (జైనాలయం), హళేబీడు (శివాలయం), బేలూరు (వైష్ణవాలయం) కర్ణాటకలో హసన్ దగ్గర పక్క పక్కనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో నేను వీటిని దర్శించాను. ఎంతో ఆనందించాను కూడా.
 
తమిళ నాట చోళుల ప్రాబల్యం, ప్రాభవం ఉన్న సమయంలోనే కడలూరు - పాండిచ్చేరి పక్కనే- లో శ్రమణ మఠములుండేవి. జైనులను శ్రమణులనీ అంటారు.

No comments:

Post a Comment