Thursday, April 13, 2017

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - ఐదవ భాగము

మా భావనగర్ పర్యటన - పాలీతానా యాత్ర - ఐదవ భాగము

ఆదినాథుని దర్శనం

మేము భావనగర్ నుంచి​ అరవై కిలోమీటర్ల దూరంలో కల పాలీతానాకు టాక్సీలో వెళ్ళాము. మా హోటల్ మేనేజర్
టాక్సీ కుదిర్చిపెట్టాడు. పొద్దున్నే ఐదు గంటలకు బయలుదేరి తీరాలని చెప్పాడు. మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చి పంపాడు. పొద్దున్నే లేచి ఐదు గంటలకల్లా తయారై పోయాము. టాక్సీ రెడీగా ఉంది. పాలీతానాకు ఆ చల్లని ఉదయం బయలుదేరాము. దారిలో ఒక చోట టీ తాగడానికి ఆపాడు డ్రైవర్. అక్కడ టీ బాగుంది.

ఏడు గంటలకు పాలీతానా చేరాం. అది తాలూకా కేంద్రం.

బాంద్రా నుంచి పాలీతానాకు డైరక్ట్ రైలు ఉంది. మేము టాక్సీ దిగుతూనే మమ్మల్ని ఓ పదిమంది చుట్టేసారు -
డోలీ కావాలా అంటూ. పాలీతానా పక్కనే ఉన్న పర్వతం పై ఆదినాథుని జైనాలయం ఉంది. 3000 - మూడు వేల మెట్లు ఎక్కి వెళ్ళాలి. నడిచే వెళ్ళాలి. లేదా మనుషులు మోసే డోలీ ఎక్కి వెళ్ళొచ్చు. ఇద్దరు మోసే డోలీ కి పన్నెండు వందలు. నలుగురు మోసే డోలీకి రెండు వేలు తీసుకుంటారు. మనుషులు మోసే డోలీ ఎక్కడం నాకు, మా‌ ఆవిడకి సుతరామూ ఇష్టం లేదు. అదీ కాక మేము ఆ మూడు వేల మెట్లు ఎక్కి దిగగల శరీర ధారుఢ్యం మాకు ఉంది. అంచేత కాలినడకనే వెళ్లి రావడానికి నిశ్చయించుకున్నాము. కింద ఉన్న నాలుగైదు తీర్థంకరుల ఆలయములు సందర్శించుకొని హోటల్ వాళ్ళిచ్చిన బ్రేక్ఫాస్ట్ దర్శనం అయ్యాక పైన తిందామని కూడా తీసికొని బయలుదేరాము. మంచినీళ్ళ బాటిల్ కొందామనుకుంటే, మంచినీళ్లు దొరుకుతాయని చెప్పారు. వంద మెట్లు ఎక్కేసరికి. మా చేతిలో ఉన్న బ్రేక్ఫాస్ట్ పొట్లం చూసి వాలంటీర్లలా ఉన్న నలుగురు యువకులు మమ్మల్ని ఆపారు. లోపల ఏమున్నాయో చూసి తినుబండారాలు ఏవీ పైకి తీసుకెళ్లకూడదని, పొట్లం వాళ్ళకిచ్చేసి దిగేటప్పుడు తీసికోవచ్చని చెప్పి మా పొట్లం తీసుకున్నారు.

అప్పటికి పొద్దున్న ఏడైంది. నెమ్మదిగా మెట్లు ఎక్కడం మొదలెట్టాము. ఎక్కుతూంటే చుట్టుపక్కల ప్రకృతి ఎంతో
ఆహ్లాదకరంగా ఉంది. కింద ఒక నది పర్వతాన్ని అనుకుని చుట్టూ ప్రవహిస్తోంది. దాని పేరు శత్రుంజయ అని తర్వాత
తెలిసింది. దారిలో ప్రతి వంద మెట్లకి ఒక మండపము, అక్కడ చల్లని మంచినీళ్లు అందించే వ్యవస్థా ఉన్నాయి. మరేమీ లేవు. తినుబండారాల వంటివి అస్సలు లేవు.

ఐదు వందల మెట్లేక్కేక ఒక చిన్ని అమ్మవారి ఆలయం ఉంది. దానికే ప్రాముఖ్యత లేదు. 2300 వందల మెట్లేక్కేక
పద్మావతీ దేవి ఆలయం ఉంది. జైన సంప్రదాయం లోని పద్మావతి ఈవిడ. అక్కడ కొందరు అమ్మవారికి దీపం చూపించడం, వింజామర వీచడం, హారతీయడం లాంటి సేవలు చేస్తున్నారు. అక్కడ 24 తీర్థంకరుల చిన్న విగ్రహాలున్న ఆలయ సమూహం ఉంది. అన్ని జైన దేవాలయాల సమీపంలోనూ ఇలా 24 తీర్థంకరుల ఆలయ
సమూహములుంటాయి.

మౌంట్ అబూ సమీపంలోని అందమైన పాలరాతి జైన దేవాలయాలు కల దిల్వారా ఆలయ సముదాయం లోనూ 24 తీర్థంకరుల దేవాలయాల సమూహం ఉంది. అదీ తప్పక చూడాల్సిన ప్రదేశం.మెట్లు ఎక్కడానికి వీలుగా ఉన్నాయి. నడిచి ఎక్కుతున్నట్టే ఉంది. అలసట అనిపించలేదు. కాని ఎండ నెమ్మదిగా పెరుగుతోంది. ఇంక వంద మెట్లెక్కాలనగా ఒక వలంటీరు పక్క దారమ్మట వెళితే పూజా టిక్కెట్ ఇస్తారని చెప్పాడు. స్నానం కూడా చేయడం అటే అని చెప్పాడు. అటు ఎవరూ వెళ్లడం లేదు. అయినా మేము అటే వెళ్ళాము. మా వెనకాల ఒకావిడ, ఒకాయన వస్తున్నారు. ఆవిడని అడిగాను.

ఆవిడ చెప్పింది: జైనులకి ఈ యాత్ర ఎంతో ముఖ్యమైనదని, ఎంతో ప్రాధాన్యత కలదనీ, హిందువులకి కాశీ, రామేశ్వరాలు, తిరుపతి ఎటువంటివో జైనులకు ఈ యాత్ర అంత పవిత్రమైనదనీ చెప్పింది. ఆవిడ రెండు మూడేళ్ళకోసారి ఈ యాత్ర చేసుకుంటుందట. ఆమె అహ్మదాబాద్ నివాసి. ముప్ఫైయ్యేళ్ళుండవచ్చు.
పూజ టిక్కెట్ తీసుకుని, అక్కడ స్నానం చేసి అక్కడ పక్కనే ఉన్న దర్గాను సందర్శించి ఆదినాథుని దర్శించి
అక్కడ పూజ చేసుకోవడం యాత్రా విధానం. అక్కడ ఉన్న ఆ దర్గాలో ఇద్దరు ముస్లింలు ఉండి దర్గాను చూస్తూంటారు.

జైనులకు తప్ప మరెవ్వరికీ ఆ దర్గాలోకి ప్రవేశం లేదు.

మేము దర్గా చూడలేదు. అక్కడ స్నానమూ చేయలేదు. పూజ చేయాలనుకోలేదు. ఆ విధి విధానాల గురించి సరిగ్గా తెలియదు కాబట్టి హిందువులను పూజ చేయనిస్తారో లేదో; ఈ రెండవ మార్గంలో కొన్ని అర్వాచీన తీర్థంకరుల
ఆలయాలు దర్శించుకుంటూ ప్రధాన ఆలయానికి, బయలుదేరిన రెండు గంటల తర్వాత, తొమ్మిది గంటలకు చేరాము. కొండ ఎక్కడానికి రెండు గంటలు పడుతుంది.

ప్రధాన ఆలయంలో ఫొటోలు తీయకూడదు. సెల్ఫోన్ తీసికెళ్ళనిస్తారు. ఈ విషయం నాకు చాలా నచ్చింది.
ప్రధాన ఆలయం పురాతన కట్టడం. ఎంత పురాతనమో అక్కడి వారు చెప్పలేదు. ఆలయం నిర్మించిన రాయి లేత ఆకుపచ్చనిది. అందంగా ఉంది. ప్రధాన ఆలయం లోకి ప్రవేశించి అక్కడ ఎంతసేపైనా దేవుణ్ణి చూస్తూ కూర్చోవచ్చు. దేవుడు ఎంతో బాగున్నాడు. కన్నులు ప్రకాశిస్తూ దివ్యంగా, సుందరంగా ఉన్నాయి. భగవంతుని చూస్తూ అరగంట సేపు అక్కడే కూర్చుని దర్శనం చేసుకుని ఎంతో ఆహ్లాదాన్ని పొందాము.

నేను ఎలా ప్రార్ధించాలి అని కొంత మీమాంసకు లోనయ్యాను. అందరూ నారాయణుని అవతారాలు కథా అనిపించి అలా ప్రార్ధించాను. మా ఆవిడ మాత్రం మరింత విజ్ఞతతో భగవంతుని శాంత స్వరూపునిగా ప్రార్ధించింది.
అక్కడే ఆలయం అంతర్భాగంలో భగవంతుని ఎదురుగా పూజలు చేసికుంటున్నారు. ఆ సన్నివేశం, దృశ్యం చాలా రమణీయంగా ఉంది. పిల్లలు రెడీమేడ్ ధోవతులు కట్టుకుని కళాత్మకంగా కనిపించి కనువిందు చేశారు.

ప్రధాన ఆలయం లోకి ప్రవేశించే ముందు ప్రదక్షిణం చేశాం.
ఆ సందర్భంలో ఆదినాథుని మరొక ఆలయంలో స్వామికి
దీపం చూపించడం, వింజామర వీచడం, అద్దంలో దేవుని
విగ్రహ ప్రతిబింబం చూడడం వంటి సేవలు చేశాము.

ఆదినాథుని దర్శనం ప్రశాంతతను కలిగించింది. పూజ టిక్కెట్ - ఉచితంగానే - తీసికున్నవారు ప్రధాన ఆలయం
లోపలికి వెళ్ళి అర్పణలు చేసి, స్వామిని తాకి పులకిత మనస్కులై దర్శనం చేసుకుంటున్నారు. జనం ఉన్నా తొడతొక్కిడి లేదు.
ఆలయం ప్రాంగణంలో ఆదినాథుని పాదములు ఉన్న ఆలయం ఉంది. అందరూ భక్తి శ్రద్ధలతో వాటికి నమస్కరిస్తున్నారు. ఆ పక్కనే ఒక చెట్టు ఉంది. అదీ ఎంతో పురాతనమైనది. హిందీలో ఆ చెట్టు పేరు రైనా.
ఆ చెట్టు దగ్గర కూర్చుని స్త్రీలు జట్లు జట్లుగా పూజలు చేస్తున్నారు. ఆ చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాం. అప్పుడు ఆ చెట్టు పైనుంచి ఆకు రాలి మనపై పడితే ఈ జన్మలో మనకు మోక్షం తథ్యం. నామీద గాని, మా ఆవిడ మీద గాని ఆయన చెట్టు ఆకులు రాలలేదు.

లోపల ప్రధానాలయ అంతర్భాగంలో భగవంతుని ఎదురుగా కూర్చుని చేస్తున్న స్తోత్రాలలోఎన్నో సంస్కృత పదాలు వినిపించాయి నాకు.

అక్కడ బయట ప్రాంగణంలోనే ఒక వేలంపాట జరుగుతోంది. రోజుకు పదకొండు మంది ఆదినాథునికి మకుట ధారణ చేయవచ్చు. ఆ భాగ్యం ఎవరు దక్కించుకుంటారు అనే దానికి వేలంపాట అది. జైనులందరూ స్త్రీ, పురుష, బాలలందరూ రమ్య వస్త్రధారణలో అందగిస్తూ పూజలు చేస్తూ ఆనందంగా భగవద్దర్శనం చేసుకోవడం
చూస్తూంటే ఎంతో బాగుంది. వారి భక్తి శ్రద్ధలు ముచ్చట గొలిపాయి.

తనివితీరా ఆదినాథుని సందర్శించాము. మన తిరుపతి దర్శించుకున్న అనుభూతి కలిగింది. స్వామి రూపు మది నిండా నిండి సంతోషాన్ని కలిగించింది. చల్లని మంచి నీళ్ళు తాగి సేదదీరాము. పైన తినడానికి ఏమీ దొరకదు. దానికి సిద్ధపడే వెళ్ళాలి. నడిచే ఎక్కాలి. ఎక్కలేని వాళ్ళు డోలీలలో వెళ్లొచ్చు. పైన ఎంతో శుభ్రంగా ఉంది.
అప్పటికి పొద్దున్న పదకొండయింది. ఎండ తీవ్రత పెరిగింది. అలానే నెమ్మదిగా దిగాము. ఇబ్బందేమీ అనిపించలేదు. దిగడానికి రెండు గంటలు పట్టింది. ఇది శ్వేతాంబరుల ఆలయం. జైనులలో శ్వేతాంబరులు​, దిగంబరరులు అని రెండు తెగలు. మేము కొల్హాపూర్ దగ్గరి ఒక జైనాలయం 300 మెట్లు మాత్రమే ఎక్కేది చూశాము. అది దిగంబర జైనుల ఆలయము.

ఇక్కడ జైన సన్యాసినులు, సన్యాసులు కింద ఆరామంలో ఉంటారు. వారు, ఎంతో పెద్దవారు కూడా ఉన్నారు, చక చకా ఎక్కి చక చకా దిగుతున్నారు. వారి శరీరాలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి.

భారత దేశంలో పాలకులు  ఎవరైనా, ఏ మతం వారైనా "భిన్నత్వంలో ఏకత్వం" శతాబ్దాల నుంచీ ఎంతో బాధ్యతాయుతంగా గౌరవింప బడుతూ వచ్చింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు సంకుచిత రాజకీయ నాయకుల చేతుల్లో భ్రష్టు పట్టిపోయింది. ఓట్లకోసం, పదవి దొరుకుతుందని దేశాన్ని కులముల, మతముల, ప్రాంతముల, సిద్ధాంతముల మధ్య రణరంగం చేశారు.

ఎప్పటికి బయట పడతామో.

భారతీయ సంస్కృతి, తత్త్వ జ్ఞానము ఉపనిషత్తుల కాలం నుంచి, బౌద్ధ జైన చార్వాక వైష్ణవ శైవ వీర వీర వీర వైష్ణవ వీర శైవ మతాలు, ఆధునిక కాలంలో సాంఘిక విప్లవకారులకు చోటు కల్పించి ఉన్నతంగా ఎదిగింది. దాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత భారతీయులందరిదీ.

మేము భావనగర్ తిరిగి వచ్చి మరునాడు బొంబాయికి​ ప్రయాణం అయ్యాము, క్షేమంగా చేరాము కూడా.

No comments:

Post a Comment