Sunday, October 12, 2014

శ్రీ రమణ మహర్షి







శ్రీ రమణ మహర్షి (1879-1950 ) పరమగురువులు. "సత్" గురువులు. "సత్" తనంతట తాను ఆయనకు సాక్షాత్కరించి, అవగతమై ఆయనను ఆత్మజ్ఞాన సంపన్నులను చేసింది; బ్రహ్మవిదులుగాను, బ్రహ్మకోవిదులుగానూ చేసింది.


"బ్రహ్మ విత్ బ్రహ్మ ఏవ భవతి" - బ్రహ్మమును తెలిసికున్నవారు తామే బ్రహ్మము అవుతారు- - అనేది ప్రసిద్ధమైన పలుకు. శ్రీ రమణ మహర్షి ఈ నానుడికి సాక్షాత్ ప్రతీక. బ్రహ్మమే ఆయన; ఆయనే బ్రహ్మము. ఆత్మారామము, రామబ్రహ్మము కూడా ఆయనే.

బ్రహ్మవిదులకు - దయా సర్వ భూతేషు - అన్ని జీవులయందు దయ; క్షాంతి - ఓర్పు , అనసూయ  - అసూయ లేకపోవడము, శౌచం - మానసిక, శారీరక శుభ్రత, అనాయాసః  - శరీరాన్ని, మనసును క్లేశపరచకుండా తపస్వులుగా ఉండడం , మంగళం - అన్ని శుభములను కలిగించే ప్రశస్తమైన లక్ష్మీ వైభవాన్ని చిందించే భావములను కలిగి ఉండడము, కళ్యాణదాయకమైన కర్మలను ఆచరించడము - అకార్పణ్యం - లోభ గుణం లేకపోవడం, అస్పృహ - దేనియందు కోరిక, ఆశ లేక  వ్యక్తికీ, వ్యక్తిత్వానికి సంబంధించిన భావములు నిండుకొని ఉండడం (నిస్పృహస్య తృణం జగత్ - అంతర-, బహి- ప్రపంచములు దృష్టి యందు లేకపోవడం, ఒక వేళ ఉన్నా వాటికి ఏవిధమైన విలువ ఇవ్వబడకపోవడం - అనే ఈ ఎనిమిది  సహజ లక్షణములు. ఇవన్నీ శ్రీ రమణ మహర్షి యందు మూర్తీభవించాయి

"వైరాగ్యమేవ అభయం" అనేది ఆయన జీవనశైలి. జీవన సారాంశం; జీవిత ఉపదేశం.
 

ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే

వ్యోమవత్ వ్యాప్య దేశాయ (దేహాయ)

శ్రీ దక్షిణామూర్తయే నమః

-అనే ప్రసిద్ధమైన వాక్యం ఆయనను స్తుతించడానికి, నిర్వచించడానికి, వివరించడానికి సరియైన ప్రకటనము.

శ్రీ రమణ మహర్షి దక్షిణామూర్తి స్వరూపులు. సాక్షాత్ శివులు (జ్ఞాన స్వరూపులు). తమిళ నాట ప్రసిద్ధ శివభక్తులైన నాయనమారులలో విశేషులైన తిరుజ్ఞానసంబధరులు శ్రీ రమణులుగా పుట్టారా అనిపిస్తుంది. పదిహేడవ ఏట మరణానుభవరూప జ్ఞానానుభవం కలిగే వరకు వెంకటరామన్ గా  నున్న శ్రీ రమణ మహర్షి శివుని పితృసమానంగా  భావించి కొలిచిన వారు. మదురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఎదుట భక్తిభావ జనిత అశ్రువులు రాలుస్తూ ఈశ్వరుని చెంత ఎంతో సమయం గడుపుతూండేవారు.

విరాగియైన పిదప అరుణాచలం(తిరువణ్ణామలై ) లో శ్రీ అరుణాచలేశ్వరుని మొదటి సారి సందర్శించినప్పుడు  "అప్పా! నీ దగ్గరకు వచ్చేసాను" అన్నారు. ఆ తర్వాత తిరువణ్ణామలై లోనే జీవితాంతం ఉన్నా, ఆయన మళ్లీ అరుణాచలేశ్వరుని గుడిలో  సందర్శించక పోయినా, శివునిపై ఆయన పితృ భావం అలానే ఉండిపోయింది. అందుకే అయన సమకాలికులు, ఆయనకు రమణ మహర్షి అని పేరు పెట్టినవారు, ఆయనను గురువుగా భావించి తరించినవారు, "నాయన" అని మహర్షి చే పిలువబడిన వారు అయిన కావ్యకంఠ శ్రీ వాశిష్ఠ గణపతి ముని శ్రీ రమణ మహర్షిని స్కందుని (సుబ్రహ్మణ్యే శ్వరుని) అవతారంగా భావించేవారు.
 

శ్రీ ఋభుగీతలో వర్ణించిన ఆత్మజ్ఞాన ప్రాప్తి సహజంగా, మార్జాల కిశోర న్యాయంగా (తల్లి పిల్లి, పిల్లి పిల్లలను ఎంత జాగ్రత్తగా సాకుతుందో అలా భగవంతుడు కొందరు భక్తులను సాకే విధం) శ్రీ రమణ మహర్షి కి కలిగింది.

ఆయన ప్రమేయం, ప్రయత్నం అణుమాత్రమైనా లేకుండా జ్ఞానులయ్యారు. పరమేశ్వరుని అద్భుత అనుగ్రహఝరి. స్నానమాడి తరించినవాడు వెంకటరామన్. ఆ ఈశ్వర లీల  రమణ మహర్షిని మనకి అందించింది.

ఉపనిషత్తులు మనకు ప్రసాదించిన దశ మహా విద్యలలో "దహరా" విద్య ఒకటి. (ఆత్మజ్ఞాన ప్రాప్తి మార్గాన్ని, ధ్యాన పద్ధతిని ఉపనిషత్ పరిభాషలో విద్య అంటారు). శ్రీ రమణ మహర్షి ఉపదేశం ఈ విద్య కోవకు చెందినది.

ఈ పద్ధతిలో "నేను ఎవరు?" అని మనలను మనం ప్రశ్నించుకుంటాము. శరీరం, మనస్తత్వమునకు అన్వయించుకునే "అబద్ధపు నేను" స్పృహ, తదనుగుణ జీవ భావం పుట్టే చోటు; "అసలు నేను" - ఎవరు? ఏమిటి? - అని అలా ప్రశ్నించుకోవడంలోనే; పదే పదే ప్రశ్నించుకోవడంతోనే - మనం "జీవ సంబంధమైన నేను" భావాన్ని అధిగమించి, "నేను" కు అసలు తాత్పర్యమైన తత్పరతను పొందుతాము.

ఈ "అసలు నేను", "అహం బ్రహ్మాస్మి" వాక్యానుసారం, ఆత్మ అని మనకందరకూ తెలిసిన విషయమే. సత-చిత్-ఆనందం; నిత్య-శుద్ధ-బుద్ధ-ముక్తం; అస్తి-భాతి-ప్రియం; అయిన ఆత్మలో లీనమై, జీవభావ విముక్తులమై, ఆత్మ స్వరూపంగా బ్రహ్మమై వెలుగొందుతాము. "నేను" కు సరియైన అన్వయాన్ని తెలుసుకొని, తపించి, పొంది అ "అసలు నేను" గా విరాజిల్లుతాము.

ఇంతటి జ్ఞానాన్ని మనకి అందించిన రమణులు కర్మయోగి కూడా. శ్రీ శంకర భగవత్పాదుల వలె తల్లిని ఆదరించినవారు. ఆశ్రమంలో కూరలు తరగడం చేసేవారు. జ్ఞానమార్గావలంబులు కర్మ పరిత్యాగం చెయ్యాలనే అజ్ఞానపూరిత భావాన్ని, డంబాన్ని, భ్రమను, భ్రాంతిని పటాపంచలు చేసే విధంగా తను జీవించి మనకు ఉదాహరణగా నిలిచారు. మనందరమూ సంసారములో ఉంటూనే, సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే, నిర్వహించుకుంటూనే ఆత్మజ్ఞానం  పొందే ప్రయత్నాలు చేస్తూ వాటిని ఫలింప చేసుకోవాలని ఆయన ఉపదేశం. ఉపనిషత్ స్రష్టల జీవితములూ ఈ  ఉపదేశ భూయిష్ఠములే కదా.

ఇంతటి జ్ఞానాన్ని మనకి అందించిన రమణులు కర్మయోగి కూడా. శ్రీ శంకర భగవత్పాదుల వలె తల్లిని ఆదరించినవారు. ఆశ్రమంలో కూరలు తరగడం చేసేవారు. జ్ఞానమార్గావలంబులు కర్మ పరిత్యాగం చెయ్యాలనే అజ్ఞానపూరిత భావాన్ని, డంబాన్ని, భ్రమను, భ్రాంతిని పటాపంచలు చేసే విధంగా తను జీవించి మనకు ఉదాహరణగా నిలిచారు. మనందరమూ సంసారములో ఉంటూనే, సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే, నిర్వహించుకుంటూనే ఆత్మజ్ఞానం  పొందే ప్రయత్నాలు చేస్తూ వాటిని ఫలింప చేసుకోవాలని ఆయన ఉపదేశం. ఉపనిషత్ స్రష్టల జీవితములూ

ఆత్మజ్ఞాన ప్రాప్తి విధం, పథం, సంసార జీవనం పడుగు పేకల్లాగ అల్లుకుని, పాలూ నీళ్ళలా కలిసిపోయి, తేనె - మధురిమల లాగ ఒకటై తీయగా సాగాలని రమణుల ఆదేశం. సందేశం. ఇవి "ఒకటిని విడచి ఒకటి లేవు" అని మనం గమనిచాలని ఆయన ఉపదేశం.
 

శ్రీ రమణులు మనందరి హృదయాలను రమణీయం చేసి బ్రహ్మజ్ఞానాధ్యనానురక్తులను చేయుదురుగాక!

శుభం భూయాత్!

1 comment:

  1. Namaskaram

    " Shodasi : Secrets of the Ramayana Lo Seshendra Sharma
    | Shivasshaktyaa yadi bhavathi shakttaha...... " irusugaane
    Ramayaanam hrudayam spandistudani selavichchaaru.
    Hanuma , Ravana - Ubhayulu Srividyopasakule , Bhinna maargaalaku chendinavaaru.
    Please read reviews : www.facebook.com/shodasi/

    ReplyDelete