Tuesday, July 31, 2018

మా ఉజ్జయిని యాత్ర

మా ఉజ్జయిని యాత్ర 1
20, 21, 22 July, 2018
ఇండోర్ నుంచి నరసింహారావు గారి కారులో ప్రొద్దున 10 గంటలకి బయలుదేరాము. ఇండోర్ నుంచి ఉజ్జయిని 55 కి.మీ. 12 గంటలకు ఉజ్జయిని చేరాం. నరసింహారావు గారు తిన్నగా మహాకాలేశ్వరుని ఆలయానికి తీసికెళ్ళారు. మేము మరునాటి భస్మ హారతి చూడడానికి టికెట్ కోసం అడిగితే మరునాటికి టిక్కెట్ కేటాయింపులు అయిపోయాయి అని, రేపు పెందరాళే ఏడు గంటలకు క్యూ లో నిలబడితే ఆ మరునాటికి టికెట్ దొరుకుతుంది అని చెప్పారు.
వెంటనే మహాకాలేశ్వరుని దర్శనానికి వెళ్లాం. జనం పెద్దగా లేరు. 40 నిమిషాలలో దర్శనం అయి పోయింది. మహాకాలేశ్వర దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగించింది. దేవుని దగ్గరకు వెళ్ళే ముందు రెండు బాల్కనీలు మీదుగా వెళ్తాము. ఆ రెండు బాల్కనీల నుంచి ఎదురుగా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది. ఆ డిజైన్ ఎంతో బాగా చేశారు.
తరువాత దగ్గర లోనే ఉన్న మహాకాళి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారు ఒకే విగ్రహంలో మూడు ముఖాలతో ఉన్నారు. పై భాగం అన్నపూర్ణా దేవి, మధ్యలో హరసిద్ధా, కింద మహాకాళి. ఆలయం పురాతనమైనది.
సాయంకాలం ప్రమిదలు వెలిగిస్తారని, ఎంతో బాగుంటుంది తప్పక చూడమని చెప్పి నరసింహారావు గారు ఇండోర్ వెళ్ళి పోయారు. ఆయన స్నేహభావన, ఉపకార మనస్తత్వం మరపురానివి. ఎన్నదగినవి.
ఆయన వెళ్లి పోయాక భోజనం చేసి మా పెద్దబ్బాయి బుక్ చేసిన హోటల్ లో సాయంకాలం దాకా విశ్రమించాము.
ఉజ్జయిని అనగానే మనకు మహాకాళి, జ్యోతిర్లింగ స్వరూపుడైన మహాకాలుడు, కాళిదాసు, భోజుడు, విక్రమాదిత్యుడు, భట్టి, భేతాళుడు, గుర్తుకు వస్తారు.
ఉజ్జయిని క్షిప్రా నదీ తీరంలో ఉంది. క్షిప్ర నిజానికి నర్మదా వలె నదము. ప్రవహించి చంబల్ నదిలో కలుస్తుంది. మహాకాలేశ్వరాలయం రుద్ర సాగర్ అనే పేరు కల సరస్సు ఒడ్డున ఉంది.
సాయంకాలం సరదాగా షికారుకి బయలుదేరాము.
గుడి దగ్గరే ఆర్. ఎస్. ఎస్. వాళ్ళు నిర్మించి, మెయింటైన్ చేస్తున్న భారతమాత ఆలయం చూసాము. ఆర్. ఎస్. ఎస్. వారి దేశభక్తి నిరుపమానమైనది. అక్కడ సరస్సుపై నుంచి వచ్చే చల్లని గాలి ఎంతో ఆహ్లాదపరచింది.
అప్పుడు చీకటి పడడంతో దీప ప్రజ్వలన చూడడానికి మహాకాళి ఆలయానికి వెళ్ళాం. రెండు దీప స్తంభాలకున్న ప్రమిదల్లో ఈ దీపాలన్నీ వెలిగిస్తారు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది.
ఆపై పక్కనే ఉన్న విక్రమాదిత్యుని స్మారక చిహ్నం చూసాము. చక్రవర్తి సింహాసనం పై కూర్చున్న భంగిమలో ఆయన విగ్రహం మలిచారు. కింద పక్కన ఆయన ఆస్థానం లోని నవరత్నముల బొమ్మలు చెక్కారు. ఒక చిన్న అమ్మవారి గుడి ఉంది ఆ విగ్రహం ఎదురుగా.
ఇవన్నీ చూసి భోజనం చేసి హోటల్ లో విశ్రమించాము.

మా ఉజ్జయిని యాత్ర 2
భస్మ హారతి దర్శనం
ఉజ్జయిని మహాక్షేత్రానికి వెళ్ళినప్పుడు అందరూ తప్పక వీక్షించేది మహాకాలేశ్వరునకిచ్చే భస్మ హారతి. ఇది తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు చేసే శివ పూజ. ఆరాధన. అభిషేకం. దీనికి ఆన్లైన్ లో 100 టిక్కెట్ల కేటాయింపు ఉంది. మిగతా 600 లు ముందు రోజు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ గా ఒక రోజు ముందుగా ఇస్తారు. మేము 22 తెల్లవారుజాము భస్మ హారతి దర్శనం కోసం 21 ప్రొద్దున 7 గంటలనుంచీ క్యూ లో నుంచున్నాము. పదిన్నరకు కౌంటర్ తెరుస్తారు. ఒక ఫార్మ్ ఇస్తారు. అందులో 5 పేర్లు నింపవచ్చు. ఐదుగురు క్యూ లో నుంచోనవసరం లేదు. కాని ఐదుగురి ఆధార్ కార్డులు కాని ఇతర ఫొటో ఐడెంటిటీ కార్డు కాని ఇవ్వాలి.
వాళ్ళు వెరిఫై చేసి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ నంబరు ప్రకారం పిలుస్తారు. ఇప్పుడు ఐదుగురూ ఉండాలి. ప్రతివాళ్ళ ఫోటో తీసికొని ప్రతివారికి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది. డబ్బులేం కట్టక్కరలేదు. భస్మ హారతి దర్శనం ఉచితం. ఈ పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. మేము అంతా అయ్యి హోటల్ కి వచ్చే సరికి 12 అయ్యింది. మేము, మా ఫ్రెండ్ కపుల్ భోజనం చేసి విశ్రమించాము.
సాయంకాలం మంగల్ నాథ్, కాలభైరవ దర్శనాలకు ఆటో మాట్లాడుకుని బయలుదేరాం. ఉజ్జయిని ఊరికి ఈ రెండు 8 కిమీ దూరంగా ఉన్నాయి. ముందు మంగల్ నాథ్ ఆలయానికి వెళ్ళాం. దారిలో కృష్ణ బలరాములు, కుచేలుడు చదువుకున్న సాందీపని ఆశ్రమం మీదుగా వెళ్ళాం. కాని లోపలికి వెళ్ళలేదు.
ముందుగా మంగల్ నాథ్ ఆలయానికి వెళ్ళాం. ఈ ఆలయం క్షిప్రా నదము ఒడ్డున ఉంది. క్షిప్రా నదము పెద్దది కాదు. మంగల్ నాథ్ ఆలయం శివాలయం. మంగలుడు - కుజునికి ఇక్కడ ఎఱ్ఱటి వస్త్రాలు దానం చేస్తారు. మేము చేయలేదు. నేనూ, నా మిత్రుడు ఇటువంటి వాటిపై ఆసక్తి లేని వాళ్ళం.
భగవంతుని దర్శించడమే మా ధ్యేయం. పూజలు పునస్కారములు చేయం. క్షేత్రాలకు జన సమ్మర్దం ఉన్నప్పుడు వెళ్ళం.
దర్శనం చేసి కొని అక్కడే ఉన్న క్షిప్రా నదము ఒడ్డున ఫొటోలు దిగి కాలభైరవ ఆలయానికి బయలు దేరాము. క్షిప్రా దాటి ఒక కిలో మీటర్ తరువాత క్షిప్రా అవతలి ఒడ్డున కాలభైరవ ఆలయం ఉంది. పురాతన ఆలయం. శక్తి పీఠానికి అనుగుణంగా ఉండటం వల్ల వామాచారమూ ఉంది. ఇక్కడ కాలభైరవునికి దారు దానం ఇస్తారు. దారు అంటే మద్యం. మందు సీసాలతో ఎందరో కాలభైరవ దర్శనం చేసుకుని దానం ఇచ్చి (భగవంతునికి సమర్పించి) ప్రసాదంగా తీసుకుంటారు.
మేమూ దారు రహితంగా దర్శనం చేసుకున్నాం. కాలభైరవుని విగ్రహం చిత్రంగా ఉంది. ముఖం మనిషి ముఖమే కాని వింతగా ఉంది. ఆ ప్రాంగణంలోనే ఉన్న దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని ఉజ్జయిని తిరిగి వచ్చాం. భోజనం ముగించి కాసేపు శయనించాం.
రాత్రి 11-30 కి వెళ్లి భస్మ హారతి క్యూ లో చేరాం. ముందు ముందుగా వెళితే ముందు లింగానికి దగ్గరగా కూచోవచ్చని. పదవ వరసలోనే ఉన్నాం. ముందు గేట్ దగ్గర రోడ్ మీద కూర్చున్నాం. తరువాత వచ్చిన వాళ్ళు నుంచో వలసి వచ్చింది. మా అబ్బాయి మా హోటల్ ఆలయం పక్కనే బుక్ చేశాడు. 2 నిమిషాల నడక.
తెల్లవారుజామున 1-15 వరకు అలానే ఉన్నాం. మా అదృష్టం కొద్దీ వర్షం కురియలేదు. లేకపోతే తడిసి ముద్ద అయిపోయే వాళ్ళం. 1-15 తర్వాత చెకింగ్ పూర్తి అయ్యి లోపలకు ప్రవేశించాం. నేను పట్టుబట్ట కట్టుకొని వెళ్ళాను. అక్కడున్న సెక్యూరిటీ గార్డుకి నా దాక్షిణాత్య కట్టు సరిపోలేదు. అతనే నాకు మళ్ళీ బిగుతుగా ఔత్తరాహిక పద్ధతిలో కట్టాడు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భస్మ హారతి మొదలయ్యే ముందు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాలునికి అభిషేకం మొదలవుతుంది. ఇతర జ్యోతిర్లింగ క్షేత్రముల వలె మనం ఎవరమైనా గర్భగుడిలో ప్రవేశించి శివునికి అభిషేకం చేసుకోవచ్చు. కాని సాంప్రదాయ దుస్తులు ధరించాలి.
మగవారు పంచె, కండువా (బనీను కూడా ఉండకూడదు), ఆడువారికి రవికా, చీర కట్టు.
ముందు అభిషేకం చెయ్యడం కోసమని భస్మ హారతి టికెట్ వాళ్ళందరూ సాంప్రదాయ బద్దంగా దుస్తులు ధరించి వస్తారు. అక్కడ సాంప్రదాయ దుస్తులు అద్దెకిస్తారు. అభిషేకం చెయ్యడం కోసం నీరు పట్టుకోవడం కోసం పాత్రా అద్దెకు ఇస్తారు.
1-15 కి లోనికి రానిచ్చి ఒక మండపంలో 3-45 వరకు కూర్చోబెట్టారు. అప్పుడు అభిషేకం లైన్ - భస్మ హారతి లైన్ ఏర్పడి కదిలింది. మిగతా చోట్ల లాగే విఐపిలు ముందు పంపబడ్డారు. మేము ముందుగా కూర్చోవడం వీలుపడదని అర్థం అయింది. లోపల హాలు, బాల్కనీలలో ప్రవేశించే ముందు అభిషేకానికి నీళ్లు పట్టుకునే సదుపాయం ఉంది. నీళ్ళు పట్టుకుని మా క్యూ నెమ్మదిగా గర్భగుడిలో ప్రవేశించే సరికి అభిషేకం చేసేసి బాల్కనీల్లో చాలా మంది కూర్చుని ఉన్నారు. మామూలుగానే విఐపిలు ముందు లింగానికి ఎదురుగా దగ్గరగా తిష్టవేసి ఉన్నారు.
గర్భగుడిలో ప్రవేశించి ఉదకం మహాకాలుని మీద అభిషేకించే లోపే లోపలి వారు చేయిపట్టుకుని లాగేస్తున్నారు. మన తిరుమలంత హడావుడి గానూ ఉంది' మహాకాలేశ్వరుని లింగాన్ని దర్శించి, అభిషేకించాము, నేను, నా అర్థభాగమూ. క్రితం రోజు నేను టికెట్ క్యూ లో నుంచున్నప్పుడు కామేశ్వరి దర్శనానికి వెళ్ళింది. అప్పుడు గర్భగుడిలో ప్రవేశించ నిచ్చారుట. అలా ముందుగానే తను గర్భగుడిలో శివుని దర్శించుకొంది.
అభిషేకం పూర్తిచేసికొని బాల్కనీలు చేరేసరికి అవి పూటుగా నిండిపోయి ఉన్నాయి. ఏదో కష్టపడి చివరగా ఓ చోట కూర్చున్నాము. నేను ముందే చెప్పినట్టు ఆ బాల్కనీలో ఎక్కడ కూర్చున్నా శివలింగం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగానే ఉన్నట్టు నిరూపిస్తుంది. 5-6 భస్మాభిషేకం, అనంతరం భస్మ హారతి జరిగాయి. ఒక సాంప్రదాయ సన్యాసి తెచ్చిన చితాభస్మంతో అభిషేకం జరిగింది. ఇదివరకు స్మశానం నుంచే చితాభస్మాన్ని తెచ్చే వారట. ఇప్పుడల్లా చేయడం లేదు. మామూలు విభూదినే వాడుతున్నారు.
చితాభస్మంతో అభిషేకం జరుగుతున్నప్పుడు ఆడువారిని ఆ అభిషేకం డైరెక్ట్ గా చూడొద్దని, కొంగు లోంచి చూడమని అన్నారు. ఇదంతా జరిగి, భస్మహారతిచ్చి, అలంకారం చేసి మళ్ళీ అలంకారించిన మహాదేవునికి మరల హారతులిచ్చి భస్మహారతి కార్యక్రమం ముగించారు. అలా రాత్రి 11-30 నుంచి తెల్లవారి 6 వరకు భస్మహారతి కార్యక్రమం వీక్షించాము. 5-6 భస్మాభిషేకం, భస్మహారతి వీక్షించడం ఒక దివ్యానుభవం. పరమేశ్వరునితో మమేకం అయ్యాము. శివసాయుజ్యం లభించింది. ఆసక్తి, భక్తి శ్రద్ధలు ఉన్నవారు తప్పక వీక్షించ వెలసిన కార్యక్రమం.
కాని మాలాగా రాత్రి 11-30 కే క్యూ లో చేరక్కరలేదు. తెల్లవారుజామున 1 గంటకు చేరచ్చు.
హోటల్ కి వచ్చి, పడుకొని పొద్దున్న 10 గంటల వరకు లేవలేకపోయాం. తరువాత నెమ్మదిగా రిఫ్రెష్ అయ్యి భోజనం ముగించాము. మా హోటల్ దగ్గరే ఒక అప్నా గ్రూప్ వారి రెస్టారెంట్ ఉంది. అక్కడ దాక్షిణాత్య, ఔత్తరాహిక భోజనాలు, టిఫిన్ లు లభిస్తాయి. బాగుంది కూడా. మేం ఉజ్జయిని లో ఉన్నన్నాళ్ళు ఆ రెస్టారెంట్ లోనే తిన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళడానికి సాయంకాలం 4 గంటలకు ఇండోర్ వెళ్ళి పోయారు.
మేం మహాకాలుని సాయం హారతి, పూజ చూసి, మహాకాళిని మళ్ళీ దర్శించుకున్నాము. సాయం హారతి ఎంతో సుందరంగా, భక్తి ప్రదంగా జరిగింది. ఒక గంట అక్కడ గడిపాము. అంతటి మహాకాలేశ్వరుని ఎదుట నా అజ్ఞానం కొద్దీ నా అర్థభాగముతో మాట తేడా తెచ్చుకున్నాను. అప్పటి నా ప్రవర్తన గర్హనీయం. పరమశివుని ఎదుటే అలా సహనం కోల్పోవడం నన్ను ఎంతో చింతా క్రాంతుణ్ణి చేసింది. ఇదరమూ తరువాత మహాకాలేశ్వరుని ఎదుటే సర్దుకున్నాము. టిఫిన్ చేసి,హోటల్ చేరి నిదురించాము.
మరునాడు ఉదయం 6-30 కు ఉజ్జయిని లో అనువ్రత్ ఎక్స్ప్రెస్ ఎక్కి మరునాడు ఉదయం 2-30 కు బెజవాడ చేరాము. భీమవరం ట్రెయిన్ పట్టుకొని 6 గంటలకు భీమవరం చేరాము.
మా ఓంకారేశ్వర్, ఇండోర్, ఉజ్జయిని యాత్ర, పర్యటనలు ఎంతో అందమైన అనుభూతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.
సమస్త సన్మంగలాని భవంతు!

No comments:

Post a Comment