Thursday, July 26, 2018

మా ఓంకారేశ్వర్ యాత్ర

మా ఓంకారేశ్వర్ యాత్ర 1
ఓంకారేశ్వరం నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక జ్యోతిర్లింగం. చూడడానికి బయల్దేరాం భార్యాభర్తలమిద్దరమూను.
నాకు మనందరికి మల్లేనే క్షేత్ర దర్శనం, నదులు నదములంటేనూ చాలా ఇష్టం.మా ఓంకారేశ్వర్ యాత్ర 2
16-7-2018
మేము 15 వ తారీఖు ప్రొద్దున 6 గంటలకు విజయవాడలో తిరువనంతపురం-ఇండోర్ రైలు ఎక్కాము. 16 వ తేదీ ఉదయం 6 గంటలకు ఇండోర్ చేరాము. 
అక్కడ నుంచి ఓంకారేశ్వర్ 70 కి.మీ. దూరం. టాక్సీ మీద 2 గంటల ప్రయాణం చేసి ఓంకారేశ్వర్ చేరాము. ఊరు పెద్ద పల్లెటూరు.
మా పెద్దబ్బాయి ముందే బుక్ చేసిన హోటల్ రాధేకృష్ణ లో చెక్ ఇన్ అయ్యాము. సంసార పక్షంగా బాగానే ఉంది. అక్కడకి అవతల ఒడ్డున ఓంకారేశ్వరరుని ఆలయం ఉంది. ముందుగా మేము
నర్మదా నదములో స్నానం చెయ్యాలి అని అనుకున్నాం.
మా హోటల్ కి దగ్గరగానే నర్మదా నదము ఉంది. పదినిమిషాల నడక. వెడల్పు ఎక్కువగా లేదు. రెండు మూడు చిన్ని కొండల మధ్య కింద ప్రవహిస్తూ ఉంటుంది. ఓంకారేశ్వర్ కి అరకిలోమీటరు దూరంలో నదమునకు ఎగువన ఒక డామ్ కట్టారు. అక్కడ నుంచి నీటిని పైపుల ద్వారా ఉజ్జయిని క్షిప్రా నదిలోకి పంపుతారు.
మధ్యప్రదేశ్, గుజరాత్ లకు నర్మదా నదము నీటి వసతి కలిగిస్తుంది. వారి పాలిటి భాగీరథి.
ఓంకారేశ్వర్, నర్మదా అనగానే మరొక విషయం గుర్తుకు వచ్చింది. ప్రఖ్యాత నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు "నర్మదా పరిక్రమ" అనే ఒక పుస్తకం రాశారు. నేను ఆ పుస్తకం చదివాను. ఆ పరిక్రమ చేసిన విధానం, ఎలా చేశారు ఆయన ఎంతో బాగా వర్ణించారు. నర్మదానదము ఒడ్డున ఒక ఊరిలో బయలుదేరి, నర్మదా పరిక్రమ చేసి మళ్ళీ బయలుదేరిన ఊరికి చేరడం. ఆయన నర్మదా నదము దక్షిణ ఒడ్డున ఒక ఊరినుంచి బయలుదేరి, అరేబియా సముద్రంలో నర్మద కలిసే చోట్లో ఉత్తర ఒడ్డుకు వచ్చి, ఆ ఒడ్డున నదము ఎగువకు పయనించి, జబల్పూర్ పైన నర్మదా నదము జన్మస్థానం చేరి, మళ్ళీ అక్కడ నర్మద దాటి దక్షిణ ఒడ్డమ్మట వారు బయలు దేరిన ఊరు చేరడం. ఈ పుస్తకం ఆసక్తి ఉన్నవారు చదవొచ్చు.మా ఓంకారేశ్వర్ యాత్ర 3
16-7-2018
హోటల్ కి ఉదయం 8-30 కి చేరాము. చెక్ ఇన్ అయ్యి, స్థిమితపడి నర్మదా నద జలాల లో స్నానానికి బయలు దేరాము. పదినిమిషాల నడక. నర్మదా నదముపై ఉన్న కాలి వంతెన అవతలి ఒడ్డుకు (ఉత్తరం ఒడ్డు) చేరుస్తుంది. అటువైపే ఓంకారేశ్వరుని ఆలయం ఉంది. మేము ఖాళీగా ఉన్న ప్రదేశం చూసుకొని స్నానానికి 100 మెట్లు దిగాము. అది పడవల రేవు. అక్కడ నర్మదా నదము ఎంతో లోతుగా ఉంది. నీరు బాగానే ఉంది. నల్లగా అంటే నీలముగా ఉన్నాయి నీళ్లు. నేను వేగేశ్వరపురంలో గోదావరి లో చిన్నప్పుడు నేర్చుకున్న ఈత ఈదాలనుకున్నాను కానీ మా ఆవిడ వద్దంది.
పడవల వాళ్ళు మాకు ఒక బకెట్ ఇచ్చి మేము స్నానం చెయ్యడానికి సహకరించారు. ఇద్దరం ఆ బకెట్ సాయంతో ‌గట్టు మీదే స్నానం చేశాం. ఆవిడ నదీ పూజ, నేను సంధ్యావందనం అక్కడే కానిచ్చి హోటల్ కి తిరిగి చేరుకున్నాం.
మా ఓంకారేశ్వర్ యాత్ర 4
16-7-2018
స్నానం ముగించుకొని హోటల్ చేరిన మేము తయారై ఓంకారేశ్వరుని దర్శనానికి బయలుదేరాం. ఓంకారేశ్వర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నర్మదా నదము యొక్క ఉత్తర తీరంలో ఉంది. దానికి ఎదురుగా దక్షిణ తీరాన మమలేశ్వరుని ఆలయం ఉంది. ఈ రెండింటినీ కూడా జ్యోతిర్లింగాలే అంటారు పెద్దలు.
మేమున్న హోటల్ కి దగ్గరగానే అవతల ఒడ్డున ఓంకారేశ్వరుని ఆలయం ఉంది. పదినిమిషాల నడక. నడక వంతెన దాటి వెళ్ళాలి. గమ్మునే వెళ్ళి పోయాము. పెద్ద రష్ లేదు. పదిహేను నిమిషాలలో దర్శనం అయిపోయింది. లింగం చిన్నది.
గుజరాత్లో సోమనాథ్, నాగేశ్వర్ లలో ఉన్నట్లు అమ్మవారు అయ్యగారికి వెనుక కొలువై ఉన్నారు. అయ్యవారు ఓంకారేశ్వరుడు. అమ్మగారు పార్వతీదేవి. అమ్మవారి విగ్రహం ఆకట్టుకొనేలా ఉంది. ఎందరో ఇక్కడ నర్మదా జలాలతో ఓంకారేశ్వరుని అభిషేకిస్తున్నారు.
ఈ రోజు సోమవారం. కిందికి (100 మెట్లపైన) నర్మదా తోయముల తెచ్చి ఈశ్వరుని అభిషేకించాలి అనిపించింది. ఇంతలో అక్కడ ఒక బ్రాహ్మణుని చేతిలో నర్మదా జలాలు ఉన్నాయి. నాకు పెద్ద పెద్ద క్షేత్రాలలో, మామూలుగా కూడా పూజలు, అభిషేకములు చేయించడంపై అంతా ఆసక్తి లేదు. కాని ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో పరమేశ్వరుని అభిషేకించాలి అనిపించింది.
ఆయన మమ్మల్ని మళ్ళీ ఓంకారేశ్వరుని దర్శనానికి తీసికెళ్ళారు. తనివితీరా ఆయన అందించిన నర్మదా తోయములతో ముక్కంటిని అభిషేకించాను. లింగానికి ముందు ఎత్తుగా, అక్కడ నీళ్ళు పోస్తే ఓంకారేశ్వరునిపై జలము పైపు ద్వారా పడి అభిషేకించేలా ఏర్పాటు చేశారు.
ఆ ఏర్పాటు ద్వారా నీటిని పోస్తే ఈశానునికి అభిషేకం జరుగుతుంది. అలా బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ, మేమూ గొంతు కలిపి మూడునిమిషాలు అభిషేకం చేయగలిగాం. ఎంతో సంతోషం కలిగింది. ఇలా అందరూ చేయవచ్చు.
మనసు కోతికదా, వారు పెట్టిన ఎత్తు పై నుంచి ఎవరో నీరు పోస్తే, నేనూ అలా చేశాను, శివునిపై నీరు మనమే తిన్నగా అభిషేకింనట్టుందని. కాని అలా పోస్తే నీరు లింగంపై పడదు. ఆ పని చేసినందుకు అక్కడి పూజారులచే అక్షింతలు వేయించుకొని, మరొక మారు ఆదిదంపతులను తనివితీరా దర్శించి, ఆలయం బయటకు వచ్చి, నందిని కూడా అభిషేకించి, కింద ఒక హాలులో ప్రవేశించాము బ్రాహ్మణునితో సహా.
ఆయన అక్కడ కూర్చోబెట్టి, అక్కడ ముక్కాలి పీట ఆకారంలో పాములు కాళ్ళలా ఉండి శివలింగాన్ని వహించి ఉన్న ఇత్థడి అమరికపై 
శివునికి మరల తదనుగుణ మంత్రములు చదువుతూ మరల అభిషేకం చేయించి, అమ్మవారికి అయ్యవారికి దీపదర్శనం చేయించి, పూజ చేయించి కార్యక్రమం ముగించారు. మా ఇద్దరికీ ఎంతో సంతృప్తి కలిగింది. ఆ బ్రాహ్మణుణ్ణి సంతుష్టి పరచి కాసేపు అక్కడి దృశ్యాలు వీక్షించి, ఆనందాంతరంగులమై హోటల్ కి చేరి పుల్కాలతో భోజనం అయిందనిపించి, విశ్రమించాము.
మా ఓంకారేశ్వర్ యాత్ర 5
16-7-2018
ఉదయం ఓంకారేశ్వరుని, పార్వతీ దేవిని తనివితీరా దర్శించి, అర్చించి సాయంకాలం వరకు విశ్రాంతి తీసుకున్నాము. అప్పుడు బయలుదేరి మమలేశ్వరుని దర్శించడానికి బయలుదేరాము. మమలేశ్వరుని ఆలయం నర్మద దక్షిణ ఒడ్డున ఉంది.
ఓంకారేశ్వరాలయం, మమలేశ్వరాలయం నర్మదకు ఉత్తర, దక్షిణ తీరాలలో ఉన్నాయి. మా హోటల్ నుంచి పదినిమిషాల నడక. మెట్లు దిగి ఎక్కాలి.
మమలేశ్వరాలయం ఆరు ఆలయాల సముదాయం. అన్నీ శివాలయాలే. మమలేశ్వరాలయం పెద్దది. మిగిలినవన్నీ బాగా చిన్నవి. ఒక్క మమలేశ్వరాలయంలోనే అభిషేక, పూజా పునస్కారాలు జరుగుతున్నాయి. ఇదంతా పురాతన ఆలయాల సముదాయం.
మమలేశ్వరాలయంలో శివుని, ఆయన వెనుక ప్రతిష్ఠిత అయిన పార్వతీ దేవిని దర్శించుకున్నాము. ఈ ఆలయాన్ని ఎక్కువ మంది ఒక మామూలు దేవాలయంగా చూస్తారు, దర్శనం చేసుకునే విషయంలో, అభిషేకాదులు చేసే విషయంలో.
ఒక విధంగా ఈ ఆలయ సముదాయం పాడుపడినట్లు ఉన్నాయి. ఆలయ నిర్మాణం బాగుంది. వందల సంవత్సరాల క్రితం ఆలయాలు.
ఎందుకు ఇవి ఇలా పాడుపడినవో తెలియదు. మా హోటల్ దగ్గర ఉన్న ఒక విష్ణు మందిరాన్ని చూసాము. దానినీ ఎవరూ దర్శించడం లేదు.
తరువాత మళ్ళీ ఉత్తరం వైపుకు వెళ్లి కిందికి దిగి నర్మదానద తోయములతో సంప్రోక్షణ చేసికొని, మరల పార్వతీ దేవి, ఓంకారేశ్వరుల దర్శనం చేసి కున్నాము.

మా ఓంకారేశ్వర్ యాత్ర 6
17-7-2018
ఈ రోజు మాతో నా చిన్ననాటి స్నేహితుడు సూరిబాబు దంపతులు ఓంకారేశ్వర్ లో కలిశారు. మేం ముందు అనుకున్న ప్రకారం వాళ్ళూ మేమున్న
హోటల్ లోనే రూం తీసికున్నారు.
శంకరాచార్యుల గుహ
కలిసి మళ్ళీ ఓంకారేశ్వర దర్శనం చేసి కున్నాము. 50 మెట్లు క్రిందే ఉన్న శంకరాచార్యుల గుహను చూశాము. ఈ గుహలోనే శంకరులు తమ గురువులు గోవింద భగవత్పాదుల వద్ద సన్యాసం స్వీకరించారు.
ఆ గుహ పాతకాలం నాటిది అని తెలుస్తూ ఉంటుంది. అక్కడ శంకరాచార్యుల విగ్రహం, దానిపైన వారి గురువుల విగ్రహం ఉన్నాయి. లోపల ప్రశాంతంగా ఉంది. బాగా మెయిన్టైన్ చేస్తున్నారు. లోపల కూర్చునే సావకాశం లేదు.
భారతదేశ తత్త్వ శాస్త్రానికి అద్వైత వేదాంతపు సొబగులు అద్దిన ఆదిశంకరుల స్మరణ అక్కడ నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. అద్వైతము బౌద్ధమునకు దగ్గరగా ఉన్నదని శంకరాచార్యులను ఆస్తిక ఆచార్యులు "ప్రచ్ఛన్న బౌద్ధులు" అన్నారు.
భారతీయ తత్త్వశాస్త్రము ఉపనిషత్తులతో మొదలై
బౌద్ధ, జైన, చార్వాకములను కలుపుకొని షడ్ దర్శనముల కలయికతో ఎంతో ఎదిగింది.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఉపనిషత్తులు, బౌద్ధ, జైన తత్త్వాలు, షడ్ దర్శనములు ఒకదానిని ఖండించుకుంటూ, మిగతా వాటిలోని ముఖ్య, ప్రాధాన్య, ప్రత్యేక విషయాలను తమలో కలుపుకుంటూ (complementing and supplementing) భారతీయ తత్త్వశాస్త్రాన్ని సుసంపన్నం చేశాయి. వీటిలో దేన్నీ తీసిపారేయకూడదు. అలా తీసి పారేసి ఒక సిద్ధాంతాన్నే పట్టుకు వేలాడుతూ మిగతా సిద్ధాంతాలను తీసిపారేయడం జ్ఞానుల లక్షణం కాదు. ఉత్తి అమాయకుల, పసివారల, అజ్ఞానుల లక్షణం. అంతనూ, అన్నింటినీ కలుపుకొని పోవడం తెలియని పరిమిత జ్ఞానంతో గ్రహింపు లేక చేసే దుర్వ్వాఖ్యలు మాత్రమే. తెలిసీ తెలియని మాటలే.
భారతీయ తత్త్వశాస్త్రము ఆస్తికమే కాదు, పూర్తి అయిన జ్ఞానము, విజ్ఞానము, మానసిక కార్యకలాపాలపై గొప్ప అవగాహన కలిగి, అవగాహన
ఇచ్చే జ్ఞాన బోధ మీమాంస.
నిర్పక్షపాత ధోరణితో భారతీయ తత్త్వశాస్త్రమును అభ్యసిస్తే ఈ జ్ఞానమును పొందవచ్చు. ఒక విజ్ఞాన శాస్త్రం గానూ మలచవచ్చు. మనుషులు భాషనేర్చే విధము, జ్ఞానము కలిగే విధము, మనసు, ఇతర అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియములు మానసిక కార్యకలాపాలు చేసే విధానం, విధం క్షుణ్ణంగా చెప్పే జ్ఞాన సర్వస్వము.
ఇదంతా భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఒక శుద్ధజ్ఞాన భాండాగారంగా చేసింది. తత్త్వజ్ఞులకు విందు భోజనం. మూర్ఖ శిఖామణులకు దెబ్బలాటకు పనికి వచ్చే అంశం. ఘనము, సర్వజ్ఞము అయిన భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఆకళింపు చేసుకుని అవగాహన ఏర్పరచుకోవడానికి చిన్ని బుఱ్ఱలకు సాధ్యం కాదు. వాళ్ళు వాళ్ళ పరిమిత జ్ఞానంతో పేచీ పెడతారు అంతే.
ఇంతటి జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానములను అందించే అద్వైత సిద్ధాంతాన్ని గౌడపాదుల ప్రశిష్యులైన శంకరులు మనకు అందించారు. ఆ కృతజ్ఞతతో శంకరులను ధన్యవాదాలు అర్పిస్తూ పదే పదే
అభిమాన, గౌరవపురస్సరంగా తలుచుకున్నాను.
నర్మద పాయలకింద విడుట
ఓంకారేశ్వరానికి అరకిలోమీటరు ముందు నర్మదపై ఒక డామ్ కట్టారు. ఈ డామ్ తర్వాత నర్మద ఒక పర్వతం ముందు రెండు పాయలుగా విడుతుంది. మళ్ళీ పర్వతం చివర రెండు పాయలు ఒకటిగా కలిసి పోతాయి. దానిని త్రివేణీ సంగమం అంటారు. కావేరి-నర్మదల సంగమం అని అంటారు. కావేరి పదం ఎందుకు వచ్చిందో తెలియదు.
డామ్ చూడడానికి వెళ్లాం. డామ్ హై సెక్యూరిటీ లో ఉంది. మమ్మల్ని చూడడానికి అనుమతించలేదు. అక్కడ నుంచి నర్మద రెండు పాయలుగా విడడం కనిపిస్తుంది. నర్మదలో నీళ్లు సరిపడా లేకపోవడం వల్ల సంగమ స్థానానికి వెళ్ళలేకపోయాము. వర్షాకాలంలో నీళ్ళు సరిపడా ఉన్నప్పుడు నౌకా విహారం చేయవచ్చు. ఎన్నో పడవలు, మర బోట్లు సిద్ధంగా ఉన్నాయి.
ఓంకారేశ్వర్ నర్మదపాయల మధ్య ఉన్న కొండపై నర్మద ఒడ్డుననే తక్కువ ఎత్తులో ఉంటుంది. నదములో స్నానం చేయాలంటే 100 మెట్లు దిగాలి.
ఓంకారేశ్వర క్షేత్ర దర్శనం మాకు ఎంతో వికాసాన్ని, హాయిని, ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చింది. ఓంకారేశ్వర్ ఉన్న ప్రదేశం ప్రకృతి ఒడిలో ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ కనువిందు చేస్తూ పరవశింప చేసింది.

No comments:

Post a Comment