Sunday, July 29, 2018

గుర్తించడం; రోజుకొక విధంగా; ఆచరణ;భావ తరంగములు; రామకృష్ణులు;మేధావి మనసు; ఎప్పుడు వంటబడుతుందో?

గుర్తించడం
చాలా ఏళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా "లేదు". ఉన్నది అని "తెలియదు". వాళ్ళ దృష్టిలో ఉన్నదల్లా ఒకే చైనా, అది ఫార్మోజా చైనా. దీనినే తైవాన్ అనీ అంటారు. 1972 వరకు ఇలా సాగింది.
మన దృష్టిలో ఏదైనా ఉండాలి అంటే అది "మనకు" ఉండి ఉండాలి. దానిని మనం గుర్తించాలి. ఇలా కాకపోతే మన వరకూ అది లేనట్టే. సువిశాల చైనా దేశం అమెరికాకు లేకపోవడం, అసలు చైనా లేకపోవడం వల్ల కాదు. చైనా ఉనికితో నిమిత్తం లేకుండా, ఆ ఉనికిని గుర్తించకపోవడం వల్ల మాత్రమే అమెరికాకు చైనా లేదు.

ఏదైనా ఒక విషయం, వస్తువు, తత్త్వం, మనిషి, దైవము ఉందా, లేదా అనే ప్రసక్తి లేకుండా, ఆ ఉనికిని మనం గుర్తించామా లేదా అనే విషయం మీద మాత్రమే ఆ వస్తువుతో మనకు మానసికంగా సంబంధం ఏర్పడుతుంది. అలాగే అన్ని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి.
ఉనికి ప్రసక్తి లేకుండా, మన మానసిక సంబంధ బాంధవ్యాలతో మాత్రమే మన అనుబంధాలు, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభాలు, వ్యయాలు ముడిపడి ఉంటాయి.
మన ఊహాపోహల వల్లే వేటి ఉనికితో నిమిత్తం లేకుండా మనం సుఖదుఃఖాలను అనుభవిస్తాం. మనసు చూపించేదే మనకు ఉంటుంది. మనసులో లేకపోతే మన వరకు అది లేనట్టే. మన సంబంధ బాంధవ్యాలతో మనం ఏర్పరచుకున్న గందరగోళమే
ఎక్కువ.
వ్యక్తి మరణం మనకి దుఃఖం కలిగించదు. వ్యక్తితో మనకు కల మానసిక అనుబంధం, గుర్తింపు మాత్రమే మనకు సుఖదుఃఖాలు కలిగిస్తాయి. రోజూ ప్రపంచంలో లక్షల కొద్దీ జనాలు మరణిస్తున్నారు. మనకే దుఃఖం కలగదు. కాని మన అహంకార మమకారాలని బట్టి దుఃఖం కలుగుతుంది. మరణం ఎవరికి కలిగింది అనేది ముఖ్యం. మరణం కాదు.
మన రోజూవారీ జీవితాల్లో మనసు భూతద్దంలోంచి చూడడం వల్లే మన వ్యథలకు, వేదనలకు, బాధలకు, హాయిలకు, ఇతర భావములకు, అనుభవములకు కారణం. మనవారిని నిందించడం, వారిచే నిందింపబడడం, దెబ్బలాడుకోవడం, అనవసరమైన మాటలనుకోవడం. ఊహలు, అపోహలు ఊసులను, కేసులను, సంఘటనలను అపార్థం చేసుకోవడానికి
కారణం. అరుదుగా అర్థం చేసుకుంటాం.
అలాగే మన కష్టాల్లో, దుఃఖాల్లో 90 శాతం మన మానసిక అనుబంధం వల్ల కలుగుతాయి తప్ప, ఆ వస్తువు, సంఘటన ఉనికి, జరగడం, జరగకపోవడం వల్ల కాదు.
ఎక్కువ శాతం మానసికమే అయిన, మన సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభవ్యయాలు, మరణాలు, పుట్టుకలు మనసుని నియమించు కోవడం వల్ల, మనకు కలగకుండా చేసుకోవచ్చు.
మనసుకి ఏదీ అంటకుండా జీవించగలగడం యోగం. వరం. కొందరు సహజంగానే ఇలా నిరామయంగా బ్రతకగలరు. ఎంతో "ఆధ్యాత్మికత" కలిగినా కొందరు పరమాన్నంలో చెంచా లాగ ఏ రుచీ తెలియకుండా, ఏ విషయము అర్థం చేసుకోకుండా గడిపేస్తారు. ముముక్షుత్వంతో కొందరు ఈ స్థితిని సాధిస్తారు.
మన గుర్తింపుకి నోచుకోని సంఘటనలు, వస్తువులు, మనుషులు, వాటికి జరిగేవి మనలను ప్రభావితం చేయలేవు.
మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః.
సుఖశాంతులు మనసుకి సంబంధించినవి. మనసు నియంత్రణలో ఉంటే కలుగుతాయి. లేకపోతే బయటి సంఘటనతో మన అనుబంధాన్ని బట్టి సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభవ్యయాలు
"కలుగుతాయి".
********
Happiness is fleeting. Grief is sticking to the mind and heart. Grief gives focus. But we also say grief is not welcome, but the spirituality that gives same or similar focus for mind is welcome.
*******
Can present governments pass a law for right for livelihood for Indians? Right for education is useless because even if you get a certificate you may not get a livelihood.
*********
రోజుకొక విధంగా

రోజుకొక విధంగా అలంకరించి భగవంతుని మురిసిపోవుదురు భక్తులు
రోజుకొక విధంగా అలంకరించి తన పాపాయిని మురిసిపోవును తల్లి
రోజుకొక విధంగా మోసగించి ఓటర్లను, మురిసిపోవుదురు రాజకీయ నాయకులు
రోజుకొక విధంగా అరకొరగా బట్టకట్టి వెలిగి పోవుదురు నవయువతులు వీధులందు
రోజుకొక విధంగా మాటలాడి భార్య అనుమానముల
నుంచి బయటపడ యత్నించును మగడు
రోజుకొక విధంగా అల్లరిచేసి నేరుస్తున్న విద్యలు చూపి మురిపించును పసికూన తనవారిని
రోజుకొక విధంగా నెలరాజు వలె కళలు చూపి
సంకులిత మనస్కుని చేయును నెలత మగనిని
*********
ఆచరణ


పుస్తకములలో చెప్పినది ఆచరిస్తేనే ఆ పుస్తకాలకు మనం వారసులం
నలుగురికీ ఇచ్చే ఉపదేశాలు, ప్రవచనములలోని సారం మన ప్రవర్తనలో ప్రతిఫలిస్తేనే సంఘోపయోగం
సాంప్రదాయం, సంస్కృతి, సంస్కారం జీవితాలతో 
మమేకం చేసికొని వర్ధిల్లకపోతే అవి శుష్క వచనములు
ఘనతంతా మన ఆచరణలో ఉంది
మాటల్లో, రాతల్లో, ఉపన్యాసాల్లో కాదు
మనసు ప్రఫుల్లమై ఆహ్లాదం చెందితే
అది కావ్యం; ఆచరింప జేస్తే శ్రేయస్కరం
**********
ఒక మనిషిలో ముగ్గురు మనుష్యులు ఉంటారు. తను ఫలానా అని ఇతరులు అనుకునేది. తను ఫలానా అని తను అనుకునేది. తను ఫలానా అని ఆత్మీయులు అనుకునేది. కూతురు విషయం కూతురు కన్నా తల్లికే బాగా తెలుస్తుంది
*******
ఒక చక్కని పుస్తకం చదువుతున్నప్పుడు, చక్కని దృశ్యం, రూపం చూస్తున్నప్పుడు, ప్రియ, శ్రావ్య ధ్వనులు వింటున్నప్పుడు, సువాసనలు పీలుస్తున్నప్పుడు, హాయినిచ్చే స్పర్శను అనుభవిస్తున్నప్పుడు, మంచి రుచులు ఆస్వాదిస్తున్నప్పుడు, మన మానస సరోవరంలో భావ తరంగములు లేస్తాయి. వీస్తాయి. ఆ తరంగములను ఒడిసి పట్టుకుంటే అవి చిరస్మరణీయమైన కవితగానో, కథ గానో, వ్యాసము గానో, వ్యాఖ్యానము గానో రూపుదిద్దుకుంటాయి.
మన రచనలన్నీ భావ మయములే కదా!
అవగాహన నుంచి, స్ఫూర్తి నుంచి, ఆకళింపు నుంచి, అనుభవము నుంచి భావ పరంపర మొదలౌతుంది.
భావము అవగాహనాదులకు వాక్య రూపము. భాషా స్వరూపము. కర్త, కర్మ, క్రియలతో అలరారి, సారస్వతాన్ని సృష్టిస్తుంది.
భావమే సకలమునకు ఆకారము. ఆలోచన, భావము రూపంలో వేరయినా, స్వరూపంలో ఒకటి. ఆలోచన బుద్ధిది. భావము మనసుది.
అవగాహన, అనుభవము, ఆకళింపు, స్ఫూర్తి అర్థమై కలిగిన తత్పర, తాత్పర్య స్థితులు.
*******
రామకృష్ణులలో ఎందుకో మనకి కృష్ణుడంటే దగ్గరితనం. కృష్ణుడు చెలికాడిలా అనిపిస్తాడు.
రాముడు ఒక ఉపాధ్యాయునిలా అనిపిస్తాడు.
రామో విగ్రహవాన్ ధర్మః
కృష్ణః వసతి మమ హృదయే
అనిపిస్తుంది.
రామము అంటే ఆనందము.
కృష్ణుడూ ఆనంద నిలయుడే.
యోగ వాశిష్ఠంలో రాముడు శిష్యుడు.
కృష్ణుడు భగవద్గీతాచార్యుడు.
కృష్ణుని నుంచే "చాణక్య నీతి" మొదలైంది.
రాముడంతా straightforward.
కృష్ణునితో మమేకం అవడం తేలిక.
రామకృష్ణులు విష్ణ్వవతారములే అయినా వారి వారి అవతార జీవితముల తేడా ప్రస్ఫుటం.
పరశురాముడు వీరిద్దరికీ భిన్నం. నరసింహుడు వామనుడు కూడా వేరే.
విష్ణుమూర్తి ఏడు, ఎనిమిదవ అవతారములైన రామకృష్ణుల ప్రాచుర్యం మిగిలిన అవతారములకు లేదు.
భాగవత కర్త, రామాయణ కర్త వేరు వేరవడం రామకృష్ణుల "వ్యక్తిత్వ" భేదాలకు కారణమేమో!
మన మనస్తత్వం బట్టి మనం ఇష్టదైవం నిర్ణయించ బడుతుంది ఏమో!?
*********
మా తాతల నాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి-అని ఒక రకం
పాతంతా చెత్త హృదయాలకు రంపపు కోత-ఆని ఇంకో రకం
మన సమాజాన్ని టగ్ ఆఫ్ వార్ ఆడేస్తున్నారు
అయోమయంలో వాళ్ళు నిరామయంలో మనం
సంకుచిత భావములు లేక అందరి బాగు కోరే విజ్ఞులు నేడు అంటరాని వారు
వాద ప్రతి వాదములలోకి చేరని వీరిని ఏ పక్షమూ
మననీయదు;నలుగురికీ మంచి చెప్పనీయదు
ఈ జుగుప్సాకరమైన, అశాంతి కలిగించే వాస్తవం
మారే సావకాశమే కానరాదు
మార్చే శక్తి యుక్తులు లేవు
దైవాధీనం అని వదిలేసే ప్రకృతీ కాదు
బుద్ధిని ఉపయోగించనీయని సంఘం
మేధావి మనసు రణరంగం
********
Love, war and politics function on similar principles.
******
భగవంతుని ఉనికిని తలుచుకోవడం అంటే మన అల్పత్వాన్ని గుర్తించడం అంతే. ఇంకేమీ కాదు.
********
Who allowed Swamis to represent Sanatana Dharma and "Hinduism". Grihasthas must do it. All asramas dissolve into and sustained by Grihasthaasrama!
*********
ఎవరి వ్రాతలు ఎవరి రాతలు మార్చునో ఎవరికెఱుక?
*******
ఎప్పుడు వంటబడుతుందో?
ఇదివరకు మన ఇళ్ళల్లో తల్లుల దృష్టి పూర్తిగా పిల్లల మీద కుటుంబం మీద ఉండేది. కాలక్షేపమూ అయ్యేది. ఇప్పుడు ఒకటి, లేక రెండూ సంతానంతో ఆపేసి వాళ్ళని పెంచి పెద్ద చేసేసి ఖాళీ వచ్చినపుడు ఫేస్బుక్ లాంటివి వచ్చి అందరికీ కాలక్షేపం కలిగిస్తున్నాయి.
పక్కనే, ఇంట్లో మనుషులు ఉండటం లేదు. ఒక డెస్క్ టాప్, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. ప్రపంచమే ఎదురుగా ఉంటోంది. బుర్రలో భావాలు, ఆలోచనలు, ఉపదేశాలు, తర్కాలు, చదువులు, భేదాలు, విభేదాలు, వాదాలు విరివిగా ఉన్నాయి.

వాటిని ఫేస్బుక్ మీదికి వదిలేయడమే తరువాయి, రోజుల కొద్దీ బిజీగా ఉండచ్చు. మన సలహాలు, సంప్రదింపులు ఉచితంగా అందించవచ్చు. ప్రపంచంలో చెడుని దునుమాడవచ్చు. మన సంఘీభావం ప్రకటించ వచ్చు.
ఇలా ఇంటి విషయం కావలసినంత సేపు మర్చిపోవచ్చు, స్త్రీ, పురుషులు. కాని మనకు నిజంగా మనసు బాగోనప్పుడు ఈ కార్యక్రమాలేవీ మనకు శాంతి ఈయలేవు. అప్పుడు మనం ఏం చేస్తాం?
అమ్మ ఉంటే చెప్పుకుంటాం. లేకపోతే స్నేహితులు,- రాళ్ళు. మనవాళ్ళకి మనం ఏమీకాక, ఏ స్వామినో, సాధువునో, బాబానో నమ్మి వ్యవహరించడం. మన తల్లితండ్రులు లాగ మానసిక బలం ఉండటం లేదు మనకు. పిల్లలకేమి బోధించగలం. ఇటువంటి చదువులు చదవటం లేదు మనం.
సాంఘిక సమస్యలు, గొడవలు, నిమ్నోన్నతాలు గురించి ఎంత మాట్లాడినా, ఆ పరిజ్ఞానం మనకు సుఖశాంతులు కలిగించు కోవడానికి ఉపయోగించదు. అటువంటప్పుడు ఏం చేయాలో పాలు పోదు. బయటి విషయాలపై మనం అలవోకగా ప్రదర్శించిన ఆసక్తి, సమస్యల పట్ల మన అభిప్రాయాలు, వాటికి మనం సూచించిన, ప్రకటించిన పరిష్కారాలు ఇప్పుడు మనకు ఉపయోగించవు.
కుటుంబాన్ని వదిలేసి సంఘ సంస్కరణకు నడుం కట్టడం పునాది వేయకుండా భవంతి కట్టడం. కుటుంబాలు ఇటుకలు. సంఘం భవంతి. ఇటుకలు బలిష్టంగా లేకపోతే సంఘం బలిష్టంగా ఉండదు.
ఈ ఇంగితం మనకెప్పుడు వంటబడుతుందో?

No comments:

Post a Comment