Thursday, July 26, 2018

మా ఇండోర్ పర్యటన

మా ఇండోర్ పర్యటన 1
18-7-2018
ఓంకారేశ్వర్ లో రెండు రోజులు ప్రశాంతంగా గడిపి మా తరువాతి మజిలీ ఇండోర్ కి బయలుదేరాము. ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ 70 కిమీ. కారులో 2 గంటల ప్రయాణం.
అందుకనే ఓంకారేశ్వర్ లో బస చేయకుండా చూసి, వెళ్లి పోదామనుకుంటే ఇండోర్ లో బస చేసి, వచ్చి ఓంకారేశ్వర్ చూసి వెళ్లి పోవచ్చు.
ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ వెళ్ళే దారిలో 60% ఘాట్ రోడ్. అరణ్యప్రాంతం. రోడ్ ఇరువైపులా టేకు మొదలైన చెట్లు కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం.
ఇండోర్ ఒకప్పుడు హోల్కర్ రాజ్య ముఖ్యపట్టణం. అహల్యాబాయి గురించి చరిత్ర చదువుకున్నప్పుడు చాలా మంది చదువుకుని ఉంటారు. అహల్యాబాయి ప్రసిద్ధి చెందిన హిస్టారికల్ పెర్సనాలిటీ.
ఇండోర్ కి వరుసగా ఈ ఏడాది భారతదేశంలో పరిశుభ్రమైన నగరం పురస్కారం రెండవసారి వచ్చింది. నగరం చాలా క్లీన్ గా ఉంది. భోపాల్ మధ్యప్రదేశ్ కి రాజధాని అయినా, ఇండోర్ అన్ని విషయాల్లోనూ భోపాల్ ని మించి ఉంటుంది. ఇక్కడ గుజరాతీ, రాజస్థానీ సంస్కృతుల ప్రభావం ఎక్కువ.
మా పెద్దబ్బాయి ముందే బుక్ చేసిన హోటల్ అప్నా ఎవెన్యూ లో దిగాము హోటల్ ఏమిబియన్స్ బాగుంది. రెస్టారెంట్ లో భోజనం బాగుంది. భోజనం చేసి సాయంకాలం 4 గంటల దాకా విశ్రమించాము.
మాతో వచ్చిన మా చిన్ననాటి స్నేహితుడు సూరిబాబు కి స్నేహితుడు ఒకాయన నరసింహారావు గారు ఇండోర్ లో 9 ఏళ్ళనుంచి ఉంటున్నారు. ఆయన 4 గంటలకు వచ్చి మమ్మల్ని కలుసుకొని ఆయన కారులో ఇండోర్ లో ప్రసిద్ధమైన, పురాతన ఖజ్రానా గణేష్ మందిర్ కి తీసికళ్ళారు.
వినాయకుడు దర్శనం ఇచ్చి మమ్మల్ని అలా ఆశీర్వదించాడు. భగవంతుని కరుణ అపారము, ఆయన సంకల్పాలు మనకు తెలియవు. ఇండోర్ లో ఇటువంటి బొంబాయి సిద్ధి వినాయక ఆలయం వంటి ప్రభావం, ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఉందనే తెలియదు. కాని గణపతి దయవల్ల ఈ దర్శనం సంకల్పించి మాకు ఇచ్చాడు. గుడి బాగుంది. సిద్ధివినాయకుని ఆలయం కన్న పురాతనమైనది.
చాలా మంది దర్శించుకుంటున్నారు. పెద్ద రష్ లేదు. ఆ ఆవరణలోనే వెంకటేశ్వరాలయం, శనీశ్వరుని ఆలయం, నర్మదా దేవి, మహాలక్ష్ముల విగ్రహాలు ఉన్నాయి. ఆవరణ, పరిసరాలు బాగున్నాయి.
తరువాత నరసింహారావు గారు మమ్మల్ని వాళ్ళింటికి తీసికెళ్ళి అల్పాహారం ఏర్పాటు చేశారు. దంపతులిద్దరూ భోజనానికి ఉండడండని అభిమానంగా ఆహ్వానించారు. కాని మేము మధ్యాహ్నం కొద్దిగా ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల ఆ అభిమానాన్ని అందుకోలేక పోయాము.
ఇండోర్ కి 25 కిలోమీటర్ల దూరంలో దేవాస్ అనే ఊరు ఉంది. ఇదివరకు ఇది ఒక రాజసంస్థానం. సూరి నాగమ్మగారు రాసిన రమణాశ్రమ లేఖలు పుస్తకం లో దేవాస్ రాజకుటుంబానికి చెందిన ఒక యువతి గురించి ప్రస్తావించిన విషయం గుర్తుకు వచ్చింది.
దేవాస్ రాజకుటుంబానికి చెందిన ఆ యువతి పెళ్ళి ఏమీ చేసుకోనంటూ మారాము చేస్తూ రమణ మహర్షి సాన్నిధ్యంలో ఉంటూ, మీరా దేవిలా భక్తురాలిని అవుతాను అంటూ ఆశ్రమం లో పసిదానిలా విహరిస్తోండేది. దరిమిలా ఆమెకు వివాహం అవుతుంది, భర్తతో వచ్చి రమణుల దర్శనం చేసికొని కణ్వాశ్రమం వదిలి వెళ్ళలేని శకుంతలలా వెళ్ళలేక వెళుతుంది. దేవాస్ అనగానే ఇదంతా గుర్తుకి వచ్చింది.
దేవాస్ లో ఒక దేవ్యాలయం ఉంది. ఈ ప్రాంతంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. దాన్ని చూడడానికి తీసికెళ్ళారు. 500 పైన మెట్లెక్కి వెళ్ళాము. పైన ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. తుల్జా భవానీ, చాముండా దేవి లు. తుల్జా భవానీ ఆలయం క్రింద చాముండా దేవి ఆలయం ఉంది.
రెండూ పవిత్రమైన దర్శనం ఇచ్చాయి. పక్కనే ఉన్న శత్రుంజయ అవతార్ జైన మందిరం చూశాము. శత్రుంజయ అవతార్ జైన మందిరం. శాంతి నాథుడు, వర్ధమాన మహావీరుడు, ఆదినాథుడు, పార్శ్వనాథుడు ఉన్న శ్వేతాంబర్ జైన మందిరం అది.
రాత్రి తిరిగి హోటల్ కి వచ్చేసరికి పది అయింది. మరునాడు మహేశ్వర్ తీసుకుని వెళ్తానని చెప్పి నరసింహారావు గారు శలవు తీసుకున్నారు. మేము అదాలత్ (రిపీట్) చూసి శయనించాము.
మా ఇండోర్ పర్యటన 2
19-7-2018
మహేశ్వర్
18వ తారీఖున ఖజ్రానా వినాయకుని, దేవాస్ లో అమ్మవార్లను దర్శించాము. ఇవాళ నరసింహారావు గారు మమ్మల్ని మహేశ్వర్ తీసికెళ్ళారు.
మహేశ్వర్ చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఇండోర్ నుంచి 90 కి.మీ. దూరంలో నర్మదానదము ఒడ్డున ఉంది. నరసింహారావు గారి కారులో బయలుదేరాము. సన్నగా వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మహేశ్వర్ చేరేదారిలో నర్మద రెండు పాయలు దాటుకుని వెళ్తాము.
మహేశ్వర్ హోల్కార్ రాజుల రాజధాని. నర్మద ఒడ్డున ఉంది. నర్మదను ఆనుకొని పెద్ద కోట కట్టారు.
అహల్యా బాయి 1761 నుంచి 1794 వరకు పరిపాలించింది. చారిత్రకంగా గొప్ప పేరు కల రాణి.
ప్రజలను ఎంతో ఆదరంగా పాలించిన ఏలిక.
భారతదేశంలో ఔరంగజేబు, ఇతర తురుష్కులు ధ్వంసం చేసిన ఆలయములను ఎన్నింటినో పునర్నిర్మించింది. కాశీ ఆలయాన్ని పునర్నిర్మించినది
ఈవిడే. ఎంతో ప్రజారంజకంగా పరిపాలించింది. ఆ సమయంలో మిగతా భారతదేశమంతా రాజకీయంగా ఎంతో అల్లకల్లోలంగా ఉంది.
మహేశ్వర్ కోట ఎంతో బాగా కట్టారు. జలదుర్గము.
దక్షిణం వైపు నర్మద సహజ అడ్డుగా ఉండి కోటకు రక్షణగా ఉంది. లోపల అహల్యా బాయి మందిరం, ఇతర కట్టడాలు ఉన్నాయి. కోటంతా ఎంతో బాగా డిజైన్ చేశారు. అక్కడ నర్మద ఎంతో నిండుగా ఉంది. ఓంకారేశ్వర్ కి 70 కి.మీ. సముద్రం వైపు ఉంది. ప్రకృతి సౌందర్యం అలరించింది. నర్మదలో నౌకా విహారం చేశాము. ఇండోర్ వారికి, ఇతరులకు ఇది వీకెండ్ రిక్రియేషన్. రిసార్ట్ లు అవి ఉన్నాయి.
మళ్ళీ 4 గంటలకు ఇండోర్ చేరాము. ఇండోర్ లో ఛప్పన్, సరాఫా అని రెండు ఫుడ్ పాయింట్స్, జాయింట్స్ ఉన్నాయి. ఛప్పన్లో అన్ని రకాల, అన్ని ప్రాంతాల తిళ్ళు లభిస్తాయి. రోడ్ ఫుడ్ వంటిది. దుకాణాల ముందు తింటూ ఉంటారు. ఒక వీధి అటూ, ఇటూ అవే.
సరాఫా అనేది రాత్రి 11 గంటలకు మొదలై తెల్లారకట్ట 3 వరకు ఉంటుంది. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. నెయ్యితో చేసిన స్వీట్లు, హాట్లు ఇక్కడ ప్రత్యేకం. బంగారం దుకాణాలు కొట్టేసాడు వాటిలో పనిచేసేవారు మొదలు పెట్టుకున్న ఈ సాంప్రదాయం ఇండోర్ వారందరి ఫేవరెట్ ఫుడ్ పాయింట్ గా, జాయింట్ గా మారింది.
ఇండోర్ లో రోడ్డు మధ్యలో సిటీ బస్ లకు ప్రత్యేక లేన్ ఉంది. ఇది ఇంచుమించు నగరంలో ముఖ్య ప్రాంతాలను కవర్ చేస్తుంది. సిటీబస్ లకు ఇలా ప్రత్యేక మార్గం ఉండడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజలకు ఎంతో వేగవంతమైన ట్రాన్స్పోర్ట్ అందుతోంది. భోపాల్ లో కూడా ఇటువంటి వ్యవస్థ ఉందిట.
10 గంటలకు రూమ్కి చేరి విశ్రమించాము. మహేశ్వర్ సందర్శనం ఎంతో చారిత్రక అనుభూతిని మిగిల్చింది.
రేపు ఉజ్జయిని ప్రయాణం. నరసింహారావు గారి కారులో ప్రొద్దున 9 కి బయలుదేరుతాము.

No comments:

Post a Comment