Tuesday, August 29, 2017

మా ఖాట్మండూ యాత్ర 5, 6, 7



మా ఖాట్మండూ యాత్ర 5

16, 17-8-2017

ఎదురుచూడని ప్రయాణానుభవాలు 2

అలా అంచెలంచెలుగా దారిలో ఎంతో హడావుడి ఉన్నా జాగ్రత్తగా రాక్సల్ చేరాము. రాక్సల్ లో నేపాల్ సరిహద్దు అరకిలోమీటరు దూరం. అక్కడినుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం వెడితే ఇమైగ్రేషన్ వస్తుంది. పాస్ పోర్ట్ అవసరం లేదు. ఆధార్ కార్డు పనికిరాదు. డ్రైవింగ్ లైసెన్స్, పేన్ కార్డు, ఓటరు ఐడెంటిటీ కార్డు పనికివస్తాయి. మనకి, నేపాల్ కి సరిహద్దుగా ఒక నది ఉంది. దాటగానే నేపాల్ వైపు వీర్ గంజ్ వస్తుంది. బెంగాలీ ప్రభావం వల్ల బీర్ గంజ్ అనికూడా అంటారు.
 
ఈ ప్రయాణం గుఱ్ఱపు బగ్గీమీద చెయ్యాలి. బోర్డరు దగ్గర ఒక వంతెన దాటాలి. ఆ వంతెన చాలా చిన్నది. ఇరుకైనది. ఇటూ అటూ అన్ని వాహనాలు ఆ ఇరుకు వంతెన మీంచే వెళ్ళాలి. ఎంతో స్లో గా ట్రాఫిక్ నడుస్తుంది. ట్రాఫిక్ జామ్ కండిషన్లో సదా అలాగే ఉంటుంది. మా గుఱ్ఱపు బగ్గీమీద ఆ ట్రాఫిక్ జామ్ లో 5 కిలోమీటర్లు వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. 5 గంటలకు వీర్ గంజ్ ఊరిమధ్యకు చేరాము.
 
3 గంటలకు ఆ చోటుకి వచ్చిఉంటే సుమో గాని, బలేరొ కాని దొరికేది. షేర్ టాక్సీలవి. 4-30 గంటల్లో ఖాట్మండు తీసుకు పోతాయి. కాని సరిహద్దు దాటడంలో జరిగిన ఈ ఆలస్యానికి మేము లేట్ అయ్యాము. ఇంక బస్ లోనే ఖాట్మండు వెళ్ళాలి. బస్ కి 7 గంటలు పడుతుంది.

మేము గుఱ్ఱపు బగ్గీ దిగగానే అక్కడ మూగిన బస్ వాళ్ళతో మహిందర్ సింగ్ మాట్లాడి ఒక బస్ లో మాకు ఖాట్మండు కి టికెట్ లు బుక్ చేశాడు. టికెట్ ఖరీదు నేపాలీ రూపాయల్లో 600. మన రూపాయల్లో 325. ఇలా తేడా ఉన్నా టీ, మంచినీళ్ల బాటిల్ మన కరెన్సీ లో రేట్లు ఇండియా లో లానే తేలతాయి.

బస్ రాత్రి 9 కి బయలుదేరి, పొద్దున్న 5 గంటలకి ఖాట్మండు చేరుతుంది. మా బస్సూ బయలుదేరింది. అది 16 వ తారీఖు రాత్రి. మేము భీమవరంలో 14వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాము. మా ప్రయాణంలో మరొక పదనిస.

తెల్లవారుజామున రెండు గంటలకు మా బస్ ఆగిపోయి ఉంది. ఏమిటి అంటే, అది ఘాట్ రోడ్. వర్షానికి కొండ చరియలు విరిగి రోడ్ మీద పడి ట్రాఫిక్ ని ఆపేశాయి. 5 గంటలకు క్లియర్ చేశారు. ఇక్కడ మా ఇద్దరికీ సహనం
కొద్దిగా సడలింది. కాని సర్దుకున్నాము.
 
మొత్తానికి 6-30 ప్రాంతంలో ఒక చోట ఆపారు. అక్కడకి ఖాట్మండు ఇంకా 110 కిలో మీటర్లు ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల బయటి ప్రపంచంతో మా సంబంధం తెగిపోయింది. మేమున్న చోట భౌతిక ప్రపంచం తో మాత్రమే మా సంబంధం.

 మా ఖాట్మండూ యాత్ర 6

17-8-2017

నేపాల్ ప్రకృతీ రమణి సుందర ఆత్మీయ స్వాగతం

అప్పుడు టీ తాగి 6-45 ప్రాంతంలో అక్కడ నుంచి బయలు దేరాము. నేపాల్ సుందర ప్రకృతి దృశ్యాలు మమ్మల్ని ఎంతో అలరించాయి. మాకు కుడి పక్కన ఆకు పచ్చని వస్త్రం కప్పుకున్న ఎత్తైన పర్వతాలు. ఎడమ పక్క లోతైన లోయ. దానిలో వంకర టింకరలుగ వయ్యారి భామ లా వగలు పోతూ రమణీయంగా వయ్యారంగా ప్రవహిస్తున్న త్రశూలి నది ఆప్యాయంగా పలకరించింది. హృదయ పూర్వకంగా స్వాగతం పలికింది. ఆత్మీయంగా ఇంచుమించు ఖాట్మండు వరకు ప్రియబాంధవిలా తోడొచ్చింది.
 
పర్వతాలు, వాటిపై వృక్ష సముదాయం, పర్వత సానువులపై వ్యవసాయం, లోయలు, లోయలో నదీ ప్రవాహం మాకు ఎంతో ఆహ్లాదం కలిగించాయి. అంత వరకు పడిన శ్రమ పూర్తిగా మర్చిపోయాం. మనసు ఆహ్లాదభరితం అయింది. నేపాల్ ప్రకృతీ రమణి మమ్మల్ని ఎంతో స్నేహంగా అక్కున చేర్చుకుంది.
త్రిశూలి నదీ లోయ తప్పక చూచి ఆనందించవలసిన ప్రకృతి దృశ్యం. అంత అలసి ప్రయాణం చేసిన మాకు ఈ ప్రకృతి దృశ్యాలు శ్రాంతతను పోగొట్టాయి.
 
తల్లి నవమాసాలు మోసి, కన్న పసిపాపని చూసి అప్పటి దాక పడిన శ్రమ మర్చిపోయినట్టు మా ప్రయాణ శ్రమని ఈ ప్రకృతి సౌందర్యం వీక్షించడంతో మర్చిపోయాం.

ప్రొద్దున్న 10-30 కి ఖాట్మండు చేరాము. మహిందర్ సింగ్ మా హోటల్ కి మాకు టాక్సీ మాటాడిపెట్టి మమ్మల్ని అందులో కూర్చోబెట్టి తన నివాసానికి వెళ్లి పోయాడు. అనిల్, మహిందర్ సింగ్ లు మాకు చేసిన ఉపకారం మరువలేనిది. కొత్త ప్రదేశం లో, విపత్కర పరిస్థితుల్లో మా పక్కన నిలచి మా ప్రయాణం ఎంతో సాఫీగా జరిగేలా చేసిన వారిద్దరూ మాకు చిర స్మరణీయులు. జీవితంలో వారికి ఎంతో మేలు జరగాలని మా ప్రార్థన. మనుషుల లోని ఈ ఉపకార గుణమే మానవవాళికి శ్రీరామరక్ష.

మేము ఎక్కిన మారుతి, దాని నేపాల్ చోదకుడు పురాతనులు. ముసలివారు. అప్పుడు ఖాట్మండులో మనవైపులానే ఎండ, వేడి ఎక్కువగా ఉంది. ఖాట్మండు ఊరు మన వారణాసి లాగా, కాన్పూర్ లాగా ఉండి ఎంతో పరిచయమైన ప్రదేశం లా అనిపించింది. అప్పుడు మేం ఒక చిరునది వంతెన పై వెళుతుంటే ఆ నది విష్ణువతి నది అని మా డ్రైవర్ చెప్పాడు. నేపాల్లో కుక్కలు బొద్దుగా ఉన్నాయి. వాతావరణ‌ ప్రభావం ఏమో! ఖాట్మండు లో బోర్డులన్నీ ఇంగ్లీష్, దేవనాగరి లిపిలో ఉన్నాయి.

పది నిమిషాల లో మా భావి నివాసమైన మార్వాడీ సేవా సమితికి చేర్చాడు. డబ్బులు ఎక్కువ ఇమ్మని నసిగాడు. ఇవ్వకపోతే విసుక్కుంటూ దింపాడు. నేపాల్లో మన కరెన్సీ చెల్లుతుంది. అందరికీ హిందీ వచ్చు.

ఇంకో దేశం వెళ్లినట్టే అనిపించలేదు. యూపి, బీహార్లో ఒక నగరానికి వచ్చినట్లు ఉంది. మార్వాడి సేవా సమితిలో సౌకర్యాలు బాగున్నాయి. ISKCON వారే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు.
 
అప్పటి కి పూర్తిగా అలిసిపోయిన మేము స్నానపానాదులు, భోజనం చేసి మంచాలపై వాలిపోయాము. సాయంకాలం 6 గంటలకు లేచాము. భోజనం చేసి పూర్తి యైన విశ్రాంతి తీసుకొన్నాము. మరునాడు కాన్ఫరెన్స్ మొదలవుతుంది.
 
మా ఖాట్మండూ యాత్ర 7

18, 19-8-2017

అనుకున్న ప్రకారం 18 తారీఖు ఉదయం 9 గంటలకు కాన్ఫరెన్స్ మొదలైంది. ప్రముఖులంతా వేదికపై ఆసీనులయ్యారు. ఖాట్మండు విశ్వవిద్యాలయం, తిభువన్ యూనివర్సిటీ, నేపాల్ అకాడమీల ని లోని
విద్యావేత్తలు, ISKCON స్వాములు, పిలువబడిన భారత శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ప్రసంగించారు.
ఖాట్మండు లోని విశ్వవిద్యాలయాల, కాలేజీల, స్కూళ్ల విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఇనాగరేషన్ బాగా జరిగింది. నేపాల్ ప్రథమ, మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ బరన్ యాదవ్ కూడా హాజరయ్యారు. అధ్యక్ష ప్రసంగం చేశారు.
ISKCON వారు అన్ని వసతులు బాగా కల్పించారు. భోజనాలు బాగున్నాయి. నేపాలీ వంటకాలు, మన ఐటమ్స్ చేశారు. రుచిగా ఉన్నాయి.
 
నా ప్రసంగం 19 వ తారీఖు ‌మధ్యాహ్నం 3 గంటలకు నిర్ణయించబడింది. నా ప్రసంగం బాగా జరిగింది. క్లాసులో పాఠం చెప్పినంత మామూలుగా జనరంజకంగా మాట్లాడాను. నా పరిశోధనా పత్రం శీర్షిక:
 
Consciousness Studies and Quantum Mechanics.

నాకు సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండడంవల్ల ఆధికారికంగా ప్రసంగించాను. మా ఆవిడ వీడియో తీసింది. అది ఇక్కడ పంచుకుంటాను. ఎక్కువ మంది నా ప్రసంగాన్ని, పరిశోధనలను అభినందించారు. ఎక్కువ మందికి నా ప్రసంగం, నా insight బాగా నచ్చినట్లు ప్రసంగిస్తోంటే, ప్రసంగించిన తరువాత నాకు అర్ధం అయ్యింది. నాకు సంతోషం కలిగింది.

ISKCONకి చెందిన భరత్ సాయం మరువరానిది. అతను మంచి స్నేహశీలి. మేము బెంగుళూరులో జరిగిన ISKCON వారి 2016 కాన్ఫరెన్స్ లో కలిశాం. మా అబ్బాయిలకి మా క్షేమసమాచారాలు అతని ద్వారా ఇ-మెయిల్ చేశాను. అతను మన విజయవాడ వాడు. నవ్వు మొహం. ఉపకారస్థుడు. మేము మంచి స్నేహితులం అయిపోయాం. తరువాత జరిగిన టూర్ లో మాకు అతని సెల్ తో, కెమెరాతో చాలా ఫొటోలు తీసాడు. వాట్సాప్ లో పంపుతాడు.

ఆ తర్వాత 19న వెలెడక్టరీ ఫంక్షన్ జరిగింది. దానికి నేపాల్ లోని భారత రాయబారి మంజీత్ సింగ్ అధ్యక్షత వహించారు. మాకు సర్టిఫికెట్ లు పంచారు. నాకు 30 ఏళ్ళుగా పరిచయం ఉన్న హైదరాబాద్ సిసిఎమ్బి ముఖ్య శాస్త్రవేత్త,, అద్వైతంలో మంచి పట్టు ఉన్న డా. M.V. Jagannadham కూడా ఈ కాన్ఫరెన్స్ కి వచ్చారు. మంచి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఆయన 2016 లో బెంగుళూరులో జరిగిన ISKCON వారి కాన్ఫరెన్స్ కీ వచ్చారు. తరువాత జరిగిన టూర్ లో కలిసి తిరిగి మన కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపాము.
20 - 22 లలో మూడు రోజులు ISKCON organizers డబ్బులు తీసుకుని tour ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు తరువాయి భాగాలలో.

సూచన:
 
ఇక్కడికి వచ్చాక లోకల్ సిమ్ తీసి కోవడం శ్రేయస్కరం. ఉత్తమం. అవసరం. లోకల్ సిమ్ లేక మనం ఇంటర్నెట్ ని సైబర్ కేఫ్ లలో ఇ-మెయిల్ వాడడానికి ఉపయోగించలేము. తీసికోవాలి కూడా. మన వాళ్ళతో కమ్యూనికేషన్ చాలా ఈజీ అవుతుంది. లేకపోతే నాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ సిమ్ తీసి కోవాలంటే పాస్ పోర్ట్, ఫొటో అవసరం. ఏది లేకపోయినా సిమ్ ఇవ్వరు.

No comments:

Post a Comment