మా ఖాట్మండూ యాత్ర 4
16-8-2017
ఎదురుచూడని ప్రయాణానుభవాలు 1
కాళికా మాత దర్శనం చేసికొని హౌరా స్టేషన్ కి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకొని మా రైలు, హౌరా-రాక్సల్ ఎక్స్ప్రెస్ ఏసి 2 టైర్ కోచ్ లో ఎక్కాము.
ప్రొద్దున్న హౌరా స్టేషన్ చేరినప్పటి నుంచి తీవ్ర వరదల వల్ల ఉత్తర బెంగాల్, ఉత్తర బీహార్ వైపు వెళ్లే ఎన్నో రైళ్ళను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలు లౌడ్ స్పీకర్ లలో ఘోష పెడుతున్నాయి. మా రైలు కూడా రద్దు చేయ బడిందేమో అన్న ఆదుర్దాతో విచారణా కేంద్రానికి వెళ్ళి కనుక్కున్నాను. మా రైలు రద్దు చేయ బడలేదు.
మా పెద్ద కోడలు మేము ఖాట్మండులో ఏ ఏ నేపాలీ వంటకాలు రుచి చూడాలో రెండు లిస్టులు పంపించింది. వీలైనన్ని రుచి చూడాలి. తనకి అన్ని దేశాల ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకోవడం, వీలైనంతగా రిసెర్చ్ చేయడం ఇష్టం.
అలా రద్దు చేయ బడని మా రైలు ఎక్కాము. ఈ ప్రయాణంలో అంతా మాములుగానే అనిపించింది.
రాత్రి పదిగంటల ప్రాంతంలో మా రైలు రాక్సల్ దాకా వెళ్ళదేమో అనే మాట వినిపించింది. పట్టించుకోకుండా
పడుకున్నాము. తెల్లారిలేచే సరికి మారైలు ముజఫర్ పూర్ దాటి గంట ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది.
వరదల మూలంగా మా రైలు రాక్సల్ వెళ్ళదని కన్ఫర్మ్ అయింది. మోతిహార్ వరకే వెళుతుంది. అక్కడినుంచి ఇంకా రాక్సల్ 100 కి.మీ. దూరం ఉంది. రైల్లోని వారు పర్వాలేదు ఎలాగో లాగా రాక్సల్ చేరచ్చన్నారు. అలా అన్నవారిలో రాక్సల్ దాకా వస్తున్న ఖాట్మండు వాసి అనిల్ ఒకడు. అప్పటినుండి అనిల్ మాకు చేసిన సహాయం ఎంతో విలువైనది.
మోతిహార్ స్టేషన్లో రైలు ఆగిపోయింది. ఇంక ముందుకు వెళ్ళదని రైల్వే వారు ప్రకటించేశారు. అనిల్ ఆపద్బాంధవుడిలా మాతోనే ఉండి, ఆటో మాట్లాడి మమ్మల్ని మోతిహార్ బస్ స్టాండ్ కి చేర్చాడు. మాతోనే ఉన్నాడు. అది బస్ స్టాండ్ కాదు. రోడ్డు మీదే బస్సులు ఆగే చోటు. బస్సులు రాక్సల్ వెళ్ళడం లేదు. ఆ రోజునుంచి, లేదా జస్ట్ అప్పటినుండి జీప్ లు వెళుతున్నాయి. మాకు లగేజి ఎక్కువగా ఉంది. మూడు సూట్ కేసులు. ఒక జీప్ లో మా ముగ్గురికి ఐదు సీట్లకి మాట్లాడి ఆ రణగొణ ధ్వని, పోటీలో ( రాక్సల్ వెళ్ళవలసిన వాళ్ళతో అక్కడ ఎంతో హడావుడిగా, గడబిడగా, తొక్కిసలాట, తోపులాటలతో ఎలా ఉండాలో అలా ఉంది.) మమ్మల్ని మా సామానుతో సహా జీప్లో సౌకర్యంగా కూర్చో బెట్టాడు.
మా జీప్ కదులుతూ ఉంటే వరద భీభత్సం అంతా మాకు కనిపించింది. గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురై ఉన్నాయి. స్త్రీ పురుషులు, పిల్లా, పెద్దా, గొడ్డూ, గోదా అందరూ, అన్ని రోడ్డు మీదే నివాసమున్నారు. రోడ్డుకి అటూ, ఇటూ కనుచూపు మేర జల మయమే. నీటి సంద్రం.
పూర్వీ గండక్ నది వరదల భీభత్సం ఇది. నేపాల్లో కురిసి వర్షాలవల్ల ఈ నది పొంగుతుంది. గండక్ నేపాల్ లోని ముఖ్యమైన నది. సాలగ్రామాలు దొరికేది ఈ నదిలోనే. ఇది గంగానదికి ఉపనది. బీహార్లో గంగని కలుస్తుంది. మనం ఈ నదిని గండకి అంటాము.
ఇవన్నీ చూస్తుంటే ఎంతో బాధ అనిపించింది. సహాయ కార్యక్రమాలు ఏమీ కనిపించలేదు. మన వైపులా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయినట్టు, కదిలినట్లు, సహాయక చర్యలు చేపట్టినట్లు ఎక్కడా కనిపించలేదు. వాసన కూడా వేయలేదు. ప్రజలు ఎవరి ఖర్మ వారనుభవిస్తున్నట్టు, వాళ్ళ సహాయాలు వాళ్ళే చేసుకుంటున్నట్లు అనిపించింది.
ఆశ్చర్యపోతూ జీప్ లో ప్రయాణించాము. ఒక చోట వంతెన కొట్టుకుపోయి, తాత్కాలిక ఏర్పాటు చేశారు. మా డ్రైవర్ హాయిగా నడిపేశాడు. వెంటనే రోడ్ మీద ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. రోడ్డు ఏమీ కనిపించడం లేదు. మళ్ళీ మా డ్రైవర్ ముగ్గురిని దింపి, ధైర్యంగా, మేమూ ధైర్యంగా కూర్చుని ఉండగా చాలా చాకచక్యంగా ఆ ఉధృత నీటి ప్రవాహాన్ని దాటాడు. మేమందరం ఇంప్రెస్స్ అయ్య మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టాము. మాతో ఒక విదేశీయురాలు, ఆమె కూతురు ఉన్నారు. వాళ్ళూ కంగారు పడకుండా ఆ ప్రయాణాన్ని ఆనందించారు.
రాక్సల్ 20 కి.మీ. ఉందనగా మా జీప్ ని ముందుకెళ్ళదని ఆపేశారు. 100 మీటర్ల దూరంలో ఒక వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహిస్తూండడం దానికి కారణం. మా ప్రయాణీకులందరూ రాక్సల్ చేరలేదు కాబట్టి కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతను ఒప్పుకొని అలాగే చేశాడు.
ఇంక 400 మీటర్లున్న ఆ ప్రాంతం మా సామాన్లతో దాటడం ఎలా? మాకు ఆలోచించవలసిన అవసరం లేకుండా కొందరు మమ్మల్ని, మా సామానుని క్షేమంగా దాటిస్తామని, కొంత డబ్బు అడిగారు. ఒప్పుకొని వాళ్ళ సాయం తీసుకున్నాము. ఆ సాయం అవసరం. సామాన్లు లేకపోవడం వల్ల అనిల్ వేగంగా దాటేశాడు. మేమూ దాటాక అక్కడి వ్యవహారం చూశాక; జనం, తొక్కిసలాట, తోపులాటలు గమనిస్తూ కిం కర్తవ్యతా విమూఢులమై నుంచుని ఉన్నాము. మా ఆవిడ అనిల్ కోసం చూడమంది. నేనెందుకో అతను వెళ్ళిపోయాడు అనుకున్నాను. ముందుకు వెళ్ళి చూశాను. జీప్ ల దగ్గర రామ రావణ యుద్ధాలు జరుగుతున్నాయి.
ఏంచేయాలి అని ఆలోచిస్తూ వెనక్కి వచ్చాను. మా కోసం ఎదురుచూస్తున్న అనిల్ మా ఆవిడను గమనించాడు. సుమో మాట్లాడేను, రండి అని తీసికొని వెళ్ళడానికి వచ్చాడు. ఇంతలో నేనూ వచ్చాను. అందరం కలిసి సుమో దగ్గరకు చేరి, మేమూ, సామాన్లు, సర్దుకున్నాము.
అక్కడ ప్రయాణీకులలో మహిందర్ సింగ్ ని పరిచయం చేశాడు. అతను శిఖ్. మహిందర్ కూడా ఖాట్మండు వస్తున్నాడు. ఖాట్మండు నివాసి. రాక్సల్ చేరిన తర్వాత మమ్మల్ని ఖాట్మండు చేర్చే బాధ్యత అనిల్ నుంచి అతను తీసికున్నాడు. పొద్దున్న 9 గంటలకు రాక్సల్ చేరవలసిన వాళ్ళం ఇలా ప్రయాణించి సాయంత్రం 3 గంటలకు నెమ్మదిగా రాక్సల్ చేరాము.
ఇక్కడ ఒక మాట చెప్పాలి. రైలు మోతిహార్ లో ఆగిపోవడం వల్ల రాక్సల్ చేరడానికి మాకు ఎక్కువ అయిన ఖర్చు అక్షరాలా పదకొండు వందల రూపాయలు.
నేను కాళికాలయంలో 11వందల రూపాయలకు ఇస్తామన్న అమ్మవారి ప్రసాదం నిరాకరించినపుడు మా ఆవిడ అనుకుందిట: అమ్మవారి ప్రసాదం ఈయన ఎందుకు వద్దన్నారో, పోనీ, తల్లి అంత మొత్తాన్నీ ఏదో విధంగా less privileged కి ఇప్పిస్తే బాగుండును అని. అమ్మవారు ఆమె కోర్కె ఇలా తీర్చినట్టుంది. అనిల్ ని, మహిందర్ సింగ్ నీ మాకు పరిచయం చేసి మాకు ప్రయాణం సాఫీగా జరిగేలా చేసింది అనిపించింది. తల్లికి మనసులోనే కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించాను.
మన మనసు ఎంత తుంటరో మనందరికీ తెలుసు. మేము మొదట గోరఖ్ పూర్ మీదుగా నేపాల్ వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నాము. ఆర్గనైజర్ల సలహాతో రాక్సల్ మీదుగా వస్తే వీలుగా ఉంటుంది అన్నారు. అలా టికెట్లు మార్చుకున్నాము. ఇలా రైలు ఆగిపోయి హడావుడిగా ప్రయాణం చేస్తోంటే గోరఖ్ పూర్ మీదుగా వెళితే ఈ హడావుడి తప్పేది కదా అని ఒకటే నస. మనం నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో తేడా వస్తే మనసు పెట్టే నస, సణుగుడు అంతా ఇంతా కాదు. పెళ్లి, ఉద్యోగం, ఇంకా ఇటువంటి విషయాల్లో తర్వాత తేడా వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సతాయింపు చిరాకు పుట్టిస్తుంది. మనసుని నెమ్మదిగా బుజ్జగించు కోవాలి.
No comments:
Post a Comment