Friday, May 20, 2016

ఆధ్యాత్మికత - గురువు

 ఆధ్యాత్మికత - గురువు


ఆధ్యాత్మికతకు, ఆనందానుభవమునకు గురువు అత్యవసరమని కొందరు గట్టిగా చెబుతారు, వాదిస్తారు. నిజానికి ఎవరు గురువు? గురువులేక ఆత్మానుభవం పొందలేమా? ఈ గురువనే మధ్యవర్తి ఆధ్యాత్మిక జీవనమునకు అంత ముఖ్యుడా?

అంత ముఖ్యుడు కాదు. ఉంటే పరవాలేదు. ఒక్కోసారి ఒకరకం గురువులు ఉంటే ఎంతో పరవాఉంది. అటువంటి వారు ఉండకపోవడమే మంచిది.

నిజమైన గురువు రసాయన శాస్త్రములోని ఉత్ప్రేరకము (catalyst) వంటివాడు. ముముక్షువు తొందరగా మారడానికి ఉపయోగపడతాడు. ముముక్షువును ఆధ్యాత్మిక మార్గములో పెట్టిన తరువాత గురువు తన దారి తాను చూసుకోవాలి. గురుశిష్యులము అనుకుంటూ రాసుకు పూసుకు తిరుగుతూ, శిష్యుణ్ణి జీవితాంతం శిష్యుని గానే ఉంచెయ్యకూడదు గురువు. నేడు చాలామంది గురువులు దశమ, ఏకాదశ గ్రహముల వలె శిష్యులను పట్టి పీడిస్తున్నారు తప్ప వదలటంలేదు. 

చాలా మంది ప్రస్తుత గురులు గృహస్థ శిష్యుల ఇళ్శలో తిష్టవేసి మరింత మంది శిష్య పరమాణువులకోసం వలలు పన్నుతూ, వారినుంచి రకరకాల పేర్లతో ధనసంచయము చేసి ఆస్తిపరులు అవుతున్నారు. పెద్ద పెద్ద ఆర్ధిక సామ్రాజ్యములకు చక్రవర్తులవుతున్నారు. అలా ఆస్తి పాస్తుల సంపాదించుకుంటూ, స్థితిపరులై అనుభవిస్తూ తమకూ, తమ శిష్యపరమాణువులకూ, ఆధ్యాత్మికత అనే పదానికీ పెడార్థములు కల్పిస్తూ, ఆధ్యాత్మికంగా తాము చెడుతూ, తమ శిష్యులను చెరుపుతూ, చివరకు అన్నిటికీ చెడి శరీరములు వదులుతున్నారు.
భగవంతునికి, భగవత్ తత్వానికి కువ్యాఖ్యానములు చేస్తూ, సనాతన ధర్మాన్ని భ్రష్టుపరుస్తూ‌ స్వార్ధ పూరితులై
ఆధ్యాత్మికతకు చెడ్డపేరు తెస్తున్నారు.

వీరివంటి వారు గురువులు కారు. గురు శబ్దము వీరికి అన్వయింపదు. వీరికి తగనిది. వీరు గురవులు కారు లఘువులు. కూటికోసం వేషం వేసిన నిరక్షరకుక్షులు. ఆధ్యాత్మికానుభవ హీనులు. రహితులు. పాయంసంలోనే ఉంటూ, పాయసాన్ని పంచిపెడుతూ, తాను ఉన్న, పంచి పెడుతున్న వస్తువు రుచి కించిత్ కూడా ఆస్వాదించని, ఆస్వాదించలేని గరిట వంటి వారు. ఏ ఆధ్యాత్మిక అర్హత లేని సామాన్యులు వీరు. వీరు తరించలేరు, ఎవరినీ తరింపజేయలేరు. ఆధ్యాత్మిక ఉద్ధరణకు వీరి బోంట్లను ఆశ్రయించడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడం వంటిది.

ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్య దేశాయ (దేహాయ) దక్షిణామూర్తయే నమః!

ఇష్టదైవము, జీవించి ఉన్న లేక బ్రాహ్మీభూతులైన మానుష గురువులు, ముముక్షువు అయిన వ్యక్తియే (అంటే ఎవరికి వారు - వారి స్ఫురణ, స్ఫూర్తి) గురువు అవడానికి, గురువుగా ఉండడానికి, ఉపయోగపడడానికి అర్హులు.

ఎవరి జన్మాంతర పాప పుణ్యములను బట్టి, ప్రారబ్ధ కర్మని బట్టి వారికి ఆ యా గురు యోగం కలుగుతుంది.

దురదృష్టవశాత్తు నేడు ఎక్కువ మంది జనులు రాళ్ళను రత్నములని భ్రమసి తమ తమ జీవితాలను, ఆధ్యాత్మిక శ్రేష్ఠతను ధ్వంసం చేసికుంటున్నారు. నకిలీ గురువుల వలలో పడి విడిపించుకోలేని బంధములలో చిక్కుకుంటున్నారు. తమ ఆధ్యాత్మికతకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఒక సామాన్యుని "సేవలో" జీవితం వ్యర్ధం చేసుకుంటున్నారు. అలమటిస్తున్నారు. భ్రమ, భ్రాంతులలో నిజాన్ని మరుస్తున్నారు. దివ్యుని, దివ్య పదమును పొందక, పొందలేక అఘోరిస్తున్నారు.

భగవంతుడు మనలను ఈ దుర్దశ నుంచి కాపాడుగాక!

సమస్త సన్మంగళాని భవంతు!

No comments:

Post a Comment