Tuesday, July 31, 2018

మా ఉజ్జయిని యాత్ర

మా ఉజ్జయిని యాత్ర 1
20, 21, 22 July, 2018
ఇండోర్ నుంచి నరసింహారావు గారి కారులో ప్రొద్దున 10 గంటలకి బయలుదేరాము. ఇండోర్ నుంచి ఉజ్జయిని 55 కి.మీ. 12 గంటలకు ఉజ్జయిని చేరాం. నరసింహారావు గారు తిన్నగా మహాకాలేశ్వరుని ఆలయానికి తీసికెళ్ళారు. మేము మరునాటి భస్మ హారతి చూడడానికి టికెట్ కోసం అడిగితే మరునాటికి టిక్కెట్ కేటాయింపులు అయిపోయాయి అని, రేపు పెందరాళే ఏడు గంటలకు క్యూ లో నిలబడితే ఆ మరునాటికి టికెట్ దొరుకుతుంది అని చెప్పారు.
వెంటనే మహాకాలేశ్వరుని దర్శనానికి వెళ్లాం. జనం పెద్దగా లేరు. 40 నిమిషాలలో దర్శనం అయి పోయింది. మహాకాలేశ్వర దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగించింది. దేవుని దగ్గరకు వెళ్ళే ముందు రెండు బాల్కనీలు మీదుగా వెళ్తాము. ఆ రెండు బాల్కనీల నుంచి ఎదురుగా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది. ఆ డిజైన్ ఎంతో బాగా చేశారు.
తరువాత దగ్గర లోనే ఉన్న మహాకాళి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారు ఒకే విగ్రహంలో మూడు ముఖాలతో ఉన్నారు. పై భాగం అన్నపూర్ణా దేవి, మధ్యలో హరసిద్ధా, కింద మహాకాళి. ఆలయం పురాతనమైనది.
సాయంకాలం ప్రమిదలు వెలిగిస్తారని, ఎంతో బాగుంటుంది తప్పక చూడమని చెప్పి నరసింహారావు గారు ఇండోర్ వెళ్ళి పోయారు. ఆయన స్నేహభావన, ఉపకార మనస్తత్వం మరపురానివి. ఎన్నదగినవి.
ఆయన వెళ్లి పోయాక భోజనం చేసి మా పెద్దబ్బాయి బుక్ చేసిన హోటల్ లో సాయంకాలం దాకా విశ్రమించాము.
ఉజ్జయిని అనగానే మనకు మహాకాళి, జ్యోతిర్లింగ స్వరూపుడైన మహాకాలుడు, కాళిదాసు, భోజుడు, విక్రమాదిత్యుడు, భట్టి, భేతాళుడు, గుర్తుకు వస్తారు.
ఉజ్జయిని క్షిప్రా నదీ తీరంలో ఉంది. క్షిప్ర నిజానికి నర్మదా వలె నదము. ప్రవహించి చంబల్ నదిలో కలుస్తుంది. మహాకాలేశ్వరాలయం రుద్ర సాగర్ అనే పేరు కల సరస్సు ఒడ్డున ఉంది.
సాయంకాలం సరదాగా షికారుకి బయలుదేరాము.
గుడి దగ్గరే ఆర్. ఎస్. ఎస్. వాళ్ళు నిర్మించి, మెయింటైన్ చేస్తున్న భారతమాత ఆలయం చూసాము. ఆర్. ఎస్. ఎస్. వారి దేశభక్తి నిరుపమానమైనది. అక్కడ సరస్సుపై నుంచి వచ్చే చల్లని గాలి ఎంతో ఆహ్లాదపరచింది.
అప్పుడు చీకటి పడడంతో దీప ప్రజ్వలన చూడడానికి మహాకాళి ఆలయానికి వెళ్ళాం. రెండు దీప స్తంభాలకున్న ప్రమిదల్లో ఈ దీపాలన్నీ వెలిగిస్తారు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది.
ఆపై పక్కనే ఉన్న విక్రమాదిత్యుని స్మారక చిహ్నం చూసాము. చక్రవర్తి సింహాసనం పై కూర్చున్న భంగిమలో ఆయన విగ్రహం మలిచారు. కింద పక్కన ఆయన ఆస్థానం లోని నవరత్నముల బొమ్మలు చెక్కారు. ఒక చిన్న అమ్మవారి గుడి ఉంది ఆ విగ్రహం ఎదురుగా.
ఇవన్నీ చూసి భోజనం చేసి హోటల్ లో విశ్రమించాము.

మా ఉజ్జయిని యాత్ర 2
భస్మ హారతి దర్శనం
ఉజ్జయిని మహాక్షేత్రానికి వెళ్ళినప్పుడు అందరూ తప్పక వీక్షించేది మహాకాలేశ్వరునకిచ్చే భస్మ హారతి. ఇది తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు చేసే శివ పూజ. ఆరాధన. అభిషేకం. దీనికి ఆన్లైన్ లో 100 టిక్కెట్ల కేటాయింపు ఉంది. మిగతా 600 లు ముందు రోజు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ గా ఒక రోజు ముందుగా ఇస్తారు. మేము 22 తెల్లవారుజాము భస్మ హారతి దర్శనం కోసం 21 ప్రొద్దున 7 గంటలనుంచీ క్యూ లో నుంచున్నాము. పదిన్నరకు కౌంటర్ తెరుస్తారు. ఒక ఫార్మ్ ఇస్తారు. అందులో 5 పేర్లు నింపవచ్చు. ఐదుగురు క్యూ లో నుంచోనవసరం లేదు. కాని ఐదుగురి ఆధార్ కార్డులు కాని ఇతర ఫొటో ఐడెంటిటీ కార్డు కాని ఇవ్వాలి.
వాళ్ళు వెరిఫై చేసి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ నంబరు ప్రకారం పిలుస్తారు. ఇప్పుడు ఐదుగురూ ఉండాలి. ప్రతివాళ్ళ ఫోటో తీసికొని ప్రతివారికి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది. డబ్బులేం కట్టక్కరలేదు. భస్మ హారతి దర్శనం ఉచితం. ఈ పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. మేము అంతా అయ్యి హోటల్ కి వచ్చే సరికి 12 అయ్యింది. మేము, మా ఫ్రెండ్ కపుల్ భోజనం చేసి విశ్రమించాము.
సాయంకాలం మంగల్ నాథ్, కాలభైరవ దర్శనాలకు ఆటో మాట్లాడుకుని బయలుదేరాం. ఉజ్జయిని ఊరికి ఈ రెండు 8 కిమీ దూరంగా ఉన్నాయి. ముందు మంగల్ నాథ్ ఆలయానికి వెళ్ళాం. దారిలో కృష్ణ బలరాములు, కుచేలుడు చదువుకున్న సాందీపని ఆశ్రమం మీదుగా వెళ్ళాం. కాని లోపలికి వెళ్ళలేదు.
ముందుగా మంగల్ నాథ్ ఆలయానికి వెళ్ళాం. ఈ ఆలయం క్షిప్రా నదము ఒడ్డున ఉంది. క్షిప్రా నదము పెద్దది కాదు. మంగల్ నాథ్ ఆలయం శివాలయం. మంగలుడు - కుజునికి ఇక్కడ ఎఱ్ఱటి వస్త్రాలు దానం చేస్తారు. మేము చేయలేదు. నేనూ, నా మిత్రుడు ఇటువంటి వాటిపై ఆసక్తి లేని వాళ్ళం.
భగవంతుని దర్శించడమే మా ధ్యేయం. పూజలు పునస్కారములు చేయం. క్షేత్రాలకు జన సమ్మర్దం ఉన్నప్పుడు వెళ్ళం.
దర్శనం చేసి కొని అక్కడే ఉన్న క్షిప్రా నదము ఒడ్డున ఫొటోలు దిగి కాలభైరవ ఆలయానికి బయలు దేరాము. క్షిప్రా దాటి ఒక కిలో మీటర్ తరువాత క్షిప్రా అవతలి ఒడ్డున కాలభైరవ ఆలయం ఉంది. పురాతన ఆలయం. శక్తి పీఠానికి అనుగుణంగా ఉండటం వల్ల వామాచారమూ ఉంది. ఇక్కడ కాలభైరవునికి దారు దానం ఇస్తారు. దారు అంటే మద్యం. మందు సీసాలతో ఎందరో కాలభైరవ దర్శనం చేసుకుని దానం ఇచ్చి (భగవంతునికి సమర్పించి) ప్రసాదంగా తీసుకుంటారు.
మేమూ దారు రహితంగా దర్శనం చేసుకున్నాం. కాలభైరవుని విగ్రహం చిత్రంగా ఉంది. ముఖం మనిషి ముఖమే కాని వింతగా ఉంది. ఆ ప్రాంగణంలోనే ఉన్న దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని ఉజ్జయిని తిరిగి వచ్చాం. భోజనం ముగించి కాసేపు శయనించాం.
రాత్రి 11-30 కి వెళ్లి భస్మ హారతి క్యూ లో చేరాం. ముందు ముందుగా వెళితే ముందు లింగానికి దగ్గరగా కూచోవచ్చని. పదవ వరసలోనే ఉన్నాం. ముందు గేట్ దగ్గర రోడ్ మీద కూర్చున్నాం. తరువాత వచ్చిన వాళ్ళు నుంచో వలసి వచ్చింది. మా అబ్బాయి మా హోటల్ ఆలయం పక్కనే బుక్ చేశాడు. 2 నిమిషాల నడక.
తెల్లవారుజామున 1-15 వరకు అలానే ఉన్నాం. మా అదృష్టం కొద్దీ వర్షం కురియలేదు. లేకపోతే తడిసి ముద్ద అయిపోయే వాళ్ళం. 1-15 తర్వాత చెకింగ్ పూర్తి అయ్యి లోపలకు ప్రవేశించాం. నేను పట్టుబట్ట కట్టుకొని వెళ్ళాను. అక్కడున్న సెక్యూరిటీ గార్డుకి నా దాక్షిణాత్య కట్టు సరిపోలేదు. అతనే నాకు మళ్ళీ బిగుతుగా ఔత్తరాహిక పద్ధతిలో కట్టాడు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భస్మ హారతి మొదలయ్యే ముందు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాలునికి అభిషేకం మొదలవుతుంది. ఇతర జ్యోతిర్లింగ క్షేత్రముల వలె మనం ఎవరమైనా గర్భగుడిలో ప్రవేశించి శివునికి అభిషేకం చేసుకోవచ్చు. కాని సాంప్రదాయ దుస్తులు ధరించాలి.
మగవారు పంచె, కండువా (బనీను కూడా ఉండకూడదు), ఆడువారికి రవికా, చీర కట్టు.
ముందు అభిషేకం చెయ్యడం కోసమని భస్మ హారతి టికెట్ వాళ్ళందరూ సాంప్రదాయ బద్దంగా దుస్తులు ధరించి వస్తారు. అక్కడ సాంప్రదాయ దుస్తులు అద్దెకిస్తారు. అభిషేకం చెయ్యడం కోసం నీరు పట్టుకోవడం కోసం పాత్రా అద్దెకు ఇస్తారు.
1-15 కి లోనికి రానిచ్చి ఒక మండపంలో 3-45 వరకు కూర్చోబెట్టారు. అప్పుడు అభిషేకం లైన్ - భస్మ హారతి లైన్ ఏర్పడి కదిలింది. మిగతా చోట్ల లాగే విఐపిలు ముందు పంపబడ్డారు. మేము ముందుగా కూర్చోవడం వీలుపడదని అర్థం అయింది. లోపల హాలు, బాల్కనీలలో ప్రవేశించే ముందు అభిషేకానికి నీళ్లు పట్టుకునే సదుపాయం ఉంది. నీళ్ళు పట్టుకుని మా క్యూ నెమ్మదిగా గర్భగుడిలో ప్రవేశించే సరికి అభిషేకం చేసేసి బాల్కనీల్లో చాలా మంది కూర్చుని ఉన్నారు. మామూలుగానే విఐపిలు ముందు లింగానికి ఎదురుగా దగ్గరగా తిష్టవేసి ఉన్నారు.
గర్భగుడిలో ప్రవేశించి ఉదకం మహాకాలుని మీద అభిషేకించే లోపే లోపలి వారు చేయిపట్టుకుని లాగేస్తున్నారు. మన తిరుమలంత హడావుడి గానూ ఉంది' మహాకాలేశ్వరుని లింగాన్ని దర్శించి, అభిషేకించాము, నేను, నా అర్థభాగమూ. క్రితం రోజు నేను టికెట్ క్యూ లో నుంచున్నప్పుడు కామేశ్వరి దర్శనానికి వెళ్ళింది. అప్పుడు గర్భగుడిలో ప్రవేశించ నిచ్చారుట. అలా ముందుగానే తను గర్భగుడిలో శివుని దర్శించుకొంది.
అభిషేకం పూర్తిచేసికొని బాల్కనీలు చేరేసరికి అవి పూటుగా నిండిపోయి ఉన్నాయి. ఏదో కష్టపడి చివరగా ఓ చోట కూర్చున్నాము. నేను ముందే చెప్పినట్టు ఆ బాల్కనీలో ఎక్కడ కూర్చున్నా శివలింగం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగానే ఉన్నట్టు నిరూపిస్తుంది. 5-6 భస్మాభిషేకం, అనంతరం భస్మ హారతి జరిగాయి. ఒక సాంప్రదాయ సన్యాసి తెచ్చిన చితాభస్మంతో అభిషేకం జరిగింది. ఇదివరకు స్మశానం నుంచే చితాభస్మాన్ని తెచ్చే వారట. ఇప్పుడల్లా చేయడం లేదు. మామూలు విభూదినే వాడుతున్నారు.
చితాభస్మంతో అభిషేకం జరుగుతున్నప్పుడు ఆడువారిని ఆ అభిషేకం డైరెక్ట్ గా చూడొద్దని, కొంగు లోంచి చూడమని అన్నారు. ఇదంతా జరిగి, భస్మహారతిచ్చి, అలంకారం చేసి మళ్ళీ అలంకారించిన మహాదేవునికి మరల హారతులిచ్చి భస్మహారతి కార్యక్రమం ముగించారు. అలా రాత్రి 11-30 నుంచి తెల్లవారి 6 వరకు భస్మహారతి కార్యక్రమం వీక్షించాము. 5-6 భస్మాభిషేకం, భస్మహారతి వీక్షించడం ఒక దివ్యానుభవం. పరమేశ్వరునితో మమేకం అయ్యాము. శివసాయుజ్యం లభించింది. ఆసక్తి, భక్తి శ్రద్ధలు ఉన్నవారు తప్పక వీక్షించ వెలసిన కార్యక్రమం.
కాని మాలాగా రాత్రి 11-30 కే క్యూ లో చేరక్కరలేదు. తెల్లవారుజామున 1 గంటకు చేరచ్చు.
హోటల్ కి వచ్చి, పడుకొని పొద్దున్న 10 గంటల వరకు లేవలేకపోయాం. తరువాత నెమ్మదిగా రిఫ్రెష్ అయ్యి భోజనం ముగించాము. మా హోటల్ దగ్గరే ఒక అప్నా గ్రూప్ వారి రెస్టారెంట్ ఉంది. అక్కడ దాక్షిణాత్య, ఔత్తరాహిక భోజనాలు, టిఫిన్ లు లభిస్తాయి. బాగుంది కూడా. మేం ఉజ్జయిని లో ఉన్నన్నాళ్ళు ఆ రెస్టారెంట్ లోనే తిన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళడానికి సాయంకాలం 4 గంటలకు ఇండోర్ వెళ్ళి పోయారు.
మేం మహాకాలుని సాయం హారతి, పూజ చూసి, మహాకాళిని మళ్ళీ దర్శించుకున్నాము. సాయం హారతి ఎంతో సుందరంగా, భక్తి ప్రదంగా జరిగింది. ఒక గంట అక్కడ గడిపాము. అంతటి మహాకాలేశ్వరుని ఎదుట నా అజ్ఞానం కొద్దీ నా అర్థభాగముతో మాట తేడా తెచ్చుకున్నాను. అప్పటి నా ప్రవర్తన గర్హనీయం. పరమశివుని ఎదుటే అలా సహనం కోల్పోవడం నన్ను ఎంతో చింతా క్రాంతుణ్ణి చేసింది. ఇదరమూ తరువాత మహాకాలేశ్వరుని ఎదుటే సర్దుకున్నాము. టిఫిన్ చేసి,హోటల్ చేరి నిదురించాము.
మరునాడు ఉదయం 6-30 కు ఉజ్జయిని లో అనువ్రత్ ఎక్స్ప్రెస్ ఎక్కి మరునాడు ఉదయం 2-30 కు బెజవాడ చేరాము. భీమవరం ట్రెయిన్ పట్టుకొని 6 గంటలకు భీమవరం చేరాము.
మా ఓంకారేశ్వర్, ఇండోర్, ఉజ్జయిని యాత్ర, పర్యటనలు ఎంతో అందమైన అనుభూతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.
సమస్త సన్మంగలాని భవంతు!

Sunday, July 29, 2018

గుర్తించడం; రోజుకొక విధంగా; ఆచరణ;భావ తరంగములు; రామకృష్ణులు;మేధావి మనసు; ఎప్పుడు వంటబడుతుందో?

గుర్తించడం
చాలా ఏళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా "లేదు". ఉన్నది అని "తెలియదు". వాళ్ళ దృష్టిలో ఉన్నదల్లా ఒకే చైనా, అది ఫార్మోజా చైనా. దీనినే తైవాన్ అనీ అంటారు. 1972 వరకు ఇలా సాగింది.
మన దృష్టిలో ఏదైనా ఉండాలి అంటే అది "మనకు" ఉండి ఉండాలి. దానిని మనం గుర్తించాలి. ఇలా కాకపోతే మన వరకూ అది లేనట్టే. సువిశాల చైనా దేశం అమెరికాకు లేకపోవడం, అసలు చైనా లేకపోవడం వల్ల కాదు. చైనా ఉనికితో నిమిత్తం లేకుండా, ఆ ఉనికిని గుర్తించకపోవడం వల్ల మాత్రమే అమెరికాకు చైనా లేదు.

ఏదైనా ఒక విషయం, వస్తువు, తత్త్వం, మనిషి, దైవము ఉందా, లేదా అనే ప్రసక్తి లేకుండా, ఆ ఉనికిని మనం గుర్తించామా లేదా అనే విషయం మీద మాత్రమే ఆ వస్తువుతో మనకు మానసికంగా సంబంధం ఏర్పడుతుంది. అలాగే అన్ని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి.
ఉనికి ప్రసక్తి లేకుండా, మన మానసిక సంబంధ బాంధవ్యాలతో మాత్రమే మన అనుబంధాలు, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభాలు, వ్యయాలు ముడిపడి ఉంటాయి.
మన ఊహాపోహల వల్లే వేటి ఉనికితో నిమిత్తం లేకుండా మనం సుఖదుఃఖాలను అనుభవిస్తాం. మనసు చూపించేదే మనకు ఉంటుంది. మనసులో లేకపోతే మన వరకు అది లేనట్టే. మన సంబంధ బాంధవ్యాలతో మనం ఏర్పరచుకున్న గందరగోళమే
ఎక్కువ.
వ్యక్తి మరణం మనకి దుఃఖం కలిగించదు. వ్యక్తితో మనకు కల మానసిక అనుబంధం, గుర్తింపు మాత్రమే మనకు సుఖదుఃఖాలు కలిగిస్తాయి. రోజూ ప్రపంచంలో లక్షల కొద్దీ జనాలు మరణిస్తున్నారు. మనకే దుఃఖం కలగదు. కాని మన అహంకార మమకారాలని బట్టి దుఃఖం కలుగుతుంది. మరణం ఎవరికి కలిగింది అనేది ముఖ్యం. మరణం కాదు.
మన రోజూవారీ జీవితాల్లో మనసు భూతద్దంలోంచి చూడడం వల్లే మన వ్యథలకు, వేదనలకు, బాధలకు, హాయిలకు, ఇతర భావములకు, అనుభవములకు కారణం. మనవారిని నిందించడం, వారిచే నిందింపబడడం, దెబ్బలాడుకోవడం, అనవసరమైన మాటలనుకోవడం. ఊహలు, అపోహలు ఊసులను, కేసులను, సంఘటనలను అపార్థం చేసుకోవడానికి
కారణం. అరుదుగా అర్థం చేసుకుంటాం.
అలాగే మన కష్టాల్లో, దుఃఖాల్లో 90 శాతం మన మానసిక అనుబంధం వల్ల కలుగుతాయి తప్ప, ఆ వస్తువు, సంఘటన ఉనికి, జరగడం, జరగకపోవడం వల్ల కాదు.
ఎక్కువ శాతం మానసికమే అయిన, మన సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభవ్యయాలు, మరణాలు, పుట్టుకలు మనసుని నియమించు కోవడం వల్ల, మనకు కలగకుండా చేసుకోవచ్చు.
మనసుకి ఏదీ అంటకుండా జీవించగలగడం యోగం. వరం. కొందరు సహజంగానే ఇలా నిరామయంగా బ్రతకగలరు. ఎంతో "ఆధ్యాత్మికత" కలిగినా కొందరు పరమాన్నంలో చెంచా లాగ ఏ రుచీ తెలియకుండా, ఏ విషయము అర్థం చేసుకోకుండా గడిపేస్తారు. ముముక్షుత్వంతో కొందరు ఈ స్థితిని సాధిస్తారు.
మన గుర్తింపుకి నోచుకోని సంఘటనలు, వస్తువులు, మనుషులు, వాటికి జరిగేవి మనలను ప్రభావితం చేయలేవు.
మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః.
సుఖశాంతులు మనసుకి సంబంధించినవి. మనసు నియంత్రణలో ఉంటే కలుగుతాయి. లేకపోతే బయటి సంఘటనతో మన అనుబంధాన్ని బట్టి సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, లాభవ్యయాలు
"కలుగుతాయి".
********
Happiness is fleeting. Grief is sticking to the mind and heart. Grief gives focus. But we also say grief is not welcome, but the spirituality that gives same or similar focus for mind is welcome.
*******
Can present governments pass a law for right for livelihood for Indians? Right for education is useless because even if you get a certificate you may not get a livelihood.
*********
రోజుకొక విధంగా

రోజుకొక విధంగా అలంకరించి భగవంతుని మురిసిపోవుదురు భక్తులు
రోజుకొక విధంగా అలంకరించి తన పాపాయిని మురిసిపోవును తల్లి
రోజుకొక విధంగా మోసగించి ఓటర్లను, మురిసిపోవుదురు రాజకీయ నాయకులు
రోజుకొక విధంగా అరకొరగా బట్టకట్టి వెలిగి పోవుదురు నవయువతులు వీధులందు
రోజుకొక విధంగా మాటలాడి భార్య అనుమానముల
నుంచి బయటపడ యత్నించును మగడు
రోజుకొక విధంగా అల్లరిచేసి నేరుస్తున్న విద్యలు చూపి మురిపించును పసికూన తనవారిని
రోజుకొక విధంగా నెలరాజు వలె కళలు చూపి
సంకులిత మనస్కుని చేయును నెలత మగనిని
*********
ఆచరణ


పుస్తకములలో చెప్పినది ఆచరిస్తేనే ఆ పుస్తకాలకు మనం వారసులం
నలుగురికీ ఇచ్చే ఉపదేశాలు, ప్రవచనములలోని సారం మన ప్రవర్తనలో ప్రతిఫలిస్తేనే సంఘోపయోగం
సాంప్రదాయం, సంస్కృతి, సంస్కారం జీవితాలతో 
మమేకం చేసికొని వర్ధిల్లకపోతే అవి శుష్క వచనములు
ఘనతంతా మన ఆచరణలో ఉంది
మాటల్లో, రాతల్లో, ఉపన్యాసాల్లో కాదు
మనసు ప్రఫుల్లమై ఆహ్లాదం చెందితే
అది కావ్యం; ఆచరింప జేస్తే శ్రేయస్కరం
**********
ఒక మనిషిలో ముగ్గురు మనుష్యులు ఉంటారు. తను ఫలానా అని ఇతరులు అనుకునేది. తను ఫలానా అని తను అనుకునేది. తను ఫలానా అని ఆత్మీయులు అనుకునేది. కూతురు విషయం కూతురు కన్నా తల్లికే బాగా తెలుస్తుంది
*******
ఒక చక్కని పుస్తకం చదువుతున్నప్పుడు, చక్కని దృశ్యం, రూపం చూస్తున్నప్పుడు, ప్రియ, శ్రావ్య ధ్వనులు వింటున్నప్పుడు, సువాసనలు పీలుస్తున్నప్పుడు, హాయినిచ్చే స్పర్శను అనుభవిస్తున్నప్పుడు, మంచి రుచులు ఆస్వాదిస్తున్నప్పుడు, మన మానస సరోవరంలో భావ తరంగములు లేస్తాయి. వీస్తాయి. ఆ తరంగములను ఒడిసి పట్టుకుంటే అవి చిరస్మరణీయమైన కవితగానో, కథ గానో, వ్యాసము గానో, వ్యాఖ్యానము గానో రూపుదిద్దుకుంటాయి.
మన రచనలన్నీ భావ మయములే కదా!
అవగాహన నుంచి, స్ఫూర్తి నుంచి, ఆకళింపు నుంచి, అనుభవము నుంచి భావ పరంపర మొదలౌతుంది.
భావము అవగాహనాదులకు వాక్య రూపము. భాషా స్వరూపము. కర్త, కర్మ, క్రియలతో అలరారి, సారస్వతాన్ని సృష్టిస్తుంది.
భావమే సకలమునకు ఆకారము. ఆలోచన, భావము రూపంలో వేరయినా, స్వరూపంలో ఒకటి. ఆలోచన బుద్ధిది. భావము మనసుది.
అవగాహన, అనుభవము, ఆకళింపు, స్ఫూర్తి అర్థమై కలిగిన తత్పర, తాత్పర్య స్థితులు.
*******
రామకృష్ణులలో ఎందుకో మనకి కృష్ణుడంటే దగ్గరితనం. కృష్ణుడు చెలికాడిలా అనిపిస్తాడు.
రాముడు ఒక ఉపాధ్యాయునిలా అనిపిస్తాడు.
రామో విగ్రహవాన్ ధర్మః
కృష్ణః వసతి మమ హృదయే
అనిపిస్తుంది.
రామము అంటే ఆనందము.
కృష్ణుడూ ఆనంద నిలయుడే.
యోగ వాశిష్ఠంలో రాముడు శిష్యుడు.
కృష్ణుడు భగవద్గీతాచార్యుడు.
కృష్ణుని నుంచే "చాణక్య నీతి" మొదలైంది.
రాముడంతా straightforward.
కృష్ణునితో మమేకం అవడం తేలిక.
రామకృష్ణులు విష్ణ్వవతారములే అయినా వారి వారి అవతార జీవితముల తేడా ప్రస్ఫుటం.
పరశురాముడు వీరిద్దరికీ భిన్నం. నరసింహుడు వామనుడు కూడా వేరే.
విష్ణుమూర్తి ఏడు, ఎనిమిదవ అవతారములైన రామకృష్ణుల ప్రాచుర్యం మిగిలిన అవతారములకు లేదు.
భాగవత కర్త, రామాయణ కర్త వేరు వేరవడం రామకృష్ణుల "వ్యక్తిత్వ" భేదాలకు కారణమేమో!
మన మనస్తత్వం బట్టి మనం ఇష్టదైవం నిర్ణయించ బడుతుంది ఏమో!?
*********
మా తాతల నాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి-అని ఒక రకం
పాతంతా చెత్త హృదయాలకు రంపపు కోత-ఆని ఇంకో రకం
మన సమాజాన్ని టగ్ ఆఫ్ వార్ ఆడేస్తున్నారు
అయోమయంలో వాళ్ళు నిరామయంలో మనం
సంకుచిత భావములు లేక అందరి బాగు కోరే విజ్ఞులు నేడు అంటరాని వారు
వాద ప్రతి వాదములలోకి చేరని వీరిని ఏ పక్షమూ
మననీయదు;నలుగురికీ మంచి చెప్పనీయదు
ఈ జుగుప్సాకరమైన, అశాంతి కలిగించే వాస్తవం
మారే సావకాశమే కానరాదు
మార్చే శక్తి యుక్తులు లేవు
దైవాధీనం అని వదిలేసే ప్రకృతీ కాదు
బుద్ధిని ఉపయోగించనీయని సంఘం
మేధావి మనసు రణరంగం
********
Love, war and politics function on similar principles.
******
భగవంతుని ఉనికిని తలుచుకోవడం అంటే మన అల్పత్వాన్ని గుర్తించడం అంతే. ఇంకేమీ కాదు.
********
Who allowed Swamis to represent Sanatana Dharma and "Hinduism". Grihasthas must do it. All asramas dissolve into and sustained by Grihasthaasrama!
*********
ఎవరి వ్రాతలు ఎవరి రాతలు మార్చునో ఎవరికెఱుక?
*******
ఎప్పుడు వంటబడుతుందో?
ఇదివరకు మన ఇళ్ళల్లో తల్లుల దృష్టి పూర్తిగా పిల్లల మీద కుటుంబం మీద ఉండేది. కాలక్షేపమూ అయ్యేది. ఇప్పుడు ఒకటి, లేక రెండూ సంతానంతో ఆపేసి వాళ్ళని పెంచి పెద్ద చేసేసి ఖాళీ వచ్చినపుడు ఫేస్బుక్ లాంటివి వచ్చి అందరికీ కాలక్షేపం కలిగిస్తున్నాయి.
పక్కనే, ఇంట్లో మనుషులు ఉండటం లేదు. ఒక డెస్క్ టాప్, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. ప్రపంచమే ఎదురుగా ఉంటోంది. బుర్రలో భావాలు, ఆలోచనలు, ఉపదేశాలు, తర్కాలు, చదువులు, భేదాలు, విభేదాలు, వాదాలు విరివిగా ఉన్నాయి.

వాటిని ఫేస్బుక్ మీదికి వదిలేయడమే తరువాయి, రోజుల కొద్దీ బిజీగా ఉండచ్చు. మన సలహాలు, సంప్రదింపులు ఉచితంగా అందించవచ్చు. ప్రపంచంలో చెడుని దునుమాడవచ్చు. మన సంఘీభావం ప్రకటించ వచ్చు.
ఇలా ఇంటి విషయం కావలసినంత సేపు మర్చిపోవచ్చు, స్త్రీ, పురుషులు. కాని మనకు నిజంగా మనసు బాగోనప్పుడు ఈ కార్యక్రమాలేవీ మనకు శాంతి ఈయలేవు. అప్పుడు మనం ఏం చేస్తాం?
అమ్మ ఉంటే చెప్పుకుంటాం. లేకపోతే స్నేహితులు,- రాళ్ళు. మనవాళ్ళకి మనం ఏమీకాక, ఏ స్వామినో, సాధువునో, బాబానో నమ్మి వ్యవహరించడం. మన తల్లితండ్రులు లాగ మానసిక బలం ఉండటం లేదు మనకు. పిల్లలకేమి బోధించగలం. ఇటువంటి చదువులు చదవటం లేదు మనం.
సాంఘిక సమస్యలు, గొడవలు, నిమ్నోన్నతాలు గురించి ఎంత మాట్లాడినా, ఆ పరిజ్ఞానం మనకు సుఖశాంతులు కలిగించు కోవడానికి ఉపయోగించదు. అటువంటప్పుడు ఏం చేయాలో పాలు పోదు. బయటి విషయాలపై మనం అలవోకగా ప్రదర్శించిన ఆసక్తి, సమస్యల పట్ల మన అభిప్రాయాలు, వాటికి మనం సూచించిన, ప్రకటించిన పరిష్కారాలు ఇప్పుడు మనకు ఉపయోగించవు.
కుటుంబాన్ని వదిలేసి సంఘ సంస్కరణకు నడుం కట్టడం పునాది వేయకుండా భవంతి కట్టడం. కుటుంబాలు ఇటుకలు. సంఘం భవంతి. ఇటుకలు బలిష్టంగా లేకపోతే సంఘం బలిష్టంగా ఉండదు.
ఈ ఇంగితం మనకెప్పుడు వంటబడుతుందో?

Thursday, July 26, 2018

మా ఓంకారేశ్వర్ యాత్ర

మా ఓంకారేశ్వర్ యాత్ర 1
ఓంకారేశ్వరం నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక జ్యోతిర్లింగం. చూడడానికి బయల్దేరాం భార్యాభర్తలమిద్దరమూను.
నాకు మనందరికి మల్లేనే క్షేత్ర దర్శనం, నదులు నదములంటేనూ చాలా ఇష్టం.మా ఓంకారేశ్వర్ యాత్ర 2
16-7-2018
మేము 15 వ తారీఖు ప్రొద్దున 6 గంటలకు విజయవాడలో తిరువనంతపురం-ఇండోర్ రైలు ఎక్కాము. 16 వ తేదీ ఉదయం 6 గంటలకు ఇండోర్ చేరాము. 
అక్కడ నుంచి ఓంకారేశ్వర్ 70 కి.మీ. దూరం. టాక్సీ మీద 2 గంటల ప్రయాణం చేసి ఓంకారేశ్వర్ చేరాము. ఊరు పెద్ద పల్లెటూరు.
మా పెద్దబ్బాయి ముందే బుక్ చేసిన హోటల్ రాధేకృష్ణ లో చెక్ ఇన్ అయ్యాము. సంసార పక్షంగా బాగానే ఉంది. అక్కడకి అవతల ఒడ్డున ఓంకారేశ్వరరుని ఆలయం ఉంది. ముందుగా మేము
నర్మదా నదములో స్నానం చెయ్యాలి అని అనుకున్నాం.
మా హోటల్ కి దగ్గరగానే నర్మదా నదము ఉంది. పదినిమిషాల నడక. వెడల్పు ఎక్కువగా లేదు. రెండు మూడు చిన్ని కొండల మధ్య కింద ప్రవహిస్తూ ఉంటుంది. ఓంకారేశ్వర్ కి అరకిలోమీటరు దూరంలో నదమునకు ఎగువన ఒక డామ్ కట్టారు. అక్కడ నుంచి నీటిని పైపుల ద్వారా ఉజ్జయిని క్షిప్రా నదిలోకి పంపుతారు.
మధ్యప్రదేశ్, గుజరాత్ లకు నర్మదా నదము నీటి వసతి కలిగిస్తుంది. వారి పాలిటి భాగీరథి.
ఓంకారేశ్వర్, నర్మదా అనగానే మరొక విషయం గుర్తుకు వచ్చింది. ప్రఖ్యాత నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు "నర్మదా పరిక్రమ" అనే ఒక పుస్తకం రాశారు. నేను ఆ పుస్తకం చదివాను. ఆ పరిక్రమ చేసిన విధానం, ఎలా చేశారు ఆయన ఎంతో బాగా వర్ణించారు. నర్మదానదము ఒడ్డున ఒక ఊరిలో బయలుదేరి, నర్మదా పరిక్రమ చేసి మళ్ళీ బయలుదేరిన ఊరికి చేరడం. ఆయన నర్మదా నదము దక్షిణ ఒడ్డున ఒక ఊరినుంచి బయలుదేరి, అరేబియా సముద్రంలో నర్మద కలిసే చోట్లో ఉత్తర ఒడ్డుకు వచ్చి, ఆ ఒడ్డున నదము ఎగువకు పయనించి, జబల్పూర్ పైన నర్మదా నదము జన్మస్థానం చేరి, మళ్ళీ అక్కడ నర్మద దాటి దక్షిణ ఒడ్డమ్మట వారు బయలు దేరిన ఊరు చేరడం. ఈ పుస్తకం ఆసక్తి ఉన్నవారు చదవొచ్చు.మా ఓంకారేశ్వర్ యాత్ర 3
16-7-2018
హోటల్ కి ఉదయం 8-30 కి చేరాము. చెక్ ఇన్ అయ్యి, స్థిమితపడి నర్మదా నద జలాల లో స్నానానికి బయలు దేరాము. పదినిమిషాల నడక. నర్మదా నదముపై ఉన్న కాలి వంతెన అవతలి ఒడ్డుకు (ఉత్తరం ఒడ్డు) చేరుస్తుంది. అటువైపే ఓంకారేశ్వరుని ఆలయం ఉంది. మేము ఖాళీగా ఉన్న ప్రదేశం చూసుకొని స్నానానికి 100 మెట్లు దిగాము. అది పడవల రేవు. అక్కడ నర్మదా నదము ఎంతో లోతుగా ఉంది. నీరు బాగానే ఉంది. నల్లగా అంటే నీలముగా ఉన్నాయి నీళ్లు. నేను వేగేశ్వరపురంలో గోదావరి లో చిన్నప్పుడు నేర్చుకున్న ఈత ఈదాలనుకున్నాను కానీ మా ఆవిడ వద్దంది.
పడవల వాళ్ళు మాకు ఒక బకెట్ ఇచ్చి మేము స్నానం చెయ్యడానికి సహకరించారు. ఇద్దరం ఆ బకెట్ సాయంతో ‌గట్టు మీదే స్నానం చేశాం. ఆవిడ నదీ పూజ, నేను సంధ్యావందనం అక్కడే కానిచ్చి హోటల్ కి తిరిగి చేరుకున్నాం.
మా ఓంకారేశ్వర్ యాత్ర 4
16-7-2018
స్నానం ముగించుకొని హోటల్ చేరిన మేము తయారై ఓంకారేశ్వరుని దర్శనానికి బయలుదేరాం. ఓంకారేశ్వర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నర్మదా నదము యొక్క ఉత్తర తీరంలో ఉంది. దానికి ఎదురుగా దక్షిణ తీరాన మమలేశ్వరుని ఆలయం ఉంది. ఈ రెండింటినీ కూడా జ్యోతిర్లింగాలే అంటారు పెద్దలు.
మేమున్న హోటల్ కి దగ్గరగానే అవతల ఒడ్డున ఓంకారేశ్వరుని ఆలయం ఉంది. పదినిమిషాల నడక. నడక వంతెన దాటి వెళ్ళాలి. గమ్మునే వెళ్ళి పోయాము. పెద్ద రష్ లేదు. పదిహేను నిమిషాలలో దర్శనం అయిపోయింది. లింగం చిన్నది.
గుజరాత్లో సోమనాథ్, నాగేశ్వర్ లలో ఉన్నట్లు అమ్మవారు అయ్యగారికి వెనుక కొలువై ఉన్నారు. అయ్యవారు ఓంకారేశ్వరుడు. అమ్మగారు పార్వతీదేవి. అమ్మవారి విగ్రహం ఆకట్టుకొనేలా ఉంది. ఎందరో ఇక్కడ నర్మదా జలాలతో ఓంకారేశ్వరుని అభిషేకిస్తున్నారు.
ఈ రోజు సోమవారం. కిందికి (100 మెట్లపైన) నర్మదా తోయముల తెచ్చి ఈశ్వరుని అభిషేకించాలి అనిపించింది. ఇంతలో అక్కడ ఒక బ్రాహ్మణుని చేతిలో నర్మదా జలాలు ఉన్నాయి. నాకు పెద్ద పెద్ద క్షేత్రాలలో, మామూలుగా కూడా పూజలు, అభిషేకములు చేయించడంపై అంతా ఆసక్తి లేదు. కాని ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో పరమేశ్వరుని అభిషేకించాలి అనిపించింది.
ఆయన మమ్మల్ని మళ్ళీ ఓంకారేశ్వరుని దర్శనానికి తీసికెళ్ళారు. తనివితీరా ఆయన అందించిన నర్మదా తోయములతో ముక్కంటిని అభిషేకించాను. లింగానికి ముందు ఎత్తుగా, అక్కడ నీళ్ళు పోస్తే ఓంకారేశ్వరునిపై జలము పైపు ద్వారా పడి అభిషేకించేలా ఏర్పాటు చేశారు.
ఆ ఏర్పాటు ద్వారా నీటిని పోస్తే ఈశానునికి అభిషేకం జరుగుతుంది. అలా బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ, మేమూ గొంతు కలిపి మూడునిమిషాలు అభిషేకం చేయగలిగాం. ఎంతో సంతోషం కలిగింది. ఇలా అందరూ చేయవచ్చు.
మనసు కోతికదా, వారు పెట్టిన ఎత్తు పై నుంచి ఎవరో నీరు పోస్తే, నేనూ అలా చేశాను, శివునిపై నీరు మనమే తిన్నగా అభిషేకింనట్టుందని. కాని అలా పోస్తే నీరు లింగంపై పడదు. ఆ పని చేసినందుకు అక్కడి పూజారులచే అక్షింతలు వేయించుకొని, మరొక మారు ఆదిదంపతులను తనివితీరా దర్శించి, ఆలయం బయటకు వచ్చి, నందిని కూడా అభిషేకించి, కింద ఒక హాలులో ప్రవేశించాము బ్రాహ్మణునితో సహా.
ఆయన అక్కడ కూర్చోబెట్టి, అక్కడ ముక్కాలి పీట ఆకారంలో పాములు కాళ్ళలా ఉండి శివలింగాన్ని వహించి ఉన్న ఇత్థడి అమరికపై 
శివునికి మరల తదనుగుణ మంత్రములు చదువుతూ మరల అభిషేకం చేయించి, అమ్మవారికి అయ్యవారికి దీపదర్శనం చేయించి, పూజ చేయించి కార్యక్రమం ముగించారు. మా ఇద్దరికీ ఎంతో సంతృప్తి కలిగింది. ఆ బ్రాహ్మణుణ్ణి సంతుష్టి పరచి కాసేపు అక్కడి దృశ్యాలు వీక్షించి, ఆనందాంతరంగులమై హోటల్ కి చేరి పుల్కాలతో భోజనం అయిందనిపించి, విశ్రమించాము.
మా ఓంకారేశ్వర్ యాత్ర 5
16-7-2018
ఉదయం ఓంకారేశ్వరుని, పార్వతీ దేవిని తనివితీరా దర్శించి, అర్చించి సాయంకాలం వరకు విశ్రాంతి తీసుకున్నాము. అప్పుడు బయలుదేరి మమలేశ్వరుని దర్శించడానికి బయలుదేరాము. మమలేశ్వరుని ఆలయం నర్మద దక్షిణ ఒడ్డున ఉంది.
ఓంకారేశ్వరాలయం, మమలేశ్వరాలయం నర్మదకు ఉత్తర, దక్షిణ తీరాలలో ఉన్నాయి. మా హోటల్ నుంచి పదినిమిషాల నడక. మెట్లు దిగి ఎక్కాలి.
మమలేశ్వరాలయం ఆరు ఆలయాల సముదాయం. అన్నీ శివాలయాలే. మమలేశ్వరాలయం పెద్దది. మిగిలినవన్నీ బాగా చిన్నవి. ఒక్క మమలేశ్వరాలయంలోనే అభిషేక, పూజా పునస్కారాలు జరుగుతున్నాయి. ఇదంతా పురాతన ఆలయాల సముదాయం.
మమలేశ్వరాలయంలో శివుని, ఆయన వెనుక ప్రతిష్ఠిత అయిన పార్వతీ దేవిని దర్శించుకున్నాము. ఈ ఆలయాన్ని ఎక్కువ మంది ఒక మామూలు దేవాలయంగా చూస్తారు, దర్శనం చేసుకునే విషయంలో, అభిషేకాదులు చేసే విషయంలో.
ఒక విధంగా ఈ ఆలయ సముదాయం పాడుపడినట్లు ఉన్నాయి. ఆలయ నిర్మాణం బాగుంది. వందల సంవత్సరాల క్రితం ఆలయాలు.
ఎందుకు ఇవి ఇలా పాడుపడినవో తెలియదు. మా హోటల్ దగ్గర ఉన్న ఒక విష్ణు మందిరాన్ని చూసాము. దానినీ ఎవరూ దర్శించడం లేదు.
తరువాత మళ్ళీ ఉత్తరం వైపుకు వెళ్లి కిందికి దిగి నర్మదానద తోయములతో సంప్రోక్షణ చేసికొని, మరల పార్వతీ దేవి, ఓంకారేశ్వరుల దర్శనం చేసి కున్నాము.

మా ఓంకారేశ్వర్ యాత్ర 6
17-7-2018
ఈ రోజు మాతో నా చిన్ననాటి స్నేహితుడు సూరిబాబు దంపతులు ఓంకారేశ్వర్ లో కలిశారు. మేం ముందు అనుకున్న ప్రకారం వాళ్ళూ మేమున్న
హోటల్ లోనే రూం తీసికున్నారు.
శంకరాచార్యుల గుహ
కలిసి మళ్ళీ ఓంకారేశ్వర దర్శనం చేసి కున్నాము. 50 మెట్లు క్రిందే ఉన్న శంకరాచార్యుల గుహను చూశాము. ఈ గుహలోనే శంకరులు తమ గురువులు గోవింద భగవత్పాదుల వద్ద సన్యాసం స్వీకరించారు.
ఆ గుహ పాతకాలం నాటిది అని తెలుస్తూ ఉంటుంది. అక్కడ శంకరాచార్యుల విగ్రహం, దానిపైన వారి గురువుల విగ్రహం ఉన్నాయి. లోపల ప్రశాంతంగా ఉంది. బాగా మెయిన్టైన్ చేస్తున్నారు. లోపల కూర్చునే సావకాశం లేదు.
భారతదేశ తత్త్వ శాస్త్రానికి అద్వైత వేదాంతపు సొబగులు అద్దిన ఆదిశంకరుల స్మరణ అక్కడ నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. అద్వైతము బౌద్ధమునకు దగ్గరగా ఉన్నదని శంకరాచార్యులను ఆస్తిక ఆచార్యులు "ప్రచ్ఛన్న బౌద్ధులు" అన్నారు.
భారతీయ తత్త్వశాస్త్రము ఉపనిషత్తులతో మొదలై
బౌద్ధ, జైన, చార్వాకములను కలుపుకొని షడ్ దర్శనముల కలయికతో ఎంతో ఎదిగింది.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఉపనిషత్తులు, బౌద్ధ, జైన తత్త్వాలు, షడ్ దర్శనములు ఒకదానిని ఖండించుకుంటూ, మిగతా వాటిలోని ముఖ్య, ప్రాధాన్య, ప్రత్యేక విషయాలను తమలో కలుపుకుంటూ (complementing and supplementing) భారతీయ తత్త్వశాస్త్రాన్ని సుసంపన్నం చేశాయి. వీటిలో దేన్నీ తీసిపారేయకూడదు. అలా తీసి పారేసి ఒక సిద్ధాంతాన్నే పట్టుకు వేలాడుతూ మిగతా సిద్ధాంతాలను తీసిపారేయడం జ్ఞానుల లక్షణం కాదు. ఉత్తి అమాయకుల, పసివారల, అజ్ఞానుల లక్షణం. అంతనూ, అన్నింటినీ కలుపుకొని పోవడం తెలియని పరిమిత జ్ఞానంతో గ్రహింపు లేక చేసే దుర్వ్వాఖ్యలు మాత్రమే. తెలిసీ తెలియని మాటలే.
భారతీయ తత్త్వశాస్త్రము ఆస్తికమే కాదు, పూర్తి అయిన జ్ఞానము, విజ్ఞానము, మానసిక కార్యకలాపాలపై గొప్ప అవగాహన కలిగి, అవగాహన
ఇచ్చే జ్ఞాన బోధ మీమాంస.
నిర్పక్షపాత ధోరణితో భారతీయ తత్త్వశాస్త్రమును అభ్యసిస్తే ఈ జ్ఞానమును పొందవచ్చు. ఒక విజ్ఞాన శాస్త్రం గానూ మలచవచ్చు. మనుషులు భాషనేర్చే విధము, జ్ఞానము కలిగే విధము, మనసు, ఇతర అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియములు మానసిక కార్యకలాపాలు చేసే విధానం, విధం క్షుణ్ణంగా చెప్పే జ్ఞాన సర్వస్వము.
ఇదంతా భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఒక శుద్ధజ్ఞాన భాండాగారంగా చేసింది. తత్త్వజ్ఞులకు విందు భోజనం. మూర్ఖ శిఖామణులకు దెబ్బలాటకు పనికి వచ్చే అంశం. ఘనము, సర్వజ్ఞము అయిన భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఆకళింపు చేసుకుని అవగాహన ఏర్పరచుకోవడానికి చిన్ని బుఱ్ఱలకు సాధ్యం కాదు. వాళ్ళు వాళ్ళ పరిమిత జ్ఞానంతో పేచీ పెడతారు అంతే.
ఇంతటి జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానములను అందించే అద్వైత సిద్ధాంతాన్ని గౌడపాదుల ప్రశిష్యులైన శంకరులు మనకు అందించారు. ఆ కృతజ్ఞతతో శంకరులను ధన్యవాదాలు అర్పిస్తూ పదే పదే
అభిమాన, గౌరవపురస్సరంగా తలుచుకున్నాను.
నర్మద పాయలకింద విడుట
ఓంకారేశ్వరానికి అరకిలోమీటరు ముందు నర్మదపై ఒక డామ్ కట్టారు. ఈ డామ్ తర్వాత నర్మద ఒక పర్వతం ముందు రెండు పాయలుగా విడుతుంది. మళ్ళీ పర్వతం చివర రెండు పాయలు ఒకటిగా కలిసి పోతాయి. దానిని త్రివేణీ సంగమం అంటారు. కావేరి-నర్మదల సంగమం అని అంటారు. కావేరి పదం ఎందుకు వచ్చిందో తెలియదు.
డామ్ చూడడానికి వెళ్లాం. డామ్ హై సెక్యూరిటీ లో ఉంది. మమ్మల్ని చూడడానికి అనుమతించలేదు. అక్కడ నుంచి నర్మద రెండు పాయలుగా విడడం కనిపిస్తుంది. నర్మదలో నీళ్లు సరిపడా లేకపోవడం వల్ల సంగమ స్థానానికి వెళ్ళలేకపోయాము. వర్షాకాలంలో నీళ్ళు సరిపడా ఉన్నప్పుడు నౌకా విహారం చేయవచ్చు. ఎన్నో పడవలు, మర బోట్లు సిద్ధంగా ఉన్నాయి.
ఓంకారేశ్వర్ నర్మదపాయల మధ్య ఉన్న కొండపై నర్మద ఒడ్డుననే తక్కువ ఎత్తులో ఉంటుంది. నదములో స్నానం చేయాలంటే 100 మెట్లు దిగాలి.
ఓంకారేశ్వర క్షేత్ర దర్శనం మాకు ఎంతో వికాసాన్ని, హాయిని, ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చింది. ఓంకారేశ్వర్ ఉన్న ప్రదేశం ప్రకృతి ఒడిలో ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ కనువిందు చేస్తూ పరవశింప చేసింది.

మా ఇండోర్ పర్యటన

మా ఇండోర్ పర్యటన 1
18-7-2018
ఓంకారేశ్వర్ లో రెండు రోజులు ప్రశాంతంగా గడిపి మా తరువాతి మజిలీ ఇండోర్ కి బయలుదేరాము. ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ 70 కిమీ. కారులో 2 గంటల ప్రయాణం.
అందుకనే ఓంకారేశ్వర్ లో బస చేయకుండా చూసి, వెళ్లి పోదామనుకుంటే ఇండోర్ లో బస చేసి, వచ్చి ఓంకారేశ్వర్ చూసి వెళ్లి పోవచ్చు.
ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ వెళ్ళే దారిలో 60% ఘాట్ రోడ్. అరణ్యప్రాంతం. రోడ్ ఇరువైపులా టేకు మొదలైన చెట్లు కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం.
ఇండోర్ ఒకప్పుడు హోల్కర్ రాజ్య ముఖ్యపట్టణం. అహల్యాబాయి గురించి చరిత్ర చదువుకున్నప్పుడు చాలా మంది చదువుకుని ఉంటారు. అహల్యాబాయి ప్రసిద్ధి చెందిన హిస్టారికల్ పెర్సనాలిటీ.
ఇండోర్ కి వరుసగా ఈ ఏడాది భారతదేశంలో పరిశుభ్రమైన నగరం పురస్కారం రెండవసారి వచ్చింది. నగరం చాలా క్లీన్ గా ఉంది. భోపాల్ మధ్యప్రదేశ్ కి రాజధాని అయినా, ఇండోర్ అన్ని విషయాల్లోనూ భోపాల్ ని మించి ఉంటుంది. ఇక్కడ గుజరాతీ, రాజస్థానీ సంస్కృతుల ప్రభావం ఎక్కువ.
మా పెద్దబ్బాయి ముందే బుక్ చేసిన హోటల్ అప్నా ఎవెన్యూ లో దిగాము హోటల్ ఏమిబియన్స్ బాగుంది. రెస్టారెంట్ లో భోజనం బాగుంది. భోజనం చేసి సాయంకాలం 4 గంటల దాకా విశ్రమించాము.
మాతో వచ్చిన మా చిన్ననాటి స్నేహితుడు సూరిబాబు కి స్నేహితుడు ఒకాయన నరసింహారావు గారు ఇండోర్ లో 9 ఏళ్ళనుంచి ఉంటున్నారు. ఆయన 4 గంటలకు వచ్చి మమ్మల్ని కలుసుకొని ఆయన కారులో ఇండోర్ లో ప్రసిద్ధమైన, పురాతన ఖజ్రానా గణేష్ మందిర్ కి తీసికళ్ళారు.
వినాయకుడు దర్శనం ఇచ్చి మమ్మల్ని అలా ఆశీర్వదించాడు. భగవంతుని కరుణ అపారము, ఆయన సంకల్పాలు మనకు తెలియవు. ఇండోర్ లో ఇటువంటి బొంబాయి సిద్ధి వినాయక ఆలయం వంటి ప్రభావం, ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఉందనే తెలియదు. కాని గణపతి దయవల్ల ఈ దర్శనం సంకల్పించి మాకు ఇచ్చాడు. గుడి బాగుంది. సిద్ధివినాయకుని ఆలయం కన్న పురాతనమైనది.
చాలా మంది దర్శించుకుంటున్నారు. పెద్ద రష్ లేదు. ఆ ఆవరణలోనే వెంకటేశ్వరాలయం, శనీశ్వరుని ఆలయం, నర్మదా దేవి, మహాలక్ష్ముల విగ్రహాలు ఉన్నాయి. ఆవరణ, పరిసరాలు బాగున్నాయి.
తరువాత నరసింహారావు గారు మమ్మల్ని వాళ్ళింటికి తీసికెళ్ళి అల్పాహారం ఏర్పాటు చేశారు. దంపతులిద్దరూ భోజనానికి ఉండడండని అభిమానంగా ఆహ్వానించారు. కాని మేము మధ్యాహ్నం కొద్దిగా ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల ఆ అభిమానాన్ని అందుకోలేక పోయాము.
ఇండోర్ కి 25 కిలోమీటర్ల దూరంలో దేవాస్ అనే ఊరు ఉంది. ఇదివరకు ఇది ఒక రాజసంస్థానం. సూరి నాగమ్మగారు రాసిన రమణాశ్రమ లేఖలు పుస్తకం లో దేవాస్ రాజకుటుంబానికి చెందిన ఒక యువతి గురించి ప్రస్తావించిన విషయం గుర్తుకు వచ్చింది.
దేవాస్ రాజకుటుంబానికి చెందిన ఆ యువతి పెళ్ళి ఏమీ చేసుకోనంటూ మారాము చేస్తూ రమణ మహర్షి సాన్నిధ్యంలో ఉంటూ, మీరా దేవిలా భక్తురాలిని అవుతాను అంటూ ఆశ్రమం లో పసిదానిలా విహరిస్తోండేది. దరిమిలా ఆమెకు వివాహం అవుతుంది, భర్తతో వచ్చి రమణుల దర్శనం చేసికొని కణ్వాశ్రమం వదిలి వెళ్ళలేని శకుంతలలా వెళ్ళలేక వెళుతుంది. దేవాస్ అనగానే ఇదంతా గుర్తుకి వచ్చింది.
దేవాస్ లో ఒక దేవ్యాలయం ఉంది. ఈ ప్రాంతంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. దాన్ని చూడడానికి తీసికెళ్ళారు. 500 పైన మెట్లెక్కి వెళ్ళాము. పైన ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. తుల్జా భవానీ, చాముండా దేవి లు. తుల్జా భవానీ ఆలయం క్రింద చాముండా దేవి ఆలయం ఉంది.
రెండూ పవిత్రమైన దర్శనం ఇచ్చాయి. పక్కనే ఉన్న శత్రుంజయ అవతార్ జైన మందిరం చూశాము. శత్రుంజయ అవతార్ జైన మందిరం. శాంతి నాథుడు, వర్ధమాన మహావీరుడు, ఆదినాథుడు, పార్శ్వనాథుడు ఉన్న శ్వేతాంబర్ జైన మందిరం అది.
రాత్రి తిరిగి హోటల్ కి వచ్చేసరికి పది అయింది. మరునాడు మహేశ్వర్ తీసుకుని వెళ్తానని చెప్పి నరసింహారావు గారు శలవు తీసుకున్నారు. మేము అదాలత్ (రిపీట్) చూసి శయనించాము.
మా ఇండోర్ పర్యటన 2
19-7-2018
మహేశ్వర్
18వ తారీఖున ఖజ్రానా వినాయకుని, దేవాస్ లో అమ్మవార్లను దర్శించాము. ఇవాళ నరసింహారావు గారు మమ్మల్ని మహేశ్వర్ తీసికెళ్ళారు.
మహేశ్వర్ చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఇండోర్ నుంచి 90 కి.మీ. దూరంలో నర్మదానదము ఒడ్డున ఉంది. నరసింహారావు గారి కారులో బయలుదేరాము. సన్నగా వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మహేశ్వర్ చేరేదారిలో నర్మద రెండు పాయలు దాటుకుని వెళ్తాము.
మహేశ్వర్ హోల్కార్ రాజుల రాజధాని. నర్మద ఒడ్డున ఉంది. నర్మదను ఆనుకొని పెద్ద కోట కట్టారు.
అహల్యా బాయి 1761 నుంచి 1794 వరకు పరిపాలించింది. చారిత్రకంగా గొప్ప పేరు కల రాణి.
ప్రజలను ఎంతో ఆదరంగా పాలించిన ఏలిక.
భారతదేశంలో ఔరంగజేబు, ఇతర తురుష్కులు ధ్వంసం చేసిన ఆలయములను ఎన్నింటినో పునర్నిర్మించింది. కాశీ ఆలయాన్ని పునర్నిర్మించినది
ఈవిడే. ఎంతో ప్రజారంజకంగా పరిపాలించింది. ఆ సమయంలో మిగతా భారతదేశమంతా రాజకీయంగా ఎంతో అల్లకల్లోలంగా ఉంది.
మహేశ్వర్ కోట ఎంతో బాగా కట్టారు. జలదుర్గము.
దక్షిణం వైపు నర్మద సహజ అడ్డుగా ఉండి కోటకు రక్షణగా ఉంది. లోపల అహల్యా బాయి మందిరం, ఇతర కట్టడాలు ఉన్నాయి. కోటంతా ఎంతో బాగా డిజైన్ చేశారు. అక్కడ నర్మద ఎంతో నిండుగా ఉంది. ఓంకారేశ్వర్ కి 70 కి.మీ. సముద్రం వైపు ఉంది. ప్రకృతి సౌందర్యం అలరించింది. నర్మదలో నౌకా విహారం చేశాము. ఇండోర్ వారికి, ఇతరులకు ఇది వీకెండ్ రిక్రియేషన్. రిసార్ట్ లు అవి ఉన్నాయి.
మళ్ళీ 4 గంటలకు ఇండోర్ చేరాము. ఇండోర్ లో ఛప్పన్, సరాఫా అని రెండు ఫుడ్ పాయింట్స్, జాయింట్స్ ఉన్నాయి. ఛప్పన్లో అన్ని రకాల, అన్ని ప్రాంతాల తిళ్ళు లభిస్తాయి. రోడ్ ఫుడ్ వంటిది. దుకాణాల ముందు తింటూ ఉంటారు. ఒక వీధి అటూ, ఇటూ అవే.
సరాఫా అనేది రాత్రి 11 గంటలకు మొదలై తెల్లారకట్ట 3 వరకు ఉంటుంది. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. నెయ్యితో చేసిన స్వీట్లు, హాట్లు ఇక్కడ ప్రత్యేకం. బంగారం దుకాణాలు కొట్టేసాడు వాటిలో పనిచేసేవారు మొదలు పెట్టుకున్న ఈ సాంప్రదాయం ఇండోర్ వారందరి ఫేవరెట్ ఫుడ్ పాయింట్ గా, జాయింట్ గా మారింది.
ఇండోర్ లో రోడ్డు మధ్యలో సిటీ బస్ లకు ప్రత్యేక లేన్ ఉంది. ఇది ఇంచుమించు నగరంలో ముఖ్య ప్రాంతాలను కవర్ చేస్తుంది. సిటీబస్ లకు ఇలా ప్రత్యేక మార్గం ఉండడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజలకు ఎంతో వేగవంతమైన ట్రాన్స్పోర్ట్ అందుతోంది. భోపాల్ లో కూడా ఇటువంటి వ్యవస్థ ఉందిట.
10 గంటలకు రూమ్కి చేరి విశ్రమించాము. మహేశ్వర్ సందర్శనం ఎంతో చారిత్రక అనుభూతిని మిగిల్చింది.
రేపు ఉజ్జయిని ప్రయాణం. నరసింహారావు గారి కారులో ప్రొద్దున 9 కి బయలుదేరుతాము.

హిందూత్వ కాదు విద్వన్మణిహారం; తప్పనిసరి; కవి-కవిత్వము,పనికి రానివి ; దివ్యులం;భారతదేశంలో మేధావుల వీరంగం; "సావిత్రి"

హిందూత్వ కాదు విద్వన్మణిహారం

తల్లిదండ్రులను గౌరవించడం, వారిని ఆదుకోవడం హిందూత్వ కాదు; చదువు చెప్పిన, కౌశలముల
నేర్పిన పెద్దల, గురువుల పట్ల కృతజ్ఞత హిందూత్వ
కాదు; ఇంటికొచ్చిన వారికి ఇంత అన్నం పెట్టడం
హిందూత్వ కాదు; అన్నదమ్ములు, అప్పచెళ్ళెళ్ళు
పరస్పరం కలిసి మెలిసి ఆత్మీయతలు పంచుకోవడం
హిందూత్వ కాదు; స్నేహితుల, బంధువుల ఆదరించుట హిందూత్వ కాదు; "సర్వే జనాః
సుఖినోభవంతు", "వసుధైక కుటుంబకమ్" అనడం
హిందూత్వ కాదు; ఇదంతా మానవత్వం సాంఘికం
అసతోమాసద్గమయ, తమసోమాజ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతం గమయ అనడం ఇంగితం,
జ్ఞానం; అందరు మానవులకు దోసిలిలో అమృతం
స్త్రీ పురుష కుల ప్రాంత సిద్ధాంత వాద దేశ భాషా
వివక్ష లేక అందు ఊతం; రమణీయార్థ ప్రతిపాదిక
శబ్దః కావ్యః, వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్, విశ్వ శ్రేయః కావ్య పరమార్థం - ఇవేవీ హిందూత్వ కావు
సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం పంచే
ఆణిముత్యాలు; బంగరు నగలు; రసహృదయ
ఆనందములు, అనుభూతులు సంస్కృతీ చిహ్నాలు
నాగరికతా నాడులు; సంస్కార భూయిష్టములు
ఇందులో ఉన్నది హిందూత్వ కాదు విశ్వమానవ
సౌభ్రాతృత్వం, ఉపనిషత్, ఇతిహాస, శ్రుతి, స్మృతి
పురాణముల సారం; మానవులకు విద్వన్మణిహారం
***********
తప్పనిసరి
విదేశములకు వెళ్ళుట గొప్ప మోజు మనకు
సంఘంలో గౌరవం, మర్యాద, పెద్దపీట మనకు
ఇది వరకు దేశం కాని దేశానికి వెళ్ళడం
అవయోగం క్రింద లెక్క; కష్టాలని ఉవాచ
కాల ప్రవాహంలో ఎన్నో అవయోగాలు
యోగాలౌతాయి; అవరోధాలు పూలదండ లౌతాయి
ప్రపంచంలో అంతా పరిణామ శీలమే
పొట్టకై, సుఖ సంతోషాలకై వెంపర్లాటే
మనిషికి కావలసింది సంతృప్తి
శాంతిమయ జీవితం, కుటుంబ సౌఖ్యం
ఏభై ఏళ్ళ క్రితం వరకు కూడుకి, గుడ్డకి, పైకప్పుకి
లోటు లేకపోతే శ్రీమంతం క్రింద లెక్క; ఇప్పుడు
కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆరాటం, రంధి, అసంతృప్తి; ఎంత ఆస్తి సంపాదించినా తినేది
ఆవకాయ అన్నమే; బంగారం తినం; అయినా
ధనసంపాదనకై ఉరుకులు, పరుగులు; కాకి తీరు
పనీ పాటా లేని మెట్ట వేదాంతి వట్టి మాటలు కావివి
ప్రశాంత, ఆరోగ్య జీవనమునకై పెద్దలు చెప్పిన సుద్దులు
ప్రేమ, ఆత్మీయత, అనురాగము, అనుబంధాలూ
మనుషులకు అవసరం; కాని జీవనభృతి స్వదేశంలో
దొరకక విమానముల ఎగిరి సాగరాలు దాటి
పరాయి భూముల కమతం నేడు తప్పనిసరైనది
***********
ఏ దేశంలోనైనా నాయకులు లేరు. అందరూ వి నాయకులే. కు నాయకులే.
ప్రజలు తమ తమ ధోరణులతో ప్రజా సంక్షేమం చూసే నాయకులను ఎన్నుకోవటం లేదు. తమకి వ్యక్తిగతంగా ఏదేదో చేసేస్తాం అని చెప్పిన వారి మాటలు విశ్వసించి అందరి సంక్షేమానికీ ఉపయోగించే పనులను చేయనీయకుండా నాయకులు ఐదేళ్ళూ రికామీగా గడిపేసే అవకాశం ఇస్తున్నారు.
*******
Knowledge however right and ultimate can not by itself liberate one; it must be accompanied by right action and behavior. Both right knowledge and applied action are necessary to attain salvation - ability to transcend ego - ; only one of these nourishes ego and is incapable and insufficient to liberate one.
********
చాలా మంది శాస్త్రవేత్తలు, మేధావులు, ఫేస్బుక్, వాట్సాప్ లను సమయం వృథా చేసే వాటిగా
చాలా చిన్న చూపు చూస్తారు. తమ స్థాయికి సరిపడని విషయాలుగా అనుకుంటారు.
తాము గొప్ప విషయాలపై దృష్టి పెడుతున్నామని అనుకుంటూ ఇటువంటి సామాజిక సాలెగూళ్ళను తక్కువ రకం కాలక్షేపంగా నిరసనగా చూస్తారు.
ఫేస్బుక్ లాంటి చోట అన్ని రకాల మనుషులకు చోటు ఉంది. ఎవరి సోది వాళ్ళది. అయినా సత్కాలక్షేపం.
**********
We should, of course, rejoice in our memories. If we desire to do so frequently, it is a hint that we are not comfortable with our present.
*********
కుల, మతాలు వద్దని చెప్పేవాడే తప్ప వాటిని స్వార్థానికి ఉపయోగించుకోని సంస్కర్తయే లేడు.
*********
కవి లేని దేశము దేవుడు లేని గుడి,
నీరు లేని కాసారము, కలువలు లేని సరోవరము;
ఆటపాటలు లేని ఆటస్థలము
ప్రవాహము లేని నీటి గుంట
కాపు కాయని చెట్ల గుంపు
వంపు సొంపులు లేని కన్యామణి
బాజా బజంత్రీలు లేని కల్యాణము
నట్టువాంగం లేని నాట్య ప్రదర్శనము
సంగీతము వినుపింపని నీరవ నిశీధి
యువతీయువకుల రసోద్వేగము లేని విహారము
ఆవపెట్టని పులిహోర
పెరుగులో నానని "ఆవడ"
ఇల్లాలు లేని ఇల్లు
జవసత్త్వాలుడిగిన ముదుసలి
కేరింతలు కొట్టని పాపాయి
విలువ కోల్పోయిన రూపాయి
పంట పండని బీడు
వెంటబడని యువకుడు
ఎత్తులు పల్లములు లేని నారి
ఉప్పు లేని పప్పు
కప్పు లేని నివాసము
మెప్పు లేని కాపురము
********
ఉత్తరాదిని చపాతీలు
దక్షీణాదిని ఇడ్లీ సాంబార్
తిండి అలవాట్లు
గోధుమలు, వరి ధాన్యములు;
పప్పులు ఇరువురికి సమముగా
ఆహార దినుసులు
********
కవి-కవిత్వము
దివ్య భావజాలము లేని వాడు కవి కాదు
నవ్య భావ సముచ్చయముతో వెలగని వాడు
రవి కాంచనిచో కాంచువాడు కాదు
మంచిని నమ్మి మంచిని ప్రచారము చేయువాడు కవి
చదివించి తన్మయపరచి ఆనందాబ్ధిని ముంచి తేల్చునది కవిత్వము
*********
పనికి రానివి
ఎవరి మట్టుకు వారు
తమ మతం గొప్పదని,
తమ ప్రాంతం గొప్పదని
తమ కులం గొప్పదని
తమ భాష గొప్పదని, తమ యాస
గొప్పదని, తమ సిద్ధాంతం గొప్పదని
తమ వాదం గొప్పదని
తమ నినాదం గొప్పదని,
తమ విధానం గొప్పదని
తమ సంస్కృతి గొప్పదని
ఊదరగొట్టేస్తూంటారు.
కాని ఎవరూ
తమ కులం, మతం, ప్రాంతం, వాదం, సంస్కృతి,
భాష, యాస, సిద్ధాంతం, నినాదం, విధానం
ఉపయోగించి మానవాళికి సుఖసంతోషాలు
కలిగించలేకపోతున్నారు
ఇంకెందుకీ గొప్పలు పోవడాలు?
ఒకళ్ళతో ఒకళ్ళు ముష్టీ ముష్టీ
బాహీ బాహీలతోనే సరిపోతోంది
అందరు తమ తమ సంకుచిత్వాలతో
తమ తమ గొప్ప వ్యవస్థలను
పనికిరాని వాటిగా చేసేస్తున్నారు
***********
కథల కౌగిలిలో కవితల గమ్మత్తులో
ఓలలాడు నేను మైమరచిన సాహితీ పిపాసిని
********
దివ్యులం
భాషలో అనుకుంటాం మానసిక ఘోషలో జీవిస్తాం
మనసు వాక్యముల వరుస అర్థముల స్థితి
స్ఫూర్తితో తక్కువ, ఆలోచనలతో ఎక్కువ జీవించే మనం, అర్థస్పృహ అధిగమించి తత్పర తాత్పర్య
స్థితిలో బ్రతుకలేము; శాంతి, భక్తి, మౌన, మోక్ష స్వరూపమైన ఆనంద మగ్నత పొంది తరించలేము
భాషను మించిన మౌన భాషణం నేర్చుకున్న
తస్య వాచకః ప్రణవః - రీతిలో మనం దివ్యులమౌతాం
********
Wise decision
Vijay Mallya willing to come back to India and face the law: Report
A wise decision. In India one can get bail and live a life of luxury, style and happiness at home as usual as we see many stalwarts from politicians, corporate bigwigs, government officials, other type of criminals, who are adept in doing so and enjoying their life till law is tired of taking its course and punishment may never arrive at all. Like 2G trial you may be freed also.
***********
తిట్టు కవి
కలమే ఒక అస్త్రం ఆలోచనలే శస్త్రం, కులమే కవచం
కవి యోధుడా? మహాభారతపు సుయోధనుడా?
ఆభిజాత్యం, అభిమానం ఎక్కువ పాళ్లలో కలిగి
ఇతరమును, ఇతరులను దుయ్యబట్టే వాడు
కవియా! తిట్టు కవితల అల్లు తింగరి వాడా?
తను సంఘర్షిస్తూ అందరను అస్తమానూ సంఘర్షించమనే నిత్య శ్రామికుడా? బీడు భూముల
కవితా వ్యవసాయము చేయు కర్షకుడా?
సౌమ్య వాదము వంటబట్టని ఉత్తి సామ్యవాదియా?
పుర్రచేతి భావముల పుంఖానుపుంఖాలుగా వదలు,
వదరు, నిష్కారణంగా సనాతనమును రేయి పవలు
ఆడిపోసుకొను అతి వాదియా? వాదం మాత్రం ఎఱిగి
మరేమీ తెలియని వట్టి పేచీకోరా? పెడధోరణివాడా?
నిర్మల మానసము లేని ద్వేష విద్వేషాలు మాత్రం కల
సంకుచిత మనస్కుడా? సామ్యవాది ఎవడు వాడు?
***********
భారతదేశంలో మేధావుల వీరంగం
రకరకాలుగా ఆలోచించి తమ ఆలోచనలను సంఘం మీదికి వదులుతూ ఉంటారు మేధావులు.
వీరి ఆలోచనలు స్వంతం కావచ్చు లేదా తాము చదివిన, అవగాహన చేసుకొన్న ఇతరుల ఆలోచనా స్రవంతి కావచ్చు. ఒక దిశానిర్దేశం లేని సంఘంలో ఈ మేధావులు కప్పల తక్కెడ వ్యవహారంగా ఉంటారు.
వారు చెప్పినది వీరు ఖండిస్తారు, వీరు చెప్పినది వారు ఖండిస్తారు. వారి జీవితమంతా ఖండన ముండనలతో అయిపోతుంది.
సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేసే మేధావులు తక్కువై పోతున్నారు. తమ సిద్ధాంతానికి
సరిపోలేదని అనూచానంగా వస్తున్న ఆలోచనా స్రవంతిని ఆపుజేస్తారు. దానికి సమానమైన ప్రత్యామ్నాయం చెప్పరు. చెప్పలేరు. వారి సమయము, ఇతరుల సమయము వాద ప్రతివాదములతో వృథా చేసుకుంటారు. వృథా చేస్తారు.
తాము మాట్లాడే మాటల వల్ల కలిగే కష్టనష్టాలు, సాధకబాధకాలు వారికి పట్టవు. తాము మాట్లాడాలి అంతే. బాధ్యతా రహితమైన పెద్దరికం వహిస్తారు.
ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ నాయకులతో సమానంగా మేధావులూ అశాంతి, అనర్ధం కలిగిస్తున్నారు. సామాన్యులైన ప్రజాప్రతినిధులు, పాలకులు గురించి చెప్పనక్కర్లేదు. నాయకుని చుట్టూ తిరుగుతూ చెంచా గిరీ చేస్తూ అందినంత బొక్కుతూ, వెనకేసుకుంటూ తరతరాలుగా తమవాళ్ళు "సంపన్నుల" వలె బతకడానికి సరిపడా, ఇంకా నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
అనర్హులు అన్ని రంగాల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉండి అన్ని వ్యవస్థలని, వ్యవహారాలని తమ చేతకాని తనంతో భ్రష్టు పట్టించింది చాలక వారసత్వ రాజకీయాలకు నాంది పలికి ప్రజాస్వామ్యాన్ని
కబ్జా చేశారు.
దేశ, సంఘ, ప్రజా పురోభివృద్ధి, పురోగతి పట్టించుకోక తమ అవినీతి సంపాదనలే పరమావధిగా బ్రతుకుతున్నారు.
మేధావులు, రాజకీయ నాయకులు, ఆమ్యామ్యా ఉద్యోగులు కలిసి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. మాట్లాడదాం అంటే మన కులం, మతం, ప్రాంతం పేరుచెప్పి ఎక్కడెక్కడో వెళ్లి అరిచేసి, అల్లరి చేసి నోరునొక్కేస్తున్నారు. పౌరుల్లో ఉన్న అశాంతి, అసంతృప్తి ఒకనాడు తప్పక వెల్లువ కాక మానదు.
అందరికీ మండాలి. ఇప్పుడు కొందరికే మండుతోంది.
**********
సనాతన ధర్మం, హిందూ మతం చాలా గొప్పవే; ఎటొచ్చీ వాటిని పాటించే, ఆసక్తి, శ్రద్ధ, సమర్థత, అనురాగము మాత్రం ఎవరికీ లేవు. ఎందుకీ శుష్క వచనములు? శూన్య రచనలు.
గమనించండి:
గృహస్తులు, గృహిణులు, గృహస్థాశ్రమం లేకపోతే మనం ఎవ్వరం పుట్టి ఉండేవాళ్ళం కాము. సనాతన ధర్మం గృహస్థాశ్రమం, గృహిణుల ద్వారానే శోభిస్తుంది. సనాతన ధర్మం లో సన్యాసులకు, సన్యాసానికి పెద్ద పీట లేదు. అప్పుడు సన్యాసులే లేరు. సన్యాసం బౌద్ధ, జైన సంప్రదాయాల ప్రభావం, అనుకరణ.
**********
అరవిందుల "సావిత్రి" గ్రంథాన్ని అర్థం చేసికున్నవారి కంటే ఉటంకించే వారే ఎక్కువ. అలాగే చాలా ఆధ్యాత్మిక, తత్త్వ గ్రంథాలను ఏమీ అర్థం చేసికోకుండా ఉటంకించడం ఒక కళ అయింది.
జ్ఞాన సముపార్జనము, జ్ఞానాధ్యయన, అధ్యాపనలు
ఒక ఉపాసనగా చేయాలి తప్ప ఉపాధిగా చేయకూడదు.
జ్ఞాని జ్ఞానాన్ని అర్థంచేసికున్నవాడు. సాధారణ ఉపన్యాసకుడు కబుర్లు చెప్పుకుంటూ పోయేవాడు. తన వాగాడంబరంతో ఆకర్షిస్తూ పొట్ట పోషించు కుంటాడు.
********
Indian nation has become weak and inefficient because of allowing and providing pampering to ineligible individuals in all fields of human endeavour.
******
Now a days we may come across many people who talk intelligently, emotionally, foolishly, intellectually, philosophically, spiritually but need not be interestingly, pleasantly, respectfully, lovingly and dearly.
********
It is highly mysterious and surprising why do many Indian "intellectuals" dislike Mr. Modi so much and write very bad of him.
Still surprising is they are doing so and are also critising Hindu religion which has no relation to Modi and still they don't care about it and continue their tirade against Hinduism.
Their secular spirit and credentials are so "strong" almost appearing fanatic that they do not know that they completely changed the meaning and essence of secularism.
***********
మనందరం భగవంతుని మీద ఎక్కువగా ఆధారపడుతున్నాము. పురుష/స్త్రీ ప్రయత్నం చేయడం బాగా తగ్గించేశాము.
గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీ భారం అనడంగా అధికంగా జీవితాలు వెళ్తున్నాయి. పసికూనలు, ముసలివగ్గులు దైవాధీనం బస్ సర్వీస్ లా జీవితాలను గడపాల్సి వస్తోంది. వారికి దేముడు తప్ప మరో దిక్కు లేకుండా పోయింది.
*********
ఒక వైద్యశాస్త్ర, మందుల నాడి తెలిసిన జ్ఞాని ఉవాచ:
మొండి వ్యాధులకు హొమియోపతీ మంచిది.
ఇన్ఫెక్షన్ లకి అల్లోపతీ మంచిది.
ఆయుర్వేదం మందులు తయారు చేసిన మొక్క ఏ వాతావరణ పరిస్థితుల్లో పెరిగిందో దానిని బట్టి ఆ మందు రోగనివారణ శక్తి ఉంటుంది.
*********
మనం చదివే విషయాల్లో నైర్మల్యం
ఉంటే మన మనసు నిర్మలంగా ఉంటుంది.
మనం చూసే విషయాలలో నైర్మల్యం ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది.
మనం వినే విషయాలలో నైర్మల్యం ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది.
మనం రుచి చూసే విషయాలలో నైర్మల్యం ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది.
మన అభిరుచులలో నైర్మల్యం ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది.
మనం మనసు నిర్మలంగా ఉంచుకోవాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం పరిగ్రహించే విషయాలు నిర్మలమైనవి అయి ఉండాలి.
*********
Doing anything with concentrated mind is meditation - physical or psychological.
*******
మనలో లేని ప్రతిభ మరొకరిలో ఉంటే ముచ్చట పడతాము. వారిని అభిమానిస్తూ గౌరవిస్తాము.
మరికొందరుంటారు: వీరు ప్రతిభ ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్య పడతారు. లోపల, లోపల ఏడుస్తూ ఉంటారు.

లోకో భిన్న రుచిః.
********
The ridiculous statement by a suspected corrupt small fellow commenting about another small fellow, his mentor, as a "greater" administrator than Krishna is really misusing the freedom of expression. Why these vowed atheists talk about Hindu
religion and its Divine Personalities is different to fathom.
Who asked his opinions like this and why he takes that liberty to make short of Hindu Gods? It is very irritating.


Friday, July 13, 2018

పెళ్లి; తెలుగుదనం; Passion; హిందువులు; అసాంఘిక శక్తులు

పెళ్లి
పెళ్లి చేసుకోకపోతే మీరు ఎవరికీ ఏమీ కారు. ఎవరికీ ఏమీ చెయ్యక్కరలేదు.
మీకూ ఎవరూ ఉండరు. మీకూ ఎవరూ ఏమీ చెయ్యరు.
పెళ్లి చేసుకుంటేనే అన్ని బాదర బందీలూను.
***********
Love is intuitive intimacy.
*****
తెలుగుదనం
భాగవత పద్యములను పిల్లలకు నేర్పు ఒరవడి లేదు
కృష్ణ, సుమతీ, వేమన, భాస్కర శతకములలో ఒక్క పద్యమైన నోటికి రాదు; అన్నమయ్య, రామదాసు కీర్తనలు ఉన్నట్టే తెలియదు; నన్నయ మొదలు
కరుణశ్రీ వరకు అలరించిన పద్య సౌరభాలు ఆస్వాదిస్తూ మనసును, బుద్ధిని వికసింప చేసికొనుట
తెలియదు; గురజాడ, కొడవటిగంటి, సత్యం శంకర మంచి కథలు, సాహిత్యములపై అవగాహన లేదు
కూచిపూడి నాట్యం, హంపీ శిల్ప సంపద, భగవద్గీత
బౌద్ధ జైన దర్శనములపై ఆసక్తి లేదు; వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నలలో
ఎన్నడు తానమాడలేదు; ఎవరో సినిమా వాళ్ళు
తప్ప, మరెవరూ చిత్రకారులు, సాహితీ స్రష్టలు, సాహితీ వేత్తలు, పెద్దలు తెలియరు; ఏమి ఈ
తెలుగుదనం; అంతా అయోమయం; సంస్కృతి అంతా నాయకుల, సినిమాల పాలు చేసిన తెలుగు వారికి
ఏది భాషా, సంస్కృతులపై పట్టు
అంతా ఇంటర్నెట్తో సరిపెట్టు,
స్మార్ట్ ఫోన్ వారి చేతి కంకణము
ఆధునిక నాగరికత వారి ఆభరణం
**********
Why we are inundated with biopics of celebrities, dead and alive?
Is it because of dearth of stories? Or fact is
stranger than fiction and is more salable?

*********

Passion and subtlety in feeling
Who is an established poet? Who is a popular writer? How they become that?
I am always puzzled about this and put many posts about this issue contemplating in many ways. But I am eluded of any answer. I find the works of many contemporary writers and poets substandard and as usual I wonder how they became famous.
Critics make or mar poets and writers, I feel. But readers genuinely find and recognise their favourite littératures.
Ideology adopted and spread, many times endears many a literary person to the critics.
But normal readers are enamored by the write-up and or poem by its quality.
Anyway, writing and composing verses is out of nature and goes on unhindered independent of recognition or otherwise.
Being a writer or poet is reflection of passion and subtlety in feeling within.
*******
అరవయ్యేళ్ళ తర్వాత, మనం అప్పటిదాకా ఎలా జీవించినా, ఎన్ని అందలాలు అందుకున్నా, ఎన్ని గతుకుల రోడ్లపై పయనించినా, ఎంతో జ్ఞానం, ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నా, మనసు తత్త్వ చింతనా మయం కావాలి. అవుతుంది. తత్త్వం అంటే జీవితం గురించిన ఒక పరిశీలన, అనుభవం, అవగాహన.
********
వీణ వాయించు సుందరి వీణాపాణియొ
అందమున మనసుప్పొంగించు తరుణి రమణియొ
మగవానికి మధుర భావనయైన ముదిత
రతియొ రసహారముల సుదతియొ సుందరి ఎవరో?
*******
Nitish Kumar is vacillating under secular fever again. He is now not able to decide whether he wants to sail with corruption, dynasty rule which is "secular" or sail with communal BJP with development slogan. It seems he doesn't want to give upper hand to BJP and more seats to BJP in the ensuing parliamentary elections.
********
మనం రోజూ విమర్శిస్తూనే వినోదం పొందేది ఫేస్బుక్ నుంచే!
******
హిందువులు
హిందూయిజం ఒక మతం కాదు. ఒక జీవనశైలి, జీవించే విధానం (డా. సర్వేపల్లి రాధాకృష్ణన్). జీవించాలి తప్ప శుష్కవచనములకు అక్కడ తావు లేదు.
కొన్ని పుస్తకాలు చదవడం మాత్రమే హిందూయిజం కాదు. ఆ చదువులను కూడా పక్కకు పెట్టి ఒక కుటుంబం జీవించే విధము హిందూయిజం. ఇందులో బాధ్యతలు, అనుబంధాలు, మమకారాలు, త్యాగాలు, ఒకరికొకరు కావడం ఇవన్నీ ఉంటాయి.
భగవద్గీత గురించి, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలపై ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే, సంసారులు కాని జీవులు, హిందూయిజం కి దూరంగా ఉండడం మంచిది. రికామీగా తిరిగే వారికి హిందూ మతం లో చోటు లేదు.
డేరా బాబాలు, ఆశాబాపూలు, ఇతర సాధు, సంత్ లు; వీరందరూ వీధికో కిళ్ళీకొట్టులా ఆశ్రమాలు నిర్మించి, డబ్బు, ఆస్తులు సంపాదించుకుంటూ, అన్ని నిషేధ ఆనందాలు అనుభవిస్తూ; శిష్యపరమాణువులను మానసిక బానిసలుగా తయారుచేసే కుఆధ్యాత్మిక స్వాములు, స్వామినులు. వీరెవరూ హిందూ మతానికి సంబంధించిన వారు కాదు.
కులం ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఏ భాషా మాట్లాడుతున్నా, ఏ సిద్ధాంతం అంటే ఇష్టమున్నా, ఏ ఉపజాతీయత కలిగి ఉన్నా; తల్లిదండ్రులను, గురువులను, గౌరవించడం, అతిథులను ఆదరించడం, పిల్లాపాపలను వాత్సల్యంతో చూడడం, జ్ఞాన సముపార్జన, విద్యా, కళల్లో రాణించడం, ఇతర భాషల వారిని, ఇతర మతాల వారిని, దేశాల వారిని, సంస్కృతుల, నాగరికతల వారిని "వసుధైక కుటుంబకమ్" దృష్టితో చూడడం హిందూ మతం ప్రత్యేకత. ఇందుకు విరుద్ధంగా చేసేవారు హిందువులు కారు.
కుల, ప్రాంత, భాషా, ఉపజాతీయత, సిద్ధాంత, మత భేదములతో ప్రజలను రెచ్చగొట్టే వారు హిందువులు కారు.
హిందువులు తాము జీవిస్తారు, ఇతరులను జీవించనిస్తారు.
********
నోటికి ఏం వస్తే అది మాట్లాడే స్వాతంత్ర్యం రాజకీయ నాయకులకు మాత్రమే ఉంది.
**********
దేనినైనా ఆచరిస్తే ఫలం ఉంటుంది కాని దాన్ని గురించి వ్యాసాలు, పుస్తకాలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు రాయడం వల్ల, కబుర్లు చెప్పడం వల్ల ఏ విధమైన ప్రయోజనం, ఫలము ఉండవు.
********
It is living when we live with all our passions. Our brain - reason and thinking, never allows us to be passionate. So if we follow only brain we may survive. But for living passionate heart is essential.
*******
అవ్యవస్థకు కారణం అసాంఘిక శక్తులు
పౌరులకు భయం ఉండాలి. భయం లేకపోవడం వల్లే ఇన్ని రకాల అకృత్యాలు చెయ్యడానికి వెనుదీయడం లేదు. ప్రభుత్వమన్నా, పోలీసులన్నా, న్యాయస్థానాలన్నా ఏ విధమైన భయం లేకపోవడం వల్లే ఇన్ని సంఘవిద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
అవినీతి, లంచగొండితనం, రాజకీయ నాయకుల అవ్యవస్థ, నేరస్థుల దారుణాలు, బతిమాలడం వల్ల ఆగవు. సంఘం, దేశం లకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమైన వారికి మానవ హక్కులు ఉండవు.
మనం ఎంత దారుణం చేసినా మనం శిక్షించబడం అనే నమ్మకం ఉన్నప్పుడు ప్రభుత్వమన్నా, పోలీసులన్నా, న్యాయ వ్యవస్థన్నా నిర్లక్ష్యం ఏర్పడుతుంది. భయం ఉండదు.
మనిషికి వ్యవస్థ పట్ల భయమైనా ఉండాలి లేదా భక్తి, గౌరవాలైనా ఉండాలి. ఇవి లేని మనిషి ఒక ప్రమాద కరమైన క్రూర జంతువు. విధ్వంసం సృష్టించే అసాంఘిక శక్తి.
ఇలా ఏ విధమైన భయం లేకపోవడంమే మన దేశంలోని, సంఘంలోని దారుణాలకు, అవ్యవస్థకు కారణం. దండం దశ గుణం భవేత్!
*******
Meditation is going through our daily routine with concentration.
******

Sunday, July 8, 2018

Nation and Individual; The Travails of Learning; ఏం చదవాలి, ఏం చూడాలి;ముత్యపు చిప్పలు-నత్తగుల్లలు; దైవాధీనం-విధి-అదృష్టము? వారాల అబ్బాయి; మూర్ఖులు

Nation and Individual
In the case of nation and individual, nation is supreme. Individual must respect, love and protect nation. If one is not comfortable with nation, he is free to leave the nation. He can't be a citizen of the nation and blame it too for what it is and for what it stands.
In acquiring knowledge individual is supreme to himself.
**********
The travails for learning
The main problem lies in demanding or thinking that this learning must provide livelihood. Providing livelihood is not the business of learning. This aspect educationalists themselves do not want to project. Politicians have combined job seeking as primary goal of learning through primary, secondary and tertiary levels of providing education. Most parents also mistake and demand that this schooling etc., must provide livelihood. They don't care for learning.
Such realities make education and learning much more unwanted things. Under these circumstances schooling etc., can't provide and serve society genuine learning.
When genuine learning is neither aspired nor provided, as earlier intellectuals, scholars, scientists, philosophers cannot be will not be arriving on the scene. None is ready to exchange livelihood aspirations to genuine learning. Under such circumstances genuine learning neither flourishes nor will provide circumstances for flourishing.
Learning is loved by only a few. Rest of the people do not care for learning. And most of them do not know what is learning and the beauty and ecstasy and thrill of learning.
********
మనం ఏం చదవాలి, ఏం చూడాలి, దేనిని గురించి మాట్లాడాలి, ఇవన్నీ మన చేతిలోని విషయాలు.

ఎవరో బలవంతం చేస్తే చదివినట్లు, టి.వి. ఛానెల్స్, సినిమాలు చూసినట్లు, ఎందుకు మనం మాట్లాడుతున్నాము?
చదివినది, చూసినది పదే పదే తలుచుకొని ఎందుకు బాధ పడుతున్నాము?
సాంకేతికత పెరగడం వల్ల, పెను మార్పులు రావడం వల్ల మన జీవితాల్లోకి ఎన్నో అనవసర విషయాలు చొరబడుతున్నాయి. ఆ చొరబాటును మనమే ఆపుకోవాలి.
తప్పనిసరి తద్దినంలా ఏమీ చెయ్యక్కర లేదు. ఏది చదవాలి, ఏది చూడాలి, దేనిని తెలుసుకోవాలి, దేనిని పట్టించుకోకూడదు ఇవన్నీ మన నిర్ణయాలే. ఆ నిర్ణయాలు జాగ్రత్తగా తీసి కుంటే చాలు.
మన మానసిక శాంతి పోవడానికి మనమే కారణం. మన ప్రవర్తనే కారణం. అది శ్రద్ధగా గమనిచుకోక ప్రపంచాన్ని నిందించడం, విమర్శించడాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
మన మనసులోకి ఏ సంగతులు వెళ్ళాలి, ఏవి వెళ్ళకూడదు అని అనుకొని, అక్కర్లేని వాటిని వడబొయ్యాలి. మనకి కావలసినది డికాక్షన్.
మనం కళ్ళు మూసుకుంటే పోయేదానికి, ప్రపంచం మారాలి అని తాపత్రయ పడడం, మన హడావుడిని మాత్రమే సూచిస్తుంది. ముఖ్యంగా మూర్ఖ ప్రేలాపనలను, అశాంతి కలిగించే వార్తలను, దృశ్యాలను వినకూడదు, పట్టించుకోకూడదు, చూడకూడదు.
మన ఆత్రం వల్ల ఏదీ మారదు. ఇతరుల మాటలకు, ప్రవర్తనకు మనం కారణం కాదు.
**********
Massacres happened in every "civilized" society, nation!
The massacres happened because of religions, regions, cultures, castes, ideologies. No "civilization" is an exception to this.
***********
ముత్యపు చిప్పలు-నత్తగుల్లలు 
చదువులదేముంది ఎవరైనా చదవొచ్చు;
కాని జ్ఞానం ఎందరికి కలుగుతుంది?
వంట ఎవరైనా చెయ్యొచ్చు
రుచికరంగా ఎందరు చేయగలరు?
సంగీతం ఎవరైనా నేర్చుకోవచ్చు
శ్రావ్య సంగీతం ఎందరు వినిపించగలరు?
ఎన్నికలలో ఎవరైనా పోటీ చెయ్యొచ్చు; డబ్బు విచ్చల విడిగా ఖర్చు పెట్టవట్టవచ్చు
కాని గెలిచేదెందరు? ప్రతినిధులై మంచి చేసేదెందరు?
ఉద్యోగంలో ఎవరైనా చేరవచ్చు
శ్రద్ధగా విధి నిర్వహణలో మగ్నమయ్యేదెందరు?
ప్రేమలో ఎవరైనా పడొచ్చు
ప్రేమికులయ్యేదెందరు?
మనసున మనసు కలసిన స్నేహమెందరిది?
********
దైవాధీనం-విధి-అదృష్టము?
కులాన్ని బట్టి, లింగాన్ని బట్టి, సిద్ధాంత పిపాసను బట్టి కవులను/కవయిత్రులను, రచయితలను, రచయిత్రులను కొలిచే కాలమిది.
ఆ కొలతలో ఇమడని వారు, వారూ సాహితీ స్రష్టలు అయినా వారికి పేరు ప్రఖ్యాతులు రావు. నలుగురికీ తెలియరు.
నిజానికి రచన నాణ్యత విమర్శకుని దృష్టిపై ఆధారపడి ఉంటుంది.
దానంతట దానికి ఏ రచనకూ "అసలు నాణ్యత" అంటూ ఉండదేమో! ఎవరో ఒకరి దృక్పథాన్ని బట్టే దాని బాగోగులు నిర్ణయించ బడతాయి. చర్చించి బడతాయి.
రచనలు అసలు, రచయిత దృక్పథాన్ని బట్టే రాయబడతాయి. కాకి పిల్ల కాకికి ముద్దులా ఎవరి రచనలు వారికి బాగుంటాయి. పాఠకులు, విమర్శకులు రచన వైశిష్ట్యాన్ని బేరీజు వేసే విధం, దాని ఫలితం, రచయిత దృక్పథంతో కలవచ్చు, కలవక పోవచ్చు. ఒక్కోసారి రచయితను అపార్థం చేసుకునే సావకాశమూ ఉంది.
గైడ్ సినిమాను దేవానంద్ తీసిన విధము ఆర్. కె. నారాయణ్ ను ఎంతో నిరుత్సాహానికి, కోపానికి, వ్యథకు గురిచేసింది.
రచన బతికి బట్ట కట్టడానికి, మనిషి జీవితంలో ఎదగడానికి సారూప్యత ఉంది. రచన నాణ్యతని, వ్యక్తి పురోభివృద్ధిని నిర్ణయించేది ఏది అంటే సరైన సమాధానం చెప్పలేం.
గాలి వాటం అనలేము. అదృష్టము అనలేము. గొప్పతనం అనలేము. అంతా ఏదో జరుగుతుంది.
మనం ఏదో అనుకుంటాం. అంతా దైవాధీనం.
*******
వారాల అబ్బాయి

ఓ రోజు ఓ దేవునికి
బుధవారం ఎవరికి?
కాలాతీతుడైన పరమాత్మ
కాలనిర్ణయమునకు అతీతుడా? కాదా?
వారముల ప్రకారము దేవుళ్ళు, దేవతలు
పూజలందుకొందురా?
మనమెప్పుడూ మన ఇష్టాయిష్టాలను
భగవంతునికి ఆపాదించి;
సర్వాంతర్యామిని సకల కాల నిర్ణేతను
వారములలో బంధించు ప్రయత్నము
చేయుట మన ఆర్తియే అర్ధార్ధమే, చపలత్వమే
జిజ్ఞాస సకృత్ మనకు
మూఢ నమ్మకాలు అతి;
దానికి తోడు ఆ నమ్మకములను
పెంచి పోషించే ఛానెల్స్
వాటిలోని ప్రాసంగికులు
వారి పొట్ట పోషణ వారిది
భగవంతుని అంశలను,
రూపములను పంచాంగములైన
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములకు
అనుగుణంగా అర్చించుట సబబే
కాని వారములు భగవంతునకు
నిర్ణయించి దేవదేవుని "వారాల అబ్బాయిగా
మార్చడం అంత అవసరం కాదేమో!?
*********
Many times living the poetry will bring problems, in the moral sphere.
*******
మూర్ఖులు
రామాయణం కల్పితం
నిజంగా జరగలేదు అన్న
నాస్తికులు, హేతువాదులు
రాముని నిందిస్తారు
ఇంతకీ రామాయణం జరిగిందా? లేదా?
రాముడు వ్యక్తా? పాత్రా?
తెలియని మంద మతులు
కోకొల్లలుగా ఉన్న దేశం
మూర్ఖ శిఖామణులకు
పాత్రను నిందించడం
మూర్ఖత్వం అని తెలియదు
అంతా ద్వేషం, విద్వేషం,
ఎందుకో