Wednesday, August 17, 2016

మతముల మొండితనములు, మూర్ఖత్వములు; "బడాయిలు"

మతముల మొండితనములు, మూర్ఖత్వములు

భగవంతుడెంతో భక్తుడూ అంతే కొన్ని మతములలో
భగవంతుని కన్న భక్తుడే మిన్న మరి కొన్ని మతములలో
భక్తుడెప్పుడూ భగవంతుని తో సమము కాడు, వేరే,
మరి కొన్ని మతములలో; ఇంతకూ ఏది నిజం? ఏమో!


విష్ణువు మాత్రమే దేవుడని వైష్ణవులు
శివుడు మాత్రమే దేవుడని శైవులు
అమ్మ వారు మాత్రమే దేవతని శాక్తేయులు
దేవుళ్ళు దేవతలు ఎవరూ లేరని విమతానుయాయులు

విదేశముల నుంచి దిగుమతైన మతముల
దేవుళ్ళు వేరే; కొందరు ఆకారులు, మరి కొందరు
నిరాకారులు; వారు మాత్రమే దేవుళ్ళని వారి వారి
వాదన; వివిధ మతముల వారి దైవారాధన క్రమములు

వేరు; పద్ధతులు వేరు; ప్రార్ధనా విధానము వేరు; ఎవరి
మట్టుకు వారే మొండివారు; ఇతరమేమీ వినని మూర్ఖము
సంఘంలో ఇంత గందరగోళము, రభస, గొడవ అంతా దేవుని
గురించే! ఆయన పేరు, రూపముల గురించే వాదనలు,

పట్టుదలలు; విననిచో నరకుటలు, మారణ
హోమం సృష్టించుటలు! అంతా మత మూఢత్వము;
మతమును నిర్వచించుటకు పదములే కరువు;
ఆలోచించే కొద్ది మనసులు బరువు; సుఖశాంతులు

శూన్యము; నిర్మల మానసమే దైవమని, మనశ్శాంతియే
మతము పరమార్ధమని, దివ్యుని అందరూ తమలోనే
కాంచవచ్చను మాటలు హితములు కావు; అటుల
చెప్పేవారు హితులు కారు; అంతయు మిథ్య, మాయ,

గోలగా పరిఢవిల్లుచున్నది‌ మతానుసరణము; నరుల
దివ్యుల చేయవలసిన మతములు వారిని రాక్షసులుగ,
మూర్ఖులుగ, మొండివారిగ, అనుకంపనారహితులుగ
మార్చుచున్నవి; మతమన్న ఇష్టమని, లోకో భిన్న‌ రుచిః

అని, ఇందు అందరకు స్వాతంత్ర్యము కలదని, ఒక్కడే
దేవుని తమ తమ దేవుళ్ళుగ పూజించవచ్చని, ప్రార్ధించ
వచ్చని ఎవరు చెప్పగలరు ఈ మూర్ఖులకు? తమ తమ
 మూఢత్వములతో అంతను, అంతా ఛిన్నాభిన్నం, ధ్వంసం

చేస్తున్నారని, చివరకు ఏ మతములు మిగలక, క్రూరత,
రాక్షసత్వములు ప్రపంచము నేలునని నచ్చచెప్పలేము;
అలా అని మన సుఖసంతోషములు, శాంతి,
ఆనందములను ఈ దుర్నీతులకు వదలలేము;
మేధావులందరూ ఈ మూఢత్వమునో, ఆ రాక్షసత్వమునో
వెనకేసుకొచ్చినన్నాళ్ళూ మన మనుగడ దుఃఖభరితము

 *******************

"బడాయిలు"

"స్వచ్ఛ భారత్" ఊపులో పౌరులు వీధులని, ఇతర ప్రదేశాలను శుభ్రం చేసే పనిని నెత్తినేసుకొంటే‌ అలా చేస్తూనే ఉండాలి. అంతటి సమయం, ఓపిక, నిరంతర ఉత్సాహము ఉన్నాయా, ఉంటాయా కూడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే చెత్త రోజూ పోగు పడుతూంటుంది కదా! మరి శానిటరీ వర్కర్లు, తత్సంబంధ ఇతరులు ఏమి చేస్తారు?
ప్రభుత్వము వారు "స్వచ్ఛ భారత్" సెస్ కూడా విధించారు. ఆ ధనాన్ని ఎలా వినియోగిస్తారు? పేపర్లలో చదివినట్టు ప్రతినిధులు, మంత్రులు, వారి వారు ఈ సెస్ తో చెత్త సేకరించి, తీసికెళ్ళి, ఎక్కడో పడేసే పనిముట్టులు, వాహనముల కొనుగోళ్ళ కమీషన్ లలో మునిగి తేలుతూంటారా?
పౌరులు తమ తమ జీవితాలే జీవిస్తారా, ఉద్యోగాలే చేసుకుంటారా, ఇతర వ్యక్తిగత పనులే చూసుకుంటారా?
సంఘంలో లేని శాంతిభద్రతలకై కూడ ఉద్యమిస్తారా, రక్షకభటులై?
అలవిమాలిన బాధ్యతల నెత్తినేసుకొంటే‌ అలా వేసుకుంటూనే ఉండాలి. మరి ప్రభుత్వాలు ప్రజలకోసం ఏమి చేస్తాయి, ప్రతీదీ ప్రజలే చేసికుంటే?
ఆదర్శము, ఆవేశము వేరు, వాస్తవము వేరు. ప్రభుత్వ సంస్థలు చేయవలసినవి అనే చెయ్యాలి. మన వంతు సాయం, చెత్త ఇష్టంవచ్చినట్టు పడేయకుండా, శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా జీవించాలి. మన జీవితాలు జీవించడానికే మనకు తీరిక, ఓపిక, శక్తి యుక్తులు లేవు. అస్తవ్యస్త పాలనలలో మగ్గుతున్నాము.
ఇంగితము ఉపయోగించి జీవించాలి. తోటి వాళ్ళని జీవించనివ్వాలి.
స్వచ్ఛీకరణ నిరంతర బాధ్యత.
మనసునీ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మనసు స్వచ్ఛత గురించీ‌ శ్రద్ధాసక్తులు ఉండాలి. మనసు స్వచ్ఛమైతే అన్ని స్వచ్ఛతలు అవే కలుగుతాయి.
ఫొటోలు దిగడం కోసం, చప్పట్లు కొట్టించుకోవడం కోసం, సంఘంలో వేలం వెఱ్ఱిని పంచుకోవడం కోసం జీవించలేము. ఈ ఊపులన్నీ తాత్కాలికములు. ప్రభుత్వాలు వాటి పని అవి చేసేలా చూస్తే పుణ్యము, పురుషార్ధము. మిగతావన్నీ బడాయిలు.
కుక్క పని గాడిద చేయరాదు. చేసినా ప్రయోజనముండదు.

No comments:

Post a Comment