Thursday, August 11, 2016

పెద్దల ఆత్మానుభవములు - శ్రీ రామకృష్ణ పరమహంస: శ్రీ అరవిందులు: శ్రీ జిడ్డు కృష్ణ మూర్తి: శ్రీ రమణ మహర్షి:

పెద్దల ఆత్మానుభవములు

ఆత్మ, బ్రహ్మముల ప్రతిపాదన, ఆత్మానుభవము, బ్రహ్మానుభవము భారతదేశమునకు ఉపనిషత్ స్రష్టలొసగిన జ్ఞానానుభవభాండాగారము. ఇతర దేశముల లోను ఇవే స్థితులు అనుభవింపబడినా, ఇంత పకడ్బందీగా ఆత్మ/బ్రహ్మ జ్ఞానములను గ్రంథీకరించడము, ఇంత విరివిగా, విశదము గా అవగాహన పంచడము జరగలేదు. ఈ వ్యాసములో శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ అరవిందులు, శ్రీ జిడ్డు కృష్ణ మూర్తి, శ్రీ రమణమహర్షుల ఆత్మానుభవముల గురించి స్పృశించడం జరుగుతుంది.

పైన ఉదహరించిన ఈ జ్ఞానుల ఆత్మ/బ్రహ్మా/జ్ఞానానుభవములలో తేడాలున్నట్టు పైకి అనిపించినా/కనిపించినా, వారు ఉపయోగించిన పదములు వేరైనా ఆ అనుభవసారములు మాత్రము ఒకటే. ఇక్కడ జ్ఞానానుభవములు జరిగిన తీరును వివరించడం మాత్రమే జరుగుతుంది. తారతమ్య పరిశీలన చేయబడదు. నిజానికి వారుపయోగించిన పదముల సాంకేతిక మాత్రమే.

పోల్చగలిగినది. అనుభవములు సమమే. ఒకటే. వారి వారి ముందటి జీవితపు స్పర్శలు, వారి వారి జ్ఞానపథగమనము పై ప్రభావము ను కలిగి ఉన్నాయి. అందరిదీ అద్వైతానుభవమే.
ఉపనిషత్తులు:

ఈశ, కేన, మాండూక్య, ముండక మొదలైన ఉపనిషత్ సారమే ఆత్మ / బ్రహ్మ జ్ఞానముగా సమీకరింపబడినది. ఇది అందరు మనుషులకు కలిగే అనుభవమే. ఇది జనుల భేద భావములైన మత, భాష, సంస్కృతీ, ప్రాంత, దేశ, కుల, లింగములకు అతీతమైన దివ్యానుభవము. ప్రస్థాన త్రయము వివిధ దృష్టులతో వ్యాఖ్యానింప బడినను,‌ అవి అందించే తత్పరత‌, తత్త్వము ఒకటే.

శ్రీ రామకృష్ణ పరమహంస:

వీరిది భక్తి, జ్ఞాన మార్గముల‌ కలయిక. కాళికాదేవి ప్రత్యక్షం అవడం ఈయన అనుభవము. ఈయన ఉపదేశములు చిన్ని చిన్ని కథలరూపంలో అద్వైత తత్త్వాన్నే అందిస్తాయి.
ఈయన మాటలు ఉపనిషత్ జ్ఞానానుభవసారములు. వ్యక్తిత్వము ను పూర్తిగా పరమాత్మ స్థితిలో లీనము చేసిన జీవన్ ముక్తులు.

శ్రీ అరవిందులు:

ఈయన ముందటి జీవితములో నిపుణుడైన అధికారి. గొప్ప పండితులు. భాషా వేత్త. దుర్గాదేవి ఉపాసకులు. విప్లవోద్యమంలో చేరి కటకటాలలో నున్నప్పుడు ఈయనకు చెరసాలలో నారాయణ దర్శనము అయింది. విడుదలైన తరువాత జ్ఞాన పిపాస ఎక్కువై జిజ్ఞాసువుగా పాండిచేరి చేరి అక్కడ ముని అయ్యారు. ఆయన అనుభవసారము ఉపనిషత్ ప్రతిపాదితమే. ఉపయోగించిన సాంకేతిక పదములు వేరైనా వాటి సారము అద్వైతమే.

శ్రీ జిడ్డు కృష్ణ మూర్తి:

ఈయన తల్లిదండ్రులకు ఎనిమిది వ సంతానము గా జన్మించారు. అందుకనే కృష్ణ మూర్తి నాధేయులయ్యారు.
ఈయన థియొసాఫికల్ సొసైటీ పర్యవేక్షణలో భావి విశ్వగురువులుగా ప్రకటింపబడడానికి గుర్తింపబడతారు, శిక్షణ పొందారు. థియొసాఫికల్ సొసైటీ అనుయాయులు విశ్వగురుపీఠం ఈయన అధిరోహించే దివ్యక్షణములకై ఎంతో భక్తి తో ఎదురు చూస్తూండే వారు. ఇలా విశ్వగురువులుగా ఆయనను తయారుచేస్తున్న సమయంలో ఆయనకు ఎంతో మానసిక వేదన, వ్యథ ఉండేవి. యాంత్రికంగా ఆ శిక్షణ‌ పొందుతూండేవారు. ఆయన తమ్ముడు నిత్య కూడ ఆయనతో ఈ ఆధ్యాత్మిక శిక్షణ పొందుతూండేవారు వాడు. కాని తీవ్ర అనారోగ్యము తో బాధపడుతూండేవాడు.
అప్పటికి కృష్ణ మూర్తి పారిస్, ఇతర యూరోపియన్ దేశముల లో, ఆస్ట్రేలియాలో పర్యటనలు చేస్తూ, ఉపన్యాసములనిస్తూ, కరపత్రములను ప్రకటించుచు తన గురు పదమును అధిష్ఠించడానికి సమాయత్తమవుతూ ఉండేవారు.

ఆ సమయంలో సొసైటీ వారు అమెరికాలో ఒక ఆస్తిని కొన్నారు.

ఇంతలో ఆయన ఆత్మీయ అనుజుడు నిత్య అనారోగ్యము తో మరణిస్తాడు. అప్పుడు కృష్ణ మూర్తి ఎంతో అంతరంగ మథనానికి లోనవుతూండేవాడు. అమెరికాలోని విశాలమైన తమ ఆశ్రమంలో పైన్ వృక్షము‌ క్రింద ధ్యానగతుడు అవుతూండేవాడు. ఒకరోజు బుద్ధునికి బోధి వృక్షము క్రింద జ్ఞానసిద్ధి కలిగినట్టు కృష్ణ మూర్తి కి దివ్యానుభవము కలుగుతుంది. ఇది ఉపనిషదనుభవ సదృశము.

హాలెండ్ లో విశ్వగురువులుగా ప్రకటించబడే సమయంలో ఇచ్చే సందేశంలో థియొసాఫికల్ సొసైటీ వారు శిక్షణ ఇచ్చిన విషయము కాక తన స్వంత బోధన చేస్తాడు. గురువు, శిష్యుడు అనేవారు లేరని, తత్త్వము pathless island అనీ, ఎవరి మట్టుకు వారే సత్యాన్వేషణ చేయాలని ఉపన్యాసమిస్తాడు. ఇది విని థియొసాఫికల్ సొసైటీ అనుయాయులు హతాశులౌతారు. భగ్న హృదయులవుతారు. కాని కృష్ణ మూర్తి లెక్కచేయడు. థియొసాఫికల్ సొసైటీ తో తెగతెంపులు అవుతాయి.

ఈయన అనుభవమూ అద్వైతమే. ఉపనిషత్తులు దేనినైతే అజ్ఞానము అన్నాయో, దానిని ఈయన mental conditioning అన్నారు. కృష్ణ మూర్తి బోధనల సారము ఆత్మ సారమే. తాను స్వంతము గా, ఉపనిషత్ బోధనల వినక పోయినా అదే తత్త్వ సారాన్ని స్వతంత్రముగ అనుభవించి బోధించాడు.

శ్రీ రమణ మహర్షి:

బ్రహ్మము అనే పదాన్ని వినకుండానే బ్రహ్మానుభవము పొందిన దివ్యమనీషి. మదురైలో తన ప్రయత్నమేమీ లేకుండానే ఆత్మానుభవమును పొంది అరుణాచలమొచ్చి అరుణాచలేశ్వరునిలో వ్యక్తిత్వ విలీనము చేసిన కారణ జన్ములు రమణులు. ఉపనిషత్ సారాన్ని వహించి జీవించిన జ్ఞానవరిష్టులు.

ఋభుగీత, ఇతర జ్ఞానసముచ్చయములలో వివరించిన జ్ఞాని స్థితిని పొంది, జ్ఞానిగా వసించిన మహర్షి రమణులు.
ఏ తత్త్వము, అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత, శివాద్వైత, శాక్తాద్వైత ప్రభృతములు దృష్టిలో లేని విశ్రాంత దృష్టియే ఆత్మానుభవము, బ్రహ్మానుభవము అని నిర్ద్వందముగా ప్రకటించుచు జీవించిన బ్రహ్మర్షి.

ఈయన మదురై రోజులలో శివుని తండ్రిగా తలచేవారు. చిన్నగా భక్తితో మొదలై జ్ఞానత్రివిక్రముడైన దార్శనికుడు.
అరువది నాలుగవ నాయనమార్. అభినవ సుందరమూర్తి నాయనమార్.

ఈయన జీవితము, ఉపదేశములు, కృతులు, మాటలు, చేతలు, అద్వైత వేదాంతానికి అనుసరణలు. ఆచరణలు.

ఇలా ఇందరు మహానుభావులు పొందిన అనుభవములు వేరుగా కనిపిస్తున్నా, అనిపిస్తున్నా, వారి బోధనల, జీవనశైలుల సారము, తాత్పర్యము ఒకటే. సమమే.

ఏతత్సర్వమ్ పరబ్రహ్మార్పణమస్తు!
సమస్త సన్మంగళాని భవంతు!
శ్రీరస్తు! శుభమస్తు! భగవదనుగ్రహ ప్రాప్తిరస్తు!

No comments:

Post a Comment