Monday, July 25, 2016

సగుణ - నిర్గుణ భక్త్యుపాసనలు

సగుణ - నిర్గుణ భక్త్యుపాసనలు


నేను ఎవరు అనుకోగానే మౌనం సమాధానంగా వస్తే మన మనసు నిర్మలంగా ఉన్నట్టు లెక్క.

ఊపిరి సలపని విధంగా వ్యక్తి గురించిన తలపులు ముసురుకుంటే మన మనసు విషయ, విషయానుభవ భరితమై నేను ఫలానా అనే సుడిగుండంలో త్రిప్ప బడుతున్నట్టు, తిప్పలు పడుతున్నట్టు లెక్క.

"నేను" ని సరియైన విధముగా అన్వయించుకోవడం ఆధ్యాత్మిక పరిణితికి చిహ్నము.
లేదా ప్రపంచాన్ని భగవన్మయం చేసికోవడమూ ఆధ్యాత్మిక పురోగతికి సాధనము.

మనకు నేను, ప్రపంచం (ఆంతర మానసిక ప్రపంచం) అనేవి ప్రజ్ఞానము రెండుగా విభజింబడినప్పడు కలిగే స్పృహ. త్రిపుటీ జననము జరుగుతుంది. జ్ఞాత-జ్ఞానము-జ్ఞేయము; ధ్యాత-ధ్యానము-ధ్యేయము; కర్త-క్రియ-కర్మ - ఇత్యాది త్రిపుటులు. మనము నిర్మల మానసిక స్థితియైన అద్వైత స్థితియైన భక్తి స్థితి నుంచి మానసికముగా ద్వైత స్థితికి, మానసిక కార్యకలాప నిర్వహణా స్థితికి మారతాము.

ప్రపంచం అంటే విషయ, విషయానుభవ సమాహారమైన ఆంతరిక ప్రపంచం. ఇది బయటి భౌతిక ప్రపంచము కాదు. ఆ బయటి భౌతిక ప్రపంచము జ్ఞానేంద్రియముల ద్వారా మనసు సాయముతో గ్రహించబడి మస్తిష్కంపై వేసిన దృశ్య, శబ్ద, రుచి, వాసనల - పరిమళములు, అన్ని రకముల ఘ్రాణముల, స్పర్శల ఆంతర ముద్రలు.
మన మనస్తత్త్వము‌ను బట్టి, మన బుద్ధి నైశిత్యాన్ని బట్టి మనం నేనుని గాని, ప్రపంచాన్ని గాని మార్చుకుంటాము.
నేనుని మార్చుకుంటే నిర్గుణోపాసన.

ప్రపంచాన్ని మార్చుకుంటే సగుణోపాసన.

నేను మారినా, ప్రపంచం మారినా మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము.
గుణము అంటే ముడి. (ఆంతరిక) ప్రపంచంతో ఏ ముడీ లేకుండా‌ జ్ఞాన మార్గములో "నేను" నకు శుద్ధ గమనికగా, శుద్దాహం గా అన్వయం జరిగితే మనం ప్రపంచాన్ని గమనిస్తూ, ప్రపంచానికి అతీతంగా వ్యవహరిస్తాము. ప్రపంచాన్ని గణిష్తూ అదీ, వ్యక్తిత్వము కలిసి కలిగించే సుఖదుఃఖములను లెక్క చేయక కాని, దివ్యులమై భరిస్తూ కాని, ‌సదా సదానుభవులమై ఉంటాము.

జ్ఞానేంద్రియములు, మనసు సాయంతో మన మానసిక ప్రపంచాన్ని మార్చుకుంటాము. క్రొత్తగా ఇలా ఏర్పరచుకున్న ఈ భగవత్ ప్రపంచం ఇదివరకటి, చిన్నప్పటినుంచీ మన వ్యక్తిత్వ స్పృహతో ఏర్పడిన విషయ ప్రపంచంపై దిద్దుడు. దిద్దుబాటు. పాత విషయ, విషయానుభవ సముచ్చయమైన భౌతిక ప్రపంచ దృశ్య, శబ్ద, రుచి, వాసనల - పరిమళములు, అన్ని రకముల ఘ్రాణముల, స్పర్శల ముద్రలపై ఈ నూతన దివ్య ముద్రలు పైరాతలు (over-writing as in the case of new information recorded on a disc gets recorded over the older earlier information and becomes the only available information).

ముకుందమాలలో కులశేఖర్ ఆళ్వారులు జ్ఞాన, కర్మేంద్రియములద్వారా ఆంతర ప్రపంచాన్ని ఎలా మార్చుకేవచ్చో ఇలా తెలిపారు.

జిహ్వే కీర్తయ కేశవం! మురరిపుం చేతోభజ!
శ్రీధరం పాణిద్వద్వం సమర్చ! యాచ్యుత కథాః
శ్రోత్రద్వయం త్వం శ్రుణు! కృష్ణ లోకయ లోచన ద్వయే
హరేర్గ్ఛాంఘ్రియుగ్మాలయమ్ జిఘ్ర ఘ్రాణ పాద
తులసీం మూర్ధ నమాధోక్షజమ్

అని జ్ఞాన, కర్మేంద్రియములు, మనసు సాయముతో అంతర ప్రపంచం మార్చుకునే ఉపాయం చెప్పారు.

మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథకర్ణన విధౌ
తవధ్యానే బుద్ధి ర్నయన యగళం మూర్తివిభవే
వరగ్రంథాన్ కై ర్వా పరమశివ జానే పరమత:

అని శివానందలహరిలో శ్రీ శంకరులూ అదే చెప్పారు.

మన ఇష్టదైవం ఏదైతే ఆ మూర్తిని, నామమును అలా తత్సంబంధ అర్చన, ధ్యానాదులు చేయాలి. అప్పడు భగవత్ చరిత్ర మన విషయ ప్రపంచంపై రాయబడి మనకు ఎల్లప్పుడూ భగవత్ సంబంధ భావములే వస్తాయి. మనసే ఆంతర ప్రపంచం నుంచి విషయ గ్రహణం చేస్తే భావములు కలుగుతాయి. భగవత్ సంబంధ విషయములతో అంతవరకు ఉన్న లౌకిక విషయములను తొలగించి ఈ భగవత్ సంబంధ విషయములే ఆంతర ప్రపంచంగా స్థిర పడడం సగుణ భక్తి ఉపాసనా విధానము. ఫలము. విశిష్టాద్వైతము, ద్వైతము, శాక్తాద్వైతము ఇక్కడకు తీసికొని వచ్చి ఆగిపోతాయి.

మరింత ఆసక్తి, ప్రజ్ఞ కలవారు ఆ భగవత్ ప్రపంచాన్ని కూడ దృష్టి లోనికి రానీయక విశ్రాంత దృష్టితో భగవంతులై ఉంటారు. ఇది అద్వైతము. రెండు కానిది. నేను, ప్రపంచం అని రెండుగా ఆనని త్రిపుటీ రహిత శుద్ధజ్ఞాన స్థితి. ఇది నిర్గుణ భక్తి.

ఈ నిర్గుణ భక్త్యుపాసనలో నేను ని మార్చుకుంటూ ప్రపంచాన్ని లెక్కచేయము. దృష్టిలోనికి రానీయము. అహమ్ బ్రహ్మా "అస్తి" - అవుతుంది. వ్యక్తిత్వ రహితమైన శుద్ధ గమనిక, ప్రజ్ఞానము దృష్టి అవుతుంది. మనం శుద్ధహం రూపంగా వెలసి వెలుగుతూంటాము.

సగుణ భక్త్యుపాసనలో ప్రపంచాన్నిమార్చుకుంటే మనకు ఎల్లప్పుడూ ఇష్టదైవ స్మరణంలో, అర్చనలో, ధ్యానములోదివ్యభావనలే కలుగుతూంటాయి. భగవన్మయమైన ప్రపంచంలో ఇష్టదైవమై వెలుగుతాము.
భక్తి తు అస్మిన్ పరమప్రేమ రూపా - అనేది మన మానసిక ప్రపంచం మారడానికి సహాయపడుతుంది. ఇది సగుణ భక్తి.

భక్తిః తు స్వస్వరూపానుసంధానం - అయినప్పుడు నేను మారుతుంది. ఇదీ నిర్గుణ భక్తి.

చిత్తవృత్తి నిరోధః యోగః అన్న యోగము,

చేతోవృత్తిః ఉపేత్య తిష్ఠతి సా భక్తిః ఇతి ఉచ్యతే

అనే భక్తి ఒకే మార్గాన్ని సూచిస్తున్నాయి.

ఏ మార్గమైనా ఆంతర ప్రపంచాన్ని మార్చుకోవడమో, దృష్టిలోనికి రాకుండా చేసికోవడమో చేస్తాయి. మన మన తత్త్వాన్ని‌బట్టి, మనస్తత్త్వన్ని బట్టి, ప్రవృత్తిని బట్టి మార్గానుసరణము జరుగుతుంది.
అన్ని మార్గములు సమానముగా వంద్యనీయములే, అనుసరణీయములే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే వారు ఆధ్యాత్మిక పరిణితి లేనివారు. తమ మార్గమే అత్యుత్తమము అని వాదించే మొండివారు. పసివారు. వీరి సంకుచిత మత ప్రచారము (cult affiliations) ఆధ్యాత్మకోన్నతికి పథము కాదు.

మనకు ఇష్టమైన మార్గమును అనుసరించి, ఇతర మార్గములను తూలనాడక, వాటికి సముచిత గౌరవాన్ని ఇస్తూ తరింతుముగాక!

శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగళాని భవంతు!

భగవత్ ప్రీతిరస్తు! పరమాత్మానుసంధాన ప్రాప్తిరస్తు!

సర్వే జనాః సుఖినో భవంతు!

No comments:

Post a Comment