Thursday, February 5, 2015

మా తుళ్ళూరు యాత్ర (వ్యాసము)





మా తుళ్ళూరు యాత్ర


తుళ్ళూరు ఊరు గురించి తెలుగు వారికి, అదే ఆంధ్రులకి, ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. వార్తాపత్రికల్లో, టివీల్లో ఆ పేరు ఊదరగొట్టేస్తున్నారు. అంచేత తుళ్ళూరు అందరూ విన్న ఊరే. ఎక్కడ ఉందో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఇంతటి పేరు మోసిన తుళ్ళూరు ఊరుని సందర్శించడానికి మేము - నేను, మా ఆవిడా పాండిచేరి నుంచి బయలుదేరలేదు.
ఈ మధ్య అన్ని రాజకీయ పార్టీలు కూడబలుక్కొని చీల్చిన ఆంధ్రరాష్ట్రపు ముక్క రాజధానీ నగరం తుళ్ళూరు చుట్టుపక్కల నిర్మించడానికి ముఖ్యమంత్రి పెద్ద ప్రయత్నం చేస్తూ, తను వింతగా హడావుడి పడుతూ, అందర్నీ హడావుడి పెడుతున్నాడని మాత్రం పాండిచేరి నుంచి బయలుదేరే ముందు చదివాను.
నవంబరు చివరివారంలో ఒక ISKCON అంతర్జాతీయ సదస్సులో ఉపనిషత్తులు- జ్ఞానబోధా మీమాంసా దృక్పథమువిషయముపై నా పరిశోధనా పత్రాన్ని సమర్పించడానికి విజయవాడ చేరుకున్నాము. నిర్వాహకులు ఒక హొటల్ లో మా బస ఏర్పాటు చేశారు. మరునాడు సదస్సు ప్రారంభం అవుతుంది. ఒక రోజు ముందుగా వచ్చేశాము. అంచేత ముందురోజు ఖాళీ. సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు చదివినప్పటినుంచీ నాకు సత్యంగారితోటి, అమరావతితోటి అవినాభావ సంబంధం ఏర్పడింది. అమరావతి అన్నా, సత్యంగారి అమరావతి కథలన్నా ఎంతో మక్కువ. అమరావతి చూడాలనీ, అక్కడి కృష్ణానది సోయగాలు చూడాలనీ, అమరేశ్వరుణ్ణీ, బాల చాముండేశ్వరీ దేవిని దర్శించుకోవాలనీ ఉత్సుకత, అభీష్టమూను.
ఇంతవరకు వీలు కాలేదు. ఎన్నోసార్లు విజయవాడ వెళ్ళడం అక్కడ స్నేహితులతో రెండు మూడు ఉండి గడపడం, అమరావతి వెళ్ళాలనుకుంటూ వెళ్ళలేకపోవడం ఎన్నోసార్లు జరిగింది. అలాగే గుంటూరు అంతర్జాతీయ కవుల సమ్మేళనానికి నాలుగైదు సార్లు వెళ్ళినప్పుడూ కుదరలేదు.
శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. శివాజ్ఞ అయినట్టుంది, సారి తప్పక దర్శించుకోవాలనే దృఢ నిశ్చయంతో పుణ్యము, పురుషార్ధము కలిసొచ్చేలా చేసుకందామనీ ఒక రోజు ముందరగా విజయవాడ చేరాము. అంచేత అమరావతి వెళ్ళడానికీ, దారిలో ఉండవల్లి గుహలు, మంగళగిరీ కలుపుకొని రానూ, పోనూ అమరారామానికి (అమరావతికి) టాక్సీ మాట్లాడుకొని ఉదయమే బయలుదేరాము.
(అమరావతిలోని అమరారామము, మా ఊరే అయిన భీమవరంలో సోమారామము, మా పక్కనే ఉన్న ఊరు పాలకొల్లులో క్షీరారామము, మా పక్క జిల్లా తూర్పు గోదావరిలో దాక్షారామంలో దాక్షారామము, కాకినాడ పక్కన సామర్లకోటలో కుమారారామము అని పంచారామ క్షేత్రములు ఉన్నాయి. ఈ ఐదు క్షేత్రములను తప్పక సందర్శించాలని చాలామంది ఆంధ్రులు అనుకుంటారు.)
ఉండవల్లి గుహలు, గుహలనుంచి క్రింది ప్రకృతి సౌందర్యము చూసి ఆనందించి మంగళగిరి వెళ్ళాము. లక్ష్మీ నరసింహస్వామిని, రాజ్యలక్ష్మీ దేవిని దర్శించుకొని, పానకము తాగి అమరావతికి బయలుదేరాము. మంగళగిరి క్రింద నరసింహస్వామిని దేవేరితో దర్శించుకొని అమరావతి రోడ్డెక్కాము. పచ్చని పంట పొలాల మధ్య కారు వెడుతూంటే ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణిస్తున్నాను.
బంగరు వరిచేలు, ధాన్యాన్ని వహించి మన అన్నదాతలై విరాజిల్లుతున్నాయి. నేను పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాడిని కాబట్టి నాకు పంటకాలవలు, వరిచేలు నెచ్చెలులు. ఆ ప్రకృతి సౌందర్య వీక్షణంలో ఎంతో ఆనందం కలిగింది
*తరుణ రమణుల వరుసల సోయగములు చిందిస్తూ అరటి తోటలూ; గులాబులను, పువ్వులను కలిగిన పూలతోటలూ; ఇతర ప్రకృతి దృశ్యాలు;
*ఏరులు, లోతైన చెరువులు;
*వాటిలో నిర్మలమైన నీళ్ళు;
*పరిణితి చెందిన హృదయముల పోలు పసుపు చేలు; భక్తిపరులు పక్వ మనమును పోలిన పసుపుదనాలు;
*పెద్దల మనముల వలె ఉన్నతములైన నారికేళ వృక్షములు;
*మన బచ్చలి కూరకు అమితమైన రుచినిచ్చే కంద తోటలు;
*అందమైన యువతుల అధర సుధారసమును వహించిన చెరకుల తోటలు;
*వయసు వచ్చీరాని కన్నెల వలె పూచీ పూయని మామిడి చెట్లు;
*ఎన్నో రకముల కూరగాయ తోటలు


పచ్చదనం రూపుగొని శ్యామలా దేవి ఆనంద తాండవము చేస్తోంది
ఇవన్నీ చూస్తూ నేను ఒక దివ్య రసలోకంలో విహరిస్తున్నాను.
ఇలా ప్రకృతి అంతా కనువిందు చేస్తున్న వేళ కారు అన్ని పల్లెటూళ్ళను దాటి ఒక ఊరి మీదుగా వెళుతోంది. అక్కడ డ్రైవరు కారు నెమ్మదిగా నడపాల్సి వచ్చింది. ఇంతలో నేను ఇహ లోకంలోనికి వచ్చాను. అక్కడ తీర్థ ప్రజ. ఇక్కడ ఇవాళ ఏమయినా తీర్థమా అని డ్రైవరును అడిగాను.
తీర్థమేంటండీ బాబు. అది సబ్-రిజిస్ట్రారు ఆఫీసు. ఈళ్ళందరూ పొలాల రిజిస్ట్రేషన్ కి వచ్చిన రైతులు, దళారులూ నండీ. సిబిఎన్ పుణ్యమా అని ఇష్టం ఉన్నా లేకున్నా ఈ రైతులందరూ యవసాయం గంగలో కలుపుకుని ఎకరం కోటి, కోటిన్నరకి అమ్మేస్తున్నారండి.
అప్పుడు స్పృహలోకి వచ్చి నేను ఇది తుళ్ళూరాఅన్నాను.
మంగళగిరి కింద గవర్నమెంటు స్థలాలే, ఎన్ని ఎకరాలు కావలిస్తే అన్ని ఎకరాలున్నాయండి. కృష్ణా నది ఒడ్డమ్మట కిందకి అన్నీ పోరంబోకు బంజరు బూమండి. ఈడికి ఈ పంటచేల మీద ఎందుకు పడిందోనండి కన్ను. పార్టీ పెద్దోళ్ళకి సానా మందికి ఇక్కడ బూములున్నాయండి. దానికోసవండి ఈ ఏడుపంతా. పంటలు పండే సారవంతమైన బూములన్నీ ధొంసం సేసేస్తన్నాడండి.
ప్రతి గ్రామం లోనూ రియల్ ఎస్టేటు వ్యాపారం బోర్డులు కనిపించాయి. నాకూ మనసు ఒక సారి ఖేద పడింది; ఇంతటి అందమూ, పచ్చదనమూ ఒకటి రెండేళ్ళల్లో మాయమైపోతాయనుకునే సరికి. రోబోట్ లు కాకుండా ప్రకృతి సౌందర్య పిపాసులు రాజకీయాల్లో ఉంటే బాగుండును కదా అని ఎంతో అనిపించింది. ఎన్నిక అయ్యే వరకు ఒక ఎజండా. ఎన్నికయ్యాక స్వంత ఎజండా. రాజకీయనాయకులు దేనినుంచైనా లబ్ధి పొందగల చాణక్యులు.
నెమ్మదిగా అమరావతి చేరాము. పంచారామ క్షేత్రమైన అమరారామంలో కృష్ణమ్మ సొగసులు, నది ఒడ్డున అందగించిన బాల చాముండీ సమేత అమరేశ్వరుణ్ణి దర్శించుకొని, సత్యం శంకరమంచి గారికి మనసా ప్రణమిల్లి, ఆయన కథలలో ప్రతిఫలించిన అమరావతిని, కృష్ణవేణిని తనివిదీరా చూసుకొని, కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వెళ్ళాము. అక్కడ తల్లి దర్శనంతో మనసు నెమ్మదిని చెంది తల్లి కరుణతో కనక దుర్గమ్మపై ఒక కవితని వెలయించింది. నేను కృతార్ధుణ్ణి అయ్యాను. ఆ సంస్కృత కవిత క్రింద ఇస్తున్నాను.
శ్రీ కనకదుర్గా స్తవమ్ డా. వారణాసి రామబ్రహ్మం
ఆత్మనా దర్శయామి మనసా భజామి
బుద్ధ్యా జానామి చిత్తేన స్మరామి
ఆనందరూపిణ్యామ్ కనకదుర్గాయామ్
లీనం కరోమి మిథ్యాహం మమత్వం చ
శ్రీ దేవీ ప్రీతివృద్ధయే ఉపాసయామి
మహాదేవీం త్రిపురసుందరీం శారదామ్
ప్రసన్నదృష్టియుతాం శివ కామేశ్వరీమ్
సుస్థిర అనన్య భక్తి ప్రదాత్రీం భవానీం శ్రియమ్
తటిల్లతా తన్వీం దరహాసోజ్వలన్ ముఖీం
కృష్ణా నదీ తటస్థ ఇంద్రకీలాద్రి ఇంద్రాణీమ్
శివమనోవల్లరీం మల్లేశ్వర ప్రణయిణీమ్
విమలాం విజయవాటికా పురాధీశ్వరీమ్
సమస్త సన్మంగళాని భవంతు!
Top of Form

Bottom of Form

No comments:

Post a Comment