నేను - అద్వైతము - మాయ - ద్వైతము డా. వారణాసి రామబ్రహ్మం
పరమాత్మ స్థితి - జీవ స్థితి
"నేను"
అనుకోగానే ఏవిధమైన భావములు కలగకపోతే అప్పుడు మనము అసలు నేను అన్నమాట.
"నేను" అనుకోగానే ఎన్నో తలపులు జోరీగల్లగా మనస్సుని చుట్టుముడితే మనము జీవ
స్థితిలో ఉన్నట్టు లెక్క. ఈ స్థితిని ద్వైత స్థితి అంటారు. భావములు ఏమీ
కలగని స్థితిని అద్వైత స్థితి అంటారు. ఆత్మయే అసలు నేను. అనుభవములు,
తలపులు, ఉచ్చారణలు దృష్టిలో లేని విశ్రాంత దృష్టి అయిన వట్టి గమనిక మాత్రమే
ఆత్మ. అలా వట్టి గమనిక మాత్రమే అసలు నేను.
ద్వైతస్థితి లోని "అబద్ధపు నేను" అసలు నేను పైని ఆనింపు. ఇది
మిథ్య. అంటే ఒకసారి ఉంటుంది మరుక్షణం మాయ మౌతుంది; మాయ అవుతుంది. అలాగే ఈ
అబద్ధపు నేను స్పృహ కలగడానికి కారణమైన, మేధలో ఆత్మ (చిత్) శక్తి యొక్క
ప్రతిఫలనము అయినది మాయ (- చిదాభాస - చిత్ శక్తి మిథ్యా ప్రతిఫలనము); (యా
మా సా మాయా - ఏది లేనిదో లేక మిథ్య అయినదో అది మాయ).
కాని మాయ మనకి ఏంతో ఉపయోగించే మానసిక శక్తి. మన అహంకార, మమకారయుత
వ్యక్తిత్వ స్థితికి, తద్వారా కలిగే తదితర అనుభవములకు, వాటి సేకరణ,
జ్ఞాపకములుగా భద్రపరచుటకు, తిరిగి దృష్టి లోకి తేవడానికి
(ప్రేరేపించడానికి) కారణమైనది కూడా మాయే. మాయ అనగానే ఏదో ఇంద్రజాలము మన
దృష్టి కి వస్స్తుంది. కాని కాదు. "యయా అసన్తమ్ పశ్యన్తి సా మాయా" -- దేని
ద్వారా ఈ బయటి ప్రపంచాన్ని, దాని మెదడులో ప్రతిరూపమైన ప్రపంచాన్ని
సృష్టించడానికి, తిరిగి భావములుగా (జగత్ - కదిలేది) తేవడానికి మాయ ఉపయోగ
పడుతుంది.
మాయ అనగానే మానసిక శక్తి అని మనకు బదులు రావాలి. దృష్టి కలగాలి.
మాయారూపమైన మానసిక శక్తి యొక్క [అంతఃకరణములు - మనసు, బుద్ధి, అహంకారము
(వ్యక్తిత్వ బావనలు), చిత్తము - ఇవి మాయా విభూతులు; అన్ని మానసిక
కార్యక్రమములను నిర్వహిస్తాయి.] పరిణామములే మన అన్ని మానసిక కార్యకలాపములు.
అందుకనే "మాయామయమ్ ఇదం జగత్" అన్నారు. ఈ జగత్తు (అంతర ప్రపంచం)
అంతా మాయచే నిర్మింపబడినది - అంటే మన లోని ప్రపంచం, అన్ని భావనలు,
అనుభవములు, గ్రహణలు, క్రియలు, ప్రతిక్రియలు (జానేంద్రియ, కర్మేన్ద్రియముల
సాయముతో) - ఇవన్నీ మాయా వివాఅర్తనములే. (పురోధాన తిరోధాన యుత వర్తనం
వివర్తనమ్ - ముందుకు-తిరిగి వెనుకకు కదిలే వర్తనము వివర్తనము. ఉదాహరణ:
బంగారము అలాగే ఉండి నగగా మార్పు చెందుతుంది. నగ మళ్ళీ బంగారమౌతుంది.
బంగారముగాఉన్నప్పుదు, నగ అయినప్పుడు ఆవస్తువు బంగారమే. బంగారముతో
నిర్మించబడినదే. నగగా ఉన్నా, బంగారముగాఉన్నా అందులోని బంగారాన్నే చూస్తాడు
కంసాలి.
అలాగే జ్ఞాని - దృశ్య, శబ్ద, పరిమళ (వాసన), రుచి, స్పర్శ -
యుతమైన మాయామయమైన (చిత్ ఆభాస - ఆత్మ శక్తి నిర్మితమైన) జగత్తుని
చూస్తున్నప్పుడు కూడా ఆత్మనే చూస్తాడు. నామరూపాత్మకమైన జగత్తులో
నామరూపములచే ప్రలోభపడక, ప్రభావితుడు కాక, ఆ జగత్తు నిర్మాణముకు కారణము,
జగత్తుమయమైన, జగన్మూలమైన పరమాత్మనే చూస్తాడు. జ్ఞాని ఎల్లప్పడూ అసలు నేను
స్థితిలో ఉంటాడు. అబద్ధపు నేను జ్ఞానికి ఉండదు.
ఈ జగత్తు, వ్యక్తిత్వము ఆత్మ స్థితి పైని ఆచ్ఛాదనలు. ఈ ఆచ్ఛాదనలు
తొలగించుకోవడమే మనము చేయవలసినది. ఎల్లప్పుడూ సిద్ధమై ఉన్న ఆత్మ / బ్రహ్మము
నేను-నేను అని వెలుగుతుంది. మనలను వెలిగిస్తుంది.
మనకు
తెలిసీ తెలియక మెలకువ (బహిర్ముఖ దృష్టి -బయటి ప్రపంచము జ్ఞానేంద్రియముల
ద్వారా దృష్టిలో ఉంటుంది), కల (అంతర్ముఖ దృష్టి-అంతఃకరణముల ద్వారా -
అనుభవములు, భావనలు, ), గాఢ నిద్ర (విశ్రాంత దృష్టి - మానసిక కార్యకలాపములు
విరమింప బడిన స్థితి) మన నిజ స్థితి అయిన జాగ్రత్ సుషుప్తి పైన కలిగి పోతూ
ఉంటాయి. విశ్రాంత దృష్టి అయిన మెలకువతో కూడిన నిద్ర మన అసలు స్థితి. ఇది
జ్ఞానుల స్థితి. మనందరి సహజ స్థితి కూడా.
మెలకువ రాగానే తలపులు విజృమ్భించి ఈ సహజ స్థితి ని మరుగు
పరుస్తాయి. తలపుల స్థితియే మన "అసలు" స్థితిగా మారుస్తాయి. అనిపిస్తాయి. ఈ
"అబద్ధపు స్థితి" లో కొట్టుమిట్టాడుచూ కాల, దేశములకు లొంగి శరీరము,
మనస్తత్వము, సాంఘిక సస్థితి గతులు నేను, నావిగా భావించి కలవరపడతాము. కష్ట
పడతాము. మన వారిని కష్ట పెడతాము.
ఇలా అసలు నేను జీవితాంతము మరుగున పరచు కొని సుఖ దు:ఖములను అనుభవిస్తూ, శాంతి లేక ప్రశాంతతకోసము అలమతిస్తూంటాము.
మన నిజ స్వరూపమును తెలిసికొంటే మన విధ్యుక్త ధర్మములను
నిపుణతతో,
సంయనముతో, శాంతముగా నిర్వర్తిస్తూ ఆనదమయమైమైన జీవితమును గడుపుతాము. అన్ని
అనుభవములను, తలపులను తట్టుకుంటూ, మానసిక ధైర్యముతో అన్నీ భరించి, సాధించి,
సుఖపడతాము. మనవారిని సుఖపెడతాము.
No comments:
Post a Comment