Sunday, August 26, 2018

History;హిందూ సంస్కృతి విధములు; కల్ప తరువు, కామధేనువులు.;

There is no one history. Every ideology has its own history. Every ideology has viewed past through their colored lens and thus we do not have a standardized history. Every one of us denounce "others'' history. It is a web of likes, dislikes and controversies.
*******
No one is indispensable in this world. Especially politicians forget this at the height of their power.
******
భారతదేశ ఎక్కువ మంది మేధావుల ఏకైక స్లోగన్:

"మాకు మోడీ అంటే ఇష్టం లేదు. ద్వేషం. కాబట్టి ఏ ఇతర భారతీయులు మోడీని ఇష్ట పడడానికి వీలు లేదు. మోడీ దేశానికి ఏమీ చేయడం లేదు. విద్వేషాలను ప్రోత్సహిస్తున్నాడు."
*********
ప్రభుత్వ లెక్కల్లో హిందువులై ఉండి మతం మీద, దేవుడి మీద శ్రద్ధ లేని వాళ్ళ మాటలు నాకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. వాళ్ళు నాస్తికులు కాదు గాని అంతటి వారు. మతాన్ని, దేవుణ్ణి తిట్టరు. పట్టించుకోరు అంతే.
వాళ్ళు మతం గురించి, దేవుడి గురించి మాట్లాడుతూంటే గొప్ప సరదాగా ఉంటుంది. వాళ్ళు అసలు అలా మతం, దేవుళ్ళ ప్రసక్తి తేవడమే ఒక గొప్ప పని అన్నట్లు మాట్లాడతారు.
వాళ్ళు అలా ప్రసక్తి తెచ్చినందుకు, చేసినందుకు దేముడు, మనం అందరం మెచ్చుకొని మేకతోలు కప్పాలని వాంఛిస్తారు. కృతజ్ఞతగా ఉంటే మరీ మంచిది అనుకుంటారు. భగవంతునికి, మతానికి ఇటువంటి మనుషుల పట్ల ఏ దృష్టీ ఉండదు. వీరు కొలిచినా, మానినా, మతం అనుసరించినా, లేకున్నా
ఎవరికీ ఏమీ నష్టం లేదు. లాభం లేదు. వాళ్ళు మటుకు మాత్రం వాళ్ళని ఎంతో మేధావులు అనుకుంటారు.
తమ తమ జీవితాలను మతం, దేవుని ప్రసక్తి లేకుండా గడుపుకోగలమని నమ్ముతూ ఉంటారు.
జిహ్వకో రుచి, పుఱ్ఱెకో బుద్ధి.
********
అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ఫేస్బుక్ మీడియా, సభ్యులు, అబద్ధాలు ప్రచారం చేసి ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు. పౌరులు, ప్రజలు, ఓటర్లు అంత గుడ్డి, చెవిటి, మనుషులా?
ఈ దుష్ప్రాపగాండా అర్థం కాని శుంఠలా?
కాని, మీడియా, ఫేస్బుక్ వార్తాహరులు అలా అనుకుంటున్నారు.
******
శూన్యం
వీధి వీధికి కిళ్ళీ కొట్టుల్లా
గల్లీకి గల్లీకి రాజకీయ నాయకులు
ఊరి ఊరికీ ఆధ్యాత్మిక ఆశ్రమములు
ఇంటి ఇంటికి కవులు, సాహితీ స్రష్టలు
ఈ తామర తంపరకు కారణం
డబ్బు; పేరు ప్రఖ్యాతులకై ఆరాటం
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనైనట్లు
సేవకులు ఎక్కువైతే సేవ అటకెక్కుతోంది
పరుల, పౌరుల శ్రేయస్సు కాక స్వంత ప్రయోజనమునకై తంటాలు పడు వీరు
సాధించునది స్వార్థం, మిగిలిన వారికి పూజ్యం
ఉత్తమ వృత్తులను దిగజార్చిన మిగులునది శూన్యం
*********
చిన్నప్పుడే భగవద్గీత చెప్పడం మొదలెట్టడం పదేళ్ల అబ్బాయికి శోభనం చెయ్యడం లాంటిది.
*******
పాత కాలపు అమ్మలక్కల కబుర్లు, ఇల్లాలి ముచ్చట్లు ఇప్పుడు ఫేస్బుక్ లో ఆడ, మగ తెలిసీ, తెలియక
అనుకరిస్తున్నారు.
*********
Indian spirituality is quest of mind about mind.
*******
దేశానికి సైనికుడు రక్ష
దేశానికి రాజకీయ నాయకులు పెద్ద శిక్ష
దేశానికి ప్రకృతి జీవనాధారం
దేశానికి రాజకీయ నాయకులు గందరగోళం
దేశానికి వివేకవంతులు, తెలివైనవారు,
కార్యదక్షులు, సమర్థులు ఉపకారం,
అలంకారం; దేశం మీద పడి తినేవోడు
అపకారం, భారం, మన దుష్కర్మకు ప్రతిరూపం
దేశానికి జ్ఞానం, కౌశలములు, విజ్ఞానం, ఇంగితం
దీక్షాపరులైన పౌరులు ఆభరణం, ఆనందం
దేశానికి పౌరుల భక్తి శ్రీరామరక్ష; దేశంపై
పౌరుల అకారణ ద్వేషం తరతరాల కక్ష
******
పరమానందం
అస్పష్టత కొందరికి గుణము
స్త్రీ వాదము కొందరికి మెప్పు
దళిత వాదము దరినుందురు కొందరు 
కమ్యూనిస్టు, రేషనలిస్ట్, అన్నలు, మరికొందరు
సామ్యవాద ప్రియులు; కవులందరు
ఈ ఈ తెగలుగ విడిపోయిరి, వారితో
విమర్శకులును చేయి కలిపిరి
వీరిని మెప్పించు కవితలు నేను రాయలేను
రాయను; నా హృదయ గిరినుండి
జాలువారు నీటి ప్రవాహములు, సెలయేళ్ళు,
జలపాతములు నా కవితా లహరి
ఒక్క రసహృదయము ఆర్ద్రమై రంజింప బడిన చాలు;
నా కవితా వ్యవసాయము పండినట్టే;
సరసహృదయ మనోరంజనమే, మనో వికాసమే
నా సాహితీ సృష్టికి ధ్యేయము; నాకు పరమానందం
*********
హిందూ సంస్కృతి విధములు
రక్షాబంధనం ఉత్తరాది ఆచారం. అలాగే కాముని పున్నమి. మా చిన్నప్పుడు (1950-70 - గోదావరి జిల్లా లలో) శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి గా మాత్రమే ప్రసిద్ధం. రక్షాబంధనం అనే మాటే అప్పుడు మేము వినలేదు. అది ఉత్తరాదిని అన్నా చెల్లెళ్ల పండుగ అని చూచాయగా తెలుసు. ఎప్పడూ జరుపుకోలేదు.
భగినీ హస్త భోజనం అని, అన్నదమ్ములు, అప్పచెళ్ళెళ్ళ ఇళ్ళల్లో వారి వంట తినడం ఆచారం.
ఇది కార్తీక మాసం అయ్యాక వస్తుంది. పంచాంగాలలో ఉంటుంది. ఏం ప్రాంతం వారు ఆ ప్రాంతం ఆచారం చేసుకోవడం, సంస్కృతి పాటించడం శ్రేయస్కరం. భారతదేశం అంతటికి ఒక భాష ఎలా ఉండదో, అలాగే ఒకే హిందూ సంస్కృతి ఉండదు. ఈ ఇంగితం తెలుసుకోవడం అత్యవసరం. దేశం పేరు చెప్పి, మతం పేరు చెప్పి సాంస్కృతిక వ్యవహారాలలో తలదూర్చడం ఏ సాంస్కృతిక సంస్థకు తగదు.
అలాగే కాముని పున్నమి, హోలీ ఒక పండగలా చేసుకోవడం మాకు ఎప్పుడూ లేదు. ఇదంతా ఈ మధ్య వచ్చిన హడావుడి, సంస్కృతి. అంతటి భారతదేశపు సంస్కృతీ ఇది కాదు. కొండొకచో ఈ  హిందూ సంస్కృతి, ఉత్తరాది ఆచారం మాత్రమే.
పంచాంగాలలో తెలుగు, కన్నడ సంస్కృతుల వారు చాంద్రమానం ప్రకారం గుణిస్తారు. తమిళ, మళయాళ సంస్కృతుల వారు సౌర మానం, ఉత్తరాది వారు బార్హస్పత్య మానం ఉపయోగిస్తారు. పుష్కరాల హడావుడి తెలుగు వాళ్ళకి మాత్రమే ఉంది. ఇంత వైవిధ్యం ఉంది "ఒకే" హిందూ మతంలో.
భారతదేశంలో హిందూ మతం పాటించే వారందరూ "హిందువులే" అయినా ప్రాంతం ప్రాంతానికి సంస్కృతి వేరు, ఆచార వ్యవహారాలు వేరు. దేవుని, దేవతల హిందూ అర్చనా విధానాలు వేరు వేరు. చేసుకునే ఉత్సవాలు, పండుగలు వేరు.
భారతదేశం ఉపఖండం, దేశం మాత్రమే కాదు.
హిందూ మతం లో ఎంతో వైవిధ్యం ఉంది. ఉత్తరాదే భారతదేశం కాదు. వారి సంస్కృతే వేరు. దానికి హిందూ తత్త్వానికి సంబంధం లేదు. వారిది విదేశాంగ వ్యవహారాల శాఖ. మముబోంట్లది హోం శాఖ.
హిందూ మతాన్ని రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా అనుసరిస్తారు. ఆచరిస్తారు. అది అలాగే ఉండాలి. ఒక ప్రాంతం ఆచారం ఇంకో ప్రాంతంలో చొప్పించడం, రుద్దడం అనవసరమైన విషయం. పైపెచ్చు దాన్ని హిందూ మతంతో ముడిపెట్టడం ఇంకా పసితనం. ఇప్పటికే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, శాక్తేయం, వైష్ణవం, శైవం, మరిన్నో తెగలు, ఉన్నాయి. ఇప్పుడు వెలుగుతున్న బాబాలు, అమ్మలు హిందూ దేవుళ్ళుగా చెలామణీ అయిపోతున్నారు.
ఈ కొంగ్రొత్త ధోరణులుకి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు హిందూ మతం అంటే ఏమిటో, ఇలా మూలాలే మారిపోవడం ఏమిటో అర్థమే కాదు.
********
కథల్లో, కవితల్లో ఉపదేశాల కన్నా మనోరంజకంగా, మనో వికాసాన్ని కలిగించే సృజన ఉండాలి.
********
An ordinary individual may not be able to do all screening. Faith in Himself, Him and friends saves us of lot of stress and strain. We may not be able to live suspecting everyone. We must take care but can also leave things to faith. Else we can not live peacefully.
*******
ప్రపంచంలో అనేక దేశాలు రకరకాలైన రాజకీయాలు;
రాజకీయ నాయకులు, ఆమ్యామ్యా ఉద్యోగులు కూడా దేశ విధ్వంసక శక్తులై దేశానికి చీడలైన వేళ, ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చి మసలుతున్న వేళ, శిక్షలు లేవు; అన్నీ భక్షణలే
కులముల పేరుతో అందలాలెక్కేవారు, శరము లేనివారు
*******
పురందర విఠ్ఠలుడు పురందర దాసు ఇష్ట దైవము.
ఆయన కీర్తనలన్నీ పురందర విఠ్ఠల ముద్రతో ముగుస్తాయి.
పాండురంగ విఠ్ఠలుడు జ్ఞానేశ్వర్ మొదలు ఎందరో మరాఠీ జ్ఞానులకు, భక్తులకు ఇష్ట దైవము.
శ్రీరంగడు ఆళ్వారుల, విష్ణు భక్తుల ఇష్ట దైవము.
"రంగ" లందరూ భక్తత్రాణ పరాయణులు.
శ్రీరంగడు, ఆది రంగడు, మధ్య రంగడు, అంత్య రంగడు అని పిలువబడుతూ, కావేరీ నది పాయల మధ్య, శ్రీరంగపట్టణ, శివసముద్రం, శ్రీరంగం లలో ఉన్నాడు.
ఇష్ట దైవములు భక్తుల పాలిటి కల్ప తరువు, కామధేనువులు.
అన్నమయ్యకు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, రామదాసుకు భద్రాచల రాముడు, త్యాగరాజస్వామికి ఇంటనే వెలసియున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత ఇక్ష్వాకు కుల తిలకుడు శ్రీరామచంద్రుడు ఇష్ట దైవాలు.
అందరు వాగ్గేయకారులు నవ విధ భక్తిలతో ఇష్ట దైవాలను కీర్తించారు, భక్త శిఖామణులతో సమానంగా స్మరించారు, కొలిచారు. మనకు ఎంతో భక్తి సాంప్రదాయ ఐశ్వర్యాన్ని అందించి తమ ఇష్ట దైవాలలో లీనమై పోయారు.
******

Thursday, August 23, 2018

కోటు; కులపిచ్చి, కులగజ్జి; వేసవి సెలయేళ్ళు; మాయ స్వరూప, స్వభావాలు; ముదిమి

Individuals who are not "disturbed" by any emotions are not living.
కోటు
ఇప్పటికీ కోటు వేసుకుంటేనే
సభల్లో, ఫంక్షన్ లలో గొప్ప తనం
వేసుకున్న దుస్తులు మనిషికి గౌరవం తెస్తాయి
కోటు వేసుకుంటే పెద్ద వాడి కింద లెక్క; కోటుకు
ఉన్న గౌరవం మనిషికి లేదు; కోటు స్థాయి పెంచుతుందమో కాని మనిషికి ప్రతిభనీయలేదు
కాని కోటంటే కోటి రెట్లు మోజు
అది వేసుకుని రావడం మనకు
సభల్లో ఫంక్షన్ లలో గొప్ప రివాజు
***********
కులపిచ్చి, కులగజ్జి
భారతదేశంలో రాజకీయ నాయకులని వారి కులాన్ని బట్టి అభిమానిస్తారు పౌరులు. ఓట్లూ వేస్తారు.
అలాగే కులాన్ని బట్టే సినీ తారలను అభిమానిస్తారు.
కులాన్ని బట్టే డాక్టర్ దగ్గరకు వైద్యానికి వెళతారు.
పిల్లల్ని స్కూళ్ళలో చేరుస్తారు.
ఒక పక్క నుంచి కుల విభజనను దుయ్యబడుతూ, కులాన్ని స్వ, స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం భారతీయులకే చెల్లింది. ఈ రెండు నాల్కల ధోరణి వల్ల దేశమూ, ప్రజలూ అధమ గతిలో ఉన్నారు. కులపిచ్చి, కులగజ్జి భారతదేశ వాసుల రక్తంలో ఉంది.
**********
పెళ్ళాం లేనివారు
పెళ్ళాం లేనివారు, ప్రియురాలును లేనివారు; ఎలా జీవించాలో మనకు ఉపన్యాసాలిస్తారు; డబ్బులు మీద వ్యామోహం కూడదంటారు, మన డబ్బులు తీసుకోక వారికి పొట్ట గడవదు, ఆశ్రమములును
నడవవు; మనపై వీరికెందుకు ఇంత ప్రేమ? ముందు
వారిని ఉద్దరించుకోమనండి; జీవితం మిగిలితే మన జోలికి రావచ్చు; తనకు మాలిన ధర్మము మనకేల?
ప్రపంచంలో ఇతరులను ఉద్ధరించడానికి ఎందరో?
*********
వేసవి సెలయేళ్ళు
ఈరోజు ఈ జంట, రెండు రోజులకే మరొక జంట,
స్నేహమున మునిగి తేలును; వివిధ డేటింగ్ ల వరద పారును
మూడు నాళ్ళ ముచ్చటలు తారల పెళ్ళిళ్ళు
నాటి నాటికి క్షీణించు ఆ "పై పై బంధములు"
కాని వాటికి అనుసరణ ఎక్కువ, డేటింగ్ నుంచి
పెళ్ళి వరకు మన ఆసక్తిని సొమ్ము చేసుకొనెదరు
వారి పిల్లలు, విడాకులు, మరేదైనా మనకు
మరుక్షణం అందించు మీడియా మనకు ప్రోబ్లం
మనమే అందరకు కామధేనువు, కల్పవృక్షములము
మన అభిమానములే వారికి ధనము కాయు వృక్షములు
ఆకసమున తారలు మనసు పడు జాబిలి
మనకెంత మాత్రము ఆహ్లాదం కలిగించని ఱేడు
పున్నమి వెన్నెలల ఆస్వాదన లేదు
మల్లెల సౌరభాల తెలియదు
మనదంతా మనసున తారలు
తప్ప మరేమీ నిలవని వేసవి సెలయేళ్ళు
**********
తమకు తక్కువ తెలిసినా, ఏమీ తెలియక పోయినా కూడా, బల్ల గుద్ది బజాయించి శబ్ద కాలుష్యం సృష్టించేవారు ఎక్కువ అయిపోయారు. ఈ పర్యావరణ కాలుష్యము జరగకుండా చూడడం ఎవరి వల్లా కావటం లేదు.
********
మన చదువులు రెండు రకాలు. ఉద్యోగం తెచ్చే చదువులు. ఉద్యోగం తేలేని చదువులు.
మన పిల్లల్లో ఎక్కువ మంది ఉద్యోగం తేలేని, తెచ్చుకోలేని చదువులు చదువుతున్నారు.
********
మాయ స్వరూప, స్వభావాలు
నేను 9 వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మగారి వద్దనున్న పురాణాలు చదువుతుంటే, మహామాయ అనే పదాన్ని మొదటి సారిగా విన్నాను. మహామాయ నుంచే త్రిమూర్తులు ఉద్భవించారనీ చదివాను. మొదట కొద్దిగా ఆశ్చర్యానికి లోనయ్యాను.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే దేవుళ్ళు కదా, వారు మాయ నుంచి ఉద్భవించడమేమిటీ అని అనిపించింది. దానిని తరువాత అలా మస్తిష్కంలో ఉంచుకున్నానంతే.
మాయ పదాన్ని తరువాత అద్వైత సిద్ధాంతం చదువుతున్నపుడు మళ్ళీ దాన్ని స్పృశించాల్సి వచ్చింది. భారతదేశ తత్త్వ శాస్త్ర చరిత్రలో "మాయ" పదాన్ని అపార్థం చేసికున్నట్టుగా మరే పదాన్ని అపార్థం చేసుకోలేదు. సామాన్యుల నుంచి ఆచార్యుల వరకు ఈ విషయంలో ఒక లాగే పొరబడ్డారు. విశిష్టాద్వైతం, ద్వైతం మాయ పదాన్ని తీవ్రంగా నిరసిస్తాయి.
సామాన్యులమైన మన గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు. మాయమైపోవడం, దగ్గర నుంచి ఎన్నో అపార్థాలు సృజించుకున్నాము. అసలు మాయ అంటే ఏమిటి? ఈ పదాన్ని అద్వైతులు ఏ అర్థంలో ఎలా వాడేరు - అనేదాని మీద స్పష్టమైన అవగాహన భారతీయులెందరికో లేదు.
అసలు మాయ అంటే ఏమిటి?
మేధలో ప్రతిఫలించే ఆత్మ (చిత్) శక్తియే మాయ. దీనిని చిదాభాస, ప్రణవం అని కూడా అంటారు. వ్యాకరణ వేత్తలు దీనినే "స్ఫోట" అంటారు.
మాయ మానసిక శక్తి. తను ముందుకు, వెనుకకు పరిణమించి మనలో, మనచే మానసిక, శారీరక కార్యకలాపాలు చేయిస్తుంది. అంతఃకరణములు మాయ యొక్క విభూతులే (అవతారములే, వివర్తనము నందిన శక్తులే). చేసే పనిని బట్టి అంతఃకరణములకు పేర్లు.
మాయ మిథ్యయైనది. మిథ్యా పదానికి రెండు అర్థాలు ఉన్నాయి.
ఒకటి, ఒక క్షణం ఉండి, మరుక్షణం మాయమయ్యేది
మిథ్య. మన భావములు దీనికి ఉదాహరణ. మనకు భావములు, వాసనలు (కలిగిన అనుభవములు) ప్రేరేపించినపుడు, బయటి ప్రపంచంతో, వ్యక్తులతో సంబంధం ఏర్పడినప్పుడు, బయటి ప్రపంచపు మానసిక ముద్రలైన అంతర ప్రపంచం, దృష్టిలోకి వచ్చినపుడు కలుగుతాయి. ఇవి, దీనికి కారణంమైన జగత్ (అంతర ప్రపంచం) మిథ్య అన్నారు. అంటే మన మానసిక దృష్టిలో ఒక క్షణం ఉండి, మరుక్షణం ఉండనివి.
మిథ్యకు మరొక అర్థం అబద్ధమైనది. నిజం కానిది.
మనం నిజం. అద్దంలో మన ప్రతిబింబం అబద్ధం. దానికి ఉనికి ఉన్నా, మనకు కనిపిస్తున్నా, అది నిజం కాదు. దానికి స్వతంత్రమైన ఉనికి లేదు. మనం లేకపోతే మన ప్రతిబింబానికి ఉనికి లేదు. అలా అది మిథ్య. మిథ్యా ప్రతిబింబం ఈ నామ, రూపాత్మకమైన అంతర ప్రపంచం. మాయా పరిణామాలు జరక్క పోతే మనకు అంతర, బాహ్య భౌతిక ప్రపంచంములు కనరావు. ఇవి మాయ యొక్క "నిజ స్వరూప, స్వభావములు".
మాయా మయమ్ ఇదమ్ జగత్ - ఈ జగత్ అంతా మాయచేత నిర్మింపబడింది. ఈ ప్రపంచం అంతా ప్రణవమయం అనీ చదువుతాము. మాయ, ప్రణవము ఒకే చిత్ శక్తి విభూతులు. శక్తి ఒకటే, పేర్లే వేరు. అద్వైతం ఎప్పుడూ బాహ్య భౌతిక ప్రపంచంము మిథ్యా అనలేదు. జ్ఞానేంద్రియాల ద్వారా మనసు మాధ్యమంలో ఏర్పడే, మానసిక ముద్రల సమూహమైన అంతర ప్రపంచం (ఇది భావముల రూపంలో ఉంటుంది) మిథ్యా అంది.
ఈ అవగాహన లేక సామాన్యులు, ఆచార్యులు అద్వైతాన్ని చీల్చి చెండాడేస్తారు. శంకరాచార్యులను ప్రచ్ఛన్న బౌద్ధులు అని నిందిస్తారు. మన అపార్థంతో ఇతరులను తీసిపారేయడం సంఘంలో ఎప్పటి నుంచో ఆనవాయితి.
భారతీయ తత్తవదర్శనమును ఆస్తిక దృష్టితో వ్యాఖ్యానించ వచ్చు, కాని ఇతర నిర్గుణ, జ్ఞాన దృష్టులను త్రోసిరాజనడం, నిరసించడం, నిందించడం అనవసరం. నిర్గుణ దృష్టిని జ్ఞాన బోధ మీమాంసా దృష్టితో వ్యాఖ్యానించినపుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రాలకు ఎంతో ఉపకారం జరుగుతుంది.
యయా అసంతమ్ పశ్యతి సా మాయా - దేని ద్వారా మనం సత్ కానిది - అసత్ అయినది - అయిన బాహ్య భౌతిక ప్రపంచంమును గ్రహిస్తామో, అన్ని గ్రహణలను చేయగలుగుతామో - ఆ మానసిక శక్తి మాయ.
యా మా సా మాయా - ఏది లేదో, ఏది అబద్ధమైనదో, ఏది మిథ్యా ప్రతిబింబం వలె నిజ వస్తువు లేకపోతే ఉనికిని కోల్పోతుందో అది మాయ.
ఏది వివర్తనం (పురోధాన - ముందుకి, తిరోధాన - వెనుకకు - పరిణమించడం) పొందడం వల్ల అన్ని మానసిక, తదనుగుణ శారీరక కార్యకలాపాలు జరుగుతున్నాయో, అది మాయ. మరోసారి, దేనికి చిత్ శక్తి లేకపోతే, స్వతంత్రంగా ఉనికి లేదో అది మాయ.
తత్త్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల కాక అపార్థం చేసుకోవడం వల్ల భారతీయ తత్వదర్శనానికి, అద్వైతానికి అనవసర ప్రతికూలతలు వచ్చాయి.
ఈ విధంగా:
మాయ = చిదాభాస - చిత్+ఆభాసా - reflection of చిత్ in మేధా. మానసిక శక్తి. ప్రణవమన్నా ఇదే. దీనికే స్ఫోట అనే పేరూ ఉంది.
ఇచ్చి పుచ్చుకోవడం ఏ రంగంలోనైనా మానవాళికి ముఖ్యం. అవసరం. శాంతి ప్రదం.
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
********
దుస్తులు ధరించు వైఖరులు
ధరించిన దుస్తుల వెరైటీలు
రంగులు, హంగులు మనుషుల
వృత్తుల, ప్రవృత్తుల సూచకములు
********
The theme of pre-teen love is used for an advertisement. Is it necessary? How can 8 or 9 years old kids falling in love is a matured theme? It will be imitated profusely and we will have Romeo-Juliets very early in lives!. The advertisement is not in good taste or a responsible one. "Freedom" of speech!!!???
**********
ఒకరి భావాలను ఒకరు నిర్దయగా, నిరంకుశంగా, సంస్కార రహితంగా, అనాగరికంగా, క్రూరంగా తిట్టిపొయ్యడం ఫేస్బుక్ లో ఒక సంస్కృతిగా మారింది. ఇంతటి అనాగరికం, సంస్కార రాహిత్యం ఆదిమ మానవుని స్థాయికన్నా కనాకష్టంగా ఉంది. అధములు, జంతు సదృశులు వాతావరణాన్ని తమ మూర్ఖత్వంతో దారుణంగా కలుషితం చేస్తున్నారు. వాళ్ళ దురభిమానాలు వెళ్ళగక్కడం కన్న వాళ్ళు సాధించేది శూన్యం.
********
ఫేస్బుక్ లో; చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.
*******
అంతర్జాలంలో కొట్టుకునే వారు పిరికివారు
తమ వాగుళ్ళను, తిట్లను ధైర్యంగా చెప్పలేని భీరువులు; బయటన్న దెబ్బలు తగులవచ్చును,
ప్రాణమే పోవచ్చును; ఫేస్బుక్ రక్షణలోని బలహీనులు
*******
ఎవరి డబ్బా వారు కొట్టుకునే ఫేస్బుక్ లో ఎవరు రచయితలు ఎవరు చదువరులు; ఎవరు సెలిబ్రిటీలు ఎవరు అభిమానులు; కలగా పులగం అయిపోయిన
ఈ వ్యవస్థలో అందరూ సెలిబ్రిటీలే; అభినందనీయులే
**********
సినిమాలు మనకి పానీయములు, తిళ్ళు, అలంకరణలు, ఆడంబరములు; ఫేస్బుక్ పోస్ట్లు ప్రాచుర్యము, గౌరవము, హుందా; మన జీవితముతో మమేకమైన సినిమా మన ఊపిరియు, ఊసులును
*********
ముదిమి వచ్చును శరీరము లొంగును; మాట, అడుగులు తడబడును; వణకును ఒడలు కాని నారాయణ పదారవింద మధుపానమత్త చిత్తము అటులనే రమించుచు తత్పరయై పరంధామునిలో
*******
Mother is no longer the desired identify of modern woman. She desires to be identified with her degrees, employment, personal achievements and equality with man in all aspects.
*******
రాయగా, రాయగా రచయిత తన రచన అందరూ చదవాలనే స్థాయి నుంచి, తన రచనలను ఎవరైనా చదివారా, చదువుతున్నారా అనే స్పృహ లేకుండా సారస్వత సృష్టి చేసే స్థాయికి ఎదుగుతాడు. అప్పుడు లోకానికి ఉపయోగకరమైన సారస్వతం అందుతుంది.
*******
భగవంతుడు ఉన్నాడా, లేడా అనేది ప్రశ్న కాదు. మనకు భగవంతుని యందు అనురాగం, అనురక్తి, భక్తి ఉన్నాయా, లేవా అనేదే ముఖ్యం.
భగవంతుని ఉనికిని ఇటు గాని, అటు గాని ఎవరూ తేల్చలేరు. మనకు భగవంతునితో ఉన్న అనుబంధమే కావలసినది.
భగవంతుని ఇష్ట పడడం, ఇష్ట పడకపోవడమే మనం చెయ్యగలిగినది.
భగవంతుని ఉనికిని భావముల లోంచి ఎవరూ తీసివేయలేరు. భగవంతుడు ఉన్నాడు, లేడు అని మాత్రం అనగలరు.
**********
మనందరికీ పనికిరాని పరిజ్ఞానం ఎక్కువగా ఉంది. పనికొచ్చే జ్ఞానం, విజ్ఞానం లేవు.
**********
మనుషులు మరపు నేర్చుకోవాలి. ప్రతీదీ, ప్రతీ వాణ్ణి గుర్తుంచుకోవడం అనవసరం. మనకి ప్రస్తుతం జ్ఞాపకాల ప్రకటన, ప్రదర్శన ఎక్కువ అయిపోయింది.
*********

Monday, August 20, 2018

అజ్ఞానం; పేరు - పెన్నిధి; ; నా సాహితీ-విజ్ఞాన-జ్ఞాన సృష్టి, పరిశోధన;గతవైభవ చిహ్నాలు

ముసల్దైన ఒక సినీతార ఓ పడుచు వాణ్ణి పెళ్ళాడబోతూంటే మనకు హడావుడి
అసలు సిసలైన కరుణ, సేవా నిరతీ చూపించే వాళ్ళంటే మనకు వికారం మనకు మనమే అసహ్యం
ప్రకృతి విలయాలు సంభవించినపుడల్లా భగవంతుని 
కోపాన్ని తలుచుకోవడం ఆస్తికుల అలవాటు
భగవంతునికి మన వలే వికారాలుంటాయా? ఏమో!
మనుషుల ప్రవర్తనను బట్టి ప్రకృతిని ఉసిగొల్పుతాడా
భగవంతుని తత్త్వం అర్థం చేసి కోని వారిలో
నాస్తికులతో బాటు ఆస్తికులూ ఉంటారు
మన అవగాహనలు, సగం మన ప్రకోపం
మరో సగం మన అజ్ఞానం; భగవంతుడు
కరుణాంతరంగుడు, మన రక్షకుడు; కాడు మన
భక్షకుడు, కాడు మనకు వైరి, మనల కాచు దివ్యుడు
మురారి నీలకంఠుడు, వారి పరివార దేవతలు
దేవుళ్ళు, మనకు మంచినే చేస్తారు, చెడు తలపెట్టరు
కాని ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు
**********
Every day one or the other dies. And Facebook is full of obituaries and condolences to the departed. From very famous to very limited in popularity get various messages on them out of desire to express. It is becoming habit to read about the dead and ritualistic writings. Public platforms will be like that only. If we don't like, we have to excuse ourselves.
********
మనం ఫేస్బుక్లో ఏం రాసినా, వాగినా ఏం జరగదు కాబట్టి (అలా అని అందరం అనుకుంటున్నాము) నోళ్ళకి అడ్డూ అదుపూ ఆపూ లేకుండా పోయాయి. అమ్మా ఆలీ బూతులు రాస్తున్నారు. రాజకీయం, కుల, మతం విషయాలైతే చెప్పక్కరనేలేదు.
వ్యక్తిగత, సంస్థా దూషణ, భూషణ, తిరస్కారములు నింగినంటుతున్నాయి. అభిమాన, దురభిమానాలను నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా, జుగుప్సాకరముగా, అశ్లీల భాషలో అనాగరికంగా వ్యక్తపరుస్తున్నారు.
మాటల్లో, రాతల్లో మర్యాద, గౌరవము పూర్తిగా నిండుకుంటున్నాయి.
ఇదంతా మన నాగరికతా పేలుడుకి, సంస్కృతి, సంస్కార రాహిత్యానికి సంకేతాలు. మనిషి ఆధునికుడైన కొద్దీ అనాగరిక, ఆటవిక, జంతు ప్రవృత్తులు ఇలా విజృంభించడం మనం ఎన్ని ఆధునిక సౌకర్యాలు అనుభవిస్తున్నా,, సాంకేతికత వాడుతున్నా, మన ప్రవృత్తి, ప్రవర్తనల దృష్ట్యా రాతి యుగంలోనే ఉన్నాము. సంఘంలో జరుగుతున్న ఘోరాలు కూడా దీనికి తార్కాణం.
విద్యావిధానం లోని లోపాలు మన్ని పట్టి పీడిస్తున్నాయి.
*******
మన వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టి నాయకులను, ఇతర రంగాలలోని ప్రముఖులను మనం ఆకాశానికి ఎత్తెయ్యనవసరము లేదు.
మన్ని మనం గౌరవించుకుంటూ, మర్యాద చూపించుకుంటూ ఇతరులను అభిమానించవచ్చు.
గొప్పదనాలు సహజమైనవి కొన్ని, ఆపాదించబడినవి ఎన్నో.
సమాజంలో రకరకాల మనస్తత్వాల వారు రకరకాల రంగాల్లో గొప్పవారిని కీర్తిస్తారు. కాని ఎవరూ ఆ గొప్పవారి గొప్పదనాలను అనుసరించరు. వట్టి పొగడ్తల వల్ల సంఘంలో గొప్పవారు తయారుకారు.
మన అభిమాన, దురభిమానాలు గొప్పవారిని తయారు చేయవు. కాని మిత్రత్వాలను, శత్రుత్వాలను పుట్టించి, పెంచి, పోషిస్తాయి.
ఆవేశపడే అభిమానుల వల్ల ఏ మంచీ జరగదు. ఆవేశం ప్రకృతి సృష్టించిన ప్రళయం లాంటిది. దానికి ఆలోచన ఉండదు. ఆవేశం మాత్రమే విధ్వంసాన్ని మాత్రం సృష్టిస్తుంది.
ప్రకృతి కలిగించే విలయం, ఆవేశపరులు కలిగించే నష్టం ఒకటే.
ఉద్యమేన న సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః
నహి సుప్తస్య సింహస్య ముఖే ప్రవిశంతి మృగాః
అర్థము:
ఉద్దేశించి నంత మాత్రాన పనులు జరగవు; మనోరథములు సిద్ధించవు.
పడుకొని ఉన్న సింహం నోట్లో జంతువులు తమంత తాముగా ప్రవేశించవు.
 ********
Addiction of any kind is a symptom of mental disorder and affects both the body and mental health.
*******
There should be some illusion to make us live in this world.

Else we will be completely bored or peace will be our experience.

*******

మనలో చాలా మందిమి రకరకాల రచయితలం.
అంతర్జాల మాధ్యమ సాలెగూళ్ళు, పత్రికలలో మాత్రమే ప్రచురింపబడేవారు.
ఈ అంతర్జాల మాధ్యమాలతో బాటు అచ్చు పత్రికల్లో కూడా ప్రచురించబడేవారు.
పుస్తకాలు సొంతంగా ప్రచురించుకునేవారు.
ప్రచురణ కర్తలు ప్రచురించేవారు.
ఏ ప్రచురణకూ నోచుకోని వారు.
ఏ ప్రచురణకూ నోచుకోని వారు రచయితలా, కాదా?
ఎన్ని రచనలు ఎక్కడ ప్రచురించబడితే ఒకళ్ళు రచయితలు అవుతారు?
ఎన్ని రచనలు, ఎక్కడ ప్రచురించబడితే అనువాదకులు అవుతారు?
సంఖ్య ముఖ్యమా?
రచయితగా ముద్ర పడాలంటే ఏది లెక్క, చిహ్నం?
ప్రమాణం?
నిజానికి రచయితలంతా ఈ తర్జనభర్జనలు అనుభవించేవారే. అనుభవించిన వారే. అనుభవిస్తూ ఉన్న వారే.
తమ స్థానం, స్థాయి ఎక్కడో, ఏమిటో తెలియని వారే.
*******
సైన్స్ చదువుకోని వాళ్లు, సైన్స్ గురించి ఏమీ తెలియని వాళ్ళు సైన్స్ గురించి మాట్లాడినట్టు, నాస్తికులైనా, మతం గురించి ఏమీ తెలియని వాళ్ళైనా మతం గురించి మాట్లాడతారు, భారతదేశంలో.
******
In India we have limitless freedom from any aspect; in any way.
******
అభిమానము, ఆప్యాయత, ఆత్మీయత, ప్రేమలతోనిండిన మన ఇంట్లోని వారి దగ్గరితనం మన మనసుని క్రుంగనీయదు.
ఏ భగవద్గీత చదవక్కరలేదు, ఏ ఉపన్యాసాలు, ప్రవచనాలు వినక్కరలేదు.
ఆధ్యాత్మిక జ్ఞానములు, ధ్యానాలు, తపస్సులు, శిష్యరికాలు అంటూ తిరగక్కరలేదు.
ఇంటిలోని వారి ప్రేమాభిమానాలు అందనపుడు ఏ ఆధ్యాత్మిక పథము, గురువులు మనఃస్థిమితాన్ని ఈయలేరు. మనసుకు నెమ్మదిని కలిగించలేరు.
ఇంట్లోని ఆప్యాయతలను కాలదన్నుకొని, ఏ ఆశ్రమాలకు చేరినా కావలసిన మనశ్శాంతి దొరకదు. అభిమానము అందించి, అందుకోవడంలోనే శాంతి సౌఖ్యాలు ఉన్నాయి.
********
పేరు - పెన్నిధి
సినీ తారలది ఏది అసలు పేరో ఏది పెట్టుడు పేరో మనకి తెలియదు.‌ మనం పెట్టుడు పేర్లతో గుర్తుంచుకుంటాము.
సన్యాసులు, సినీతారలు తమ అసలు పేర్లతో పిలువబడరు. వారు బయటకు చెప్పకూడదు కూడాను.
తమ ఐడెంటిటీ మర్చిపోవడానికి సన్యాసులు పేరు మార్చుకుంటే సినీతారలు తమ ఐడెంటిటీ మరుగు
పరుచుకోవడానికి పేరు మార్చుకుంటారు.
"పేరులోన ఏమి ఉన్నది పెన్నిధి" అని గిరీశం అందంగా తర్జుమా చేసినా పేరులోనే ఎంతో ఉంది.
మన వ్యక్తిత్వం అంతా పేరుతోనే ముడిపడి ఉంటుంది. మనకి స్పృహ తప్పినపుడు, ఆపరేషన్ అయ్యాక పేరుతో పిలుస్తారు. మనం స్పందిస్తాము.
మన పేరు మనకి ఎంతో గొప్ప. పేరుని తప్పు పలికినా, సరిగా పలకక పోయినా మనకి ఎంతో కోపం వస్తుంది.
ఎంత‌ కోపం, చిరాకు వస్తాయో తెలియాలంటే: On being called Thompson అనే శీర్షిక గల A. G. Gardener ఆంగ్ల వ్యాసం చదవండి.
పేరు, రూపము, గొంతు మనకు ప్రత్యేకం.
*******
నా సాహితీ-విజ్ఞాన-జ్ఞాన సృష్టి, పరిశోధన 1
మాస్తి వేంకటేశ అయ్యంగార్ పేరు వినగానే తమిళం గుర్తొస్తుంది. కాని ఆయన కన్నడ భాషలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.
నేను కాలేజీలో చదువుతున్నానేమో అప్పటికి. ఆయనలా రచనలు చేయాలనిపించేది. నేను సైన్స్ విద్యార్థినే అయినా సాహిత్యాన్ని అభిమానించే వాడిని. చదివేవాడిని. భారతదేశ ఇతర భాషా కవుల సాహిత్యం అనువాదములలో చదివేవాడిని.
తమిళనాట ఎంతో ప్రసిద్ధి పొందిన రచన శిలప్పదిగారమ్ కథని ఒక ఉత్తరాది రచయిత రాసిన, తెలుగులోకి అనువదించబడిన కణ్ణగి పుస్తకం ద్వారా ఆనందించాను. ప్రొఫెసర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారి అనువాదములతో సుబ్రహ్మణ్య భారతిని పరిచయం చేసికున్నాను. తమిళభాషకి ఎన్నో పురాతన గ్రంథాలను వెలుగులోకి తెచ్చి ఎనలేని సేవ చేసిన స్వామినాథయ్యర్ కృషిని ఒక అనువాదంలో చదివాను. ఆయన ఎలా తమిళనాట ఇంటింటికీ తిరిగి జైనుల కాలం నాటి సన్యాసుల సాహితీ సృష్టిని, రచనలను సంపాదించారో చదివి ముగ్ధుడనయ్యాను.
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం అన్ని భాగాలు చదివి నా సాహితీ తృష్ణను తీర్చుకున్నాను. నా సాహిత్య దృష్టిని పరిపుష్టం చేసుకున్నాను. యువ భారతి వారు 1970 లలో ప్రచురించిన అన్ని కవితా వైభవాలు, లహరులు కొని చదివి ప్రాచీన తెలుగు సాహిత్యం గురించి తెలుసుకున్నాను. ఇలా ప్రచురించడం యువభారతి వారు తెలుగు వారికి చేసిన మహోపకారం.
వారి ప్రచురణలు చదివి సంస్కృత సాహిత్యాన్ని పరిచయం చేసికున్నాను. తెలుగు సినిమా సాహిత్యం ఎంతో శ్రద్ధగా విన్నాను. ఆ కవుల పటిమకు మనసులోనే పరవశుడనయ్యాను. విపులలో వివిధ భాషల్లో కథలను చదివాను.
నావి వివిధ భాషల కథల అనువాదాలు 16 విపులలో ప్రచురించ బడ్డాయి.
1980లలో ది హెరిటేజ్ అని చందమామ ప్రచురణల వారి ఆంగ్ల మాస పత్రిక ప్రచురించ బడేది. అది ఎంతో గొప్ప ప్రచురణ. భారతీయ భాషలనుంచి కథల అనువాదాలు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయములు, తత్త్వశాస్త్రముల గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాసాలు, విషయాలు ప్రచురించ బడేవి. కాని ఆ పత్రిక ఆర్థికంగా నిలదొక్కుకో లేక పోయింది. దాని మనుగడకై చందమామ ప్రచురణల నుంచి ధనం సర్దాల్సి వచ్చేది. అది నచ్చని హెరిటేజ్ సంపాదకులు మనోజ్ దాస్ ఆ పత్రికను మూసి వేయడానికి నిర్ణయించు కొని మూడేళ్ల తరువాత మూసేశారు. ఆ రోజున నాకు కలిగిన వేదన చెప్ప లేనిది.
అలాగే 1990 ల నుంచి ప్రచురించ బడుతున్న సంభాషణ సందేశః అనే సంస్కృత మాస పత్రిక సంస్కృత భాషలో భారతీయ, విదేశీ భాషల కథల సంస్కృతానువాదాలు ప్రచురిస్తూ ఉండేది.
హెరిటేజ్, సంభాషణ సందేశః లలో నాకు నచ్చిన వివిధ భాషల కథలని తెలుగు లోకి అనువదించే వాడిని. ఆ అనువాదాలు విపులకు పంపేవాడిని.
పరశురామ్ అని కలం పేరు కల ఒక ప్రఖ్యాత బెంగాలీ కథకుని కథను "బటేశ్వరుని సృష్టి" పేర అనువదించాను. ఇది నాకెంతో ఇష్టమైన నా అనువాదం. విపులలో ప్రచురింపబడినది. కన్నడ, తమిళ, మరాఠీ, బెంగాలీ, సంస్కృత, మళయాళం, బెలూచీ, ఇలా మొత్తం 16 కథలను అనువదించాను; విపులలో అవన్నీ ప్రచురించ బడ్డాయి. ఇవన్నీ హెరిటేజ్, సంభాషణ సందేశః లలో ప్రచురించబడినవి.
ఆ తర్వాత ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానం, బౌద్ధం, జైనం, షడ్ దర్శనములు, రమణ మహర్షి భాషణములు ఇలా తత్త్వ శాస్త్ర గ్రంథాలను చదవడం లోకి మారి సాహితీ సృష్టిని, అనువాదాలను కొద్దిగా ప్రక్కకు పెట్టాను.
మనం మన జీవితంలో వివిధ దశలలో వివిధ రకాల సాహిత్యానికి, జ్ఞానానికి, కళలకు ఆకర్షింప బడతాము. ముందరి ఆకర్షణ కొత్త ఆకర్షణతో సన్నగిల్లుతుంది.
నేను తెలుగు, సంస్కృతం, ఆంగ్ల, ఫ్రెంచ్, జర్మన్ భాషలలో సాహితీ సృష్టి, అనువాద పరిశ్రమ చేస్తున్నాను. నేను చదివిన, నాకు సమానంగా ఇష్టమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధననూ కొనసాగిస్తున్నాను. మన తత్త్వ శాస్త్ర గ్రంథాలలోని విజ్ఞాన శాస్త్రాంశాలను వ్యాసములుగా రాస్తున్నాను.
ఇలా నా సాహితీ, విజ్ఞాన శాస్త్ర, జ్ఞాన పరిశోధనా ప్రస్థానం కొనసాగుతోంది.
******
గతవైభవ చిహ్నాలు
వేదాల్లో అన్నీ ఉన్నాయి అంటూ కోర్చోడం కన్నా
మనం ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని ఆ జ్ఞానంతో సుసంపన్నం చెయ్యాలి; లేకపోతే మనవన్నీ
వట్టి మాటలు; కట్టి పెట్టడం మంచిది, శ్రేయస్కరం
ఎప్పుడో భారతీయులు గొప్పవారు, అంటూ ప్రకటించుకోవడం కన్నా ఇప్పుడూ అంతటి వారం అయ్యి చూపాలి; లేకపోతే మన మాటలు వట్టి
గొప్పలుగా మిగిలిపోతాయి; దున్ననివాడు పండించలేడు
తత్త్వశాస్త్రాన్ని మథించిన అచార్యుల నీడన
బ్రతుకక మనమూ మథించి నవనీతం తీయాలి
మదించి కూచుంటే మిడి మిడి జ్ఞానులు అంత
తత్త్వాన్నీ తుప్పు పట్టించేస్తారు, తప్పుడు కూతలు కూస్తారు
బంగరు ఆభరణములను సాకేంతగా, సాకినట్టుగా
విలువనెరిగి శ్రద్ధాభక్తులతో వినియోగించుకోవాలి
మా తాతలనాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే సరిపోదు; సరిపడా శ్రమ పడాలి
ఆస్తులు వినియోగించుకొని అభివృద్ధి చెందుతూ
ఆస్తులు పెంచాలి; కూచుని తింటే కొండలైనా కరిగిపోతాయి
అర్హులైన వారసులవ్వాలంటే అంతటి వారం కావాలి
వట్టి మాటలతో శూన్యహస్తములతో వారికి సరితూగలేము
********

నా సంస్కృత భాషాధ్యయనం, "సారస్వత సృష్టి"

నా సంస్కృత భాషాధ్యయనం, "సారస్వత సృష్టి" 

సంస్కృత భాష నేర్చుకోవాలని నాకు కోరిక. 9 వ తరగతికి వచ్చే వరకు నేను చదివిన స్కూల్లో - మలకపల్లి, కొవ్వూరు దగ్గర, పశ్చిమగోదావరి జిల్లా - సంస్కృతం లేకపోవడం వల్ల ఆ దృష్టే రాలేదు.
9 వ తరగతిలో (1965-66) మా నాన్నగారికి వేగేశ్వరపురం అనే ఊరు బదిలీ అయింది. ఈ ఊరు మలకపల్లికి 5 కిమీ పోలవరం వైపు ఉంది. గోదావరి ఒడ్డు. మా నాన్నగారు అప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్. అంతకు ముందు మా నాన్నగారు బి. ఎడ్. అసిస్టెంట్ గా ఉన్నప్పుడు వేగేశ్వరపురంలోనే (1953) పుట్టాను. మళ్ళీ 9 వ తరగతికి ఆ ఊరే వచ్చాం.
నా భాషాధ్యయనం -1 లో ( నా బ్లాగ్ లో ఉంది) నా ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి మా నాన్నగారి ప్రభావం ఎంతుందో వివరించాను. మా నాన్నగారు ఇంగ్లీష్ మరియు సోషల్ టీచర్. హెడ్ మాస్టర్ అయ్యాక కూడా SSLC (11 th standard) వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేవారు.
వేగేశ్వరపురం స్కూల్ లో సంస్కృతం ఉంది. ఆ మాస్టారు చేరమనీ అన్నారు. కాని అప్పుడు సంస్కృతం తీసుకుంటే మార్కులు తక్కువ వస్తాయేమో, క్లాస్ ఫస్ట్ రానేమోనని తీసుకోలేదు. అలాగే స్కూల్ పోతుందేమో అని ప్రెసిడెంట్ స్కౌట్
గా ఎన్నికైనా ఢిల్లీ వెళ్ళలేదు. అలా సంస్కృతం నేర్చుకోవడం మొదలు కాలేదు. కాని కోరిక పోలేదు.
ఇంతలో M.Sc. అయిపోయింది (1974). ఒక 6 నెలలు ఖాళీ వచ్చింది. మా భీమవరంలో ఉన్న సంస్కృతం కాలేజీలోని లెక్చరర్ గారి దగ్గర సంస్కృత భాష ఓనమాలు మొదలు పెట్టాను. కొన్నాళ్ళు నేర్చుకునే సరికి రిసెర్చ్ లో సీటు వచ్చి హైదరాబాద్ ఆర్. ఆర్. లాబ్స్ (ఇప్పుడు IICT) లో JRF గా చేరాను. అలా తర్వాత University of Hyderabad లో రిసెర్చ్ కి మారాను. పి హెచ్. డి. కూడా పూర్తయింది. ఈ మధ్యలో CIEFL ( ఇప్పుడు English and Foreign Languages University - EFL University) లో జర్మన్ మూడు ఈవెనింగ్ కోర్సులు చేశాను. Advanced Diploma in German పూర్తయింది కూడాను.
పి హెచ్. డి. పూర్తయ్యాక (1983-84) వచ్చిన ఖాళీ సమయంలో హైదరాబాద్ దోమల్ గూడా లో ఉన్న రామకృష్ణ మిషన్ వాళ్ళు ఈవెనింగ్ కోర్సులో సంస్కృతం నేర్పుతున్నారని తెలిసి అందులో చేరాను. అక్కడ గురువుగారు మంచి ఉపాధ్యాయులు. సంస్కృతాన్ని సరళంగా, ఆసక్తికరంగా బోధించే వారు. కాని రెండు నెలలవకుండా బెంగళూరు I. I. Sc. లో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వచ్చింది. బెంగళూరు వెళ్ళి పోయాను సంస్కృత భాషాధ్యయనాన్ని ఆపేసి. భాష మీద పట్టేమీ రాలేదు అప్పటికి.
కాని అదే సమయంలో చందమామ ప్రచురణల వారు సంస్కృత చందమామ ప్రచురించడం ప్రారంభించారు. దానికి చందా కట్టి తెప్పించుకోవడం మొదలు పెట్టాను. పూర్తిగా అర్థం కాక పోయినా ఏదో చదువుతూండే వాడిని. శ్రమగా ఉండేది. ఎక్కువ గా చదవలేక పోయేవాడిని. బలవంతంగా కొన్నాళ్ళు చదివి ఆపేశాను. భాషలో ఏవిధమైన ప్రవేశమూ రాలేదు.
తరువాత కొన్నాళ్ళు మా ఊరు భీమవరంలో ఉద్యోగం చేశాను. అప్పుడుకూడా అడపాదడపా సంస్కృతాన్ని చూస్తూ టచ్ లో ఉంచుకున్నాను.
ఇంతలో పాండిచ్చేరి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి యానాంలో చేరాను. అప్పుటికి కొద్ది స్థిమితం కలిగింది, సమయమూ దొరికింది. అప్పుడు సంస్కృతం మీదికి దృష్టి మళ్ళింది.
అప్పుడు బెంగళూరు లో విశ్వ హిందూ ప్రతిష్ఠాపన వారు సంస్కృతం పోస్టల్ కోచింగ్ మొదలెట్టారు. అందులో చేరాను. కౌముది పాస్ అయ్యాను. వారి కోచింగ్ పాఠాలు సరళంగా, ఆసక్తిని రేకిస్తూ ఉండేవి.
అప్పటికే నేను తెలుగు, ఆంగ్ల వ్యాకరణములతో సరి పోల్చుకుంటూ జర్మన్ నేర్చుకొని సఫలీకృతుడిని అయ్యాను. జర్మన్ నేర్చుకుంటున్నప్పుడే విభక్తుల ప్రాముఖ్యం, ఉపయోగం తెలిసాయి. అలాగే జర్మన్ భాషలో ప్రతి పదము పుంలింగ, స్త్రీ లింగ, నపుంసక లింగ శబ్దాలలో ఏదో ఒకటి అవుతుంది. లింగ, వచనాలని బట్టి, వాటిని బట్టి విభక్తులలో పదం చివరలు మారతాయి. జర్మన్ భాషలో రెండే వచనాలు. జర్మన్ వారికి నామవాచకము అంటే ఇష్టం. అది వాక్యం లో ఎక్కడ వచ్చినా సరే పెద్దక్షరం రాస్తారు. మనమూ రాయాలి. మన తెలుగు భాషలా ఒక్కో వర్గానికి ఒక్కో లిపి, భాష ఉండవు. అందరికీ కావ్య భాష ఒకటే.
సంస్కృతం, తెలుగులలో సంబోధన ప్రథమా విభక్తితో ఎనిమిది విభక్తులు. జర్మన్ లో నాలుగు విభక్తులే. Prepositions విభక్తులకి ప్రత్యేకంగా ఉంటాయి. ఆంగ్ల భాషలో విభక్తుల పని proposition లు చేస్తాయి. అంచేత విభక్తులు ఆంగ్లభాషలో ప్రత్యేకంగా చెప్పరు. ఆంగ్ల భాషలో పదాలు లింగ పరంగా ఉండవు. అది ఒక సౌలభ్యం ఆంగ్ల భాష నేర్చుకోవడానికి. పదాల చివర్లూ మారవు.
ఫ్రెంచ్ భాషలో పదాలు పుంలింగ, స్త్రీ లింగ పదాలుగా ప్రత్యేకంగా ఉంటాయి. లింగ, వచన పరంగా పదాల చివర్లు మారుతాయి. ఫ్రెంచ్ వారికి విశేషణములు అంటే చాలా ఇష్టం. వారు కలల మనుషులు. వారికి క్రియాన్వయంలో, tenses లో కన్న కలలు చెప్పడానికి ఒక tense ఏర్పరచు కున్నారు. అంతటి భావప్రియులు ఫ్రెంచ్ వారు.
అన్ని జాతుల వారు ఒకే ఫ్రెంచ్ భాష రాస్తారు.
ఇంతలా పక్కకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, భాషల స్వరూప స్వభావాలు క్రమాలు విజ్ఞులు తెలుసుకోవడం అవసరం. భాష ఎలా చెబితే అలా నేర్చుకోవాల్సిందే. బేరాలు, తర్కాలు ఉండవు. న్యాయాన్యాలు ఉండవు. అందరికీ ఒకటే న్యాయం. సామాజిక న్యాయం అంటూ ఉండదు.
ఆంగ్ల భాషలో put పుట్, but బట్ అవుతుందంతే. అడగడానికి, తర్కించడానికి వీలులేదు.

సంస్కృత భాష సంస్కరించ బడిన ఏ భాషా?
సంస్కృతం పరిణమించక మునుపు పాలి, పైశాచీ, బ్రాహ్మీ మొదలైన ప్రాకృత భాషలు చెలామణీలో ఉండేవి.
సంస్కృత భాష ప్రత్యేకంగా రూపొందించబడిన భాష.
సంస్కృత భాషలో మన ప్రాచీన గ్రంథాలు అన్ని రంగాలవి ఉన్నాయి. ప్రస్తుతం సంస్కృతం ఎన్నో దేశాల వారిని ఆకర్షిస్తున్న భాష. దురదృష్టవశాత్తు భారతదేశంలోనే సంస్కృత భాషను ఒక మతం యొక్క, కులం యొక్క భాషగా భ్రమించి ద్వేషించే నాస్తికులు, హేతువాదులు ఎక్కువ. వారికి ఈ అకారణ ద్వేషం ఎందుకో తెలియదు. కేరళలో ముస్లిములు, క్రైస్తవవులు ఎంతో ప్రీతితో సంస్కృత భాష నేర్చుకుంటారు.
నాకు సంస్కృత భాష అంటే ఇష్టం. నేను నేర్చుకున్నాను. సంస్కృత భాష నేర్చుకోవడాన్ని వేగవంతం చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. 1990 లలో నేను ఆత్మదర్శనం అనే ఒక తెలుగు పుస్తకం మా కొలీగ్ ఇస్తే చదివాను. దానిని కొండూరి వీరరాఘవాచార్యులు రచించారు. ఆ పుస్తకం చదువుతూంటే "జ్ఞ" అనే పదం నన్ను ఆకర్షించింది.
"జ్ఞ" అంటే to know. వెంటనే నాకు ఒక స్ఫురణ వచ్చింది. ఆత్మ మనలో ఉండడం వల్ల మనం తెలుసుకో గలుగుతున్నాం అనీ మనకు అన్ని రకముల జ్ఞానములు కలుగుతున్నాయని. ఆ స్ఫురణనే పెంచుకొని ఆత్మజ్ఞానాన్ని నాదైన దృష్టితో చూడడం మొదలుపెట్టాను. నిజానికి నాదైన దృష్టి మన ఉపనిషత్ స్రష్టల దృష్టి అని తరవాత్తరవాత తెలిసింది. వ్యాఖ్యానాల వల్ల రూపు మారిపోయింది అనీ అర్థం అయింది.

ఆస్తికులు సంస్కృత భాషను దేవభాష అంటారు. అంతటి దివ్యత్వం ఉంది సంస్కృత భాషలో.
నేను విశ్వహిందూ ప్రతిష్టాన బెంగళూరు వారి పోస్టల్ కోచింగ్లో సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టిన రోజుల్లోనే ఆత్మజ్ఞానం అవగాహన కలగడం ప్రారంభించింది అని ముందు భాగంలో చెప్పాను.
కొండూరి వీరరాఘవాచార్యుల ఆత్మ దర్శనం పుస్తకం చదువుతున్న రోజుల్లోనే గుంటూరి లక్ష్మీకాంతం గారు రచించిన "నాయన" అనే శీర్షిక కల పుస్తకం నా చేతికి అందింది. ఆ రచయిత అన్నగారి కుమారులు గుంటూరి రామకృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన మంచి జ్ఞాన సంపన్నులు. అన్ని విధముల పుస్తకాలు చదివి మంచి అవగాహన సంపాదించిన వారు. ఆయనతో సంభాషణలు నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేవి.
మా మాటల్లో ఆయన నన్ను కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని తెలుసా అని అడిగారు. తెలియదని చెప్పారు. అప్పుడు ఆయన కావ్యకంఠ గణపతి ముని గురించి టూకీగా చెప్పారు. నేను గణపతి ముని వ్యక్తిత్వం పట్ల, జీవితం పట్ల, ఆయన ప్రజ్ఞా పాటవాల పట్ల ఆకర్షితుడనయ్యాను. "నాయన" ఆయన ఆత్మకథ.
"నాయన" పుస్తకం నాకు ఇచ్చి చదవమన్నారు. నేను ఏక బిగిని చదివేసాను. ఎంతో ప్రభావితుడ నయ్యాను. ఆ చదవడంలో గణపతి ముని రమణ మహర్షిని గురువుగా భావించారని తెలిసి రమణ
మహర్షి మీద ఆసక్తి కలిగి, పెరిగింది.
అంతవరకు రమణమహర్షి గురించి నాకు తెలిసినది చాలా స్వల్పం. చలం తన చివరి రోజులు రమణాశ్రమంలో గడిపాడు అనే సందర్భంలో మాత్రమే రమణమహర్షి గురించి విన్నాను. ఆయన ప్రతిభ "నాయన" పుస్తకం చదివాక తెలిసింది. "నాయన" అనేది రమణమహర్షి గణపతి మునిని పిలిచే పిలుపు అనీ తెలిసింది.
నాయన 1905 ప్రాంతంలో బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతున్న స్వామిని ఒకటి రెండు సార్లు కలుసుకొని, మూడవ సారి ఎంతో ఆర్తితో మహర్షిని తపస్సు అంటే ఏమిటి అని అడిగి ఆయన సమాధానానికి అప్రతిభుడై, తక్షణం బ్రాహ్మణ స్వామిని గురువుగా స్వీకరించి, ఆయన అసలు పేరు వేంకట రామన్ అని తెలుసుకొని ఆయనకు రమణ
మహర్షి అని పేరు పెట్టారు. ఆ పేరే బ్రాహ్మణ స్వామికి
స్థిరపడింది. అదే సమయంలో శ్రీ గణపతి ముని ఇంద్రాణీ సప్తశతి తెలుగు అనువాదం చదివాను. ఆయన ప్రతిభా వ్యుత్పన్నల గురించి మరొక సారి ప్రస్తుతిస్తాను. రమణుల గురించి ప్రత్యేకంగా రాస్తాను.
నా సంస్కృత భాషాధ్యయనానికీ దీనికి సంబంధం ఉంది. ఉపనిషత్తులు, భారతీయ తత్త్వశాస్త్రం సంస్కృతంలో రచించబడ్డాయి. ఆత్మజ్ఞానం గురించి సంస్కృతభాషలో ప్రవేశం ఉండి తీరాలని చాదస్తుల, సాంప్రదాయీకుల నమ్మకం. మరోమాట చెబితే వినరు. మాట్లాడితే, శంకరుని, రామానుజులని, మధ్వాచార్యులని ఉటంకించే సాంప్రదాయ వాదులు,
ఆచార్యుల వ్యాఖ్యానాలను చిలుక పలుకుల్లా అప్పచెబుతారు. వారికి కల అవగాహన పరిమితం.
తమ తత్త్వంలో, సాంప్రదాయంలో, వేదాంతంలో నిష్ణాతులైన వీరు "వారి సాంప్రదాయం అనే నూతిలో కప్పలు". మరొక వివరణ అస్సలు వినరు.
ఇటువంటి వారు సంస్కృతం రాని నా వ్యాఖ్యను కొట్టిపారేస్తారు. అందుకని సంస్కృతం నేర్చుకొని తీరవలసిన అవసరం కలిగింది నాకు. నాకు తరువాత సంస్కృత భాషతో సంబంధం లేకుండా ఆత్మ/బ్రహ్మ జ్ఞానముల మీద అవగాహన కలిగినా
విమర్శకులను తట్టుకోవడానికి సంస్కృత భాషలో అభినివేశం ఉండి తీరాలని నిశ్చయించుకున్నాను.

భాష మీద పట్టు రావాలంటే ప్రతి భాషలోనూ వ్యాకరణం, శబ్ద సంపదా మన సొంతం చేసుకోవాలని నాకు అర్ధం అయ్యింది. సంస్కృత భాషకు సంబంధించినంతవరకు పదాలు ఇంచుమించులో తెలుగు వారమైన మనకు పరిచయమే. జర్మన్ భాష నేర్చుకోవడం వల్ల విభక్తుల ప్రాముఖ్యం, పదాల చివర్లు వచన, లింగ, విభక్తులని బట్టి మారతాయనీ తెలిసింది.
స్కూల్ లో తెలుగు విభక్తులు నేర్చుకున్నా మాతృభాష అవడం వల్ల పదాల చివర్లు మారడం అనే స్పృహ కలగలేదు. ఈ విషయం తెలియక 9 వ తరగతిలో మా హిందీ మాష్టారు మాకు హిందీ వ్యాకరణం చెబుతూంటే ఎందుకు సరిగా అర్థమవలేదో ఇప్పుడు తెలిసింది. హిందీలో కూడా శబ్దాల స్త్రీ, పుంలింగ విభాగాన్ని, వచనాన్ని బట్టి కా, కీ, కే లు వస్తాయని ఈ సందర్భంలో తెలిసింది. పదాన్ని బట్టి చివర్లు మారతాయి అని అప్పటికి అనుభవం కాలేదు. స్పృహా రాలేదు. జర్మన్ భాష నేర్చుకోవడం వల్ల ఈ స్పృహ కలిగింది.
ఆ స్పృహతో సంస్కృతం నేర్చుకోవడం తేలిక అయింది. వ్యాకరణాన్ని ఆంగ్ల వ్యాకరణంతో సరిపోల్చి నేర్చుకున్నా. దానితో వ్యాకరణం సులువుగా మచ్చికైంది. పదాలు తెలిసినవే. దానితో పాటు సంస్కృతం చందమామ చదవడం కూడా మొదలుపెట్టాను. పోస్టల్ కోచింగ్ ఎలాగా ఉంది.
ఒక విధమైన సులువుతో ఆడుతూ పాడుతూ సంస్కృత భాషాధ్యయనాన్ని ఆనందిస్తూ చేశాను.
ఆ హుషారులో సంస్కృతంలో "పరాన్నజీవినః" అని ఒక చిన్న కథ రాసి సంభాషణ సందేశః కి పంపించాను. అది ప్రచురించ బడింది. ఆ తర్వాత ఇంకో 3 కథలు, 3 వ్యాసాలు సంభాషణ సందేశః లో ప్రచురించ బడ్డాయి. అవి:
కథలు:
విస్మృతిః; బ్రిగీటా, అనాఘ్రాతమపి ఆఘ్రాతం పుష్పమ్
వ్యాసములు:
శూన్యాని; కాలః నామ; ఆత్మా-మనః-ధ్యానమ్
కొన్ని కవితలు రాసాను. అవి:
గిరిఝరిః, సౌందర్య లహరి; విష్ణు వైభవమ్
కనకదుర్గా స్తవమ్; శ్రీ రామచంద్రాష్టకమ్;
త్రిపురసుందరీ దశశ్లోకీ; శ్రీ కమలాంబికా ద్వాదశ మంజరీ స్తోత్రమ్; కోऽహమ్
అహంశబ్ద తాత్పర్య దర్శనమ్ - అనే వ్యాసం కూడా రాసాను.

నేను సంప్రాయబద్ధంగా సంస్కృతం నేర్చుకోలేదు. కావ్యాలు చదువుకోలేదు. ఆధునిక పద్ధతిలో నా అంతట నేను నేర్చుకున్నాను. నా భాషా పాటవం సంస్కృతంలో కథలు, వ్యాసములు, ఛందస్సులేని కవితలు రాయడానికి సుబ్బరంగా సరిపోతుంది. ఉపనిషత్ వాజ్ఞయం, ఇతర దర్శనములు, సూత్ర కావ్యములు చదివి అర్థం చేసుకొనేందుకు సరిపోతుంది. 
తరువాత Elements of Cognitive Science I Ancient Indian Spiritual Wisdom అనే పరిశోధనా కార్యక్రమంలో మునిగిపోయి సంస్కృత సారస్వత సృష్టి చేయలేకపోయాను. నేను సంస్కృతంలో చేసిన సాహిత్య సృష్టి అత్యల్పము. కాని నాకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చింది.
మళ్ళీ త్వరలో సంస్కృత సారస్వత సృష్టి మొదలుపెట్టాలని సంకల్పం.

Monday, August 13, 2018

సత్య దర్శనం ; What and Who shaped our lives?; ఇంగిత లేమి; The Sand Particles; ద్వేషించే మేధావులు; Recognition; గృహస్థులు, గృహిణులు; మాధవ ఉవాచ

సత్య దర్శనం 

ఈ ప్రపంచంలో నిజం తెలుసుకోవడం కన్న ఒక విధమైన ఊహాలోకంలో ఉండడం చాలా మంది తెలియకుండా చేసే పని. సత్య దర్శనం కన్న సత్య మిథ్యా దర్శనాలే, వ్యాఖ్యానాలే అలరిస్తాయి. మిథ్యాసత్యం ఒక అబద్ధపు లోకంలో విహరింప జేస్తుంది.
కలల ప్రపంచం ఇచ్చే హాయి మరొకలా కలుగదు. ఒక పరిమితిలో కలల ప్రపంచంలో జీవించడం అవసరమే. ఉపయోగమే.
సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వల్ల, ఆశా భంగానికి కూడా లోను కావచ్చు. సత్యాన్ని మనం ఒకలా ఊహించుకొని ఆ అబద్ధపు లోకంలో ఉండడం ఎక్కువగా జరుగుతుంది.
ఉపనిషత్తులు, ఇతర వేదాంత గ్రంథాలు, షడ్ దర్శనాలు, ఆచార్యుల వేదాంతాలు ఏం చెప్పాయో‌
సరిగా తెలుసుకోకుండా ఊహించుకోవడం ఒక అవగాహనను ఇస్తుంది. ఈ అవగాహన లోనే ఉండిపోవడం ఒక విధమైన స్థిమితాన్ని ఇస్తుంది.
ఈ అసంపూర్ణ అవగాహన చాలామందికి చాలా వరకు సరిపోతుంది. సంపూర్ణ అవగాహన ఎప్పుడైనా కలిగితే అది నిజం కాదని అనిపిస్తుంది.
సంపూర్ణ అవగాహనతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారని అనిపించి వారిని ఈసడిస్తారు. మిడి మిడి జ్ఞానం ఇచ్చే భరోసా అంతటిది.
అసమగ్ర వ్యాఖ్యానం సమగ్ర వ్యాఖ్యానాన్ని తప్పు అనుకుంటుంది. ఇదంతా ఎందుకంటే నిజం, సత్యం మన ఇష్టాయిష్టాలకు, నచ్చిన వ్యాఖ్యానాలకు, ప్రవచనాలకు, ప్రాచుర్యానికి, ప్రచారాలకు విరుద్ధంగా ఉంటే మనం సత్యాన్నే నిరసిస్తాము. నిలదీస్తాము.
ప్రపంచంలో సత్యాన్ని ఎవరికి కావలసినట్టు వారు
అన్వయించుకొని, అవగాహన చేసుకొని శాంతి సుఖములు అనుభవిస్తారు.
అసలు నిజం అంటూ ఉండదు. ఎవరి వేదాంతావగాహన పరంగా వారికి వారి నిజం ఉంటుంది.
ఇలా కలిగిన వివిధ అవగాహనల వల్ల సత్యం మరుగున పడి అసలు సత్యం ఏదో చెప్పడానికి వీలు లేకుండా తయారవుతుంది. ఎవరి సంప్రదాయం వారిది. అలా సమాంతరంగా ప్రశాంతంగా ఉంటే ఎంతో శాంతి సౌఖ్యాలు. కలహించుకుంటే అనవసర స్పర్ధలు.
*********
What and Who shaped our lives?
Definitely the Ramayana, the Mahabharata, the Mahabhagavata, the upaakhyaanas present in them, the Panchatantra, the Hitopadesa, the Jataka Tales, the spiritual literature from the Upanishads have shaped our lives who are born between 1950s and 1980s.
The movies had a tremendous effect on our psyche and we have unconsciously and unintentionally became the fans of cine stars. The cine lyrics have also refined our literary taste and sense in addition to the classical literature.
These pleasant and charming conditions moulded our interests and love for life and living.
Also our parents and elderly relatives and family friends became examples by their living.
Our parents especially have been our spiritual gurus, and even today we do not go to any swami, Baba, Amma, sanyasi or a spiritualist. Our parents' teaching by their practice and behaviour has been so profound and deep. We learnt through their words, deeds, actions and reactions how to face a problem in family or outside. Our teachers in primary, secondary, tertiary levels of learning and in the University have been adequately useful and influencing.
We as human beings have been shaped by aesthetic literature, fine-arts, parents, elders and creative people around. Learning has been earnest.
So many things and persons are necessary for the useful upbringing of kids.
Nowadays these aspects are either ignored and forgotten or considered unnecessary.
Thus we are all suffering the absence of such responsible upbringing. A nation or society need so much effort to train and shape their little citizens. Such responsibility is unfortunately missing now.
*******
ఇంగిత లేమి
భారతదేశంలో ఉన్న వైవిధ్యాలకు అనుగుణంగా ఏ మేధావి, సాహితీ కారుడు, మతం ప్రవక్తలు, నాస్తికులు, హేతువాదులు ఇతర కళాకారులు, జ్ఞానులు సమైక్యతను అందించడం లేదు.
వేల సంవత్సరాల చరిత్ర ఒకటే అంటుంది.
ఏ మతమూ ఇంకో మతాన్ని లేకుండా చేయలేదు.
ఏ సంస్కృతీ ఇంకో సంస్కృతి, నాగరికత సంప్రదాయాలు, సంస్కారం లేకుండా చేయలేదు.
సర్దుకు పోవడమే నాగరికత. సంస్కృతి. సంస్కారం, సాంప్రదాయం.
దీనికి విరుద్ధమైనవి సంఘంలో శాంతి సుఖములు లేకుండా చేస్తాయి తప్ప మరేమీ సాధించలేవు.
ఈ మాత్రం ఇంగితం ఇప్పటి వారిలో ఎందుకు లోపించిందో అర్థం కాదు. సంస్కర్తలు వచ్చారు, సంస్కరించారు, పోయారు. మళ్ళీ మామూలే.
ఓ మతాన్నో, ఓ కులాన్నో, ఓ ప్రాంతాన్నో, ఓ సంస్కృతినో, ఓ భాషనో, ఓ సాంప్రదాయాన్నో ఓ ఉప జాతీయతనో, ఓ సిద్ధాంతాన్నో పట్టుకువేలాడక మానవులందరి సుఖశాంతులు కోరుకోవాలి. లేకపోతే ఎవరికీ సుఖశాంతులు ఉండవు.
ఇతరులకు హాని కలిగించని ఎవరి సాంఘిక, మత, కుల, ప్రాంత, సంస్కృతీ, నాగరికతా, సాంప్రదాయ ఆచారాలను వారు అనుసరిస్తూ ఇతరులను వారి వారి సాంస్కృతిక, సాంఘిక ‌నియమాలను పాటించ నీయాలి.
ఇవి ఆదర్శవాదుల మాటలు కావు. మన ఉనికిని భద్రపరిచే చద్దికూటి మూటలు.
సామరస్యము, సౌమనస్యము, పంచని, పెంచని సాహితీ కారులు, మేధావులు, నాగరీకులు దేశానికి బరువులు. ప్రజల సుఖశాంతులకి పురోభివృద్ధికీ అడ్డులు. అడ్డంకులు.
*******
The Sand Particles
Writers, intellectuals and leaders
Are sand particles on the vast beach of
Humanity, civilization, culture and Knowledge;
But they are arrogant to besmirch
Civilisations, cultures, knowledge
And everything with their limited
Knowledge and exposure; they dictate
Ways of living to ordinary folks
And criticise great expositions
And want to replace tradition, civilization And cultures with their favourite isms
It is a routine in human societies
That such individuals destroy existing
Civilisations, culture and Knowledge
And try to replace them with their
Half-baked knowledge, "genius"
And affiliations; they disturb every
Existing thing without giving an alternative
Such internationals, writers and leaders
Are incapable of creating a new order
They only cause disorder and disturbance
********
మనకి ఏ పనీ లేకపోవడమే మనం అంతర్జాల సాలెగూళ్ళలో అస్తమానూ కనిపించడానికి కారణం. మన జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞాన ప్రదర్శన చేయాలనే ఉత్సుకత కూడా కొంత కారణం.
అంతర్జాల సాలెగూటి మాధ్యమాలు మనకి కాలక్షేపం బఠానీలు మరియు కళా ఆవిష్కరణ స్థలాలు. పోసుకోలు కబుర్లు చెప్పుకోవడానికి కాణాచులు.
నిజానికి మనం నేర్చుకునే దాని కంటే ప్రదర్శించేదే ఎక్కువ ఉంటుంది. మనకన్నీ తెలుసు. అందరికీ సలహాలిస్తాం. విమర్శిస్తాం. అన్ని దారుణాలను, దౌర్జన్యాలను మన ఇంట్లో కూర్చుని నిరసిస్తాం. తీర్పులు చెప్పి నేరస్థులను శిక్షిస్తాం. అన్ని గొడవలు మనకే. మనవే. సాంకేతికత అందించిన వరం ఇది మనకు.
*********
ద్వేషించే మేధావులు

మనకి ఆర్ధిక శాస్త్రం ఏమీ తెలియదు. కానీ ప్రభుత్వాన్ని ఆర్ధిక నిర్ణయాల్లో చీల్చి చెండాడేస్తాం.
మనకి విద్య గురించి ఏమీ తెలియదు. కానీ ప్రభుత్వం విద్యా విధానాన్ని చీల్చి చెండాడేస్తాం.
మనకి విదేశాంగ విధానం గురించి ఏమీ తెలియదు. కానీ విదేశాంగ విధానంలో ప్రభుత్వం నిర్ణయాలను చీల్చి చెండాడేస్తాం.
మనకి సంస్కృతి గురించి ఏమీ తెలియదు. కాని ప్రభుత్వ సాంస్కృతిక విధానాన్ని చీల్చి చెండాడేస్తాం.
ఇంతకీ మనం ఎవరం?
రచయితలం. మేధావులం. పత్రికల వారం. ప్రధాన మంత్రి ని ద్వేషించే వారం. మనకి అన్ని హక్కులూ ఉన్నాయి. బాధ్యతలు లేవు. దేశం బాగుపబడం కన్న
మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలే ముఖ్యం.
********
ప్రపంచంలో సత్పురుషులు రెండు పరిస్థితుల్లోనే సుఖంగా ఉండగలరు.
ఒకటి సర్వ సంగ పరిత్యాగ్యంలో.
లేదా
రెండవది అమిత ఐశ్వర్యంలో.
********
కొడుకులకు, కూతుళ్ళకు, బామ్మర్దిలకి, పెళ్ళాలకి, అయినోళ్ళకి రాసిచ్చే ఆస్తి భారత ప్రజాస్వామ్యమున
పార్టీ పెట్టుట, నడుపుట. ఓటర్లు ఇందుకై యథా శక్తి సాయం చేస్తారు. పార్టీల కుటుంబ పాలన భారత దేశమున అమలులో ఉన్న ప్రజాస్వామ్యం.
********
Recognition
Many "writers" are getting recognition because of their other backgrounds rather than literary background and merit in creation. The caste, region, religion, community, ideology, gender etc., are interfering in the "estimation" of a literary work. These backgrounds are used both by "writers" and critics. This is marginalising the literary standards.
********
గృహస్థులు, గృహిణులు నేడు మానసికంగా బేలలు అవడం వల్ల స్వాములు, సన్యాసులు, బాబాలు, అమ్మలు, ఆధ్యాత్మిక ప్రవచనకారులు సంసారులను తేలికగా చూస్తున్నారు. ఋజు మార్గంలోనో, అడ్డంగానో సంసారులు సంపాదించే ధనము, ఆస్తిపాస్తులు, సంసారుల వ్యాపకాలు (CA, Doctor, మొదలైన ప్రొఫెషనల్స్ ల వృత్తులను వాడుకోవడం) ఉపయోగించుకుంటూ, సంసారులను అజ్ఞానులుగా, "పాపులు" గా, ఉద్ధరింపబడవలసిన వారిగా చూడడం ఈ "ఆధ్యాత్మిక" వేత్తలకే చెల్లింది.
సంసారంలో వడిదుడుకులు పడినవాడెవడూ సంసారులను తేలికగా చూడడు. ఏ బాదరబందీ లేకుండా రికామీగా బ్రతుకుతూ సంసారుల సాధక బాధకాలు తెలిసీ వారిని తేలికగా చూడడం ఆధ్యాత్మికత కాదు. పొట్ట కూటి కోసం చెప్పే మాటలు.
ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్నంత మాత్రాన ఈ వేత్తలు సంసారుల కన్నా గొప్పవారు కాదు.
*********
మాధవ ఉవాచ:
సఖీ! రాధా!
చిదిమి నిన్ను పెట్టుకొనవచ్చును దీపము
అదుముకొని నిన్ను తీర్చుకొనవచ్చును తాపము
రత్నహారములచే నీ శంఖ సదృశ కంఠ సీమల నలంకరించనను
బంగారు గాజులు నీ పసిడి చేతులకు తొడిగినను
పట్టుచీర గట్టి వడ్డాణము పెట్టి నే మురిసిపోయినను
ఈ పై మెరుగులు నీ మేని సహజ సౌందర్యము ముందు
వెల వెల బోవునేమో నని సందియమగుచున్నది ప్రియా!
నీ పై ప్రేమ తప్ప మరే పెన్నిధి లేని పేదవాడను
మనసున మనసు కలిపి నీతో పొందునకై అలమటించుచున్న
చేలికాడను నీ వాడను నీవే నేను సఖీ!
శృంగారముల రస సింగారముల ముంచి తేల్చమని
రస ప్రణయ పాఠములు నేర్ప మని మురిపెముతో
నిను చేర లేదనుటలు కాదనుటలు ఈ జన్మ కింతే యనుటలు
నా హృదయము పై సమ్మెట పోటులు తల పై రోకటి పోటులు రాగమయీ!
శృంగారము నీవు తత్త్వము నేను నేరుపుచుండ
మన మేనులు పరస్పరము అల్లుకొని లీనమై
మమేకమగు క్షణములిప్పుడే రావలె
లేనిచో నేవు నేను ఆనందమునకు దూరమై దూరమగుదుము
సరసము పండవలె ప్రణయము జాలువారవలె మన రస ప్రయాణమున
సఖీ! ప్రియా! నీవును నేనును ఒకటే
రాస లీల మన సయ్యాట; మన జీవితముల జీవమదే
చెలీ! మన ప్రత్యేకానుబంధమున మనమిద్దరమూ
మన మేనుల కలయికలో పెంచుకొవలె ఫలింప చేసుకొవలె
గోపాలుడ నేను గోపికవు నీవు
పురుషుడను నేను ప్రకృతివి నీను
మన సంగతిలో పులకించును
ప్రణయము! రసాస్వాదనము!
ప్రకృతి; పుడమి అంతా!

Friday, August 10, 2018

Depression; The mystery remains; వెదజల్లినజల్లిన కేకలు; నడిరేయి నను చూసి నవ్వుతావెందుకు?; జ్ఞానం ; సున్నా లేని సంఖ్యాశాస్త్రం

Depression
Most of modern men and women suffer from depression because they either do not know to love and shower affection on near and dear or do not love and shower affection and be loved.
Humans must love and be loved. Even though modern Life and life styles ignore fellow human beings - though are near and dear - the psychological requirements need it. Amnesia for this is partially responsible for the onset of depression among modern
men and women.
Affection and love are balm to psychological afflictions. We can't survive without them.
**********
The mystery remains
I continue wondering how a literary creation gets name and fame and becomes classical. I find various genres of literary creation becoming popular and also well-read.
In any language, any type of literature , poetry, fiction, novel etc., - having different ideologies, cultures, civilizations, social, religious and spiritual - interests only a few become "great".
Narration, sticking to literary values, trends,
having wedded to a religious, social philosophy, spiritual practice, a particular genre of creation - poetry, drama, fiction and the like - might be some elements that are fanciful and dear to readers.
Critics play an important role in making or marring a literary piece. Aesthetics and live for literature of readers also make a literary piece immortal.
Still my wonder continues and the yardstick of standardization still misses to me. Popular works are not always great works just as great works are not always popular. The mystery remains.
***********
వెదజల్లినజల్లిన కేకలు
కరుణనైన నరసింహుడినైన
మరణం సమముగా వరించును
మరణించిన వారికి అన్ని బంధములు తెగిపోతాయి
హడావుడి అంతా మిగిలిన ఇంటివారిదే అభిమానులదే
వారి వారికి అనుచరులకు అనుయాయులకు
జ్ఞాపకములలో మెదలుచుందురు కొంతకాలము
ఆపై కలిసిపోదురు కాలగర్భంలో శాశ్వతంగా
ఎవరు మిగలరిక్కడ నాస్తికులైనా కవులైనా
సమాజాన్ని అతలాకుతలం చేసే వారైనా
సమాజం శాంతి సుఖములు చూసేవారైనా
సమముగా కీర్తింపబడుదురు సంఘమున
జడమగునది పార్థివదేహం; కాదు వెదజల్లిన కేకలు
*********
నీతిని పాటించే రోజులు కావివి.
నీతిని గురించి మాట్లాడే, ఉపన్యాసాలు ఇచ్చే, ప్రవచనాలు చెప్పే రోజులు మాత్రమే.
అందరం తెలివిమీరి పోయాం. ఇతరులను నీతి విషయంలో తప్పు పట్టినంత గాఢంగా మనం నీతిని పాటించం.
*******
నడిరేయి నను చూసి నవ్వుతావెందుకు?
రస సంగరమున రసేశ్వరుడు మాధవునికి సమ ఉజ్జియై చెలరేగి
కామోద్దీపనమున స్పందించిన ఆణువణువూ ఝంఝామారుతమై
తనూసాగరమునూప చెలరేగిన రత్యేచ్ఛా కెరటములతో 
పోటీ పడుచు ఎగసి పడుచున్న వక్షద్వయమును
అధ్యక్షించిన స్వామి రాధాదేవి అభీష్టమును తీర్చిన పిదప
రమణి శాంత చిత్తయై సుఖానుభూతిని ఆస్వాదించుచున్న వేళ
మాతృత్వ చిహ్నములు, మంగళ సూత్రముల వహించి
నెమ్మదిగా ఎగసిపడుచున్న ప్రేయసి పాలిండ్లను చూచి
క్షణము క్రిందట వాటి ఊపులు ఊయలలు గుర్తుకు వచ్చి
కృష్ణుడు తన నెమ్మోమున చిందించెను సుందర దరహాసము
అర్ధ నిమీలిత నేత్రయయ్యు గమనించి రాధ
వీణా స్వనమున ప్రియుడ నడిగె మత్తుగా
నడిరేయి నను చూసి నవ్వుతావెందుకు?
*********
అసెంబ్లీ కి హాజరు కాకుండా, ఏదో రిజిస్టర్ లో సంతకం పెట్టి ఎమ్.ఎల్.ఏ. వేతనాలు తీసికున్న,
తీసి కుంటున్న ప్రజాప్రతినిధులు భారతదేశంలో ఎందరో! వారిలో ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, తమ ఇష్టారాజ్యంగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. ద్రావిడ సింహాలు కూడా అందులో ఉన్నాయి. ఉపజాతీయతతో పౌరులను విడదీసి పబ్బం గడుపుకునే, గడుపుకున్న నాయకులు మరణించినంత మాత్రాన గొప్నవారవుతారా? భారతదేశంలో అయిన దానికీ కాని దానికీ ఓపిక ప్రదర్శించడం ఒక రివాజు, దుర్గుణం అయింది.
*********
భారతదేశంలో హిందూమతం అణగద్రొక్కబడాలని కోరుకునే వారిలో ఏ మతానికి చెందం అని గర్వంగా చెప్పుకునే - వారి కుటుంబాలు అనూచానంగా సనాతన ధర్మాన్ని ఆచరించినవే - నాస్తికులు, హేతువాదులు ఎక్కువ.
ఇదేమి గోరోజనమో?
వారి పరిధిలోకి మరే మతాల మంచి చెడ్డలు రావు.
ఇదేం మూర్ఖత్వమో? లోపాలు లేని మతం పృథివిలో ఉందా?
ఈ హ్రస్వ దృష్టులకు మాత్రం ఏదీ, ఏమీ ఆనదు. సమాజ దౌర్భాగ్యం.
హిందూ మతం మీద ఈ అకారణ ద్వేషం ఎందుకో అర్థం కాదు.
*******
జ్ఞానం అంటే ఏమిటి?
ఏది కలిగితే మనశ్శాంతి ఏర్పడుతుందో అది జ్ఞానం అని ఒక నిర్వచనము.
మన జీవికకు వృత్తులలో ఉపయోగించే కౌశలములు, నైపుణ్యాలు జ్ఞానం పరిధిలోనికి రావు. అవి లౌకికమైనవి. వాటినీ మనం జ్ఞానం అంటాము.
విజ్ఞానము ప్రకృతి, సాంఘిక శాస్త్రాలకు సంబంధించినది.
పరిజ్ఞానం మనందరం అంతర్జాల మాధ్యమాల్లో చూపించేది.
కళలు లలితకళా జ్ఞానాలకు సంబంధించినవి.
జ్ఞానం తప్ప మిగతావేవీ అజ్ఞానాన్ని పోగొట్టలేవు.
జ్ఞానము కానిది అజ్ఞానము.
********
మోడీని, హిందూ మతాన్ని తిడుతూ, హిందూ మతాన్ని మోడీ నుంచి వేరుచేయక అందరి హిందువులను, భక్తులను, జ్ఞానులను కించపరుస్తూ పబ్బం గడుపుకునే కుహనా మేధావులకు, సెక్యులరిస్టులకు ఇంగితం లేదు. హిందువుల మనసులను పదే పదే గాయపరుస్తున్నారు. మోడీ వేరు, హిందూ మతం వేరు అని ఈ అజ్ఞానులకు ఎప్పటికి తెలుస్తుంది? తెలవదు.
********
సినిమా లేని మన బ్రతుకులు
సున్నా లేని సంఖ్యాశాస్త్రం
స్మార్ట్ ఫోన్ లేని మన జీవితం
శూన్యము లేని బూలియన్ ఆల్జీబ్రా
మాల్స్ కి, మల్టిప్లెక్స్ లకి వెళ్ళని మన నాగరికత
ఆన్, ఆఫ్ గేట్ సర్క్యూట్లు లేని డిజిటల్ ఎలక్ట్రానిక్స్
పబ్లకు వెళ్లి మద్యం, మాదక ద్రవ్యాలు సేవించని
మన సంస్కృతి శూన్యము వహించని పదార్ధము
తోటి మనుషుల కుటుంబ సభ్యుల మంచి చెడ్డలు
పట్టించుకోని మన జీవనశైలి శూన్యసహిత ప్రపంచం
*******
చదవడం మనిషిని ఉత్సాహపరుస్తుంది.
అనవసరంగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది.
పగటి కలలు కనడం మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.
విచక్షణ వ్యథల నుంచి, వేదనల నుంచి రక్షిస్తుంది.
వివేకము చింతలను బాపుతుంది.
రక్తి, భక్తి జీవితాన్ని రస భరితం చేస్తాయి.
స్నేహం ఇవ్వన్నీ ఇస్తుంది. మనలని చక్కబెడుతుంది. చక్కబరుస్తుంది.
*********
ఊపిరి
వ్రాయుట కొందరికి ప్రవృత్తి
సూక్తులు చెప్పి సమాజాన్ని
మార్చెయ్యాలనే అమాయకత్వం
లేదు; నిజానికి రచనలన్నీ ఉపదేశాల
కొరకు కావు; జలపాతం దూకినట్టు
నది ప్రవహించినట్టు, మొగ్గ విరిసినట్టు
చెట్లు పూసినట్టు, చక్కని కన్నియ
సొగసులద్దుకున్నట్టు, చిక్కని దేవి
కులికినట్టు, అంతా ప్రకృతి దరహాసం;
సత్పురుషుల ఉపకార మనస్తత్వం
ప్రతిబింబించే ప్రకృతి సోయగాలు
రామణీయకము రచనకు ఊపిరి
*********