విషయము అంటే దృశ్యము, శబ్దము, రుచి, వాసన, స్పర్శ లలో ఒకటి. విషయసుఖము ఆంటే ఈ విషయములు కలిగించే తృప్తులు, సుఖములు. వీటిలో మమకార, ఇష్ట వస్తువు అంది కలిగించే సుఖము, ఉన్నాయి.
మనందరమూ విషయం సుఖములు కావాలని వెంపర్లాడతాము. ఇందులో తప్పేమీ లేదు. మోతాదు మించకూడదు. ధర్మబద్ధముగా విషయసుఖములు అనుభవించాలని పెద్దలంటారు. మనము ఈ సుఖాల హడావుడిలో ఒకవిషయము మర్చిపోతాము.
అది ఏ విషయాలైతే మనకు సుఖాలు కలిగిస్తాయో ఏవ్ మనకు దుఃఖాలూ కలిగించవచ్చు. కలిగిస్తాయి కూడా. అంచేత మనము దుఃఖాలు కలగకూడదని కోరుకుంటాము. కానీ విషయం వాంఛ (పైన ఉటంకించిన ఏ విషయ సుఖమైనా) పోగొట్టుకోవాలనుకోము. విషయ దుఃఖము వలె విషయసుఖాన్ని మనము వదిలెయ్యగలగాలి, వదిలెయ్యాలి అని యోగసారా ఉపనిషత్ చెబుతోంది.
విషయవాంఛ తీరినప్ప్పుడు సుఖము, తారనప్పుడు దుఃఖము కలుగుతాయి.
విషయవాంచే లేకుంటే సుఖదుఃఖములుండవు. దుఃఖము లేని జీవితము కావాలి కానీ, సుఖము లేని జీవితమును కోరుకోవడం ఎలా? సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా అనుభవించడానికి సిద్ధపడితే విషయం వాంఛలు ఉండవచ్చు.
అవ్వా కావాలి బువ్వా కావలి అంటే కుదరదు అంటుంది యోగసార ఉపనిషత్. .
మంత్రం 10
ప్రకృతిః త్రిగుణావలంబనీ
ప్రకృతి మూడు గుణములను అవలంబించి, ఆశ్రయించి మానసిక కార్యకలాపములను నిర్వర్తిస్తుంది.
యోగ, సాంఖ్యములు ప్రకృతిని మానసిక శక్తి అంటాయి. ఆ ప్రకృతి మానసిక కార్యకలాపములు గుణముల రూపములో నిర్వర్తిస్తుంది.
ఈ గుణ విభాగాన్ని అన్ని ఆస్తిక దర్శనములు చేశాయి. వైశేషికము మానసిక శక్తిని పదార్థము అంది. వాటిని ద్రవ్యగుణకర్మవిశేషణసామాన్యసమవాయా: అని చెప్పి తరువాత అభావమును కూడా పదార్ధములలో కలిపింది. అభావము అంటే దేనినీ గ్రహించకుండా ఉన్న స్థితి.
వేదాంతము, ఈ గుణ విభాగాన్ని వాడింది. భారతీయ తత్త్వ శాస్త్రములు ఒకదానిని ఒకటి ఖండించి, కొన్నిటిని తమ స్వతం చేసికొని కలిసి ఎదిగాయి. మనము ఇప్పుడు వీటన్నిటిలో మనకు పనికివచ్చేవి తీసికొని ఒక స్వతంత్ర దర్శనము తయారుచేసి కోవచ్చు. దానిని జ్ఞానబోధ మీమాంస అంటాము. మంకు జ్ఞానము ఎలా కలుగుతుంది, మనము ఎలా చేష్టిస్తాము, ఎలా మానసిక చర్యలు, ప్రతిచర్యలు చేస్తాము; వీటన్నిటి గురించి ఒక నమూనా తయారుచేయవచ్చు. అది భారతీయ తత్త్వ శాస్త్రానికి సారము, సారాంశము అవుతుంది. ఈ గుణములను ఎలా అర్థము చేసుకోవచ్చు, మనము ముముక్షువులుగా ఎలా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాము.
సత్త్వరజస్తమో గుణములను ఇప్పటివరకు అందిన వాఖ్యానములకు భిన్నముగా, వీలుగా అర్థముచేసికుందాము. అందరూ అనుకునేలా సత్త్వరజస్తమో గుణముల ప్రేరణతో మనుషుల ను విడతీయడము ఒక దృష్టి. కానీ మనందరమూ ఈ అన్నిగుణములను వివిధ సమయములలో చూపిస్తాము. గుణము అంటే ముడి. దేనితో ఏది ముడి పడుతుంది? చూద్దాము.
గుణ త్రయ విభాగము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి
భారతదేశంలో తత్త్వ శాస్త్రానికి రకరకాల వ్యాఖ్యానములు అందుబాటులోనున్నాయి. ఉపనిషత్తులు భారతదేశ తత్త్వశాస్త్రానికి మూలములు.
ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానము / ఆత్మజ్ఞానము ప్రతిపాదింపబడి వివరించబడ్డాయి. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శాక్తాద్వైత, వంటి దృష్టులతో ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు - ప్రస్థాన త్రయము - వ్యాఖ్యానింపబడ్డాయి.
ఇందులో ఆచార్యులు తమ మేధాశక్తి, స్ఫురణ, భాషా పటిమ, శాస్త్ర, తత్వ పరిజ్ఞానములు, దృక్పథములు, బుద్ధి నైశిత్యములతో తమ తమ దృష్టులతో పకడ్బందీగా వివరణలు ఇచ్చారు. అవి ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే, వారి వారి అనుయాయులిప్పటికీ తమ తమ మతములను ఎంతో నమ్మకముతో అవి మాత్రమే శ్రేష్ఠమైనవి అని వాదులాడుకుంటూంటారు. ఒకరినొకరు ఎంతో తీవ్రపదజాలంతో ఖండించుకుంటారు. ఉపనిషత్తుల ఈ అనుయాయులు ఎవ్వరూ సమ్యక్ దృష్టితో పఠించరు. తమ స్ఫురణ, స్ఫూర్తిలను అసలు ఉపయోగించకుండా ఆచార్యుల మాటలే తమ మాటలుగా ఆచార్య సిద్ధాంతములను ప్రచారము చేయడానికి ఉపయోగించు కుంటారు. ఒక్కొక్కసారి కవిగారి కవిత్వం కొంత మన పైత్యంగా ఈ ప్రచారములు జరుగుతాయి.
ఉపనిషత్తులు మనసు యొక్క పుట్టు పూర్వోత్తరములు, మానసిక దశలు, మానసిక కార్యకలాపములు జరుగు వైనము, మనకు లౌకిక, పారలౌకిక జ్ఞానములు కలిగే విధములు విశదముగా చెప్పాయి. ఆత్మను, బ్రహ్మమును, తత్సంబంధ పారిభాషిక పదములను; భగవంతుని ఉనికిని ప్రస్తావించకుండా, భగవత్ సంబంధము లేకుండా ఉపనిషత్తులను, తదనంతర తత్త్వ సాహిత్యాన్ని వ్యాఖ్యానించ వచ్చు. దీనిని జ్ఞానబోధ మీమాంసా దృష్టితో అన్వయించవచ్చు.
పతంజలి, భర్తృహరి, ఆదిశంకరులు మొదలైన వారు అద్వైత-ద్వైత దృష్టుల మేలు కలయికతో ఎంతో తత్త్వాన్ని బోధించారు. ప్రబోధించారు.
పతంజలి శబ్దబ్రహ్మ సిద్ధాంతమును ప్రతిపాదించి బ్రహ్మజ్ఞానాన్నించి భాషాశాస్త్ర సర్వస్వమును పితికి మనకి అందించారు. భర్తృహరి తదనంతర స్ఫోట వాదులు భాషాశాస్త్ర దృష్టితో మనము భాషలు నేర్చుకునే, మాట్లాడే విధానాన్ని వివరించారు. భాషల అవస్థా భేదములను చెప్పారు.
వేదాంతుల మాయ, తత్త్వజ్ఞుల చిదాభాస, మునుల ప్రణవము, శబ్ద బ్రహ్మ సిద్ధాంతీకుల స్ఫోటము అన్నీ ఒకే మానసిక శక్తికి వివిధ నామములు.
ఉపనిషత్తులు, బౌద్ధజైనతత్త్వముల, షడ్దర్శనములు ఈ ఉపనిషత్ ప్రతిపాదనలను స్వీకరించి, నిరాకరించి, సవరించి, తమ స్ఫూర్తితో విషయాలను జోడిస్తూ భారతీయ తత్త్వశాస్త్రాన్ని వటవృక్ష ప్రాయము చేశారు.
ఆత్మ, బ్రహ్మము, మాయ, జగత్, ప్రపంచము, మానసిక దశలు, స్థితులు, గుణములు, నిర్గుణము, సగుణము ఇలా ఎంతో తత్త్వశాస్త్ర పరిభాష ఉంది. ఇందులో గుణ శబ్దానికి అర్థ, తాత్పర్యములను జ్ఞానబోధ మీమాంసా దృష్టితో చర్చించాను. గుణత్రయవిభాగము భగవద్గీతలో పరమాత్మ సద్రవ్యచాడు. ఆయన చెప్పిన సారాంశం కలిగి ఉండి మరొక దృష్టితో నేను ప్రస్తుతిస్తాను.
గుణము అంటే మనకు సత్త్వ-రజస్-తమో గుణములు దృష్టిలోనికి వస్తాయి. గుణ శబ్ద ప్రతిపాదనను వైశేషికము చేసింది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావములను సప్త పదార్థములుగా ప్రతిపాదించింది. పదార్థమును వేదాంతం నామ-రూప-భావ-వాసనా రహిత వస్తుః పదార్థః అంటుంది. వ్యాకరణము నాలుగు పదార్థములు అంటుంది. సాంఖ్యయోగములు ప్రకృతిని పదార్థము అంటారు.
వీటన్నటిలోి పదార్థాన్ని మనసు, ఇతర అంతఃకరణముల, జగత్, ప్రపంచముల ముడి పదార్థము/శక్తి అనే అర్థములో
వాడారు. ఈ మీమాంస మరొక సారి చేద్దాము.
సత్త్వరజస్తమోగుణములు:
మాయా/చిదాభాస/ప్రణవము/స్ఫోట ల పరిణామములైన అంతఃకరణములు సమస్త మానసిక కార్యకలాపములను నిర్వహిస్తాయి. ఇక్కడ మానసిక శక్తీ పరిణామము వక్తలో పురోధాన (ముందుకు) / శ్రోతలో తిరోధాన (వెనుకకు) జరుగుతుంది.
విషయయుత బహిర్ ప్రపంచముతో అనుసంధానము మనసు జ్ఞానేంద్రియముల ద్వారా కలిగిస్తుంది. ఇది మెళకువ (జాగ్రత్) మానసిక దశలో జరుగుతుంది. ఇప్పుడు మానసిక దృష్టిని బహిర్ముఖ దృష్టి అంటారు.
(కంటికి దృశ్యములు, రూపములు; చెవికి ధ్వనులు, మాటలు; ముక్కుకు వాసనలు; నాలుకకు రుచులు, చర్మమునకు స్పర్శలు, వేడి, చల్లదనాలు విషయములు. వీటన్నిటినీ కలిపి జ్ఞానేంద్రియములు అంటారు.
వాక్-పాణి-పాద-పాయువు-ఉపస్థలు కర్మేంద్రియములు అంటారు.
ఇవి మాట, చేతి కదలికలు, కాలు కదలికలు, ప్రేవుల కదలికలు, జననేంద్రియ కదలికలు.
ఇవన్నీ యాంత్రికశక్తీ చలితములు. మాయ దివ్యమై జ్ఞాన శక్తిగా మనసు ద్వారా జ్ఞానేంద్రియములను ప్రచలితము చేసి గ్రహణలు చేస్తుంది. ఇతర అంతఃకరణముల ద్వారా తత్సంబంధ జ్ఞాన సముపార్జన, జ్ఞాన నిధానము, జ్ఞాన ప్రేరణ చేస్తుంది. స్వర శక్తియై కర్మేంద్రియములద్వారా జ్ఞాన వ్యక్తీకరణలు, ప్రతిక్రియలు చేస్తుంది.
మనసు జ్ఞానకర్మేంద్రియముల ద్వారా అన్ని పనులు చేస్తుంది. ఇతర అంతఃకరణములు తోడ్పడతాయి.)
మిగతా అంతఃకరణములైన బుద్ది, అహంకారము, చిత్తము మనసు గ్రహించిన విషయాన్ని తర్క, వ్యక్తి సంబంధ, విషయములుగా విడదీసి అంతర ప్రపంచంగా మస్తిష్కములో భద్రపరుస్తాయు; మనసు మరల ఈ అంతర ప్రపంచం నుంచి విషయగ్రహణము చేస్తే అది భావము లేక తలపు అవుతుంది; చిత్తము ద్వారా వాసనలు (విషయ సంబంధ అనుభవనులు, అర్థములు, స్ఫురణలు,) ఏర్పడడం, ప్రేరేపింపబడడం జరుగుతాయి. ఇప్పుడు దీనిని కల (స్వప్న) మానసిక దశ అంటారు. ఇప్పటి దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు.
ఇందులో ఏ విషయము కాని విషయానుభవము గాని గ్రహింపబడక మనసు నిర్మలంగా ఉంటే దాన్ని సత్త్వ గుణము అంటారు. ఇది శుద్ధ గమనిక స్థితి. భగవత్ సంబంధమైన విషయ, విషయానుభవ గ్రహణము సత్త్వ గుణము అని ఆస్తికులు అంటారు.
గమనికలో అంతఃకరణములుంటే అది రజోగుణము. అంతఃకరణములు విషయయుతమైతే అది తమో గుణము. గమనికలో ఏ విషయము, విషయానుభవము ఉండక పోవడం నిర్గుణము.
గుణము అంటే సంస్కృత భాషలో ముడి అనీ అర్థము ఉంది. ఈ అర్థములోనే గుణ శబ్దము వాడబడింది.
నిర్గుణము:
ఏ విషయ, విషయానుభవముతో ముడి వడి ఉండక పోవడం నిర్గుణము. ఇది శుద్ధ గమనిక. ఆత్మ అంటే శుద్దాహం. ఇదే శుద్ధ గమనిక. అహం అన్నా గమనిక అనే అర్థము. అయమ్ ఆత్మా బ్రహ్మా - ఆత్మ, బ్రహ్మము ఒకటే అంటుంది.
అలా "అహం బ్రహ్మాస్మి" అంటే "నేను శుద్ధ గమనిక" అని తాత్పర్యము. ఈ స్థితి నిర్గుణ స్థితి. నిర్మల మానసిక స్థితి.
దీనినే అద్వైత (రెండు కాని-రెండు లేని-రెండుగా లేని) స్థితి అంటారు. ఇప్పుడు దృష్టిలో విషయ, విషయానుభవములు ఏమీ ఉండవు. దీనిని విశ్రాంత దృష్టి అంటారు. అహం-అహం అనే శుద్ధ గమనికా స్ఫురణ నిరంతరంగా సాగుతూంటుంది. దృష్టిలో అహం-ఇదమ్ అనే విభాగము ఉండదు.
ఇదమ్ - మానసిక కార్యకలాపములు జరగడానికి, గ్రహణలకు, విరమింప బడడానికి చిహ్నము. దృష్టి అహం ఇదమ్ లుగా విడి అంతఃకరణములకు కనబడితే అది ద్వైత (రెండు ఉన్న- రెండు - అహం-ఇదమ్-గా కనబడుతున్న) స్థితి. ద్వైత స్థితిలో దృష్టిలో త్రిపుటి విభాగము జరుగుతుంది. జ్ఞాత-జ్ఞాన-జ్ఞేయములుగా విడడం-మూడూ విడిగా తెలియడం త్రిపుటి ఏర్పడడానికి చిహ్నము.
ఈశావాస్యమ్ ఇదమ్ సర్వమ్, సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మా ల లోని ఇదమ్ ఇదే.
ఈ విభాగమే వైయాకరుణుల కర్త-క్రియ-కర్మ విభాగము.
ధ్యానపరుల ధ్యాత-ధ్యానము-ధ్యేయము విభాగము.
ఈ విభాగము గుణత్రయ విభాగము. సత్త్వ- రజ: - తమో - గుణములు గా మనసు పని చేసే సమయము.
త్రిపుటి ఏర్పడక, మనసు, ఇతర అంతఃకరణములు పనిచేయక నిర్వాపారముగా ఆత్మలో లీనమై ఉండడం
నిర్గుణ స్థితి. శాంతము, మౌనము, ఆనందము, మోక్షము, తురీయము, భగవత్ స్థితి, పరమాత్మ స్థితి అని దీనికే పేర్లు.
గుణ త్రయ విభాగము జరిగితే మానసిక కార్య కలాపములు జరుగుతున్నట్టు. అనుగుణ వ్యక్తిత్వ స్పృహ జాగరితమై మనము జీవ స్థితినొంది తత్సంబంధ విషయ, విషయానుభవము లకు లోనై వర్తిస్తాము.
గుణత్రయవిభాగము జరగకపోతే వ్యక్తిత్వ స్పృహ కలుగదు. మన సహజ స్థితియైన పరమాత్మ స్థితి చెదరదు. మనము జీవ స్పృహ కోల్పోయి పరమాత్మాను సంధానమును పొంది నిర్గుణులమై నిరాకులంగా ఉంటాము. జీవిస్తాము.
సత్త్వరజస్తమోగుణములు కలిగి బహిర్ అంతర జగత్తులతో అనుసంధానం ఏర్పడడం, విషయ, విషయానుభవములతో మవసు, ఇతర అంతఃతరణములు ముడివడడం జీవ స్థితి.
సత్త్వరజస్తమోగుణములు కలుగక నిర్గుణముగా - విషయ, విషయానుభవములతో అంతఃకరణముల ద్వారా ముడివడక - ముడి వీడి - ఉండడం పరమాత్మ స్థితి.
ఇవి త్రిగుణములు, నిర్గుణము.
ప్రకృతి ఈ మూడు గుణములను అవలంబించి, ఆశ్రయించి మానసిక కార్యకలాపములను నిర్వర్తిస్తుంది.
ఏ విషయ, విషయానుభవముతో ముడి వడి ఉండక పోవడం నిర్గుణము. ఇది శుద్ధ గమనిక. ఆత్మ అంటే శుద్దాహం. ఇదే శుద్ధ గమనిక. అహం అన్నా గమనిక అనే అర్థము. అయమ్ ఆత్మా బ్రహ్మా - ఆత్మ, బ్రహ్మము ఒకటే అంటుంది.
అలా "అహం బ్రహ్మాస్మి" అంటే "నేను శుద్ధ గమనిక" అని తాత్పర్యము. ఈ స్థితి నిర్గుణ స్థితి. నిర్మల మానసిక స్థితి.
మంత్రము 11
యం కఞ్చిత్ విషయం బాహ్యాభ్యంతరం వా అనుసంధాత్యస్య చితైకాగ్రయం ధారణా
బయటి భౌతిక జగత్తు నుంచి గాని, (అది తన్మాత్రలుగా జ్ఞానేంద్రియములద్వారా కానీ); దాని ఆంతర ముద్రలైన ప్రపంచం నుంచి కానీ, గ్రహింపబడి అది మాత్రమే దృష్టిలో ఉండడాన్ని ధారణ అంటారు. ఇంగ్లిష్ లో దీనిని concentration అంటారు.
యమ (సత్ ప్రవర్తన), నియమ, ఆసన (భంగిమ - posture), ప్రాణాయామము, ప్రత్యాహారము లతో మొదలై ధారణ కలిగి, ధ్యానముగా మారి సమాధినిస్తుంది.
చిత్తైకాగ్రతయే ధారణ.
మంత్రము 12
తైలదారావత్ అనుసంధాన నైరత్య్రం ధ్యానమ్
తైల ధార వలె అవిఛ్చిన్నంగా అనుసంధానము చేయడాన్ని ధ్యానము అంటారు.
ధ్యానమునకు రెండు నిర్వచనములు ఉన్నాయి.
ఏక వస్తు చింతనమ్ ఏవ ధ్యానమ్
ధ్యానమ్ అర్థ భావనమ్
అని రెండు నిర్వచనములు.
మొదటి నిర్వచనము
"ఏక వస్తు చింతనమ్ ఏవ ధ్యానమ్"
అనేది
"తైలధారావత్ అనుసంధాన నైరత్య్రం ధ్యానమ్"
నిర్వచనము నకు అనుగుణముగా ఉంటుంది.
ఇక్కడ వస్తు అనే పదము మంచి గాంభీర్యమైనది.
ఆత్మను వస్తువు అంటారు. ఆత్మా, బ్రహ్మా పదములు నపుంసక లింగ శబ్దములు. "వస్తు" శబ్దం కూడా నపుంసకలింగ శబ్దము.
అంచేత వస్తువు అంటే ఆత్మా, లేదా బ్రహ్మా లక్షణములతో ఒకదానిని స్మరించడము.
అవి శాంతము, మౌనము, ఆనందము, శుద్ధ జ్ఞానము, ప్రజ్ఞానము, సత్య లోకము మున్నగునవి.
దానితో బాటు అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తములలో ఎదో ఒకదానిని మన మనస్తత్త్వమునకు అనుగుణముగా ఎన్నుకొని దాని సాయముతో నిరంతర ధ్యానము చెయ్యాలి.
మనము ధ్యానము మొదలు పెట్టినప్పుడు ధ్యాత-ధ్యానము-ధ్యేయము అనే త్రిపుటిలో మొదలు పెడతాము. ధ్యానము గాఢము అయినకొద్దీ ధ్యాత, ధ్యేయము ధ్యానములో కలిసిపోయి ధ్యానము మాత్రము మిగులుతుంది. ధ్యాత,ధ్యేయముల స్పృహ, దృష్టి పోతుంది. రెండూ ధ్యానములో లీనము అయిపోతాయి. అప్పుడు ధ్యానము పండినట్టు.
ఇలా ఎన్నుకొన్న ధ్యేయమును (ధ్యాన వస్తువును),
వస్తు లక్షణమును లేదా
విషయమును లేదా విషయానుభవమును
తైలధారవలె, అవిఛ్చిన్నముగా నిరంతరమూ దృష్టి యందు ఉంచుకొనడమే ధ్యానము.
యోగసార ఉపనిషత్తు - 10
13. సమాధిః ద్వివిధః సంప్రజ్ఞాతోసంప్రజ్ఞాతో ఇతి.
సమాధి రెండు విధములు.
సంప్రజ్ఞాతము. అసంప్రజ్ఞాతము.
సంప్రజ్ఞాతము అంటే సవికల్ప సమాధి. ప్రజ్ఞ ఉంటుంది. ఆంతర, బహిర్ ప్రపంచాలు తెలుస్తూ ఉంటాయి. అవసరమైతే సంకల్పిస్తే అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియాలు పనిచేస్తూ లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. గమనిక ఉంటుంది. అంతా తెలుస్తూంటుంది.
జ్ఞాన, కర్మేంద్రియాలు రథానికి పూన్చిన అశ్వముల వలె ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి.
అంతరము భావ, వాసనా రహితంగా ఉండి నిర్మలంగా ఉంటుంది. యోగుల, జ్ఞానుల ఆంతర స్థితి ఇది. సంకల్పిస్తే చర్యలకు ప్రతి చర్యలు జరుగుతాయి. తెలివి, స్పృహ ఉంటాయి.
అసంప్రజ్ఞాతము అంటే నిర్వికల్ప సమాధి. ప్రజ్ఞ ఉండదు. గమనికలో ఆంతర, బాహ్య జగత్తులు ఉండవు. అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియాలు పనిచేయవు. ఏమీ తెలియదు. తెలివి ఉండదు. స్పృహ తప్పిపోతుంది. ఊపిరి తీయడం, ఇతర ముఖ్య శారీరక కార్యకలాపాలు తప్ప మరే మానసిక, తదనుగుణంగా శారీరక కార్యకలాపాలు జరగవు. సంకల్పించడం ఉండదు. శరీర, జగత్ స్పృహ ఉండదు. భావములు కలుగవు. ఏ అనుభవములు
ఉండవు. అంతర, బాహ్యములు తెలియవు.
ఈ మానసిక స్థితిలో ఏమీ తెలియదు. ఇది కొందరికి సహజముగా వస్తుంది. కొందరకు సాధనలో భాగంగా వస్తుంది.
14 నిస్త్రైగుణ్యో యోగీ కైవల్యమశ్నుతే
సమాధిని చేరిన యోగి త్రిగుణములకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటాడు. సమాధి లక్షణాన్ని బట్టి
మానసిక, శారీరక కార్యకలాపాలు జరుగుతాయి.
నిర్గుణుడైన యోగి కైవల్యం పొందుతాడు.
శాంతానందమౌన స్థితిని కైవల్యము అంటారు. వైకుంఠమన్నా, కైలాసమన్నా, మోక్షమన్నా, ముక్తి అన్నా, నిర్వాణమన్నా ఇదే.