Friday, January 20, 2017

కాలము, మనసు గారడీ, బ్రాహ్మణులు-హిందూమతము, శుష్క వచనములు - శూన్యహస్తములు

కాలం వల్ల మార్పు జరగదు. మార్పే కాలాన్ని సృష్టిస్తుంది. మార్పు వల్లే సమస్త కార్యములు రూపుదిద్దుకుంటాయి. కాలం మార్పునకు పుత్రిక. ప్రతీక కూడా.‌ మార్పే కాలమునకు, కాలప్రవాహానికి ఆధారము, ఆలంబన. మార్పు లేక కాలమునకు ఉనికి లేదు. మార్పే కాలము.

************
మనలను మన నిజ స్థితి లోనికి మేలుకొల్పడం తత్త్వసాధన పరమార్ధము.
*************

మనసు గారడీ

చాలా మంది ఫలానా ఛానల్ ని ప్రభుత్వం బేన్ చెయ్యాలని పోష్ట్ లు ‌పెడుతున్నారు. మనంతట మనమే ఆ ఛానల్ ని బేన్ చేసికుంటే కలత ఉండదు కదా! ఆ ఛానల్ ని చూడమని మనలని ఎవరూ బలవంతం‌ చేయడం లేదే! మనం ప్రపంచాన్ని మనకి కావలసినట్టు నడుచుకోమని శాసించలేము. మనము మన మనసుని శాసించుకోగలిగితే ఎన్నో కలతలు, బాధలు, వేదనలు, వ్యథలు మనకు కలగవు. మన చేతిలో ఉన్న పనిని నిర్లక్ష్యం చేసి ఇతరులని మనని సుఖపెట్టమని, ప్రశాంతత కలిగించమని డిమాండ్ చేయడమేమిటి?

దేనిని చదవాలి, దేనిని వినాలి, దేనిని‌ చూడాలి, దేనిని‌ పొందాలి‌ అనేది‌ మన‌ నిర్ణయంపై, విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఎవరూ మనలని బలవంతం చెయ్యరు. అది పూర్తిగా మన ఇష్టం. ఎవరైనా సూచించినా
మన విచక్షణని, మనఃతత్త్వాన్ని ఉపయోగించుకుని చేసే స్వాతంత్ర్యం ఎప్పుడూ మనదే. ఆ విషయం గ్రహించక ఆరాటపడడం, హైరాన‌ పడడం పసితనం. అనవసరం.


ప్రపంచంలో‌ మనకి నచ్చనివి, కలత పెట్టేవి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఎందరో‌ మన‌ మనసు కష్టపెట్టేలా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. అలా జరగకుండా చేసే శక్తి, యుక్తులు, సావకాశం మనకు లేవు.
మనని బాధపెట్టే, మనకు అయిష్టమైన వారిని ఎదిరించే, సవరించే సమర్ధత మనకు లేదు. మన శక్తియక్తులు పరమితమైనవి. వాటికి అనుగుణంగా‌ జీవించడం ఇంగితం.

మనకయిష్టులందరిపైనా, మన కారణం ఏదయినా, ఎంతో సబబని మనకి అనిపించినా, చర్య తీసికోమని ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం మనకు కావలిసినట్టు చర్య తీసుకోవడం ఎంతో‌ complex and involved process. ఎన్నోసార్లు జరగకపోవచ్చు కూడా. జరగకపోవచ్చేమిటి, జరగదు కూడా.

మన‌చేతిలోని పనిని చేయక, చేయలేక, ఎవరో మనకి శాంతిసుఖములు కలిగించే దాకా కలత చెందుతూనే ఉంటామంటే‌ మనకు భగవంతుడు‌ కూడా సాయం చేయలేడు. ఆ ఛానల్ చూడడమెందుకు, కలత చెందడం ఎందుకు, ప్రభుత్వపు సాయం కోరడమెందుకు?

ఓపిక, కౌశలము ఉంటే, మన సంస్కృతినీ, సాంప్రదాయాన్ని పరిరక్షించుకునే క్రియ చేబట్టగలిగితే బెస్ట్. అంతర్జాలంలో ఏక్టివ్ గా ఉండడం మన "నాగరికతను, సంస్కృతి" నీ తెలియజేస్తుంది తప్ప దాని వల్ల మాత్రమే సంస్కృతీ సాంప్రదాయముల పరిరక్షణ‌ జరగదు.

సంస్కృతీ, సంప్రదాయములు, వాటిని మనం పాటించడం వల్ల, అనుసరించడం వల్ల, ఆచరించడం వల్ల మాత్రమే నిలుస్తాయి తప్ప; మనం ఊరికే హడావుడి పడడం వల్ల, హడావుడి చేయడం వల్ల నిలవవు. శుష్కవచనములు, శూన్యహస్తముల వలన మన సంస్కృతీ, సాంప్రదాయములు పరిరక్షించబడవు.

అడుసు తొక్కనేల, కాలు కడగనేల?

ఇదే సూత్రం మన జీవితంలో ఎన్నో కలతలకు మందు.

మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః.

ఈ నిజం తెలుసుకొని మనసుని నియమించుకుంటే సుఖము, శాంతి. మనసుని అరికట్టుకోలేకపోతే‌ మనకు అనుక్షణము కలతే. ఈవాళ ఆ ఛానల్, రేపు ఇంకోటేదో మనకు కలత కలిగిస్తూనే ఉంటుంది, మనసుని అలా వదిలేస్తే.

దారిలోని ముళ్ళు గుచ్చుకోకుండా‌ చెప్పులు ధరించడం వంటిది మనసుని నియమించుకోవడం. నేలపైనంతా తివాచీ పరవాలనడం కోతివంటి మనసు చెప్పినట్టల్లా‌ ఆడడం.

Ignorance is bliss. అంటే ఏమీ తెలియకపోవడం ఆనందం అని కాదు. I ignore you - అనే sense లో తీసికోవాలి.
ఈ ఆంగ్ల సామెత అసలు అర్థం ఏమిటంటే, పట్టించుకోకుండా ఉండడం హాయినిస్తుంది అని.
దీనిని కావలిస్తే, దేనిని పట్టించుకోవాలి, దేనిని పట్టించుకోనవసరం లేదు అనే విచక్షణను కలిగి ఉండడం మానసిక ప్రశాంతతకు అత్యవసరం అనీ అన్వయం చేసికోవచ్చు.

అనవసరంగా పట్టించుకోవడం అశాంతి. విచక్షణను ఉపయోగించి పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం చేస్తే మన మానసిక సుఖశాంతులకు లోటుండదు. భంగమూ వాటిల్లదు.

శుభం భూయాత్!

**********

 బ్రాహ్మణులు-హిందూమతము

బ్రాహ్మణులను గౌరవించక హిందూ మతము పునరుద్ధరింపబడదు. బ్రాహ్మణులను పక్కన పెట్టి, అగౌరవపరుస్తూ, అమర్యాద ‌చేస్తూ హిందూ మతాన్ని‌ పునరుద్ధరింప బూనడం‌ అమాయకత్వం. పసితనం. జరగని పని.

హిందూమతానికి బ్రాహ్మణులు పునాది, సన్యాసులు కాదు. బౌద్ధము, జైనములకు సన్యాసులు పునాది. హిందూమతమునకు గృహస్థులు పునాది. బ్రాహ్మణులను, గృహస్థులను తక్కువగా చూస్తూ, కించ పరుస్తూ, అగౌరవపరుస్తూ, అమర్యాద చేస్తూ హిందూ మతాన్ని పునరుద్ధరించబూనడం వెఱ్ఱి పని.
గృహస్థాశ్రమాన్ని, బ్రాహ్మణులను ద్వేషిస్తూ‌ హిందూమతాన్ని పునరుద్ధరించే ఊహ అపోహ.
 
హిందూ మతానికి బ్రాహ్మణులు ముఖ్యమే గాని, హిందూమతం బ్రాహ్మణుల సొత్తు కాదు. హిందూమతం నిలవాలని అందరూ అనుకుంటేనే నిలుస్తుంది. నిలవనక్కర లేదనుకుంటే కాలగర్భంలో కలిసిపోతుంది.
*********

శుష్క వచనములు - శూన్యహస్తములు

అందరూ కవులే కవిత్వం చదివేవారే అరుదు
అందరూ నాయకులే ప్రజాసేవ చేసేవారే అరుదు
అందరూ మేధావులే వారిలో మేధ మాత్రం అరుదు
అందరూ గురువులే పరమాత్మను దర్శించిన వారే అరుదు
అందరూ స్కూళ్ళు నడిపేవారే చదువు రావడమే అరుదు
అందరూ సంఘసేవకులే ఇళ్ళల్లో మాత్రం సేవ అరుదు
అందరూ సమాజాన్ని నడపాలనుకునేవారే నడపగలిగిన వారు మాత్రం అరుదు
అందరూ జీవకారుణ్య ఉపన్యాసకులే కోడి, మేక, పంది
మాంసములను తినని వారే అరుదు

కబుర్లు ఘనం ఆచరణకు గ్రహణం
నేటి మన భారత పర్వం ఒక నిరంతర
ఆషాఢభూతుల మయం రెండు నాలికల
ధోరణులు ప్రబలం అంతా శూన్యహస్తం



No comments:

Post a Comment