Monday, July 25, 2016

సగుణ - నిర్గుణ భక్త్యుపాసనలు

సగుణ - నిర్గుణ భక్త్యుపాసనలు


నేను ఎవరు అనుకోగానే మౌనం సమాధానంగా వస్తే మన మనసు నిర్మలంగా ఉన్నట్టు లెక్క.

ఊపిరి సలపని విధంగా వ్యక్తి గురించిన తలపులు ముసురుకుంటే మన మనసు విషయ, విషయానుభవ భరితమై నేను ఫలానా అనే సుడిగుండంలో త్రిప్ప బడుతున్నట్టు, తిప్పలు పడుతున్నట్టు లెక్క.

"నేను" ని సరియైన విధముగా అన్వయించుకోవడం ఆధ్యాత్మిక పరిణితికి చిహ్నము.
లేదా ప్రపంచాన్ని భగవన్మయం చేసికోవడమూ ఆధ్యాత్మిక పురోగతికి సాధనము.

మనకు నేను, ప్రపంచం (ఆంతర మానసిక ప్రపంచం) అనేవి ప్రజ్ఞానము రెండుగా విభజింబడినప్పడు కలిగే స్పృహ. త్రిపుటీ జననము జరుగుతుంది. జ్ఞాత-జ్ఞానము-జ్ఞేయము; ధ్యాత-ధ్యానము-ధ్యేయము; కర్త-క్రియ-కర్మ - ఇత్యాది త్రిపుటులు. మనము నిర్మల మానసిక స్థితియైన అద్వైత స్థితియైన భక్తి స్థితి నుంచి మానసికముగా ద్వైత స్థితికి, మానసిక కార్యకలాప నిర్వహణా స్థితికి మారతాము.

ప్రపంచం అంటే విషయ, విషయానుభవ సమాహారమైన ఆంతరిక ప్రపంచం. ఇది బయటి భౌతిక ప్రపంచము కాదు. ఆ బయటి భౌతిక ప్రపంచము జ్ఞానేంద్రియముల ద్వారా మనసు సాయముతో గ్రహించబడి మస్తిష్కంపై వేసిన దృశ్య, శబ్ద, రుచి, వాసనల - పరిమళములు, అన్ని రకముల ఘ్రాణముల, స్పర్శల ఆంతర ముద్రలు.
మన మనస్తత్త్వము‌ను బట్టి, మన బుద్ధి నైశిత్యాన్ని బట్టి మనం నేనుని గాని, ప్రపంచాన్ని గాని మార్చుకుంటాము.
నేనుని మార్చుకుంటే నిర్గుణోపాసన.

ప్రపంచాన్ని మార్చుకుంటే సగుణోపాసన.

నేను మారినా, ప్రపంచం మారినా మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము.
గుణము అంటే ముడి. (ఆంతరిక) ప్రపంచంతో ఏ ముడీ లేకుండా‌ జ్ఞాన మార్గములో "నేను" నకు శుద్ధ గమనికగా, శుద్దాహం గా అన్వయం జరిగితే మనం ప్రపంచాన్ని గమనిస్తూ, ప్రపంచానికి అతీతంగా వ్యవహరిస్తాము. ప్రపంచాన్ని గణిష్తూ అదీ, వ్యక్తిత్వము కలిసి కలిగించే సుఖదుఃఖములను లెక్క చేయక కాని, దివ్యులమై భరిస్తూ కాని, ‌సదా సదానుభవులమై ఉంటాము.

జ్ఞానేంద్రియములు, మనసు సాయంతో మన మానసిక ప్రపంచాన్ని మార్చుకుంటాము. క్రొత్తగా ఇలా ఏర్పరచుకున్న ఈ భగవత్ ప్రపంచం ఇదివరకటి, చిన్నప్పటినుంచీ మన వ్యక్తిత్వ స్పృహతో ఏర్పడిన విషయ ప్రపంచంపై దిద్దుడు. దిద్దుబాటు. పాత విషయ, విషయానుభవ సముచ్చయమైన భౌతిక ప్రపంచ దృశ్య, శబ్ద, రుచి, వాసనల - పరిమళములు, అన్ని రకముల ఘ్రాణముల, స్పర్శల ముద్రలపై ఈ నూతన దివ్య ముద్రలు పైరాతలు (over-writing as in the case of new information recorded on a disc gets recorded over the older earlier information and becomes the only available information).

ముకుందమాలలో కులశేఖర్ ఆళ్వారులు జ్ఞాన, కర్మేంద్రియములద్వారా ఆంతర ప్రపంచాన్ని ఎలా మార్చుకేవచ్చో ఇలా తెలిపారు.

జిహ్వే కీర్తయ కేశవం! మురరిపుం చేతోభజ!
శ్రీధరం పాణిద్వద్వం సమర్చ! యాచ్యుత కథాః
శ్రోత్రద్వయం త్వం శ్రుణు! కృష్ణ లోకయ లోచన ద్వయే
హరేర్గ్ఛాంఘ్రియుగ్మాలయమ్ జిఘ్ర ఘ్రాణ పాద
తులసీం మూర్ధ నమాధోక్షజమ్

అని జ్ఞాన, కర్మేంద్రియములు, మనసు సాయముతో అంతర ప్రపంచం మార్చుకునే ఉపాయం చెప్పారు.

మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథకర్ణన విధౌ
తవధ్యానే బుద్ధి ర్నయన యగళం మూర్తివిభవే
వరగ్రంథాన్ కై ర్వా పరమశివ జానే పరమత:

అని శివానందలహరిలో శ్రీ శంకరులూ అదే చెప్పారు.

మన ఇష్టదైవం ఏదైతే ఆ మూర్తిని, నామమును అలా తత్సంబంధ అర్చన, ధ్యానాదులు చేయాలి. అప్పడు భగవత్ చరిత్ర మన విషయ ప్రపంచంపై రాయబడి మనకు ఎల్లప్పుడూ భగవత్ సంబంధ భావములే వస్తాయి. మనసే ఆంతర ప్రపంచం నుంచి విషయ గ్రహణం చేస్తే భావములు కలుగుతాయి. భగవత్ సంబంధ విషయములతో అంతవరకు ఉన్న లౌకిక విషయములను తొలగించి ఈ భగవత్ సంబంధ విషయములే ఆంతర ప్రపంచంగా స్థిర పడడం సగుణ భక్తి ఉపాసనా విధానము. ఫలము. విశిష్టాద్వైతము, ద్వైతము, శాక్తాద్వైతము ఇక్కడకు తీసికొని వచ్చి ఆగిపోతాయి.

మరింత ఆసక్తి, ప్రజ్ఞ కలవారు ఆ భగవత్ ప్రపంచాన్ని కూడ దృష్టి లోనికి రానీయక విశ్రాంత దృష్టితో భగవంతులై ఉంటారు. ఇది అద్వైతము. రెండు కానిది. నేను, ప్రపంచం అని రెండుగా ఆనని త్రిపుటీ రహిత శుద్ధజ్ఞాన స్థితి. ఇది నిర్గుణ భక్తి.

ఈ నిర్గుణ భక్త్యుపాసనలో నేను ని మార్చుకుంటూ ప్రపంచాన్ని లెక్కచేయము. దృష్టిలోనికి రానీయము. అహమ్ బ్రహ్మా "అస్తి" - అవుతుంది. వ్యక్తిత్వ రహితమైన శుద్ధ గమనిక, ప్రజ్ఞానము దృష్టి అవుతుంది. మనం శుద్ధహం రూపంగా వెలసి వెలుగుతూంటాము.

సగుణ భక్త్యుపాసనలో ప్రపంచాన్నిమార్చుకుంటే మనకు ఎల్లప్పుడూ ఇష్టదైవ స్మరణంలో, అర్చనలో, ధ్యానములోదివ్యభావనలే కలుగుతూంటాయి. భగవన్మయమైన ప్రపంచంలో ఇష్టదైవమై వెలుగుతాము.
భక్తి తు అస్మిన్ పరమప్రేమ రూపా - అనేది మన మానసిక ప్రపంచం మారడానికి సహాయపడుతుంది. ఇది సగుణ భక్తి.

భక్తిః తు స్వస్వరూపానుసంధానం - అయినప్పుడు నేను మారుతుంది. ఇదీ నిర్గుణ భక్తి.

చిత్తవృత్తి నిరోధః యోగః అన్న యోగము,

చేతోవృత్తిః ఉపేత్య తిష్ఠతి సా భక్తిః ఇతి ఉచ్యతే

అనే భక్తి ఒకే మార్గాన్ని సూచిస్తున్నాయి.

ఏ మార్గమైనా ఆంతర ప్రపంచాన్ని మార్చుకోవడమో, దృష్టిలోనికి రాకుండా చేసికోవడమో చేస్తాయి. మన మన తత్త్వాన్ని‌బట్టి, మనస్తత్త్వన్ని బట్టి, ప్రవృత్తిని బట్టి మార్గానుసరణము జరుగుతుంది.
అన్ని మార్గములు సమానముగా వంద్యనీయములే, అనుసరణీయములే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే వారు ఆధ్యాత్మిక పరిణితి లేనివారు. తమ మార్గమే అత్యుత్తమము అని వాదించే మొండివారు. పసివారు. వీరి సంకుచిత మత ప్రచారము (cult affiliations) ఆధ్యాత్మకోన్నతికి పథము కాదు.

మనకు ఇష్టమైన మార్గమును అనుసరించి, ఇతర మార్గములను తూలనాడక, వాటికి సముచిత గౌరవాన్ని ఇస్తూ తరింతుముగాక!

శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగళాని భవంతు!

భగవత్ ప్రీతిరస్తు! పరమాత్మానుసంధాన ప్రాప్తిరస్తు!

సర్వే జనాః సుఖినో భవంతు!

Sunday, July 24, 2016

Poetry, fine-arts and aesthetics; మనసు; ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను, అవినీతిపరులైన మంత్రులు, ముఖ్యమంత్రులు

Poetry, fine-arts and aesthetics



Poetry is written for the aesthetic and discrete readers. Music and Dance and like fine arts are performed for the discerning and aesthetic lovers. Einstein's theory of relativity exists for intellectuals to probe and understand and get an insight about space, time and relativity.

Spiritual teachers of India starting from the Upanishadic Seers till today are beacons to right knowledge which sets peace, silence and bliss in us and ego and the vagaries caused by it set.
All these disciplines and arts and spirituality are for tuned and learned minds and aesthetic hearts.
Others who do not have the intellectual, aesthetic or spiritual training better keep off from these as they never utter a single word against science (as if they understood the disciplines like physics, chemistry, mathematics and the like basic sciences) should keep quiet. 

Their ignorance will never have any influence and if they have knowledge or aesthetic heart they will be responsible and give due respect to these disciplines as they give to science and technology, even though their scholarship in science is nil.


Let knowledge and aesthetics rule the society and not hatred or ignorance or pseudo rationalism or half-baked knowledge.

Let noble thoughts come to us from every side.

****************


 మనసు



మనసు ఆత్మగానము; పరమాత్మ నాదము; భగవంతుని
చేరుటకు పనిముట్టు; చరాచర ప్రపంచ గ్రహణమునకు
గ్రహింపులకు, రసార్ద్ర స్థితుల నొందుటకు సహాయకారి;
అవ్యక్త ఆత్మస్థితికి వ్యక్త రామణీయకము మాధుర్యము
************

 ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను


ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను
అధ్యయన అధ్యాపనములు సఖులు నాకు
నేర్చుకొనుచూ ఉండుట జీవ లక్షణము;
మన వృద్ధికి, మానసిక పరిణితికి సతత
తత్త్వావలోకనము; మనం పండడానికి, తరించడానికి,
సదా నందగోపకుమారుని నామ స్మరణం, అవసరం
**************

 అవినీతిపరులైన మంత్రులు, ముఖ్యమంత్రులు


అవినీతిపరులైన మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిని అంతం చేస్తామని ప్రకటనలిస్తే తన్న బుద్ధెయ్యదూ! అవినీతి కొమ్ము కాస్తూ అవినీతిని ఈ నాసిరకం నాయకులు అంతం చేయడం జరిగేపని కాదు.
నేతి బీరకాయలో నెయ్యిలా, పెరుగు తోటకూరలో పెరుగులా వీళ్ళ అవినీతి పోరాటంలో పోరాటం ఉంటుంది.
పౌరులని ఇంత దద్దమ్మల్లా జమకట్టి ప్రకటనలు మాత్రము చేస్తూ, అది మాత్రమే పాలనని పాలించే నాయకులు అధికమైన ఈ వేళ ప్రజల కడగళ్ళు తీరవు. అయినా‌ వెఱ్ఱి పౌరులు, కసాయిని గొఱ్ఱె నమ్మినట్టు ఈ ఆషాఢభూతులని నమ్మి వారినే పదే పదే ఎన్నుకుంటారు. ఎండమావులలో దాహం తీర్చుకుందామని వాటివైపు పరిగెడుతూనే ఉంటారు. అంతా ఆశ, దురాశ. అర్హతలేని అల్లుళ్ళకు ప్రభుత్వాలు మిథ్యా మామలు.

 

Friday, July 22, 2016

భగవంతుడు; మర్త్యుడు-మృత్యుంజయుడు : అబద్ధపు "గురువు" - ఆధ్యాత్మిక లఘువు;


 భగవంతుడు

చాలా మంది, భగవంతుడు లేడు, భగవంతుడు మనిషి సృష్టే, అంటారు. మంచిది. మన నాగరికత, సంస్కృతి, భాషలు, విజ్ఞానశాస్త్రములు, అన్ని జ్ఞానములు, కళలు, సిద్ధాంతములు, సాంకేతికత, ఇలా అన్నీ మనిషి సృష్టే. ఇవన్నీ మనిషి సృష్టే కాబట్టి మనం వాటిని నిరసించడంలేదే!? పైపెచ్చు ఆనందంగా ఉపయోగించుకుంటున్నాం. అలాగే మన‌ సృష్టే అయిన భగవంతుని ఉనికి‌ని ఉపయోగించుకోవడానికి ఎందుకు అభ్యంతరం? గొడవ, గోల? రాద్దాంతము? తర్కము పదునైనది. ఎటువైపునుంచి అయినా ఉపయోగించవచ్చు. ఆస్తికులు, నాస్తికులు తమ వాదనలను నమ్మకము మీద ఆధారపడే చేస్తారు. ఈ విషయము ఆస్తికులు ఒప్పుకుంటారు. నాస్తికులు ఒప్పుకోరు. మళ్ళీ తర్కం అంటారు. 

తర్కం మన తెలివితేటలనూ, వాదనా పటిమనూ చూపిస్తుంది తప్ప మనలను సత్యం దగ్గరకు తీసికెళ్ళదు. వట్టి తర్కంతో ఏదీ అందదు. ఏదీ తేలదు. ఆయాసం మిగులుతుంది అంతే.

సత్యాన్ని అవగాహన చేసికొనేందుకు ఒక్క తర్కం మాత్రమే సరిపోదు. పూర్తి‌ సత్య దర్శనానికి తర్కం ఉపయోగపడదు. అన్ని తర్కములూ ఆగిన పిమ్మటనే తనంత తానుగా సత్య దర్శనము కలుగుతుంది. అడ్డుకట్ట తొలగించిన వెంటనే బోదిలోని నీరు పొలం లోనికి ప్రవహించినట్టు.

అన్ని తర్కములు, వాదనలు, కారణాన్వేషణలూ వృథా ప్రయాస. నమ్మకమే అందరినీ నడిపించింది. నడిపిస్తోంది. నడిపిస్తుంది.
 ******************

మర్త్యుడు-మృత్యుంజయుడు

 ఎంత గొప్పవారమైన ఎంత అధికారమున్న
ఎంత సంపాదించిన యముని ముందు
తల వంచక తప్పదు; మర్త్యులము మనము
కాము మృత్యుంజయులము; మానవత్వము
చూపుచు మనీషులమై జీవించిన అగుదుము
మృత్యుంజయులము; కాలుడు అంటలేడు మనల
*************

అబద్ధపు "గురువు"- ఆధ్యాత్మిక లఘువు

ముండనము చేయించుకుని నామము మార్చుకుని
వేషభాషల క్రొంగొత్తవి ధరించి పేరు కొత్తది పెట్టుకున్న
మాత్రమున సన్యాసి కాడు, స్వాములవారు కాడు
బ్రహ్మజ్ఞాన ధురీణుడు కాడు: పొట్టకూటికై కోటి విద్యలు


అహంభావమును అహంకారమును వ్యక్తినుంచి
సాములోరుగా మార్చుకొని కొత్తసంసారము ఏర్పరచుకున్న
సామాన్యుడు ఆచార్యుడు కాడు, విషయ విషయాను
భవములు అంటని నిర్మల మానసము వానికి ఉండదు

నాలుగు మాటలు చెప్పుచు ప్రవచనములిచ్చుచు
వాటిని అనుగ్రహ భాషణములనుకొను వింతసంసారి
నేటి సన్యాసి; వాసనలు కరిగిఉండవు, లాలసలు
మెండుగా ఉండును కామినీజన పరివృతుడై ధన, కనక

వస్తు సంచయముచేయు ఆధునిక పరివ్రాజకుడు నొసట
విభూతి అలముకున్నను దండిగా కుంకుమ బొట్టు
పెట్టుకున్నను‌ విషయవాంఛల గెలువలేని అర్భకుడు
డబ్బకై ఆశ్రమములు పెట్టుకున్న దొంగవాడు, పొట్ట

చించిననూ అక్షరము ముక్కైనా కనుపింపని నిరక్షరాస్యుడు,
అవగాహన, ఆత్మజ్ఞానము ఇసుమంతైనా అంటని అజ్ఞాన
ధురంధరుడు అమాయక ప్రజల వంచించు వేషగాడు
అబద్ధపు "గురువు"; ఆధ్యాత్మిక లఘువు

***************


Thursday, July 21, 2016

ప్రపంచం - జగత్

ప్రపంచం -

ప్రపంచం అనగానే మనకు భూమిపై కల దేశాలు ముందు దృష్టిలోకి వస్తాయి. ఆ తరవాత మన సంస్కారము, చదువులను బట్టి చరాచర ప్రపంచము అనే ఆధ్యాత్మిక పదము గుర్తుకు వస్తుంది.

తత్త్వశాస్త్ర రీత్యా ప్రపంచము అంటే ఏమిటో గమనిద్దాము.

అస్తి భాతి ప్రియమ్ నామమ్
రూపంచేతి అంశ పంచకమ్
ఆద్యత్రయం బ్రహ్మరూపమ్
తతోద్వయమ్ జగద్రూపమ్

అని వేదాంత పంచదశి ప్రపంచాన్ని నిర్వచించింది. ప్రపంచం అనగానే చివరి పంచ, ఐదు అని స్ఫురింపజేస్తుంది. ప్రపంచం ఐదింటిచేత నిర్మింపబడింది అనీ అనిపిస్తుంది.

ఆ ఐదు అస్తి (సత్), భాతి (చిత్), ప్రియమ్ (ఆనందం), నామము, రూపము. తత్త్వశాస్త్ర రీత్యా ప్రపంచం అంటే మానసిక ప్రపంచం అని మనం అర్థం చేసికోవాలి.

మానసిక ప్రపంచం ఆత్మ శక్తి, లేక చిత్ శక్తి చేత నిర్మించబడింది అని ఉపనిషత్తులు చెప్పాయి. మేధలో చిచ్ఛక్తి యొక్క ప్రతిఫలనము చిదాభాస. దీనినే మాయ అనీ అంటారు.

మాయామయమ్ ఇదమ్ జగత్ - అంటే ఇదే. మాయచే జగత్ నిర్మింపబడింది అని అర్థము. మాయ అంతఃకరణములుగా ముందుగా పరిణమిస్తుంది. చేసే పనిని బట్టి వాటికి పేర్లు.

అవి మనోబుద్ధ్యహంకారచిత్తములు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అని అవి నాలుగు.
మనసు జ్ఞానేంద్రియముల ద్వారా బయటి భౌతిక ప్రపంచముతో అనుసంధానింపబడి ఆ భౌతిక జగత్తును గ్రహిస్తుంది. అలా అనుసంధానింపబడడాన్ని బహిర్ముఖ దృష్టి అంటారు. మెళకువ మానసిక దశ అన్నా ఇదే. అలా అన్ని విషయ గ్రహణలు మనసుచేత చేయబడతాయి.

కన్నుకి రూపము, దృశ్యములు విషయములు.
చెవికి ధ్వనులు, మాటలు, శబ్దములు విషయములు.
నాలుకకి రుచులు విషయములు.
ముక్కుకి వాసనలు విషయములు.
చర్మమునకు స్పర్శలు, వేడిమి, చల్లదనములు విషయములు.

అలా మనసుద్వారా అంతర ప్రపంచంగా మారిన విషయసముచ్చయమే జగత్తు. ఇది భావముగ మనసుచేతనే బయటికి తేబడి జగత్ అవుతుంది.

ప్రపంచం స్థాణువు. స్థావరము. అచరము. జగత్ జంగమము. కదిలేది. పుట్టి, కనుమరుగు అయ్యేది జగత్. జాయతే గచ్ఛతే ఇతి జగత్. పుట్టి అదృశ్యమయ్యేవి తలపులే. తలపులు క్షణక్షణానికీ మారతాయి. అలా జగత్ ఒకసారి ఉండి మరుక్షణం ఉండదు. అందుకే జగత్ మిథ్యా. అంటే ఒక సారి ఉండి మరుక్షణం మాయమయ్యేది. మాయ అయ్యేది. అద్వైతులు అనేది ఈ ఆంతర మానసిక జగత్తు మిథ్య అనీ. బయటి భౌతిక ప్రపంచము మిథ్య అని ఉపనిషత్తుల దగ్గర్నుంచి, బ్రహ్మజ్ఞానము, వేదాంత సూత్రములు, ఇతర అద్వైత వేదాంత గ్రంథములప అనలేదు. ఇదంతా విశిష్టాద్వైతుల, ద్వైతుల అపార్థము. భ్రమ. భ్రాంతి.

అద్వైత వేదాంతానికి మణిపూస వంటి వాక్యము:

బ్రహ్మా సత్ జగత్ మిథ్యా జీవో బ్రహ్మా ఏవ న అపరః

దీని అర్థము ఏమిటంటే

అస్తమానూ (సర్వకాల సర్వావస్థలయందూ) ఉండేది బ్రహ్మము. వచ్చిపోయేది (దృష్టిలోకి) భావరూప జగత్.

జీవుడు బ్రహ్మమే వేరు కాదు.

అంటే గమనికగా బ్రహ్మము, జీవుడు (వ్యక్తి) ఒకటే అని దీని తాత్పర్యము.

మిథ్యా శబ్దానికి మరొక అర్థము నిజము కానిది, అబద్ధమైనది అని. నిజమైనది ఆత్మ. జగత్ దానిపై ఆనింపు. కలిగి పోయేది. అస్తమానూ (అన్ని మానసిక దశలలోను, స్థితులలోను) ఉండనిది.

జగత్ అంటే కదులుతూండేది అనీ అర్థము. భావములు చిన్మయములు. చిత్ శక్తిచే నిర్మింపబడినవి.
ప్రపంచము స్థిరముగా ఉండేది. జగత్ కదులుతూ, మారిపోతూ ఉండేది. భావములు క్షణ భంగురములు. క్షణక్షణానికీ మారిపోతూంటాయి. శాశ్వతత్వము లేనివి.

ఈ గ్రహణలని ఆంతర మానసిక జగత్తుగా మనసే మస్తిష్కములో ముద్రిస్తుంది. ముద్రింపబడిన బయటి ప్రపంచ విషయ సముచ్చయము జడశక్తిగా ఆంతర ప్రపంచంలో ఉంటుంది. ఆ జడశక్తి మనోరూప చిత్ శక్తిచే ఆవేశింపబడితే, గ్రహింపబడి, భావముగ అంతర్ముఖ దృష్టి లోనికి వస్తుంది. దీని ఉనికి క్షణికము. మరొక భావనకు చోటిచ్చి తాను అదృశ్యమవుతుంది‌. కనుమరుగు అవుతుంది. మనోదృష్టికి అగుపడదు.

ఇలా ముద్రింపబడిన బయటి భౌతిక విషయ, వస్తు సమూహమునే వేదాంత పంచదశి ఈ పై శ్లోకములో ప్రపంచంగా అభివర్ణించింది. నిర్వచించింది.

ఇలా తనే ముద్రించిన విషయ ప్రపంచాన్ని తానే జగద్రూపంలో (తలపుల రూపంలో) దృష్టికి తెస్తుంది. ఆ దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు. దీనినే కల మానసిక దశ అని కూడా అంటారు.
మనసు విరమింపబడితే దృష్టి విశ్రాంతమవుతుంది. దృశ్యరహిత శాంతానందస్థితి అనుభవమవుతుంది. మౌనము వెల్లివిరుస్తుంది. మెళకువతో ఈ శాంతానంద స్థితిని అనుభవిస్తే అది జాగ్రత్ సుషుప్తి - మానసాతీత ఆత్మ దశ అవుతుంది.

ప్రపంచం ప్రతి వ్యక్తికీ వేరు. మవిషి లింగాన్ని, సాంఘిక స్థితి, చేసే ఉద్యోగము, వృత్తి, వ్యాపారాలని బట్టి వేరు వేరుగా ఏర్పడుతుంది. ఈ ప్రపంచం ఏర్పడడానికి ముడి సరుకు/శక్తి చిదాభాస అయిన మాయ. మాయ మానసిక శక్తి.
ఇది ప్రపంచ మీమాంస.

విశ్వమీమాంస పేరుతో వాశిష్ట గణపతి ముని ఒక గొప్ప అద్వైత గ్రంథాన్ని రచించారు.

అలా ప్రపంచం సత్-చిత్-ఆనందాత్మకమైన చిత్ శక్తితో నిర్మింపబడి ఆంతర జగత్తుగా, విషయసముచ్చయముగా, మస్తిష్కములో ముద్రింపబడి జడశక్తి రూపంలో నిలిచి ఉంటుంది.

మనం నేర్చుకున్న భాష ఈ రూప/దృశ్య విషయ సముచ్చయానికి (ఈ విషయసముచ్చయములో మనం చూచిన దృశ్యములు/రూపములు/ఆకారములే కాక విన్న మాటలు, ధ్వనులు, శబ్దములు; రుచి చూసిన రుచులు, ఆఘ్రాణించిన వాసనలు, పొందిన, తగిలిన స్పర్శలు, వేడిమి, చల్లదనములు కూడ భాగములు) పేర్లు పెడుతుంది. అలా జగత్ నామ-రూప-భావ-వాసనాత్మకము.

వ్యక్తిత్వ స్పృహ, అహంకార, మమకారములు కూడ దీనిలో భాగమే.

చిత్తము, విషయములను గ్రహిస్తున్నప్పుడు అవి తత్సమయంలో కలిగించే అనుభవములను/అర్థములను
భద్రపరచి వాసనలుగా మారుస్తుంది. మెళకువ వచ్చినపుడు, మెళకువలో ఉన్నపుడు ఈ వాసనలు చిత్తముచేతనే ప్రేరేపింపబడి తదనుగుణ మానసిక స్థితులను కలిగిస్తుంది. సుఖ, దుఃఖ అనుభవరూపములైన ఈ స్థితులు వ్యక్తిత్వ స్పృహను అప్పుడే కలిగించడం వలన అహంకార, మమకారములు జాగృతమై మనసు రూపంలో తలపులుగా పరిణమించి వ్యథలను, వేదనలను తీపులుగా మారుస్తాయి. ఈ‌ వేదనల సుడిగుండంలో మనిషి చిక్కుకొని అలమటిస్తాడు.

వ్యక్తిత్వ స్పృహా రూపమైన ఈ అబద్ధపు నేనును (మిథ్యాహంను) నిజమైన నేను లో - అహం బ్రహ్మాస్మి‌ - అన్న ఉపనిషత్ వాక్యార్థములో - లీనం చేసి ఆ‌ నిజాన్ని సదా దృష్టిలో ఉంచుకోవడమే ముక్తి. అప్పుడు విషయ, విషయానుభవాత్మకమైన ప్రపంచం, వాసనలు దృష్టిలోనుండవు. లలితా సహస్రనామములలో నిష్ప్రపంచాయైనమః నామము దీనినే చెబుతుంది.

దీనినే నైష్కర్మ్య సిద్ధి అనీ అంటారు. కైవల్య నవనీతము ఇదే.

జ్ఞానేంద్రియములు, మనసు ద్వారా; నేనును శరీరానికీ, తత్సంబంధ అహంకార, మమకారములకు పరిమితం‌ చేయడం వల్ల కలిగిన సుఖదుఃఖములకు ఆలవాలమైన ప్రపంచం, వాసనలలో ఇమిడి ఉన్న ఇదమ్ ను ప్రపంచం అంది వేదాంత పంచదశి.

ఈ ప్రపంచాన్ని ఒక ఇష్టదైవ అర్చనలో, దాసత్వములో, నామస్మరణలో ఆ దైవమయంగా మార్చుకోవడము సగుణోపాసన.

విషయ ప్రపంచం, విషయానుభవ జనిత‌ వాసనలను ఏర్పరచిన చిన్మూలములో అంతఃకరణములను, వ్యక్తిత్వాన్ని లీనం చేయడం నిర్గుణోపాసన.

అహమ్, ఇదమ్ లలో, అహమ్ ను మార్చుకుంటే నిర్గుణోపాసన. అద్వైతము.

విషయ ప్రపంచాన్ని, విషయానుభవమయ వాసనలను ఒక ఇష్టదైవ శరణాగతిలో, ప్రపత్తిలో మార్చుకుంటే సగుణోపాసన.

విశిష్టాద్వైతము, ద్వైతము, శాక్తము, సౌర్యము, గాణాపత్యము, వైష్ణవము, శైవము, కుమారము‌ మొదలైన మతములు సగుణోపాసనలు.

నేను, ప్రపంచం ల రూపమైన బ్రహ్మమునకు అవనత శిరస్కుడనై బ్రాహ్మీభూతుడను అవుచున్నాను.

శ్రీరస్తు! శుభమస్తు!
సమస్త సన్మంగళాని భవంతు!
ఇష్ట భగవత్ ప్రీతిరస్తు!
ఏతత్సర్వమ్ పరబ్రహ్మార్పణమస్తు!

Tuesday, July 19, 2016

నిర్దుష్టమైన తెలుగుభాషను రూపొందించడం అవసరం

నిర్దుష్టమైన తెలుగుభాషను రూపొందించడం అవసరం

మాండలికాలు ఎన్ని ఉన్నా, నిర్దుష్ట భాష ఒకటి ఉండాలి. మాతృభాషగా మనం తెలుగు భాషను మన మాండలికంలో నేర్చుకోవచ్చు. కాని తెలుగు మాతృభాష కాని వారు తెలుగు నేర్చుకోవడానికి మాండలికాల అంటు సోకని నిర్దుష్టత కల భాష ఉండాలి.
 
జర్మన్ భాషకు జర్మనీలో, ఆస్ట్రియాలో, స్విట్జర్ లాండ్లో, బెల్జియమ్ లో, నెదర్ లాండ్స్ లో వివిధ మాండలికాలున్నాయి. కాని జర్మన్ మాతృభాష కాని వారు ‌నేర్చుకోవడానికి వీలుగాఏ మాండలికము అంటు సోకని ఒక నిర్దుష్ట జర్మన్ భాషను రూపొందించారు. అన్నిరకముల శాస్త్రములు రచించడానికీ, అధ్యయన, అధ్యాపనములకు మాండలికములంటని నిర్దుష్ట భాష కావాలి. 

తెలుగు భాషను, మాతృభాష కాని భారతీయులు, విదేశీయులు నేర్చుకోవడానికి వీలుగా ఒక నిర్దుష్ట భాషను రూపొందించాలని తెలుగునాట విభజన చేసిన రెండు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయములలో ఎటువంటి ప్రయత్నము జరుగుతున్నట్టు కనిపించదు. అన్నిరకముల శాస్త్రములు రచించడానికీ, అధ్యయన, అధ్యాపనములకు మాండలికములంటని నిర్దుష్ట భాష కావాలి. 

రాజకీయనాయకులకు రాజకీయం తప్ప మరేమీ తెలియదు. కాని విద్యాలయములలో పనిచేసే ఆచార్యులు రాజకీయనాయకులని అనుకరించ కూడదు. అనుసరించకూడదు.

కవిత్రయము, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన, పృభృత కవి వర్యులు తెలుగు జాతికి చెందుతారు. ఆంధ్రాకో, తెలంగాణా‌కో మాత్రం చెందరు. జ్ఞానము, విజ్ఞానము, లలితకళలను, ఇతర సామాజిక నేర్పరితనాలను రాజకీయనాయకులు నిర్ణయించరాదు. వారిని వీటిలో ప్రవేశించనీయరాదు. తగలేస్తారు. తగలేస్తున్నారు. సాహిత్యము, సారస్వత సృష్టులకు మాత్రమే భాష ఏర్పడలేదు. అన్నిరకముల శాస్త్రములు రచించడానికీ, అధ్యయన, అధ్యాపనములకు మాండలికములంటని నిర్దుష్ట భాష కావాలి.  

విద్య ఇంత దీన స్థితిలోనుండడానికి చదువు గురించి ఏమీ తెలియని రాజకీయనాయకుల ప్రమేయం విద్యా విధానాలలోను, విద్యాలయముల నిర్వహణ లోనూ ఉండడమే ముఖ్య కారణము. వారే, భాష పేరుతో, మాండలికాల పేరుతో పౌరులను ఆటవికులుగా మార్చగలగడం భారతీయుల, భారతదేశపు దురదృష్టము.

అదే దురదృష్టము తెలుగు భాషకు, సంస్కృతికి పట్టింది. అందుకే తెలుగు మాతృబాష కాక, తెలుగు నేర్చుకుందామనుకునే ఇతర భారతీయులకు, విదేశీయులకు నేర్చుకోవడానికి వీలుగా నిర్దుష్టమైన, మాండలికాల అంటు సోకని తెలుగు భాషను రూపొందించాలని తెలుగునాట ఏ విశ్వవిద్యాలయము, ఆచార్యులు ప్రయత్నమే చేయటం లేదు. ఇది ఒక అవసరం అని వారికి అనిపించటము లేదు.
 
ప్రాంతీయ దురభిమానాలు, సిద్ధాంత మత్తు మందులు, కుల దురభిమానాలు, వాద రాద్ధాంతములు తెలుగు సాహితీ సృష్టిని భ్రష్టు పట్టించాయి.
 
కొన్ని వర్గాల బాధలు, జీవన వ్యవహారములు మాత్రమే సాహితీసృష్టికి వస్తువులు, మరేమీ కావని సంకుచితంగా, విద్వేష పూరితంగా ఆలోచించే కుహనా మేధావులు ఇప్పడు అన్ని పతనములకు కారకులు.  మిగతా శాస్త్రములను ఎవరూ తెలుగు భాషలో రాయటం లేదు, అనువాదములు చేయడానికి ప్రయత్నించటం లేదు. అందుకనే తెలుగు భాషకు నిర్దుష్ట భాష ఒకటి కావాలని తోచటం లేదు, అనిపింతటంలేదు. ఎంత సేపూ ఆస్తిక, నాస్తిక చర్చలు, వాదముల ప్రశంసలు, అభిశంసనలు, ప్రాంతీయ దురభిమాన కావేషములు ఇలా నిర్దుష్టమైన తెలుగు భాష ఆవిష్కరణకు నడుంకట్టనీయడం లేదు.

వారికి aesthetics లేవు. ఉంటాయనీ తెలియదు. ఈ వస్తు చర్చ తప్ప మరే సాహితీ లక్షణముల ప్రసక్తే తేరు ఈ మహానుభావులు. కాదేద కవితకనర్హం, కుక్కపిల్ల, - సబ్బుబిళ్ళలతో సహా అన్న సాహితీ యుగకర్తను శ్రీ శ్రీ ని కూడా లెక్కచేయరు ఈ సాహితీ నిర్దేశకులు.

వారి పరిమిత పాండిత్యము, వివిధ శాస్త్ర, విజ్ఞాన శాస్త్ర జ్ఞానముల అవగాహనా లేమి మాత్రమే తెలుగు సాహితీ సృష్టిని, శాస్త్ర నిర్మాణమును నిర్దేశించడం నేటి సాహితీ, వివిధ సాంఘిక, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాధ్యయనాధ్యాపనా, భాషాధ్యయనా, అధ్యాపనా అరాచకము.
 
ఇటువంటి పరిస్థితులలో తెలుగు మాతృభాష కాని ఇతరులు నేర్చుకునేందుకు, సాహితీ, వివిధ సాంఘిక, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాధ్యయనాధ్యాపనా, భాషాధ్యయనాధ్యాపనములకు నిర్దుష్టమైన తెలుగు భాషను రూపొందించే ప్రయత్నమునందు ఏ విశ్వవిద్యాలయము, ఆచార్యులు దృష్టి పెట్టరు. పెట్టలేరు.
 
అసలు ఇటువంటి అవసరం ఉంటుందని, ఉందని, తెలుగు భాషాసంస్కృతుల వృద్ధికి, అభివృద్ధికి ఇది ఒక సోపానమని ఈ సంకుచిత, పరిమిత జ్ఞానము, పాండిత్యము, విద్వత్తు, మేధ కల ఆచార్యులు కలలో కూడా అనుకోరు. అనుకోలేరు.
 
తమ తమ విద్వేష పూరిత భావములను, సిద్ధాంత ప్రేమను, వివిధ కుల, వాద దురభిమానములను, మనసు నిండా నింపుకొని కంపు కొట్టే ఉపన్యాసములను ఇస్తూ, వ్యాసములు రాస్తూ, టి.వి కార్యక్రమములలో ఊదరగొట్టే విశ్వవిద్యాలయ ఆచార్యులు, కుహనా మేధావులు ఎప్పటికీ గ్రహించలేరు. తెలుగు భాషకు, ఆ భాషలో సాహితీ, వివిధ సాంఘిక, విజ్ఞాన శాస్త్ర నిర్మాణ, అధ్యయనాధ్యాపనములకు ప్రయోజనకరంగా వ్యవహరించలేరు.