Monday, September 25, 2017

మా అమృత సరోవర యాత్ర


మా అమృత సరోవర యాత్ర 1

చాలా మంది మానస సరోవర యాత్ర చేస్తారు. అలా వెళ్ళిన వాళ్ళు కొందరు దానిని​ గురించి రాస్తారు. మేము మానససరోవరం వెళ్ళలేదు. అమృతసరోవరమే వెళ్ళాము. అందుకే మాది అమృత సరోవర యాత్ర అయింది. చాలా మంది ఈ యాత్రా పర్యటనగా చేసి ఉంటారు.

WAVES అని ఢిల్లీలో ఒక సంస్థ ఉంది. వీరి శాఖ అమెరికాలోనూ ఉంది. వీరు ప్రాచీన భారతీయ విజ్ఞాన భాండాగారంని శోధించే వారి పరిశోధనా పత్రాలు, విశేషాలు పంచుకోవడానికి సమావేశాలు ఏడాదికి కాని, రెండేళ్లకోసారి కాని నిర్వహిస్తారు. నేను ఇప్పటికి వారి మూడు సమావేశాల్లో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించాను. 15-12-2016 నుంచి 18-12-2016 వరకు ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్ వారి కేంద్రంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. 


యోగదర్శనము, పతంజలి శబ్దబ్రహ్మ సిద్ధాంతం, స్ఫోట వాదము, సంస్కృత భాషా, వ్యాకరణ నిర్మాణాంశములు-
బ్రహ్మ జ్ఞాన మూలముల పై వారి ఆయా సమావేశాల్లో ఇంతవరకు నా పరిశోధనా పత్రాలు సమర్పించాను.
ఇప్పుడు జ్ఞాన బోధ మీమాంసా పరంగా ఉపనిషత్తులు, అద్వైత, ద్వైత సిద్ధాంతములు, ఆస్తిక, నాస్తిక దర్శనములలో కల మనకు జ్ఞానము, భాషాధ్యయన, ఉచ్చారణలు జరిగే, కలిగే విధములపై నా పరిశోధనా పత్రం తయారు చేశాను.

నా పరిశోధనా పత్రం సమర్పించడానికి ఎన్నికైనందువల్ల ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు భీమవరం నుంచి నేను, మా ఆవిడ డిసెంబర్ 13 న కేరళ ఎక్స్ప్రెస్లో - విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరాము. ఢిల్లీలో ఆప్తులైన బంధువులు ఉన్నారు. ఇలా వస్తున్నామంటే వాళ్ళింట్లోనే దిగమన్నారు. వాళ్ళింటికే వెళ్ళాము.
*********
మా అమృత సరోవర యాత్ర 2
17-12-2016
ఆగ్రా కోట సందర్శనం
16-12-2016 తారీఖున నా పేపర్ ప్రెజెంటేషన్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంక కాన్ఫరెన్స్ లో మా పని అయిపోయింది.
మరునాడు బయలుదేరి తాజ్మహల్ చూడడానికి ఆగ్రా బయలు దేరాము; ఒక టూరిస్ట్ బస్ లో.
పొద్దున్న బయలు దేరి 10, 11 గంటల మధ్యలో ఆగ్రా చేరాము. ముందుగా ఆగ్రా ఫోర్ట్ కి వెళ్ళాము.
దానిని అక్బర్ కట్టాడు. జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు ఇక్కడ నుంచే మొగలాయి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. చాలా ప్రణాలికతో, అందంగా, ఆనాటి రాచరికానికి తగ్గి హుందా, జాగ్రత్తలు కలిపి నిర్మించిన కోట. ఆగ్రా కోట లో జహంగీర్ పెళ్ళాం నూర్జహాన్ పూలతోటలు పెంచితే, షాజహాన్ భార్య ద్రాక్ష తోటలను పెంచిందిట. షాజహాన్ మధుప్రియుడుట. అందుకని. మొగలాయి చక్రవర్తుల రాజసభ వంటిది, బేగం ల జనానాలు చూశాము.
ఎక్కడైతే శివాజీ ఔరంగజేబుని కలిశాడో ఆ ప్రదేశం చూశాఎక్కడ ఔరంగజేబు షాజహాన్ ని బంధించి ఉంచాడో ఆ బందిఖానా, దానినుంచి తాజ్ మహల్ కనిపిస్తుంది. తాజ్ చూడడానికి షాజహాన్ కోసం చేసిన ఒక కన్నం కూడా ఉంది.
రాజులు, రణాలు,‌ కుట్రలు, కుతంత్రాలు చరిత్ర లో భాగాలు. ఔరంగజేబు సోదరులను చంపి, తండ్రిని ఖైదు చేసి సింహాసనం ఎక్కాడు. అక్బరు, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు వలె ఆలయాలును ధ్వంసం చేశారు. కానీ ఔరంగజేబు కు ఉన్నంత చెడ్డపేరు వారికి రాలేదు. జహంగీర్ సేనానులు కోణార్క్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
తాజ్ మహల్
తాజ్ మహల్ కి ఉన్నంత క్రేజ్ భారతీయులకు మరెందులోనూ లేదు. ఎందుకో ప్రణయానికి తాజ్ మహల్ ను ప్రతీకగా భావిస్తారు. అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళు వచ్చాక ఎన్నో విషయాలు, వివరాలు తెలిసి, విషయం పై కాని, మనిషిపై కాని మనకు అంతవరకు ఉన్న మంచి, చెడు అభిప్రాయాలు నిలవడం లేదు. తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ బేగం ల గురించిన విషయాలు, వివరాలు కూడా అంతే. ఇదివరకటి మజాని, భావుకతని ఉత్సుకతని పాడుచేశాయి. అందుకే మనకు అన్ని విషయాల గురించి అన్ని వివరాలు తెలియనవసరం లేదు. తెలిస్తే మన సంతోషం కాస్తా ఆవిరియైపోతుంది.
షాజహాన్ 13 వ భార్య ముంతాజ్ అనీ, ముంతాజ్ భర్తీని చంపి ముంతాజ్ నుంచి వివాహమాడాడనీ, ఆమె సంతానాన్ని కంటూ అనారోగ్యం కారణంగా పోయిందదని రకరకాల విశేషాలుతో ముఖపుస్తకపు గోడలు రాతలతో నిండిపోయాయి. నాలో తాజ్ మహల్ పై ఉన్న , aura కొద్దిగా తగ్గింది. అయినా తాజ్ మహల్ చూసే వస్తాము కదా?
*********
మా అమృత సరోవర యాత్ర 3
17-12-2016
తాజ్ మహల్ సందర్శనం
మేము ఆగ్రా ఫోర్ట్ చూసి దాని చారిత్రక నేపథ్యం తలుచుకొని, ఆగ్రా లోని ఒక పంజాబీ రెస్టారెంట్లో మంచి భోజనం చేశాము. అక్కడి నుంచి తాజ్ మహల్ కి బయలుదేరాము. యమునా నదికి ఆ ఒడ్డు, ఈ ఒడ్డున ఉన్నాయి, ఆగ్రా కోట, తాజ్ మహల్.
తాజ్ మహల్ భారతీయులు మస్తిష్కంలో వేసిన ప్రణయ ముద్రను ఏ "నిజాలు" తండిచివేయలేవు.
తాజ్ మహల్ చేరేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఒక కిలోమీటరు ముందు వెహికల్స్ ఆపేస్తారు. రిక్షాలలో వెళతారు. గవర్నమెంట్ వారి వాహనము ఉంది. అది ట్రిప్పులు వేస్తూంటుంది.
తాజ్ మహల్ ఉన్న ప్రదేశానికి వెళ్ళే ముందు ఒక అందమైన కట్టడం ఉంది. దాని గుండా లోపలికి వెళితే ఎదురుగా 400 మీటర్ల దూరంలో తాజ్ మహల్ కనిపిస్తూంటుంది. ఫొటోల్లో చూసే అంది చందాల కన్నా ఇంకా బాగుంటుంది.
తాజ్ మహల్ నిర్మాణానికి సందర్శించి, వెనుక ఉన్న యమునా నది సౌందర్యాలు చూసాము. తాజ్ మహల్ అంత క్రితం అక్బరు కట్టించిన ఒక కట్టడానికి, మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన సమయంలో కట్టిన మరొక కట్టడం కూడా తాజ్ మహల్ నిర్మాణానికి స్ఫూర్తి. తాజ్ మహల్ చుట్టూ ప్రదేశాలు, యమునా నదిని తప్పక దర్శించాలి. యమునా నదిలో పున్నమి రోజున యమునా విహారానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిమిత సంఖ్యలో టిక్కెట్లు అమ్ముతారు.
తాజ్ మహల్ సందర్శించిన అనుభవం ఎవరికి వారే పొందాలి. లోపల ఉన్నవి సమాధులు అయినా ఒక చక్కని కట్టడాన్ని చూచిన అనుభవం కలుగుతుంది. రాజులు సొమ్ము రాళ్ళపాలే అయినా, ఇందులోని సోషియాలజీని పక్కకు పెట్టిన రమ్యతని ఆస్వాదించాలి.
ప్రపంచంలో రకరకాల సిద్ధాంతాలుంటాయి. ఎన్నో రకాల దృష్టులుంటాయి. మరెన్నో రకాల అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. మనకి నచ్చినది సంతోషించి, నచ్చని దానిని వదిలేస్తే మనకి హాయిగా ఉంటుంది. ప్రశాంతతను అనుభవిస్తూ జీవించవచ్చు. సిద్ధాంత రాద్ధాంతములలో తగంలుకుంటే ఏ ఆనందమూ లేదు. జీవితమూ వాదనలతో నిస్సారంగా గడిచిపోతుంది. తాజ్ మహల్ వెనుక యమునా నది ఒంపులు, సొంపులు ఆహ్లాదపరుస్తాయి. యమునా లో నీరు నల్లని. నల్లని వాని అనుంగు సఖి.
మధుర, బృందావనం ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాయి. వాటి గురించి తరువాతి భాగంలో.
*********
మా అమృత సరోవర యాత్ర 4
అమృతసర్ సందర్శనం
మా ‌అమృత సరోవర యాత్ర అమృతసర్ చూడడానికి. ఢిల్లీ కాన్ఫరెన్స్ కి వెళుతున్నాము అనుకున్నప్పుడే అమృతసర్ వెళ్ళాలి. అనుకున్నాం.
నాకు ఒక‌ 5, 6 ఏళ్ళ నుంచి అమృతసర్ చూడాలని గాఢంగా అనిపిస్తో‌ ఉంది. ఈ ఢిల్లీ పర్యటనలో తాజ్ మహల్ (మొదటి సారి), అమృతసర్ కలిపాము. తాజ్ మహల్ చూడాలని ఎన్నో ఏళ్లనుంచి‌ అనుకుంటున్నాను. అది ఇప్పుడు ‌వీలుపడింది. ఇది వరకు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు ఢిల్లీ కొంత చూశాము.
తాజ్ మహల్ చూస్తున్నపుడు శ్రీ శ్రీ గారి "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు" కవితా పంక్తులు కవితా ప్రియులైన తెలుగు వారందరికీ తప్పక గుర్తుకు వస్తాయి. కాని‌ ఆ భావం శ్రీ శ్రీ గారిదని ఎక్కువ మంది పొరబడతారు.
ఆ భావాల సొంత దారుడు బ్రెతోల్ట్ బ్రెఖ్ త్. ఈయన ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత, కవి, సాహితీ కారుడు. శ్రీ శ్రీ బ్రెఖ్ త్ భావములను సొంతం చేసికున్నారు.
బ్రెఖ్ త్ రాసిన ఒక జర్మన్ కవిత శ్రీ శ్రీ గారి ఆ ప్రసిద్ధ కవితా పంక్తులకు ఆధారం.‌ఆ కవిత‌ని ఇక్కడ ‌ఉటంకిస్తాను.‌
దాని శీర్షిక "చదువరి యైన పాఠకుని ప్రశ్నలు"
తాజ్ మహల్ చూసిన తర్వాత మధుర, బృందావనం లకు బయలుదేరాము. అప్పటికి సాయంత్రం 6 దాటింది. మధుర చేరేసరికి రాత్రి 8 అయింది. మా బస్ ఢిల్లీ ‌అర్థరాత్రి దాటాక చేరుతుందన్నారు. అప్పుడు మా అమృతసర్ రైలు మిస్ అవుతుంది. అందుకని మేము మధురలో ఆగిపోయి, మధుర మీదుగా ఢిల్లీ, అమృతసర్ వెళ్ళే మా రైలుని మధుర లోనే ఎక్కేద్దామని నిర్ణయించుకున్నాము. మేము మధుర చేరేసరికి మా రైలు మధుర రావడానికి 1-30 గంటలు మాత్రమే ఉంది.
మధుర స్టేషన్ చేరేసరికి మా రైలు 3 గంటల లేట్ గా‌ నడుస్తోందని తెలిసింది. గతి లేక మధుర స్టేషన్ లో వేచి ఉన్నాము. మా రైలు లేట్ పెరిగింది. ఈ రైలు లేటవడం ఈ ప్రయాణంలో మాకు ప్రతి సారి జరిగింది. మొదటగా ఎక్కిన కేరళ ఎక్స్ప్రెస్ 6 గంటలు లేట్ గా హజ్రత్ నిజాముద్దీన్ చేరింది. ఈ‌ రైలు ఇల్లాగే అయింది. మా‌ రైలు‌ వచ్చే వరకు మధురలో వెయిట్ చెయ్యలేక (ప్లాట్ ఫారం‌మీద; రిటైరింగ్ రూమ్‌లు ఇంకో ప్లాట్ ఫాం ‌మీద ఉన్నాయి. లగేజీ ఉంది) ముందు వచ్చిన‌ రైలు మీద న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ చేరాము. అప్పటికి రాత్రి 12 దాటింది.
మా రైలు తెల్లారకట్ట ‌4-30 కు వచ్చేవరకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాల్ లో గడిపాము. తెల్లవారుజామున 4-30 కు మా అమృతసర్ రైలు ఎక్కాము. పొద్దున్న 11 గంటలకు వెళ్ళవలసింది మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళింది.
అంతే క్రితమే మా అబ్బాయి రిజర్వ్ చేసిన ‌హోటల్ రూమ్ కి వెళ్ళి రిఫ్రెష్, రిలాక్స్ అయ్యాము.
అమృతసర్ ఊరు పాత, కొత్తలో కలయిక. పాత భవనములు, కొత్త బిల్డింగ్స్ సహవాసం చేస్తున్న ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. ఊరు పొతే వాసనలు, కొత్త‌ పరిమళాలతోటి అలరారుతోంది. ఉదాహరణకి మా హోటల్ బిల్డింగ్ చాలా కొత్తది,‌ ఫెసిలిటీస్‌ బాగున్నాయి కూడా, కాని ఒక సందులో పాత బజారు మధ్యలో ఉంది.
అమృతసర్ విశేషాలు తరువాయి భాగంలో.

మా అమృత సరోవర యాత్ర 5

18, 19, డిసెంబర్ 2016

సువర్ణ దేవాలయ సందర్శనము

నాకు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అమృతసర్ చూడాలని గాఢంగా ఉంది.
ఢిల్లీ ఎలాగ కాన్ఫరెన్స్ కి వెళుతున్నాము కదా దీనితో కలుపుదాం అని అనుకున్నాను. అలాగే ఆగ్రా సందర్శనం అయ్యాక మధురలో టూరిస్ట్ బస్ దిగిపోయి, ఢిల్లీ రైలు ఎక్కాము. మాకు రిజర్వేషన్ ఉన్న రైలు మధుర మీదుగానే వస్తుంది. కానీ బాగా లేట్ గా నడుస్తోంది. మాకు రిజర్వేషన్ ఢిల్లీ నుంచి ఉంది. అందుకని ఇంకో ముందు రైలులో ఢిల్లీ చేరాము. అక్కడ లేట్ గా వచ్చిన మా రైలు ఎక్కి 7 గంటలు లేటుగా మధ్యాహ్నం 3 గంటలకు అమృతసర్ చేరాము.

ముందుగానే మా అబ్బాయి రిజర్వ్ చేసిన ‌హోటల్ రూమ్ కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి సాయంకాలం 7 గంటలకి సువర్ణ దేవాలయ సందర్శనానికి వెళ్ళాము.

అమృతసర్ శిఖ్ఖులకు గొప్ప తీర్థయాత్రా స్థలం. నాకు చిన్నప్పటి నుంచి చరిత్ర అంటే ఇష్టం. మనదేశంలో గొప్ప శౌర్యవంతమైన, నిజాయితీ కల, కష్టపడే మనస్తత్వం కలిగిన జాతి శిఖ్ లు. మన సైన్యంలో, ఇతర రక్షణ బలాలలో శిఖ్ లు ఎక్కువ.

మొగలాయి చక్రవర్తులను ఎదిరించిన సాహస ‌జాతి శిఖ్ జాతి. నాకు ఆ జాతి పై ఎంతో గౌరవం, మన్నన.
అమృతసర్ ఊరు పాత, కొత్తల కలయిక. రైల్వే స్టేషన్ ప్రాంతం, మా హోటల్ ఉన్న ప్రాంతం పాత ఊరు.
కాన్పూర్, వారణాసిలలా‌ ఉంది.

ఆటో ఎక్కి సువర్ణ దేవాలయానికి వెళ్ళాం. చీకటి పడి పోయింది. దేవాలయం లోనికి పురుషులు ఒక రుమాలు తలకి చుట్టుకొని, స్త్రీలు తలపై కొంగు కప్పుకొని ప్రవేశించాలి. దేవాలయం సరస్సులో వెలుగులతో నిండిపోయి, వెలుగులు చిందిస్తూ ఎంతో బాగుంది.

దేవాలయ ప్రదిక్షణ చేస్తూ, చుట్టూ ఉన్న కట్టడాలు చూస్తూ దేవాలయం క్యూ లోకి ప్రవేశించాము. లోనికి వెళ్లడానికి అరగంట పట్టింది. దేవాలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. మూడు అంతస్తుల లోనూ శిఖ్ లు మతం గ్రంథం గ్రంథసాహెబా ఉంటుంది. చుట్టూ మతం గురువులు కూర్చుని ఉంటారు. మంచి గాయకులుపాడంతూ, జంత్ర తంత్రీ వాద్య గాళ్ళు సంగీతం అందిస్తూ ఉంటారు. వారి గానం ఎంతో శ్రావ్యంగా, భక్తి శ్రద్ధలతో నిండి ఉంది.

మొదటి గ్రంథసాహెబా చాలా పెద్దదిగా ఉంది. ఎంతో మంది భక్తులు డబ్బులు గ్రంథసాహెబా వద్ద వేస్తున్నారు. వరండాలో ఎంతోమంది కూర్చుని గానంలో గొంతు కలుపుతున్నారు. వాతావరణం అంతా ఆధ్యాత్మిక అమృతవాహిని లా ఉంది.

వేదాంతంలో జాగ్రత్ సుషుప్తి దేశ ఉన్నట్టే శిఖ్ ల తత్త్వంలో అమృత వేళ అని మానసిక దశ ఉంది. నిర్మల మానసిక స్థితి అది. గురునానక్ ఇప్పటి లాహోర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శిఖ్ మతాన్ని స్థాపించాడు. ప్రస్తుత పాకిస్థాన్ లో ఎన్నో చారిత్రాత్మక గురుద్వారాలున్నొయి.

రంజిత్ సింగ్ సువర్ణ దేవాలయాన్ని కట్టించాడు. పదిమంది శిఖ్ గురువులు వీరులు, ధీరులుగా
మొగలాయిలతో పోరాడి శిఖ్ మత సంరక్షణని, ప్రాచుర్యాన్ని, అభివృద్ధిని తమ భుజస్కంధాలపై వేసుకుని శిఖ్ మత ఉద్ధరణలు చేశారు. 

మొదటి, రెండవ అంతస్తులలోనూ గ్రంథసాహెబా ఉంటుంది. దాన్ని పఠిస్తూ కొందరున్నారు.
అన్ని అంతస్తుల లోనూ గ్రంథసాహెబా‌ దర్శనం చేసుకుని లంగర్ లో భోజనం చేసి రాత్రికి హోటల్ కి చేరి విశ్రమించాము.

మరునాటి ఉదయం మళ్ళీ సువర్ణ దేవాలయానికి వెళ్ళాం. గ్రంథసాహెబా దర్శనం చేసికున్నాము. తరువాత జలియన్వాలాబాగ్ సందర్శించాము. అప్పటి విషాద సంఘటన గురించి తలుచుకొని
ఎంతో వ్యథ చెందాము.

మధ్యాహ్నం వాఘా బోర్డర్ చూడడానికి టాక్సీలో బయలు దేరాము. మధ్యలో ఒక జాబితాలో భోజనం చేశాము. మా ‌పెద్దకోడలు ఒక పంజాబీ వంటకం రుచిచూశాము. అది ఆవకూరతో చేసే పరోటా లాంటిది. రుచిగానే ఉంది.
సాయంకాలం 4 గంటలకు వాఘా బోర్డర్ చేరాము. స్టేడియంలాంటి స్ట్రక్చర్ లో ఆసీనులమయ్యాము.
చాలా మంది జనం వచ్చారు. అటు పాకిస్థాన్ వైపు ముందు జనం ఎక్కువగా లేరు, కాని నెమ్మదిగా చేరారు. అప్పుడే ఢిల్లీ-లాహోర్ బస్ బోర్డర్ దాటింది. 

5 గంటలకు రిట్రీట్ మొదలైంది. చాలా హుందాగా, హుషారుగా, ఆకర్షణీయంగా జరిగింది. ఒక విధమైన దర్పం, ఆనందం కలిగాయి. గర్వంగా అనిపించింది.

మేము రెండవ సారి సువర్ణ దేవాలయ సందర్శనం లో ఉండగా మా రెండవ అబ్బాయి భావి మామగారు అమ్మాయినిస్తామని ఫోన్ చేశారు. శుభసూచకంగా ఉంది అనుకున్నాం.

రాత్రికి హోటల్ కి చేరి విశ్రమించాము. మరునాడు ఉదయం 11 గంటలకు మా రైలు. 10-30 కే స్టేషన్ చేరాము. మా రైలు ఒక్క 11గంటలు మాత్రం లేట్ అయ్యింది రాత్రి పదిగంటల ప్రాంతంలో బయలు దేరింది. తరువాత ఢిల్లీ చేరుకొని, రాత్రి 10 గంటలకు విజయవాడ కి మా రైలు ఎక్కాము. దారిలో చర్చించు కొని విజయవాడ బదులు హైదరాబాద్ చేరి మా రెండవ అబ్బాయి భావి పత్నిని చూశాం. అదే సమయంలో మా పెద్దకోడలు ప్రెగ్నెంట్ అని తెలిసింది. అప్పుడు మేము చూసిన అమ్మాయే మా రెండవ కోడలు అయింది. అలాగే మాకు ఆగస్టు రెండున మనుమరాలు పుట్టింది. 2017వ సంవత్సరంలో మా కుటుంబం లోనికి ఇద్దరు ముఖ్య సభ్యులు వచ్చి చేరారు.
కథ కంచికి మనం ఇంటికి..

No comments:

Post a Comment