Tuesday, September 19, 2017

మా ఖాట్మండూ యాత్ర 12; వృత్తి - నివృత్తి; ఫేస్ బుక్ నిండా మేధావులే

మా ఖాట్మండూ యాత్ర 12
24-8-2017
గుహ్యేశ్వరీ దేవ్యాలయ దర్శనం, చంద్రగిరి రోప్ వే
ప్రతి శివాలయంలోనూ అమ్మవారి ఆలయం ఉంటుంది కదా! పశుపతినాథ్ దేవాలయం ప్రాంగణంలో అమ్మవారి ఆలయం కోసం వెతికాను. కనిపించలేదు. ఇద్దరు, ముగ్గుర్ని అడిగాను. ఒకతను ఇక్కడ లేదు, వెనక్కాల ఉంది అన్నాడు. వివరం తెలియలేదు. శృంగేరి మఠం రిప్రజెంటేటివ్ స్వామి వారి దర్శన సందర్భంగా ఆయన్ని అడిగాను. ఆయన ఉందే, గుహ్యేశ్వరీ దేవి ఆలయం, పశుపతినాథ్ ఆలయం వెనుక బాగమతి నది దాటి వెళ్తే ఉంది. తప్పక దర్శించి వెళ్ళండి అన్నారు.
పశుపతినాథ్ ఆలయం వెనుక బాగమతి నది పై చిన్ని వంతెన దాటి 200 మెట్లు ఎక్కి 100 మెట్లు దిగితే అమ్మవారి ఆలయం వచ్చింది. దారిలో చిన్న, చితక ఆలయాలెన్నో ఉన్నాయి. పూజాదికాలకు ఏమీ నోచుకుంటున్నట్టు లేదు. అలా ఉన్నాయి అంతే. అమ్మవారు గుహ్యేశ్వరీ దేవి ఆలయం నేపాల్ గుళ్ళ నమూనాలో ఉంది. బాగమతి నది అమ్మవారి ఆలయం ఎదురుగా ఉంటుంది. అదే తిరిగి పశుపతినాథ్ ఆలయం వెనుక వైపునకు వస్తుంది. బాగమతి నది ఖాట్మండు నగరంలో ఎన్నో మెలికలు తిరిగి ప్రవహిస్తుంది.
గుహ్యేశ్వరీ దేవి ఆలయం చక్కగా ఉంది. అమ్మవారి విగ్రహం ఉండదు. కింద ఊటలా ఉంటుంది. ఆ ప్రదేశంలో పైన ఒక ఆకారంగా అమర్చి ఉంచారు.
లోపల ఇద్దరు పూజారులు ఉన్నారు. ఒకతను చైనా అతనులా ఉన్నాడు. భక్తిగా, శ్రద్ధతో ఆలయం నిర్వహిస్తున్నారు.
అమ్మవారి దర్శనం అయ్యాక మా హోటల్ కి వచ్చి భోజనం చేసి చంద్రగిరి టాక్సీ చేసుకు బయలు దేరాము. వెళ్లి రావడానికి 2500 రూపాయలు బాడుగ. దూరం ఖాట్మండు కి 20 కి.మీ. మేము వెళ్ళే దారే ఇండియా బోర్డుకు వెళుతుంది. బోర్డరు చాలా దూరం. కాని ట్రాఫిక్ విపరీతంగా ఉంది. వర్షం కురిసింది. దారి, రోడ్డు బాగులేదు.
20 కి.మీ. కి 2-30 గంటలు పట్టింది. సాయంత్రం 4-45 కి చంద్రగిరి పర్వతములు చేరాము. అక్కడ రోప్ వే ఉంది. రోప్ వే లో 15 నిమిషాలు ప్రయాణం. టాక్సీ డ్రైవర్ తొందరపెట్టి ముందు టిక్కట్లున్నయో లేదో కనుక్కోండి అన్నాడు. ఉన్నాయి. అవేళ్టికి మావే ఆఖరి టిక్కెట్లు. ఆ టిక్కెట్లు దొరకడం ఎంతో అదృష్టం. లేకపోతే ఇంత ప్రయాణం, హైరానా, ప్రయాస, శ్రమ, డబ్బూ వృథా అయ్యేవి. భగవంతుని కి కృతజ్ఞతలు చెప్పుకున్నాము.
చంద్రగిరి పర్వతములను అధిరోహింప జేసే రోప్ వే ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కుతూంటే, దిగుతూంటే సుందర ప్రకృతి దృశ్యాల సౌందర్యం, చూచి తీరాలి. పైన ఒక శివాలయం ఉంది. పూజారిగారు గుడి మూసేస్తూ మమ్మల్ని చూసి ఆగారు. ఒక స్ఫురద్రూపి అయిన కుఱ్ఱాడు అతను. శృంగేరి మఠం వారి ఆధ్వర్యంలో ఉన్నది ఈ ఆలయం కూడా. కొండపైన ఎంతో బాగుంది. మళ్ళీ రోప్ వే స్టేషన్ కి వచ్చి ఆఖరు ప్రయాణీకులు గా దిగాము. రోప్ వే ప్రయాణం ఒక అందమైన అనుభవం.
ట్రాఫిక్ జామ్ వల్ల వెనక్కి హోటల్ కి వెళ్ళడానికి 3-30 గంటలు పట్టింది. మరునాడు ఎయిర్ ఇండియా విమానంలో ఖాట్మండు-ఢిల్లీ, ఢిల్లీ-హైదరాబాద్ రిజర్వేషన్ ఉంది.
24 ఉదయం 8-30 కి ఖాట్మండు త్రిభువన్ తో విమానాశ్రయానికి చేరాము. త్రిభువన్, మహేంద్ర, జ్ఞానేంద్ర నేపాల్ రాజులు. జ్ఞానేంద్ర తన కుటుంబం అంతనీ కాల్చి చంపేశాడు. తన ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేయడానికి అంగీకరింలేదని. నేపాల్ లో ఇప్పుడు రాచరికం లేదు. ప్రజాస్వామ్యం ఉంది.
మా ఖాట్మండూ - ఢిల్లీ విమానం అరగంట ఆలస్యంగా 11-15 కి బయలుదేరింది. ఢిల్లీ చేరేసరికి మా హైదరాబాద్ కనెక్షన్ విమానం వెళ్ళిపోయింది. మాకు ఎయిర్ లైన్స్ వారు భోజనం ఏర్పాటు చేశారు. సాయంకాలం 6 గంటలు చికాగో-హైదరాబాద్ ఫ్లైట్ లో సీట్లు ఎరేంజ్ చేశారు. అది బోయింగ్ 737 విమానం. బాగా‌ పెద్దది గా ఉంది. రాత్ర 8-30కి రాజీవ్ గాంధీ విమానాశ్రయం లో దిగాము. మా రెండో అబ్బాయి వచ్చి పికప్ చేసుకున్నాడు.
మరునాడు మా రెండో అబ్బాయి, వాడి భార్య క్రొత్త కోడలు లచే వినాయక వ్రతం చేయించి అక్షింతల వేసుకున్నాము. మా పెద్దబ్బాయి కూతురు-మా మనుమరాలిని చూసి వారితో గడిపి ఆగస్టు 29 ప్రొద్దున్న నర్సాపురం ఎక్స్ప్రెస్ లో భీమవరం చేరాము. ఆగష్టు 14 న మొదలైన మా ఖాట్మండూ యాత్ర ముగిసింది.

*****************
వృత్తి - నివృత్తి

యోగః చిత్త వృత్తి నిరోధః
అనే యోగ సూత్రం మనకు పరిచయమే.
చిత్త వృత్తి అంటే ఏమిటి? వృత్తి అంటే ఏమిటి?
వృత్తి నామ అంతఃకరణ పరిణామః
వృత్తి అంటే అంతఃకరణములు పరిణమించుట. మార్పునొందుట.
మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంతఃకరణములు. లోపలి పనిముట్లు.
మన మానసిక కార్యకలాపాలు ఈ నాలుగింటి పరిణామములే.
మనసు బాహ్య భౌతిక ప్రపంచాన్ని విషయముల రూపంలో జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించి, వాటిని ఆంతర ప్రపంచంగా మస్తిష్కంలో భద్రపరుస్తుంది. మరల ఆ విషయ సమూహ సమాహారాన్ని జగత్ గా దృష్టిలోకి తెస్తుంది. తలపులు కలిగే విధము ఇది.

బుద్ధి తర్కాన్నీ, విచక్షణని, నిశ్చయాన్ని, వివేకాన్ని కలిగిస్తుంది.

చిత్తము విషయములు గ్రహించి బడుతున్నపుడు అదే సమయంలో అవి కలిగించే అనుభవములను, విషయానుభవములను గ్రహించి జ్ఞప్తి, జ్ఞాపకములు గా భద్రపరుస్తుంది. ఈ జ్ఞప్తి, జ్ఞాపకములనే వాసనలు అంటారు. వీటినే స్మృతి అనీ అంటారు. వాసనలను కలిగించి మరల వాటిని ప్రేరేపించడమూ చిత్రమే చేస్తుంది. ఆ ప్రేరేపింపబడిన వాసనే భావములు, లేక తలపులు, లేక ఆలోచనలుగా మారుతాయి. చిత్తము స్మరణమూ చేస్తుంది.

వ్యక్తికి, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయ సమాహారమే, సమాచార సమూహమే అహంకారం. దర్పము అనే అర్థం నానుడి లో వచ్చింది. అహంకార మమకారములు వ్యక్తిత్వ స్పృహ పై ఆధారపడి ఉంటాయి.

ఇలా ఈ నాలుగు అంతఃకరణములు విషయములను కాని విషయానుభవములను కాని గ్రహించడమే అంతఃకరణ పరిణామం. దీనినే వృత్తి అంటారు. ఈ నాలుగింటికి ముడి శక్తి ఒకటే. దానిని మాయ అంటారు.

ఈ అంతఃకరణ పరిణామములను నిరోధించు కోవడాన్నే యోగం అంటారు. అంటే మానసిక కార్యకలాపాలను ఉపసంహరించుకునే ప్రయత్నమే యోగం.

అంతఃకరణములు పరిణమించకుండా ఉన్న సహజ, ముందటి స్థితిని నివృత్తి అంటారు. నివృత్తి అంటే లేకుండా చేసికోవడం. చిత్తవృత్తిని లేకుండా చూసుకోవడం. అంతఃకరణములు పరిణమించకుండా చూసుకోవడం. అంతఃకరణములు పరిణమించకుండా ఎలా చూసుకోవాలి అనే విషయం యోగదర్శనం చెబుతుంది.

నివృత్తి స్థితినే మోక్ష స్థితి అని కూడా అంటారు.

వృత్తి, నివృత్తుల మధ్య మనసు, ఇతర అంతఃకరణములు మసలడమే మానసిక కార్యకలాపాలు జరగడం, ఆగడం, నియమింప బడడం. ఇది సరిగా జరిగేటట్టు చూసుకోవడమే యోగాభ్యాసము. యోగ శిక్షణ.

సమస్త సన్మంగలాని భవంతు!
***********
ఫేస్ బుక్ నిండా మేధావులే

ఫేస్ బుక్ నిండా మేధావులే
కవులే, సమాజ సేవకులే;
అంతర్జాలం పుణ్యమా అని
ప్రతి రచయితకూ లైకుల పండగే
పత్రికలలో మాత్రమే ప్రచురించబడే
రోజుల్లో జనానాలో ఉన్న కవులు
కవయిత్రులందరూ రచయితల
జనాభా లోకి వచ్చేసారు; భారత
దేశపు జనాభా వలె అతియైనది?!
కాదు, సాహితీ సృష్టికి వాతావరణం
అనుకూలంగా ఉంది; దమ్మిడీ ఖర్చు లేని
ప్రచురణా స్వాతంత్ర్యం; రసికులైన
పాఠకుల నుంచి రయ్ రయ్ మని
స్పందనలు, ప్రతిస్పందనలు, ప్రశంసలు
నేటి అంతర్జాల సాహితీ కారుల
అదృష్టమే అదృష్టము; రచనల
ప్రయోజనమేమి? ఆ ఒక్కటి
అడగొద్దు; మంది ఎక్కువై మజ్జిగ
పల్చనైంది; లేదా వాదముల రణగొణ ధ్వనుల
ముందు శ్రావ్య గీతాలు వినిపించుటలేదు??
**********
నా హృదయము నీవే; నా హృదయ స్పందనలు ప్రణవ నాదములే;
నీ దరిని చేరటకునై భవసాగరమీది అద్దరిని చేరిన సంసార సంద్రపు
ఈతగాడను; నీ మౌన సంద్రమున కలిసిన నిశ్శబ్ద వ్యక్తిత్వ సంగమమును;
నారాయణా! నేనన్నది పిసరంతైన, నాదన్నది ఇసుమంతైన లేని, అద్వైతిని

No comments:

Post a Comment