Thursday, January 11, 2018

మా తురా (మేఘాలయ) పర్యటన

మా తురా (మేఘాలయ) పర్యటన 1
19, 20-11-2017
జీవితం అనే పెద్ద ప్రయాణం లో మనం ఎన్నో చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉంటాము. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన ఈ రోజుల్లో దూరాభారాలు లెక్క చెయ్యకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటాము. 
బస్సులు, రైళ్ళు, టాక్సీలు, విమానాలు తేలికగా అందుబాటులో ఉన్న ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ పెట్టుకుంటున్నాము. మన పెద్దవాళ్ళు ఇన్ని ప్రయాణాలు చేసేవారు కాదు. రవాణా సౌకర్యాల లేమి, ధనం అంతగా లేకపోవడం, ఇళ్ళల్లో పనులు ఎక్కువగా ఉండడం కారణాలు.
అదీకాక దారిలో క్రూర మృగాల, దొంగల, దోపిడీ దారుల భయాలు ఎక్కువ. అందుకే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళిన వాడు సమానం అనుకునేవారు. మనకు ఇటువంటి సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.
రకరకాల కారణాలు పెట్టుకుని దగ్గర, దూరం ప్రయాణాలు చేస్తున్నాము. మేము డిసెంబర్ 14, 2016 నుంచి నెలకు రెండు ప్రయాణాలు దగ్గరివి,
దూరాలవి చేస్తున్నాము. మొన్నే మిజోరమ్ యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ కి వెళ్ళాము. అంత క్రితం ఆగష్టు లో ఖాట్మండు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు మేఘాలయ వెళుతున్నాము. జాతకంలో గోచారంలో గ్రహాల సంచారములో మార్పు వచ్చినపుడు ఇలా వరుస ప్రయాణాలు తగులుతాయని జాతకులు అంటూంటారు. నాకు జాతకాలు, జ్యోతిషాలలో ప్రవేశం, వాటిపై అవగాహన లేవు.
తురా మేఘాలయలో ఒక ప్రాంతం. North Eastern Hill University (NEHU), షిల్లాంగ్ యొక్క ఒక శాఖ తురా లో ఉంది. ఇక్కడ కామర్స్ డిపార్ట్మెంట్ లో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో ప్రజెంట్ చేయడానికి నా పరిశోధనా పత్రం ఎన్నిక అయింది. దానిని సమర్పించడానికి తురా బయలు
దేరాము. సదస్సు నవంబర్ 23, 24 లలో జరుగుతుంది
భీమవరం నుంచి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రి వచ్చి అక్కడ సికింద్రాబాద్- గౌహతి ఎక్స్ప్రెస్ కి మారి గౌహతి వెళుతున్నాం. రేపు ప్రొద్దున్నే 21- 11-2017, 6 గంటలకు చేరతాము. అక్కడినుంచి తురా బస్ మీద 4' 5 గంటల ప్రయాణం.
మా తురా (మేఘాలయ) పర్యటన 2
21-11-2017
శ్రీ కామాఖ్యాదేవి ఆలయ సందర్శనం
మేము సికింద్రాబాద్-గౌహతి ఎక్స్ప్రెస్ లో మూడుగంటల ఆలస్యంగా ఉదయం 9 గంటలకు గౌహతి చేరాం. గౌహతి ప్రవేశిస్తూ ఉండగా బ్రహ్మపుత్రా నది స్వాగతం పలికింది. మనకి బ్రహ్మపుత్ర అయిన ఈ నదికి దీని జన్మస్థలం అయిన టిబెట్ లో మరియొక పేరు. నామ, రూపములని బట్టి వస్తువులు మనలో ముద్రలు వేస్తాయి. ఒకే వస్తువు వేరు వేరు భాషల్లో, సంస్కృతులలో వివిధ భావాలు పుట్టిస్తాయి. మన ప్రేమాస్పదత, అభిమానాలు, ఇష్టాయిష్టాలు, ఆవేశ కావేషాలు ఈ మాటల మీద ఆధారపడి ఉంటాయి. భాష మన మొదటి సంస్కృతి. దానిమీదే అన్ని శాస్త్రాలు, వేదాంతాలు, తత్త్వాలు, కావ్యాలు ఆధారపడి నిర్మింపబడతాయి. సృష్టించబడతాయి. మన జీవనానికి, సంస్కృతీ సాంప్రదాయాలకి, నాగరికతకి భాష జీవనాడి.
బ్రహ్మపుత్ర నది దాటిన వెంటనే కామాఖ్యా రైలు స్టేషన్ వస్తుంది. ఆ తరువాత గౌహతి. మేము రైల్వే వెయిటింగ్ హాల్ లో రిఫ్రెష్ అయ్యి సామాన్లు క్లోక్ రూమ్లో పెట్టిన కామాఖ్యాదేవి ఆలయ సందర్శనానికి
బయలుదేరాము. గౌహతి స్టేషన్ నుంచి సిటీ బస్ లో ఒక సెంటర్ కి వెళ్ళి అక్కడ నుంచి దేవస్థానం బస్లో
కొండ పైకి వెళ్ళాము. కొండ కింద నుంచి ఇతర రకాల
వాహనాలు లభ్యమౌతాయి.
కొండ పైకి మెట్లు ఎక్కీ వెళ్ళవచ్చు. కొండ మరీ ఎత్తు లేదు. అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. సతీదేవి వివిధ అంగాలు వివిధ ప్రదేశాల్లో పడి అవన్నీ శక్తిపీఠాలు గా మారినట్లు మనకి ఐతిహ్యం. సతీదేవి యోని ఇక్కడ పడ్డట్టు పురాణం. తిరుపతిలో లాగా ధర్మదర్శనానికి కంపార్ట్మెంట్ లు ఉన్నాయి. జనం ఎక్కువగా ఉన్నారనిపించి దర్శనం కోసం 501/- రూపాయల టిక్కెట్లు తీసి కున్నాము. అమ్మవారి ఆలయ పరిసరాలు, ప్రాంగణం అందంగా, నిశ్శబ్దంగా, ఆహ్లాదంగా ఉన్నాయి. అమ్మవారి ఆలయం రాతి కట్టడం. శిల్పాలు సకకృత్తుగా ఉన్నాయి.

మా తురా (మేఘాలయ) పర్యటన 3
కామాఖ్యాదేవి సందర్శనం 2
22-11-2017
కామాఖ్యా దేవి విగ్రహం రూపంలో లేదు. నిన్ననే గౌహతి లో కామాఖ్య అమ్మవారి ఆలయం దర్శించాము. ఆలయంలో అమ్మవారి దగ్గరకు వెళ్ళేముందు ఒక పీఠంపై మూడు మూర్తులు ఉంటాయి. మధ్యలో కామాఖ్య అమ్మవారి మూర్తి, కుడిపక్కన కామేశ్వరి దేవి, ఎడమ పక్క కామేశ్వరుడు ల ఉత్సవ విగ్రహాలవంటివి. వెనుకవైపు భూగృహంలో అమ్మవారు జలధార లా ప్రవహిస్తూంటారు. అదే అమ్మవారు. అమ్మవారికి వేరే విగ్రహం లేదు. ఈ విగ్రహం, ఈ 15 ఏళ్ళకొకసారి అనేది అబద్ధం. ఈ వాట్సాప్ లలో ఎన్నో అబద్ధాలు రౌండ్లు కొడుతున్నాయి. నేనూ దానికి బలి అయ్యి ఆ ఫొటో షేర్ చేశాను. ఇదీ కథ.
మేము కామాఖ్య అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ప్రవేశించాము. ఆలయ పరిసరాలు, ప్రాంగణంలో చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉన్నాయి. గుడి పురాతనమైనది. వినాయకుని ఒక ప్రతిమ, కొన్ని శిల్పాలు ఆలయం గోడలపై ఉన్నాయి. ఆలయంలోకి 50 మంది చొప్పున పంపిస్తారు. క్యూ తిరిగి పీఠంపై ఉన్న ప్రతిమలను చూసినప్పుడు ఎంతో హాయి కలుగుతుంది. అక్కడ అరటిపండ్లు, కొబ్బరికాయలు ఉండవు.
పూలదండలు, తలకు చుట్టుకునే - जै श्री माता అని రాసి ఉన్న గుడ్డలు అమ్ముతారు. ఆడ, మగా కొనుక్కుని అమ్మవారి దర్శనానికి వస్తారు. పసుపు, కుంకుమ, చీర ఇచ్చే వారు ఇవ్వచ్చు. ఇవన్నీ మూల దేవి దగ్గర ఇవ్వాలి. మూర్తుల దర్శనం తర్వాత మూలదేవిని దర్శస్తాము. భూగృహంలో జలధారయే అమ్మవారు. నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిని మనం చేతితో తీసుకుని తలపై జల్లుకుంటాము. అక్కడ ఉన్న పూజారి కుంకుమ బొట్టు పూస్తారు. లోపల భూగృహంలో ప్రమిదలలో నూనె/నెయ్యి దీపాలే ఉంటాయి. వాటి వెలుగే వెలుగు. అక్కడ ఎంతో చల్లగా పవిత్రంగా ఉంది. మనసు నెమ్మదిని పొందింది.
ఖాట్మండు లో కూడా అమ్మవారు గుహ్యేశ్వరీ విగ్రహం రూపం లో ఉండరు. నీటి ఊటే అమ్మవారు. 
కామాఖ్యా అమ్మవారి కరుణతో ఆవిడ దర్శనం చేసుకుని, అక్కడ కల్పించిన సదుపాయంతో భోజనం చేసి, బ్రహ్మపుత్రా నదిని దర్శించి తురా వెళ్ళడానికి సిద్ధం అయ్యాము. ఎంతోమా తురా (మేఘాలయ) పర్యటన 4
21, 22, 23-11-2017.
తురా ఆగమనం
కామాఖ్యా దేవి దయతో ఆవిడని దర్శించుకొని ఆలయం ప్రాంగణంలో కూర్చుని తల్లికి మనఃపూర్వక కృతజ్ఞతలు చెప్పుకొని, నమస్కరించి బయలుదేరాము. బయట ఆలయం నిర్వాహకులు యాత్రీకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. పెసరపప్పు తో ఉడికించిన అన్నం, ఒక కూర, పరమాన్నం, అప్పుడు ఆధరువులు. బాగానే ఉన్నాయి. అన్నీ మారు వేశారు కాని అప్పడం వేయలేదు. మనం మన ప్రాంతం విడిచాక మజ్జిగ అన్నం, పెరుగు అన్నం గురించి మర్చిపోవాలి.
ఈ ప్రాంతాల్లో మజ్జిగ అన్నం తినే అలవాటు లేదు.
బస్సులో స్టేషన్ కి వచ్చేసరికి మధ్యాహ్నం 3 అయింది. గౌహతి నుంచి తురా కి ప్రొద్దున్న 6-30కి, మధ్యాహ్నం 1-30 కి, రాత్రి 9 గంటలక రవాణా సదుపాయం ఉంది. సుమోలు అలాంటి ఇతర వాహనాలు షేర్ చేసికొని వెళ్ళవచ్చు. టాక్సీలు ఉంటాయి. 4 వేలు అడిగాడు.
మధ్యాహ్నం 3 అయింది కాబట్టి ఇవేమీ లేవు. రాత్రి 9 గంటలకు బస్ కి రిజర్వేషన్ చేసుకున్నాం. గౌహతి స్టేషన్ నుంచి ISBT - Inter State Bus Terminal - కి వెళ్ళాలి. ఇంటర్ స్టేట్ బస్ లన్నీ అక్కడ నుంచి బయలు దేరతాయి. తురా మేఘాలయ రాష్ట్రంలో ఉంది. గౌహతి స్టేషన్ నుంచి 2 గంటలు ముందే బయలుదేరాము. స్టేషన్ పక్కనే బస్ స్టాండ్ ఉంది. అక్కడ నుంచి ఐ ఎస్ బి టి కి గంటన్నర పట్టింది. ఐ ఎస్ బి టి చాలా పెద్ద బస్ స్టాండ్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం లకు బస్సులు అక్కడ నుంచి బయలు దేరతాయి.
మా బస్ 9 కి బయలుదేరింది. అది ప్రయాణీకుల బస్సుల్లో కంటె రవాణా బస్ అనవచ్చు. మాకు తెలియక అటువంటి బస్ కి రిజర్వేషన్ చేసుకున్నాం. సీట్లున్నాయి. అందరూ మగవారే. కామేశ్వరి తప్ప ఆడవారు లేరు. కొద్దిగా అనిపించింది. కానీ అంత భయపడనవసరం లేదనీ అనిపించింది. అక్కడ రాత్రి బస్ ప్రయాణాలు చెయ్యరని తెలిసింది. అందరూ పగలే ప్రయాణం చేసేస్తారు. గౌహతి నుంచి తురా కు 5 గంటల ప్రయాణం. బస్ తెల్లవారుజామున 4 గంటలకు తురా చేరింది. మధ్యలో ఒక ధాబా దగ్గర గంట పైగా ఆపేశారు.
మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ కి ఆటో వచ్చింది. ఎక్కువగా ఏమీ తీసికోలేదు. మనుషులు మంచివారు. మా గెస్ట్ హౌస్ 8 కిలోమీటర్ల దూరం ఉంది. మమ్మల్ని జాగ్రత్తగా గెస్ట్ హౌస్ దగ్గర దించాడు. కేర్ టేకర్ వెంటనే రూం ఇచ్చాడు. అతను వెనకాల ఇంటో ఉంటాడు. అది హాస్టల్ కూడాను. అందులో ఉన్న అమ్మాయిలు కేర్ టేకర్ ని లేపడంలో
సాయం చేశారు. వారి మేలు ప్రశంసనీయం.
మేము బాగా‌ అలసిపోవడం వల్ల వెంటనే నిద్రపోయాం. ఎనిమిది గంటలకు లేచాం. కాన్ఫరెన్స్ 23, 24 లలో. 22 పొద్దున్నకి తురా చేరాం. మేము ఉన్న గెస్ట్ హౌస్ పేరు
SMELC
Social Mobilization for Employment and Learning Center.
Dakkopgre
West Fargo Hills
Tura
మేఘాలయ గవర్నమెంట్ వారి డిఆర్డిఎ శాఖ నిర్వహణలో ఉన్న భవంతి. దానికి ఆనుకొని ఒక మెస్, క్లాస్ లు జరపడానికి మరొక భవంతి ఉన్నాయి. ఆవేళ్టికి పూర్తిగా రెస్ట్ తీసుకున్నాము. మెస్ లో భోజనం చేశాము. మేఘాలయలో వరి అన్నం తింటారు. మాకు బ్రేక్ ఫాస్ట్ పూరీ కూర, మధ్యాహ్న భోజనం అన్నం, మూడు కూరలు, పల్చగా ఉన్న పెసర పప్పు నలుచుకొందుకు పచ్చిమిర్చి ముక్కలు, కారట్, ఉల్లిపాయ, కుకుంబరు ముక్కలు ఇచ్చారు. పన్నీర్ తో చేసిన కూర వీళ్ళకి ఇష్టం. అది స్పెషల్ గా, ఇష్టంగా తింటారు.
ఇక్కడ మాంసాహారం, శాఖాహారం పక్క పక్కనే ఉంటాయి. అడిగి తెలుసుకోవాలి. అందరూ మాంసాహారులే. క్రిస్టియానిటి మతము. హిందీ, ఇంగ్లీష్ అందరికీ రాదు. మేనేజ్ చేసుకోవాలి.
మరునాడు యూనివర్సిటీ కి వెళ్ళడానికి బయిటకు వచ్చినప్పుడు ఊరు ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఎత్తులు, పల్లాలలో ఊరు ఉంది. తురా మేఘాలయ రాష్ట్రంలో రెండవ పెద్ద పట్టణం. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. చల్లగా ఉంది తప్ప చలిగా లేదు. ఈ వాతావరణం ఎంతో ఆనందిస్తాం.
మేము వెళ్ళవలసిన కాన్ఫరెన్స్ NEHU - North East Hill University, Shillong యొక్క ఆఫ్ సైట్ కేంపస్. ఇది వరకు పార్లమెంటు స్పీకర్ గా పనిచేసిన పి.ఎ. సంగ్మా ఊరు. ఆయన వల్లే ఈ శాఖ 10 ఏళ్ళ క్రితం పెట్టబడింది. ఇక్కడ హిస్టరీ, మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, వంటివి పది డిపార్ట్మెంట్ లు ఉన్నాయి. పొద్దున్న 9 గంటలకు మాకు యూనివర్సిటీ బస్ వచ్చింది. మేమున్న చోటునుండి కె మమ్మల్ని కేంపస్ కి తీసికెళ్ళింది.
NEHU తురా కేంపస్ ప్రొ ఛాన్సలర్ ప్రొఫెసర్ సింగయ్య గారు తెలుగాయన. హిస్టరీలో ఇద్దరు, మేనేజ్మెంట్ లో ఒకరు మన తెలుగు వారు పనిచేస్తున్నారు. కాన్ఫరెన్స్ కెరోల్ సింగింగ్ తో మొదలైంది. ఇది మేఘాలయ సంప్రదాయం. విద్యార్థినీ విద్యార్థులు పాడారు. విజయవాడ తెలుగబ్బాయి ఒకతను ఎం బి ఎ చేస్తున్నాడు.
కన్వీనర్ బిస్వాల్ నా అభ్యర్థన మన్నించి నా ప్రెజెంటేషన్ 23 సాయంత్రం పెట్టారు. నా ప్రెజెంటేషన్ బాగా రిసీవ్ చేసుకున్నారు. Demonetization and digitization: A common man's perspective దాని శీర్షిక. ఆ సాయంత్రం గెస్ట్ హౌస్ కి చేరి మరునాడు షిల్లాంగ్ వెళ్ళే కార్యక్రమం పెట్టుకుని నిద్రించాము. మిగతా తరువాతి భాగంలో.

తురా  నుంచి షిల్లాంగ్ ప్రయాణం

23, 24-11-2017

ఈ ప్రయాణం భగవదనుగ్రహంతో హాయిగా జరిగింది. లేకపోతె చాలా ఇబ్బంది కలిగేది. కష్టపడేవాళ్ళము.
మేము 23 ప్రొద్దుటే లేచి ఆరున్నరకు తయారై ఆరు నలభై కి తురా బస్సు స్టాండ్ చేరాము. అక్కడ ఒక్క బస్సు కానీ, సుమో కానీ ఇతర ప్రయాణ వాహనాలు కానీ లేవు. తురా బస్సు స్టాండ్ ఒక జంక్షన్ మాత్రమే.
మేము ఆటో దిగి అక్కడి ఏ విధమైన వాహనములు లేకపోవడం చూసాము. అప్పుడు ఆటో డ్రైవర్ అన్నాడు, ఇక్కడనుంచి గౌహతి మీదుగా షిల్లాంగ్ వెళ్ళాలి. ఇక్కడనుంచి గౌహతి వెళ్లే అన్నిరకముల వాహనములు ప్రొద్దుట ఆరున్నరకు వెళ్లి పోతాయి. మళ్ళీ రాత్రి బస్సు లే శరణ్యం అన్నాడు.

పై ప్రాణం పైనే పోయింది. ఇంతలో అక్కడ ఉన్న ఒక టాక్సీ డ్రైవర్ మా ఇబ్బంది, కంగారు గమనించాడు. ఫోన్లో ఎదో మాట్లాడాడు. మాదగ్గరకొచ్చి ఆటో అతనిని అక్కడనుంచి 10 కిమీలలో తనకు తెలిసిన గౌహతి వెళ్లే టాక్సీ ఆపి ఉంచుతానని, ఆటో అతనిని మమ్మల్ని అక్కడకు తీరికెల్లమని అన్నాడు. ఆటో డ్రైవర్ ఉత్సాహము చూపించలేదు. అప్పుడు ఆ టాక్సీ డ్రైవరే తాను తీసికెళతానని రెండు వందలు ఇమ్మని అడిగాడు. మేము వెంటనే ఒప్పుకున్నాము. ఆటను మూడు టాక్సీని ఆపివుంచి మమ్మల్ని అక్కడకు చేర్చాడు. ఇది ఏంటో గొప్ప ఉపకారము. ఎందుకంటే రెండువందల కాదు ఎంత ఇచ్చినా మమ్మల్ని పాటించుకునేవారు లేరు. రాత్రిదాకా ఎక్కడ ఉండాలీ? అన్ని ఇబ్బందులే, బాధలే.

ఆవిధముగా అతను మానవధర్మం గా మాకు ఉపకారము చేసాడు. మేము రెండవ టాక్సీ ఎక్కి గౌహతి చేరాము. రెండవ టాక్సీ డ్రైవర్ ఫోన్ లో మాట్లాడి గౌహతి outskirts నుంచి మామ్మని షిల్లాంగ్ తీసికెళ్లే టాక్సీని ఆపి అందులో కి మార్చాడు. అల్లా ఎంతో ఇబ్బంది, కష్టం పడాల్సిన మేము ఎంతో హాయిగా షిల్లాంగ్ చేరాము. భగవంతుని అనుగ్రహము, దయ అంటాము కానీ భగవంతుడు మనుషుల ద్వారానే మనకు సాయము చేస్తాడు. భగవంతునితో పాటు ఆ మనుషులకు కూడా మనము కృతజ్ఞత చెప్పుకోవాలి

మేము మా స్నేహితుడు చెప్పిన హోటల్ కి  మధ్యాహ్నము 2 గంటలకు చేరి అందులో విశ్రమించాము. మరునాడు హోటల్ వాళ్ళ ద్వారా ఒక టాక్సీ కుదుర్చుకుని షిల్లాంగ్ చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరాము. ముందుగా షిల్లాంగ్ పీక్ పాయింట్ కి వెళ్ళాము. ఈ ప్రదేశము ఎంతో ఎత్తున ఉంది. విమాన బలాల ఆధ్వర్యం లో ఉంది. వారి అనుమతి తీసుకుని లోపలకి ప్రవేశించాలి.

ఈ పీక్ పాయింట్ నుంచి షిల్లాంగ్ ఊరు, నగరము దృశ్యము ఏంటో బాగుంది. అక్కడ కొంతసేపు గడిపి, చిన్న జలపాతము ఉన్న చోటికి వెళ్ళాము. అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంది. అదే దాని మీదుగా చిరపుంజి 50 కిమీ దూరంలో ఉంది. టాక్సీ డ్రైవర్ ఊరించాడు గాని, మాకు వరుస కార్/బస్ ప్రయాణాల వల్ల ఓపిక లేకపోవడం, అది వర్షాకాలం కాదు కాబట్టీ మేము ఉత్సాహము చూపించ లేదు. ఇంకా రెండు మూడు మ్యూజియం లు పెద్ద చర్చిలు చూసి ఒక సరస్సు చుట్టూ ఉన్న వనమునకు వెళ్ళాము. ఈ ప్రదేశము ఎంతో ఆకట్టుకుంది. రెండు గంటలు అక్కడే కూర్చుని హాయిగా గడిపాము. చల్లని గాలి మనసుని పరవశింపచేసింది. తరువాత షిల్లాంగ్ రేస్ గ్రౌండ్ మీదుగా హోటల్ చేరాము.

షిల్లాంగ్ ఎంతో అందమైన నగరము. ఊటీలా ఉంది. లోపల నగరము పాతవాసనలతో, చుట్టూ, అన్ని ప్రక్కల ప్రకృతి సౌందర్యం తో అలరారుతూ ఉంది. చాలా చల్లగా ఉంది. పగలే 13-18 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంది. చల్లగా ఉంది తప్ప చలిగా లేదు. షిల్లాంగ్ నగరము గారో కొండల మధ్య ఉంది. ప్రస్తుతము అది మేఘాలయ ముఖ్యపట్టణము. 1980 వరకు మేఘాలయ అస్సామ్ తో కలిసి ఉంది. అప్పుడు షిల్లాంగ్ అస్సాం రాజధాని.
మొత్తము మేఘాలయ, కాశి (తురా ప్రాంతము), గారో (షిల్లాంగ్ ప్రాంతము), జయంతియా కొండల మధ్య ఉంది. అంతా పర్వతమయము. గౌహతి షిల్లాంగ్ రోడ్ మాత్రము ఎక్కువ ఎత్తు పల్లాలు లేక సమ ప్రదేశముగానే ఎక్కువ భాగము ఉంది.

గౌహతి నుంచి షిల్లాంగ్ వెళుతుంటే 10 కిమీ ముందునుంచి ఒక పెద్ద సరస్సు రోడ్ పక్కాగా తగులుతుంది. దాని పేరు Umiam lake. ఆ సరస్సు గొప్ప ప్రకృతి దృశ్యం. కొన్ని వేల చదరపు కిమీ వైశాల్యం కలది. కొండల మధ్య కులుకుతూ ఏంటో అందముగా ఉంది. మేము 24-112017 ఉదయం గౌహతి రావడానికి టాక్సీ బుక్ చేసికొని, దారిలో ఈ సరసు అందాలు తిలకించి గౌహతి చేరాము. టాక్సీలో షిల్లాంగ్, గౌహతి మధ్య ప్రయాణము 2 గంటలు అంతే. అదే తూటాక్సి అతనిని అడిగి బుక్ చేసికొని బ్రహ్మపుత్ర నదిని చూడడానికి వెళ్ళాము.

గౌహతి దగ్గర బ్రహ్మపుత్ర ఎంతో విశాలముగా ఉంటుంది. మధ్యలో  ద్వీపములు ఉంటాయి. ఆ ద్వీపములలో దేవాలయములు ఉన్నాయి. మేము అక్కడకు వెళ్ళలేదు. మన గోదావరిలాగానే ఉంది బ్రహ్మపుత్ర నది. టిబెట్లో పుట్టి ఇంకో పేరు కలిగి మన దేశములో ప్రవేశించిన వెంటనే బ్రహ్మపుత్రగా పిలవబడే ఈ నది వస్సముకు వరదాయిని, దుఃఖదాయిని కూడా. బ్రహ్మపుత్ర నీళ్లు శిరసుపై చల్లుకొని, ఆ నదీమ తల్లికి నమస్కరించి ఒడ్డున ఉన్న కాళీ ఆలయం లో అమ్మవారిని దర్శించి గౌహతి స్టేషన్ చేరాము. 54 గంటలు పయనించి (దిబ్రుగఢ్ - కన్యాకుమారి ఎక్సప్రెస్ - భారతదేశములో పయనించే పొడవాటి రైలు ప్రయాణము దూరము కల రైలు) 12 గంటలు ఆలస్యముగా రాజమండ్రి చేరి, సర్కార్ ఎక్సప్రెస్ పట్టుకుని సాయంత్రం 6 గంటలకు భీమవరం చేరి ఇల్లు చేరి స్వస్థులమైనాము.

మా గౌహతి, తురా,షిల్లాంగ్ పర్యటనా ప్రయాణము ఆనందముగా ముగిసింది.



No comments:

Post a Comment