Wednesday, October 4, 2017

చదువరియైన శ్రమజీవి ప్రశ్నలు - జర్మన్ మూలము: బెర్టోల్ట్ బ్రెఖ్ త్

జర్మన్ మూలము: బెర్టోల్ట్ బ్రెఖ్ త్

తెనుగు సేత: డా. వారణాసి రామబ్రహ్మం

చదువరియైన శ్రమజీవి ప్రశ్నలు

ఏడంతస్తుల‌ ‌థేబెన్ భవనాన్ని ఎవరు నిర్మించారు?
పుస్తకాలలో చక్రవర్తుల పేర్లుంటాయి
ఆ చక్రవర్తులు రాళ్ళను ఎత్తి మోశారా?

ఎన్నోసార్లు బాబిలోనియా ధ్వంసం చేయబడింది
అన్ని సార్లు దానిని ఎవరు పునర్నిర్మించారు?

బంగారు కాంతితో మెరిసిపోయే లిమా నగరంలో
పనివారు ఎటువంటి ఇళ్ళలో నివసించే వారు?

చైనాలో గోడ కట్టడం పూర్తయిన సాయంకాలం
దానిని నిర్మించిన తాపీవాళ్ళు ఎటు వెళ్ళారు?

రోమ్ నగరం నిండా విజయ వలయాలు
వాటిని ఎవరు ఎత్తారు?
సీజర్ ఎవరిని జయించాడు?

యువ అలెగ్జాండర్ భారతదేశాన్ని గెలిచాడు (?)
తానొక్కడే గెలవగలిగాడా?

స్పెయిన్ ప్రభువు ఫిలిప్
తన నౌకలు మునిగి పోయినప్పుడు ఏడ్చాడు
ఇంకెవరూ ఏడవలేదా?

రెండవ ఫ్రెడరిక్
ఏడు సంవత్సరాల యుద్ధం నెగ్గాడు
అతను తప్ప ఇంకెవరు నెగ్గారు?

ప్రతి పేజీకి ఒక విజయం
విజయాల విందులు వండినదెవరు?

ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి గొప్ప వ్యక్తి, చక్రవర్తి
ఎవరు భరించారు ఇన్ని ఖర్చులూ?

ఎన్ని చరిత్రలో 
అన్ని ప్రశ్నలు
**********
బ్రెతోల్ట్ బ్రెఖ్ త్ జర్మన్ రచయిత, కవి, నాటకకర్త. ఆయన రాసిన నాటకాలు ఎన్నో ప్రసిద్ధి చెందాయి. ఎన్నోసార్లు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. ఆయన రెండవ ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకించాడు.
ఆయన ఈ కవితని 1937 ప్రాంతంలో రచించాడు.
శ్రీ శ్రీ 1955 ప్రాంతాల్లో రాసిన "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు......." కవితకు బ్రెఖ్ త్ యొక్క ఈ కవిత ప్రేరణ.
రెండవ ప్రపంచ యుద్ద సమయంలో వ్యతిరేకిస్తూ ఎన్నో కవితలు రాశాడు. ఎన్నో రచనలు చేశాడు.
"రాత్రిళ్ళు ఉన్నది నిదుర పోవడానికి
చనిపోయిన సైనికులు తల్లులు విలపించడానికి కాదు"
అని అప్పట్లో ఆయన రాశాడు. ఆయన రాసిన గెలీలియో నాటకం సుప్రసిద్ధమైనది.

No comments:

Post a Comment