Tuesday, July 21, 2015

చేతి చమురు భాగోతం

చేతి చమురు భాగోతం 

నేటి రోజులలో కవిగా పేరుతెచ్చుకోవడానికి కవితలు రాస్తే సరిపోదు. ఇంకా ఎన్నో చేయాలి. ముందుగా ఒక వాదాన్ని ఆశ్రయించాలి. కవనములను ఆ వాదానికి అనుగుణంగానే రాయాలి. వీలయితే  సంప్రదాయాన్ని వీలయినంత ఘాటుగా  విమర్శించాలి. మళ్ళీ నమ్మకస్తులైన పాఠకులను అమర్చుకోవాలి. 

కళాశాలలో, విశ్వవిద్యాలయములలో బోధించే ఆచార్యులు వారి వారి ఇష్టాయిష్టాలని  బట్టి కవితలకు మార్కులేస్తోంటారు. విమర్శకుల గురించి ఇంక చెప్పనక్కర లేదు. విమర్శకులు నమ్మిన సిద్ధాంతాన్ని పోషిస్తూ కవిత తయారైందా  లేదా అని వారు చూస్తారు. అప్పుడే ఆ కవితని ఆస్వాదించడానికి మొదలు పెడతారు. సిద్ధాంతపు పంజరపు చిలకలకె వారి  ఓటు. 

ఇదంతా అయ్యాక ఒక రకమైన గుర్తింపు వచ్చాక "కవికి" కవితా సంకలనము తేవాలనే కౌతుకము. దానికి సంబంధిచిన హడావుడి,శ్రమ, ఆయాసము అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇంత కష్ట పడి, ఖర్చుపెట్టి సంకలనము అచ్చువేసికున్నాక దాని ఆవిష్కరణ మరొక సంబరము. "పేరుప్రతిష్టలు" కల ఒకరిద్దరు ఘన కవుల, విమర్శకుల చేతితో ఆ ఆవిష్కరణ సభ జరపడం, దానికోసం మళ్ళీ ఖర్చు పెట్టడం. అందరూ పొగిడాక ఆ పుస్తకాన్ని అందరకూ ఉచితముగా పంచడము. ధన్యోస్మి అనుకోవడము. కవినయ్యానని ఆనందం. 

కవితలు రాయడం ఒక ఎత్తు, అచ్చు వేయడం, ఆవిష్కరణ సభ జరపడం, సభకు పెద్దలను, పాఠకులను పట్టుకురావడం, ఇదంతా ఒక ఎత్తు. 

ఈ రోజులలలో ఎందరమో ఈ "వ్యసనాన్ని"వదులుకోలేకపోతున్నాము. ఇంతటి ఖర్చు పెట్టి, చేతి చమురు భాగోతంలా కవులము అనిపించుకుంటున్నాము, అవుతున్నాము. 

ఇదంతా అవసరమా? ఏమో? 

అంతర్జాలము ఏలుతున్న ఈ రోజులలో ఇ-పుస్తకము తయారు చేసుకుంటే సరిపోదా? అవార్డులు ఇచ్చే వారు అచ్చు అయిన పుస్తకాలకే బహుమతులు ఇస్తారు. కవి అవార్డు కోసము ఇంత  ఖర్చు పెట్టాలా? ఇ-పుస్తకాన్ని అచ్చు పుస్తకం లాగా ఎందుకు పరిగణించకూడదు? 

ఖర్చు పెడితేనే కవి అవుతాడా? కవనము రాస్తే కవి  అవుతాడా? ఏమిటో మరి ఈ వింత!

No comments:

Post a Comment