Saturday, July 4, 2015

సనాతన ధర్మము - హిందూ మతము

సనాతన ధర్మము - హిందూ మతము

హిందూ మతం పేరు ఎత్తగానే, ఇది హిందూ మతము కాదు సవాతన ధర్మము అంటారు. తేడా ఏమిటి?
ధర్మము అనే పదానికి వహించునది, లక్షణము కలది అనే అర్థాలు ఉన్నాయి. ఇంకా అర్థాలు కూడా ఉన్నాయి. మతము అంటే ముఖ్యార్థము ఇష్టము అని.
నా దృష్టి ప్రకారము "సనాతన" పదము ఉపనిషత్ కాలానికి చెందుతుంది. ఉపనిషత్తులు జ్ఞాన సముచ్చయములు. ఆత్మ, బ్రహ్మము లను‌దర్శించాయి, వాటిని గురించి ప్రతిపాదించాయి. చర్చించాయి. మన కాలానికి 108 ఉపనిషత్తులు ఉన్నా పెద్దలు 12 ఉపనిషత్తులని ముఖ్య ఉపనిషత్తులుగా (Principal Upanishads) చూశారు, చూపారు.
సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు హిందూ మతము ఒక జీవన విధానము అన్నారు. సనాతన ధర్మమూ ఒక జీవన విధానము. ఉపనిత్ స్రష్టలందరూ గృహస్థులే. అప్పటికి మూడే ఆశ్రమములు. అవి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రవానప్రస్థము. మూడే వేదములు. ఋక్, సామ, యజుర్వేదములు.
సన్యాసము సనాతన ధర్మము, సంప్రదాయము కాదు. బౌద్ద, జైన సంప్రదాయములకు సంబంధించినది. తరువాత హిందూ మతములో ప్రవేశించినది. షడ్దర్శనములు తరువాతి పరిణామ ఫలములే. ఫలితములే. ఇవన్నీ తత్త్వాన్ని చర్చిస్తాయి. యోగము ఒక దర్శనము. ప్రస్తుతం యోగా అని శరీర వ్యాయామముగా మిక్కిలిగా ఆచరించబడుతోంది.
ధర్మము మానవ జీవిత విధానాన్ని, విధులను, బాధ్యతలను, గమనాన్ని చూపుతుంది. తద్వారా మానవ జీవితాన్ని నిర్దేశిస్తుంది, నియమిస్తుంది. స్నేహితునిలా, భార్య\భర్తలా కూడా ఉంటుంది. ఒకే మనిషికి ఎన్నో ధర్మములంటాయి. తల్లిగా, తండ్రిగా, భర్తగా\భార్యగా, గురువుగా\శిష్యునిగా, ప్రభువుగా, ప్రజ (ప్రజలు, సంతానముగా - కొడుకు, కూతురిగా) గా, బంధువులుగా, పై అధికారిగా, ఉద్యోగిగా, నౌకరుగా, ఇలా అన్ని బంధములకు, అన్ని వృత్తులకు, వివిధ మతానుయాయులగా, మానవుని అన్ని బాధ్యతలకు ఒక్కొక్క ధర్మము ఉంది. అవి పాటిస్తేనే సంఘ జీవితం సాఫీగా సాగుతుంది. లేకుంటే‌ అల్లకల్లోలాలే. గొడవలు, గందరగోళాలే. అశాంతియే. అందుకనే పెద్దలు అన్నారు "ధర్మో రక్షతి రక్షిత:" అని. ఎవరి ధర్మము వారు నిర్వహించకపోతే మనిషి సంఘ జీవితం సజావుగా సాగదు.
అందుకే ఉపనిషత్ స్రష్టలు "మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ" అని అన్నారు. గృహస్థులైన వారికి "అతిథిదేవో భవ" అనేదీ చేర్చారు. (ఇదివరకు హోటళ్ళు అవీ లేవని పాఠకులు గ్రహించాలి. సత్రములు, పూటకూళ్లమ్మలు తరువాతి చేరికలై ఉంటాయి.)
అహింస, జీవకారుణ్యము మానవుని విధులలో చేర్చబడ్డాయి. "సత్యం వద, ధర్మం చర" అనేదీ ఉపనిత్ ఉద్బోధమే. పరమత సహనము (శివకేశవుల, ఇతర దైవముల అభేదము) ఉపనిత్సందేశము లోని భాగమే. పురుషార్ధములైన ధర్మార్ధకామమోక్షములు ఉపనిత్ ప్రతిపాదనలే.
రామాయణ మహాభారతములు, ఇతర శ్రుతి, స్మృతి, శాస్త్ర, పురాణములు వీటిని, సనాతన ధర్మ ప్రాముఖ్యాన్ని, ఉపయోగాన్ని బహుళ ప్రచారము చేశాయి.
ఉపనిషత్తులు నిర్గుణ తత్త్వాన్ని చెప్పాయి. శంకరాచార్యులు దీనిని ప్రచారము చేశారు. రామానుజులు, మధ్వాచార్యులు సగుణ తత్త్వాన్ని ప్రచారము చేశారు. మహాభాగవతము, దేవీ భాగవతము, ఆళ్వారులు, నాయనమారులు, భారత దేశము లోని ఇతర ప్రాంతములకు చెందిన ఎందరో భక్తులు భక్తి మార్గానికి విశేష ప్రాముఖ్యము, ప్రాచుర్యము కలిగించారు.
మతము అంటే ఇష్టము కదా!
భక్తి, జ్ఞాన, కర్మ మార్గములు ముఖ్యముగా చెప్పారు. మనిషి ప్రవృత్తిని బట్టి ఒక్కొక్క మార్గము నచ్చుతుంది. ఏదీ మిగిలిన రెంటికన్న గొప్పదీ కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఇష్టము అంతే.
అలాగే దేవుళ్ళు, దేవతల, దైవముల విషయమూ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడు ఇష్టం. ఏ దేవుడూ మిగిలినవారికన్న గొప్ప కాదు.
కానీ నా మార్గము గొప్పది, మిగతావి తక్కువవి అనే కొట్లాటలు ఆది నుంచీ ఉన్నాయి. అలాగే దేవుళ్ళు. ఎవరు ఎవరికి చెప్పగలరు? చెప్పివా ఎవరు వింటారు?
మతము ఇష్టములు కలిసిన వారికి ఒకటి అవుతుంది. ధర్మము మాత్రము అందరు మనుషులకూ ఒకటే. కుల, మత, ప్రాంత, భాషా వంటి భేదములెన్నున్నా మనుషులు అనుసరించవలసిన ప్రవర్తనా నియమావళి ఒకటే. అదే ధర్మము. మతమా, ఎవరి ఇష్టము వారిది.
సనాతన ధర్మము అందరు మనుషులకూ. హిందూ మతము హిందువులకు. భారత దేశము ధర్మానికి, తత్త్వమునకు, మానవ ధర్మములకు, విధులకు, బాధ్యతలకు, తత్త్వసారమునకు పేరెన్నిక కన్నది. మతమునకు కాదు.
సనాతన ధర్మముని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. హిందువులూ ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు మానేశారు. దున్నేవాడిదే భూమిలాగ ఆచరించేవాడిదే సంస్కృతి. మా తాతలనాడు వేతులు తాగారు మా మూతులు వాసన చూడండంటే ఎలా.
ధర్మము, మతము వేరు. ధర్మము మతమునకు వేరు (root).

No comments:

Post a Comment