మళ్ళీ తెల్లవారింది. ఉషోదయం. నారాయణ అష్టాక్షరిని జపించుకోవడాని మరొక రోజు మొదలయ్యింది. భగవంతుని సేవ చేయడానికి, లీలలు చదవడానికి, వినడానికి, స్మరించడానికి, ప్రసాదం అందుకుంటూ ఉండడానికి మరల సమయం చిక్కింది.
చిన్నప్పుడు మా అమ్మగారు అంటూండేవారు: ఏంటో ఈ దేవుడు ఇల్లా తెల్లారడం, పొద్దుకూకడం పెట్టాడు, ఎందుకో, అని. అప్పుడు ఉత్సుకత కలిగేది. ఎందుకు ఇలా అని. స్కూల్ చదువులో తరగతులు పెరుగుతున్న కొద్దీ ఈ తెల్లారడం, పొద్దుకూకడాల మీద అవగాహన పెరిగింది. మా అమ్మగారనుకున్నట్టు ఇలా దేవుడు పెట్టలేదు;
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల రాత్రి, పగలు ఏర్పడుతున్నాయని తెలిసింది. ఎలా ఏర్పడినా, మనకు రాత్రి, పగలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సమయాన్ని మనం ఎలా గడపాలి, ఉపయోగించుకోవాలి అనేది మన తత్త్వం మీద, చదువు సంధ్యల మీద, పాండిత్యం మీద, జ్ఞాన, విజ్ఞాన సముపార్జన మీద ఆధారపడి ఉంటాయి.
మనం ధనికులమైతే ఒక లాగ, పేదవారిమైతే ఒక లాగ, ఉద్యోగులమైతే ఒక లాగ, విద్యాభ్యాసం చేస్తోంటే ఒక లాగ, వ్యాపారాలు చేస్తోంటే ఒక లాగ, వ్యవసాయదారులు మైతే ఒక లాగ, సంసారులమైతే ఒక లాగ, సన్యాసులు మైతే ఒక లాగ, రాజకీయ నాయకులమైతే ఒక లాగ, దుష్టులము, దుర్మార్గులమూ అయితే ఒక లాగ, ఇదివరకు స్త్రీ, పురుషులమైతే ఒక లాగ, గడుపుతాము.
రచయితలు, మేధావులు, కవులు, లలిత కళా ప్రవీణులు, ఒకలాగ, విజ్ఞాన శాస్త్ర వేత్తలు ఒక లాగ, జ్ఞానులు ఒక లాగ, సామాన్యులు ఒక లాగ, భక్తులు ఒక లాగ, నాస్తికులు ఒక లాగ సమయాన్ని గడుపుతారు.
ఒకే సమయాన్ని ( మనకు - భూమిపై కలిగే - రాత్రింబవళ్ళను) ఇలా వివిధ రకాలుగా గడుపుతాము. ఒకరికి ఒకరికి పోలిక ఉండదు.
మనిషి మనిషికీ స్వంత రాత్రింబవళ్ళు ఉంటాయి. ఎవరికి వారికి ప్రత్యేకము. ఈ రాత్రింబవళ్ళతో మనం ఏం చేస్తాము అనేది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇతరులు ఈ గడపడాన్ని బట్టి మనం ఫలానా అనే ముద్ర వేస్తారు. దీనిని అందరమూ చేయగలము.
ఇలా రాత్రింబవళ్ళు ఏర్పడడం భూమికి ప్రత్యేక మని, ఇతర గ్రహాలపై ఇలా రాత్రింబవళ్ళు ఏర్పడవని, అక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ లేదా ఎంతో తక్కువని, నీరు లేదని, గాలిలో ఆక్సిజన్ ఉండదని, అక్కడ జీవం, జీవులు లేవని,
జీవం పరిణమించడానికి అనువైన వాతావరణం భూమిపైన మాత్రమే ఉన్నదని; దాన్ని మనం ప్రమాదకరంగా ధ్వంసం చేసుకుంటున్నామని; ఇలా ఇంకా ఎన్నో తెలిసాయి.
మము బోంట్లము భగవన్నామస్మరణలో గడుపుతాము. పదవీ విరమణ చేసి, బాధ్యతలు నెరవేర్చాక సంఘంలోని జనానికి విఘాతం కలిగించకుండా మా పొల్లేదో మేము పోసుకోవడం
ముదావహమే కదా.
అటువంటి మాకు తెల్లవారడం, తెల్లవారేక బ్రతికే ఉండి మేము మెళకువలో భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండే సావకాశం ఉండడం సుకృతమే కదా!
***********
పిల్లితనం
పిచిక అంతరించి పోతోందని బాధ;
మనమూ అంతరించిపోతున్నాము
బాధపడమేమి?
జంతువులలో భాగమైన మనము
అటు జంతువులూ కాము, ఇటు
మనుషులమూ కాము;
జంతువులపై చూపు శ్రద్ధ మనపై మనము చూపుకోమేమి?
మన నాగరికత, సంస్కృతి కట్టు తప్పినవి
పట్టించుకోమేమి?
ప్రకృతి అన్ని జీవులకు అంతః స్ఫూర్తిని
ఇచ్చినది, మనకు వలె;
వాటి పాట్లు అవి పడతాయి; మన పాట్లు
మనమే పడాలి, జంతువులు పడవు మనకై
మన అంతఃస్ఫురణను తొక్కిపెట్టి,
మానవ ధర్మమును పక్కకు నెట్టి
కిరాతులమై, మృగములమై చరించు
ఈ వేళ, మనమే మనకు శిక్ష; మనమే
మనకు రక్ష; దీనిని నిర్లక్ష్యం చేసి మనం
బావుకొనునది ఏమిటి? పిల్లి కళ్ళు మూసుకుని
పాలు తాగుతూ, తన్నెవరూ చూట్టంలేదు
అనుకుంటుందిట; ఈ పిల్లి తినం ఎప్పటికి
పోతుంది మనకు; జ్ఞానోదయం ఎప్పటికి
అవుతుంది మనకు?
తమసోsమా జ్యోతిర్గమయ!
*******
Having the ability to spend time in solitude is the best boon to a human being.
*****
మానవత్వమే శ్రీరామరక్ష
మతములు మారినను సతమతములు తీరవు
కులముల వల్ల కొత్త కులుకు లొచ్చినను కలతలు మామూలే
మనిషికి మనిషికి జీవితమున చిరాకులు తప్పవు
కష్టసుఖాలు కలిమిలేములు కావడి కుండలు అందరికీ; ప్రతిభ వలన సమాజము అందగించును
వ్యుత్పన్నతల ఉత్పత్తి పెరిగి అభివృద్ధి కలుగును
స్వార్థమున చరించు మనము పరార్థమెరుగక
సంకుచితులమై ఎదిగినను మరొకడు కిందికి లాగు
మనము ఇతరుల క్షేమము మరచి కుసంపన్నులమై నను ఉత్సాహ సుఖశాంతులు కరువైన సంఘమున
మన ధనము, అధికారము, అక్రమార్జన, నేరచరిత్ర;
ఆదుకోలేవు అవసరమున; మానవత్వమే శ్రీరామరక్ష
No comments:
Post a Comment