Wednesday, October 4, 2017

పదార్థములు - జ్ఞాన బోధ మీమాంసా

పదార్థములు 1

పదార్ధము పదము ఒక్కొక్క శాస్త్రములో ఒక్కొక్క అర్థములో ఉపయోగించబడుతుంది.
నిజానికి వివిధ శాస్త్రములలో పరిజ్ఞానం కల మనుషులే తక్కువై పోతున్నారు ఈ రోజుల్లో.
చదువుకోవడం ఉద్యోగం సంపాదించుకోవడానికి మాత్రమే అని మనం రూఢిగా నమ్మి ఆచరిస్తున్న ఈ వేళ ఒకే వ్యక్తికి వివిధ శాస్త్రాలతో, తత్త్వాలతో, విషయాలతో పరిచయం ఉండాలని అనుకోవడం సాహసమే. వివిధ శాస్త్ర పరిజ్ఞానం కలవారు కావాలి అనడం చెవిటి వాని ముందు శంఖం పూరించినట్టే; గ్రుడ్డివానికి అద్దం చూపించినట్లు.
గూగుల్, వికిపీడియా విస్తృతంగా వాడే ఈ రోజుల్లో ఒక వ్యక్తి కొన్ని కావ్యాలను,శాస్త్రాలను, తత్త్వాలను, పఠించాలి, ఒక అవగాహనకు తను స్వంతంగా రావాలి అనేది చాదస్తపు ఆలోచన అని చాలా మందికి అనిపిస్తుంది.
మనిషికి, జంతువులకు తేడా ఈ మేధ; భాషా, శాస్త్ర, తత్త్వ జ్ఞానాలే అనడం ముసలి తనపు లక్షణాలలో ఒకటి అని ఎక్కువ మంది ఈ నాడు నిర్ణయించేస్తున్నారు. పండితుడై, జ్ఞానియై రసాస్వాదకుడై మనిషి సంపూర్ణ జీవితం గడపాలనడం మా తరం వాళ్ళ స్వప్నం.
మనిషి అలా మేధని మనసుని, బుద్ధిని ఉపయోగించి అధ్యయనం చేసి జ్ఞానులమై కొంగ్రొత్త విషయాలు ఆవిష్కరించడం మా తరం వారికి నాగరికత‌ సంస్కృతి, సంస్కారం, హాబీ. ఊపిరి. జీవనంలో జీవం.
లేని పోని, వెగటు కలిగించే, ప్రలాప, వాద, వితండ వాద, రాద్ధాంత సృష్టులతో కుసంస్కారంగా పబ్బం గడుపుకోవడం మాత్రమే ఎందరో "మేధావులకు", వారి అనుయాయులకు నేడు తెలిసిన విద్య.
జ్ఞాన సముపార్జనలో కాక అజ్ఞానానికి ప్రతీకలుగా జీవించడం ఒక సంస్కృతిగా, నాగరికతగా మారింది.
తిట్టిపొయ్యడాలు తెలిసినంతగా వివిధ భాషా, శాస్త్ర, తత్త్వాగాహన కలిగించుకోవడం ఎందరో ఆధునిక మేధావులకు ఎబ్బెట్టుగా ఉంది.
ఏ చెట్టూ లేనిచోట ఆముదపు చెట్టే మహా వృక్షమైనట్టు; నోటికొచ్చినట్టు లాగే, వాగే "ప్రసిద్ధులైన", ప్రచారం చేసుకోగల అనాగరికులైన ఆచార్యులు, సంఘంలో చోటునాక్రమించి, ప్రజ్ఞా పాటవములు కలిగి విజ్ఞులైన మేధావులకు చోటు లేకుండా చేస్తున్నారు. వారు మాత్రమే మేధావులుగా చెలామణీ అవుతున్నారు.
ఈ స్థితిలో పదార్థము వివిధ శాస్త్రాలలో ఎలా వాడబడింది అని చెప్పబూనడం, చర్చించబూనడం
వింతగా అనిపించొచ్చు.
కాని విజ్ఞులైన, మేధావులైన, రసాస్వాదకులైన, పాఠకులు, రచయితలు, కవులు, నిజం అర్థంలో మేధావులు, ఇంకా విరివిగా ఉన్న నేడు మము బోంట్లకు ఇలాంటివి రాయాలనే ఉత్సుకత జీవించే ఉంటుంది. మనసు, మేధ ఉత్సాహం నింపుకుని సతతమూ మనకి ఉపయోగపడి వివిధ శాస్త్రాలలో మనలను నిష్ణాతులు చేస్తాయి. మనిషిగా పుట్టినందుకు జీవితం సఫలమౌతుంది. బ్రతుకుకి ‌ఒక పరమార్థం, పరిపూర్ణత లభిస్తుంది.

పదార్థములు 2

భౌతిక శాస్త్రము
భౌతిక శాస్త్రం లో పదార్థము నిజం matter‌ అనే అర్థంలో ఉపయోగిస్తారు. Matter అంటే విషయము అనే అర్థమూ ఉంది. ఈ రెండూ నామవాచకములు. matter నిజం క్రియగాను ఉపయోగిస్తారు! It matters little అని. ఒకే పదాన్ని నామవాచకం గాను, క్రియగాను, ఇతర భాషా భాగములుగాను ఉపయోగించడం అన్ని భాషల్లోనూ ఉంది.
భౌతిక శాస్త్రం ప్రకారం పదార్థముల స్థితులు నాలుగు రకములు. అవి ఘన, ద్రవ, వాయు మరియు ions.
ఇవి ఒక పదార్థ స్థితి నుంచి మరొక పదార్థ స్థితి కి శక్తి సహాయంతో మారుతాయి. ఈ శక్తి రకరకములు.
యాంత్రిక, ఉష్ణ, కాంతి, విద్యుత్, అయస్కాంత, విద్యుదయస్కాంత, అణు, పరమాణు, కేంద్రక శక్తులు. అలాగే శక్తి రూపము పదార్థము ద్వారా, పదార్థము సహాయంతో మారుతుంది. ఇలా శక్తి, పదార్థములు పరస్పర సహాయంతో రూపము, స్థితి మార్చుకోవడమే భౌతిక శాస్త్ర సర్వస్వము.
కాలము, చోటు (ఆకాశము, అవకాశము), శక్తి, పదార్థముల కలయికతో, కలయికలో భౌతిక శాస్త్రం ఉద్భవిస్తుంది. వీటి కలయికతో జరిగే వివిధ చర్యలు, ప్రతి చర్యలు సమాహారమే భౌతిక, రసాయన, జీవ మరియు వివిధ ప్రకృతి శాస్త్రాల ఉనికికి కారణమౌతాయి.
చోటు లేక పదార్థము లేదు. శూన్యము అంటే పదార్థము యొక్క అభావము (లేకుండుట). పదార్థము, శక్తి పరిణామములు లేక కాలము లేదు. కాలమునకు స్వంతంగా ఉనికి లేదు. పదార్థ స్థితి మార్పు కాని శక్తి రూప పరిణామము కాని కాలమును సృష్టిస్తుంది. ఈ పరిణామాలు లేక కాలము ఉనికి ప్రసక్తి లేదు. కాలగమనము అని మనము భ్రమ పడేది పదార్థ గమనము (కదలిక), పదార్థ, శక్తుల పరస్పర సాహాయ్యక మార్పులు కాని, జీవి‌ పరిణమించడం కాని కాల గమనము, కాల ప్రవాహం, అని మనం అనుకుంటాం. శక్తి పరిణామమే కాలమని, పరిణామమే కాలమని తత్త్వజ్ఞుల ఉవాచ.
మనకు కాల స్పృహ మెళకువ, కల మానసిక దశలలో మాత్రమే ఉంటుంది. గాఢనిద్ర, మెళకువతో కూడిన నిద్ర (జాగ్రత్ సుషుప్తి) దశలలో కాల స్పృహ ఉండదు. జంతువులకు మనకున్నట్టుగా కాల స్పృహ, కాల గమనము లేవు. వాటి కాలం జ్ఞానము వేరు.
ముందు చెప్పినట్లుగా పదార్థాభావమే శూన్యము. అభావము, అంటే లేకుండుట (absence) ఎంతో గొప్ప ప్రతిపాదన. ఉండుట (presence) ఎంత ఉపయోగకరమైన దోపిడీ, లేకుండుట కూడా అంతే స్థాయిలో ఉపయోగకరమైనది. దానిని గురించి తరువాతి భాగంలో తెలుసుకుందాం.


పదార్థములు 3

అభావము : లేకుండుట
శూన్యములు - "లేకుండుట" లోని ఉపయోగములు
శూన్యము అనే సంస్కృత పదానికి ఒకే అర్థం - లేకుండుట. ఈ లేకుండుట వివిధ శాస్త్రాలలో, తత్త్వాలలో ఎంత ఉపయోగకరమో పరిశీలిద్దాం. విషయబోధకంగానూ, సరదాగానూ ఉంటుంది.
సున్న:
శూన్యము అంటే సున్న అని అర్థం. సున్నకు ఏ విలువ లేదు. అలా విలువ "లేకుండుట" సంఖ్యాశాస్త్రంలో సున్న వలన ఎంత ఉపయోగమో మనందరికీ తెలుసు.
రిక్త ప్రదేశము:
శూన్యమునకు మరియొక అర్థం రిక్త ప్రదేశము అని. రిక్త ప్రదేశము - పదార్థాభావము - ఉండడం వల్లే పదార్ధము వహించ బడుతోంది.
పదార్ధము యొక్క ఘన, ద్రవ, వాయు స్థితుల ఉనికి శూన్యం ఉండడం వల్ల వీలవుతోంది.
పదార్థాభావము శూన్యము.
అలాగే సాంకేతిక శాస్త్రంలో సెమి కండక్టర్ ఫిజిక్స్ లో ఎలక్ట్రానిక్స్ లో ఎలక్ట్రాను ఖాళీ చేసిన రిక్త ప్రదేశాన్ని "హోల్" అంటారు. ఈ అవగాహన సృజించడం వలన ఈ ఎలక్ట్రానిక్స్ లో ఎంతో ఎదుగుదల జరిగింది.
అలా ఎలక్ట్రాన్ "లేకుండుట" అనే ఆలోచన ట్రాన్సిష్టర్ ఎలక్ట్రానిక్స్ కి పాదు వేసింది.
మనసు లేని, జగత్ కనుపింపని, వాసనలు ప్రకోపింపని స్థితి:
తత్త్వశాస్త్రం లో శూన్యము అనే ఆలోచన, అనుభవము ఎంతో గంభీరమైనది. గహనమైనది. విలువైనది. ఉపయోగకరమైనది. శాంతానందములు కలిగించేది.
శూన్యం పదాన్ని ఎక్కువగా బౌద్ధం తో ముడిపెడుతూ ఉంటారు.
ద్వైత స్థితిలో త్రిపుటి - జ్ఞాత-జ్ఞానము-జ్ఞేయము ఏర్పడి దృష్టిలో ఉంటాయి. జ్ఞేయమేమీ దృష్టిలో లేక జ్ఞాత, జ్ఞానం మాత్రమే దృష్టిలో ఉంటే అప్పటి స్థితిని శూన్యస్థితి అంటారు. ఇక్కడ శూన్యమయ్యేది జగత్ - విషయ, విషయానుభవ సమాహారం. ఏ తలపులు, అనుభవములు కలుగవు. దృష్టి విషయరహితంగా ఉంటుంది. శూన్యత దానిదే. విషయ, విషయానుభవము లకు మాత్రమే.
ఈ స్థితిలో విషయాభావముంటుంది కాని గమనికా ఉంటుంది. అందుకే అది - దృష్టి - శూన్యము అని తెలుస్తుంది. అలా జగత్ శూన్యస్థితిలో గమనిక ఉండడం వల్ల, అది సహజ మానసిక స్థితి అవడం వల్ల శాంతము, ఆనందము అనుభవింపబడతాయి. మనసు ప్రసన్నంగా
ఉంటుంది.
బౌద్ధులు శూన్య స్థితి అన్నది వేదాంతులు పూర్ణ స్థితి అన్నారు. పూర్ణస్థితిలో మనసుకు ఉనికి శూన్యం. అలా మనసుండదు. మనసు "లేకుండుట" అలా వ్యక్తిత్వ రహిత స్థితిని అనుభవింపజేస్తంంది.
ఈ విధముగా, ఇన్ని విధములుగా శూన్యము మానవ జీవితంలో, శాస్త్రాధ్యయనం లో ఎంతో ఉపయోగకరంగా ఉండి ఎంతో మేలు చేస్తోంది.
ఏదైనా "ఉండడం" ఎంత ఉపయోగకరమో, "లేకుండటం" కూడా అంతే ఉపయోగం.
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు!

పదార్థములు 4

వైశేషిక దర్శనము

భారతీయ తత్త్వానులోకనము బుద్ధికి, మనసుకు మంచి వ్యాయామము. ఉపనిషత్తులు, బౌద్ధము, జైనము, షడ్ దర్శనములు, అద్వైతము, శాక్తాద్వైతం, ద్వైతము, తదపరి జ్ఞానులు, పెద్దలు భారతీయ తత్త్వశాస్త్రాన్ని సుసంపన్నం చేశారు.
పదార్థము వేరు వేరు దర్శనములలో వేరు వేరుగా నిర్వచించబడింది. భౌతిక శాస్త్ర పదార్థానికి ఈ పదార్థాలకు నిర్వచనంలో, ఇతరంగా అస్సలు సంబంధం లేదు. పదం ఒకటే, అంతే. అలాగే వైశేషిక దర్శనములో ఉపయోగించిన "అణు" శబ్దమునకు, భౌతిక శాస్త్రం లోని అణువు, పరమాణువులకు ఏమీ సంబంధం, సారూప్యత లేవు.

అన్ని భారతీయ తత్త్వదర్శనములు భౌతిక శాస్త్రం చెప్పే భౌతిక ప్రపంచం గురించి ఏమీ చెప్పలేదు. అన్ని తత్త్వ దర్శనములు జ్ఞాన బోధ మీమాంసా పరంగా మాట్లాడాయి. అవి ఉపయోగించిన పారిభాషిక పదాలకు, భౌతిక, ఇతర ప్రకృతి శాస్త్రాల పారిభాషిక పదాలకు సంబంధం లేదు. పదములు ఒక్కటే. అది మాత్రమే సారూప్యత. అర్థము, తాత్పర్యము వేరు.

పదముల పోలిక, సారూప్యతలని బట్టి ఆధునికులు, కొండొకచో పురాతనులు అపార్థం ఎక్కువగా చేసికొని తత్త్వదర్శనములు దేనిని గురించి మాట్లాడాయి, ఏమి చెబుతున్నాయి, దేనిని ప్రతిపాదిస్తున్నాయి అనే విషయంలో ఎంతో గందరగోళం సృష్టించారు. వాద, ప్రతి వాదములతో కలవరానికి కారణమయ్యారు.

లేని పోని మత్సరాలతో ప్రతి దర్శనాన్ని ఒక మతంగా మార్చారు. సమన్వయంతో దర్శనములలోని ప్రతిపాదనలను అనునయంగా సమీక్షించలేదు. ఉపనిషత్తులు, బౌద్ధ జైనములు, షడ్ దర్శనములు, ఇతర తత్త్వములు ఒకదానికి ఒకటి పోటీగా నిలిచి ఖండన ముండలు చేసినా, వాటికి తెలిసీ తెలియకుండా మన ఇప్పటి తరానికి జ్ఞాన బోధ మీమాంసా భాండాగారాన్ని అందించాయి.

ఏవిధమైన మత్సరములు, ద్వేష, విద్వేషాలు, కోపతాపాలు లేకుండా ఈ తత్త్వ దర్శనములను సమీక్షిస్తే మనకు జ్ఞానము కలుగు విధము, మానసిక కార్యకలాపాల నిర్వహణ మీద, భాషాధ్యయన, భాషణముల మీద ఎంతో అవగాహన ఏర్పడుతుంది.

All these spiritual and philosophical texts have illuminated the nature, form, structure, function of consciousness, mind and its functions; its control, its phases, states and cognitive scientific elements (జ్ఞాన బోధ మీమాంసా).

వైశేషిక దర్శనము పదార్థములు ఆరు అంది. అవి ద్రవ్య, గుణ, కర్మ, విశేష, సామాన్య, సమవాయములు. తరువాతి వైశేషికులు అభావమును కూడా కలిపారు.

న్యాయ, వైశేషికములు ఈ సప్త పదార్థములను, ప్రతిపాదించాయి. సాంఖ్య యోగములు, ప్రకృతిని పదార్థము అన్నాయి. పూర్వ, ఉత్తర మీమాంస లు

బ్రహ్మమును పదార్థము అన్నాయి. అదే శక్తి రూపంలో చిత్ శక్తి.

ఉపనిషత్తులు, అన్ని దర్శనములు, మనసు, మానసిక కార్యకలాపాల గురించి మాట్లాడాయి. ఈ పదార్థ ప్రతిపాదన, మనసు దేనిచే (ఎలా ) నిర్మింపబడింది, ఎలా పనిచేస్తుంది అనేది చర్చించారు. ఈ దర్శనములు మనకి కనిపించే బయటి భౌతిక ప్రపంచం గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ బయటి భౌతిక ప్రపంచం యొక్క మానసిక ముద్రల గురించి మాట్లాడాయి. వీటికి శబ్ద బ్రహ్మ సిద్ధాంతం కలిసి భాషా వ్యాకరణ శాస్త్రాలను సృష్టించింది. ఇవన్నీ కలిపి మనం ఎంతో అవగాహన చేసుకోవచ్చు. మనసు, మానసిక కార్యకలాపాల గురించి ఎంతో చెప్పొచ్చు.

ఈ "వివిధ" పదార్థముల గురించి తరువాతి భాగంలో వివరంగా తెలుసుకుందాం.

పదార్థములు 5

శ్లో:
నామ రూప వినిర్ముక్తం యస్మిన్ సంస్థితే జగత్ తమ్ ఆహుః
కేచిన్ ప్రకృతీమ్ కేచిన్ మాయామ్ అన్యే పరేత్వచ అణూన్

తాత్పర్యము:

నామ, రూపములు లేని జగత్ దేనియందు ఇమిడి ఉంటుందో, దానిని కొందరు ప్రకృతీ అంటారు; కొందరు మాయా అంటారు; మరికొందరు అణువులు అంటారు.

భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఈ శ్లోకము సమన్వయ పరుస్తుంది. జ్ఞాన బోధ మీమాంసా పరంగా భారతీయ తత్త్వశాస్త్రాన్ని సమన్వయ పరచవచ్చు. ఈ ప్రయత్నంలో మిడి మిడి జ్ఞానవంతుల్ని, తత్త్వ శాస్త్రాలను కించిత్ కూడా చదవకుండా శంకరుల, రామానుజులు, మధ్వాచార్యుల, ఇతర ఆచార్యుల, తత్త్వ వేత్తల వెనుక దాగి, ఇతర అవగాహనలను అవగాహన చేసికోకుండానే విమర్శించే ఆచార్యులని, ప్రవచనకర్తలని, సామాన్యులని, జ్ఞానులని ఈ నూతన భాషలో పురాతన తత్త్వాన్ని దర్శించే మముబోంట్ల ప్రకటనము, దర్శనము సంతృప్తి పరచలేవు. అది వేరే విషయం.

భారతీయ తత్త్వానులోకనము భౌతిక పదార్థముల, బయటి భౌతిక ప్రపంచాల గురించి చెప్పలేదని, ఇప్పటి భౌతిక శాస్త్రానికి మన దర్శనములలో ఉపయోగించిన పారిభాషిక పదాలకు ఒక్క పదములు గానే సారూప్యత అని, అర్థము, పరమార్థము, ఉపయోగించిన తీరు, సందర్భాలు‌, వేరు అనీ; ఉపనిషత్తులు, బౌద్ధ జైనములు, షడ్ దర్శనములు, ఆ తర్వాతి జ్ఞానులు, వ్యాఖ్యాతలు మాట్లాడినది జ్ఞాన బోధ మీమాంస గురించి అనీ అనుకున్నాము.

వైశేషిక దర్శనములో పదార్థములు ఆరు, ఆ తర్వాత ఈ ఆరు పదార్థములకు తరువాతి వైశేషికులు అభావమును కలిపారని కూడా అనుకున్నాం. ఆ తర్వాతి వైశేషికులు పదార్థములు పది అన్నారు.

న్యాయ దార్శనికులు పదార్థములు పదహారు అన్నారు. సాంఖ్య, యోగ దర్శనములు‌ ప్రకృతీ ని పదార్థము అన్నారు.

బ్రహ్మజ్ఞానము ఒక్కటే పదార్థము అంది. అది బ్రహ్మ పదార్థము.

నామ, రూప, వాసనా రహిత వస్తువు పదార్థము అని ఆత్మజ్ఞానము అంది.

భాషా, వ్యాకరణ శాస్త్రములు:

పతంజలి భాషా, వ్యాకరణ శాస్త్ర వివరములను తెలిపే తన శబ్ద బ్రహ్మ సిద్ధాంతమును బ్రహ్మజ్ఞానం ప్రాతిపదికగా రూపొందించాడు. భర్తృహరి తన వాక్యపదీయము గ్రంథంలో చాలా విపులంగా శబ్దబ్రహ్మ సిద్ధాంతం గురించి చర్చించాడు. వ్యాకరణ శాస్త్రం ప్రకారం పదార్థములు నాలుగు.

స్ఫోట ప్రణవ రూపం. ప్రణవము,

స్ఫోట, మాయా, చిదాభాస, ప్రకృతి సమానములు, జగన్నిర్మాణ పదార్థము/శక్తి.

ఉపనిషత్తులు, బౌద్ధ జైనములు, షడ్ దర్శనములు జ్ఞాన బోధ మీమాంసా పరంగా వ్యాఖ్యానించినపుడు ఇవన్నీ కలిపి  మన ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగ పడతాయో ఆయా వ్యాసములలో చూద్దాం. ప్రస్తుతానికి పదార్థము, అణువు, పృథ్వి, అప్, తేజస్, వాయువు, ఆకాశ పదములకు జ్ఞాన బోధ మీమాంసా పరంగా వేరు అర్థాలు ఉన్నాయి అని తెలిస్తే చాలు.

సమస్త సన్మంగలాని భవంతు!

Wednesday, September 27, 2017

మన బాధ్యతలు, విధులు; పారిజాతపు పువ్వులు ఏరడం; మనం - లబ్ధ ప్రతిష్టులు; Public speaking;

మన బాధ్యతలు, విధులు

రిలీజైన సినిమాలు చూసి వాటిని విజయవంతం చేయడానికే మనం జీవిస్తున్నాము.

ఎన్నికల్లో పోటీ చేసే నాయకులను ఎన్నుకొని వారికి పదవులు కట్టబెట్టడానికే బతుకుతున్నాం మనం.
షాపుల్లో, ఆన్ లైన్లో అమ్మే రకరకాల వస్తువులు కొనడానికే మన బ్రతుకులు.

అవినీతి పరులైన ఉద్యోగులకు లంచాలిచ్చి మన పని చేయించుకోవడానికే మనం ఉన్నాం.
ప్రైవేటు స్కూళ్ళలో, కాలేజీల్లో, విశ్వ విద్యాలయాలలో, ఇతర విద్యాలయాలలో మన పిల్లలను చేర్చి భారీగా ఆ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించేందుకే మన జీవితాలు.

దొంగలు, దుర్మార్గులు, దోపిడీ దారులు, ఉగ్ర వాదులు, మూర్ఖ, హంతక మతానుయాయులు వారి దౌర్జన్యం, దౌష్ట్యాలు, భరించడానికే మన జీవితాలు.

మేధావులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ఇతర కవులు, సాహితీ కారులు, లలితకళాస్రష్టలు వారి, వారి పైత్యాలకనుగుణంగా నోటికొచ్చినట్టు వాగినా, మన మనసులు కష్టపెట్టే సృష్టులు చేసినా పల్లెత్తు మాట అనకుండా మౌనంగా రోదించడానికే మనం పుట్టినది.

అందరూ వారి ఉనికికి, వృద్ధి, అభివృద్ధులకు, పేరు, ప్రతిష్టలుకు మన మీదే ఆధారపడి ఉన్నారు.
ఎలా నిర్వహిస్తామో మన బాధ్యతలు విధులు!!!!!?

*************

పారిజాతపు పువ్వులు ఏరడం

ప్రకృతి మనకు ఎన్నో చెట్లని, ఫల, పుష్పాలను ఇచ్చింది. అవన్నీ మనకు ఉపయోగపడేవే. ఆనందం కలిగించేవే.

రిటైర్ అయ్యాక నేను మా దొడ్లో మిగతా కొన్ని మొక్కలతో పాటు పారిజాతపు మొక్క కూడా వేశాను. అది ఏడాదిన్నరకే పూయడం మొదలు పెట్టింది. ఇప్పుడు పెద్ద మొక్క అయింది. ఎన్నో పూవులు పూస్తోంది.

ఫలం, పత్రం, పుష్పం, తోయములతో దేనితోనైనా తనను మనస్ఫూర్తిగా పూజిస్తే చాలునని తనను అర్చించడానికి ఆడంబరాలు అక్కర్లేదు అనీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చాడు. మనసు ముఖ్యం కాని, దేనితో పూజించారని తాను అస్సలు చూడనని భగవానుని సందేశం. భగవానుడే స్వయముగా చెప్పినా మనం ఖాతరు చేయం. భగవంతుని అర్చించడంలో మన ఆస్తి, అంతస్థు, డబ్బు, దస్కం ప్రతిబింబించి తీరాలని మన దర్పం. చిత్తం చెప్పుల మీద ధోరణిలో పూజలు, పునస్కారములు నిర్వర్తిస్తాము. మన గొప్ప, సంఘంలో మన స్థాయి మన భగవదారాధనలో‌ కనిపించి తీరాలని మన తత్త్వము.

ఇంతకీ పూవులతో అర్చిస్తే సరిపోయే స్వామిని అంగ రంగ వైభవంగా అర్చిస్తాము. మన పోజంతా అక్కడే కొడతాము. మన అమాయకత్వానికి, ఈ అజ్ఞానానికి, భగవంతుడు నవ్వుకోడా? నిజానికి మనం భగవంతుని ఉనికిని నమ్మడం లేదు. ఆయన లేడన్నట్టు అన్ని అక్రమాలు చేస్తూ మళ్ళీ ఆయనకే మన అహం భావంతో అతిగా, అట్టహాసంగా పూజలు, అర్చనలు చేసి ఆయన్ని "కొనాలనుకుంటాం".

ఇంతకీ పారిజాత సుమములకు కృష్ణ పరమాత్మకు ఎంతో అనుబంధం ఉంది. సత్యభామా దేవి‌ అలక మాన్పడానికి అమరావతినే ముట్టడించారడు పురుషోత్తముడు. పారిజాత వృక్షాన్ని సత్యభామా దేవి ఉద్యానవనంలో నాటాడు. తన ప్రియ సఖి అలక మాన్పించి ఆమెకు ఆనందం కలిగించి మరింత ప్రీతి పాత్రుడైన పతిగా నిలిచాడు.

ఆంజనేయమతిపాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూల వాసినమ్
భావయామి పవమాన నందనమ్

పారిజాతానికి హనుమంతులవారికీ అనుబంధం. ప్రొద్దున్నే లేచేసరికి పారిజాత వృక్షం క్రింద పారిజాతం పూవులు నింగి నుంచి నేలకు రాలిన తారకలలా పరుచుకుని ఉంటాయి. తెల్లని పూవులు ఎర్రని తొడిమ. ఎంతో అందంగా ఉంటాయి. పారిజాత పూవులని ఏరడం మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఏరితేనే కాని పారిజాత పూవులని సేకరించ లేము.

ఆ పూలను ఏరడం వలన నాకు సరిపడ్డ వ్యాయామం లభిస్తోంది. పారిజాతం పూవులని ఒంగుని, కూర్చుని, మోకాళ్ళ మీద కూర్చుని ఏరాలి. ఏరేసరికి ఒక విధమైన సంతృప్తి. వ్యాయామం. పారిజాత సుమదళాలతో కృష్ణ పరమాత్మని అర్చిస్తే పుణ్యము, పురుషార్ధము.
*******
It is only an ideal relationship to dream that no secrets and lies exist in the relationship! In reality secrets and lies may be there even in most intimate relationship.
*********
మనం - లబ్ధ ప్రతిష్టులు

మనందరం ఎంత గొప్ప వాళ్ళమైనా‌, రాజకీయ నాయకులను, సినీతారలను, ఎవరైనా లబ్ధ ప్రతిష్టులని కలిసినప్పుడు సిగ్గుతో మొగ్గై పోతాము. ఉబ్బి తబ్బిబ్బై పోతాము. మన వ్యక్తిత్వాన్ని ఆ క్షణాల్లో మరచిపోతాము.

చాలా వినయంతో, ముడుచుకుపోయి, ఆనందంతో తలక్రిందులౌతూ పరవశిస్తాం. భగవంతుడు ప్రత్యక్షమైనా అంత అభిమానం చూపించమేమో అన్నట్టు ప్రవర్తిస్తాము. మన అయిన వాళ్ళకీ, కాని వాళ్ళకీ వారితో దిగిన ఫోటోలను చూపిస్తూ, పంచుకుంటూ ధన్యులమైనట్టు ఉంటాం. ఇంకా వీలైతే
పోజు కొడతాం.

మన వ్యక్తిత్వాన్ని ఆ ఘటనతో అనుసంధానించుకొని మురిసిపోతాం. మన వంటి మీద బట్ట ఉందో లేదో కూడా చూసుకోం. దీనికంతకీ కారణం ఆ లబ్ధ ప్రతిష్టులపై మనకు కల అభిమానం. వారిని కలుసుకోవడం వల్ల మనలో ఏర్పడిన దర్పం.

అభిమానాలు మనకి ఉండొచ్చు కానీ మన ఆభిజాత్యాన్ని త్యాగం చేయనవసరం లేదు.

*********
Public speaking

Public speaking is an art. In any field the speakers with oratory and speaking skills are necessary to convey the message. Many of the skilled speakers club humor with knowledge and also cite many stanzas from many ancient texts extempore and are admired and appreciated for their memory, spontaneous recollection, scholarship, voracious reading and many other intellectual and emotion-creating skills.

Many public speakers in professional, literary, scientific, spiritual etc., matters are necessary for the spread of useful knowledge and wisdom.

Of course skilled public speakers also can charm and influence people in negative ways too. The individuals going to their speeches must exercise caution and commonsense.


Monday, September 25, 2017

మా అమృత సరోవర యాత్ర


మా అమృత సరోవర యాత్ర 1

చాలా మంది మానస సరోవర యాత్ర చేస్తారు. అలా వెళ్ళిన వాళ్ళు కొందరు దానిని​ గురించి రాస్తారు. మేము మానససరోవరం వెళ్ళలేదు. అమృతసరోవరమే వెళ్ళాము. అందుకే మాది అమృత సరోవర యాత్ర అయింది. చాలా మంది ఈ యాత్రా పర్యటనగా చేసి ఉంటారు.

WAVES అని ఢిల్లీలో ఒక సంస్థ ఉంది. వీరి శాఖ అమెరికాలోనూ ఉంది. వీరు ప్రాచీన భారతీయ విజ్ఞాన భాండాగారంని శోధించే వారి పరిశోధనా పత్రాలు, విశేషాలు పంచుకోవడానికి సమావేశాలు ఏడాదికి కాని, రెండేళ్లకోసారి కాని నిర్వహిస్తారు. నేను ఇప్పటికి వారి మూడు సమావేశాల్లో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించాను. 15-12-2016 నుంచి 18-12-2016 వరకు ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్ వారి కేంద్రంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. 


యోగదర్శనము, పతంజలి శబ్దబ్రహ్మ సిద్ధాంతం, స్ఫోట వాదము, సంస్కృత భాషా, వ్యాకరణ నిర్మాణాంశములు-
బ్రహ్మ జ్ఞాన మూలముల పై వారి ఆయా సమావేశాల్లో ఇంతవరకు నా పరిశోధనా పత్రాలు సమర్పించాను.
ఇప్పుడు జ్ఞాన బోధ మీమాంసా పరంగా ఉపనిషత్తులు, అద్వైత, ద్వైత సిద్ధాంతములు, ఆస్తిక, నాస్తిక దర్శనములలో కల మనకు జ్ఞానము, భాషాధ్యయన, ఉచ్చారణలు జరిగే, కలిగే విధములపై నా పరిశోధనా పత్రం తయారు చేశాను.

నా పరిశోధనా పత్రం సమర్పించడానికి ఎన్నికైనందువల్ల ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు భీమవరం నుంచి నేను, మా ఆవిడ డిసెంబర్ 13 న కేరళ ఎక్స్ప్రెస్లో - విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరాము. ఢిల్లీలో ఆప్తులైన బంధువులు ఉన్నారు. ఇలా వస్తున్నామంటే వాళ్ళింట్లోనే దిగమన్నారు. వాళ్ళింటికే వెళ్ళాము.
*********
మా అమృత సరోవర యాత్ర 2
17-12-2016
ఆగ్రా కోట సందర్శనం
16-12-2016 తారీఖున నా పేపర్ ప్రెజెంటేషన్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంక కాన్ఫరెన్స్ లో మా పని అయిపోయింది.
మరునాడు బయలుదేరి తాజ్మహల్ చూడడానికి ఆగ్రా బయలు దేరాము; ఒక టూరిస్ట్ బస్ లో.
పొద్దున్న బయలు దేరి 10, 11 గంటల మధ్యలో ఆగ్రా చేరాము. ముందుగా ఆగ్రా ఫోర్ట్ కి వెళ్ళాము.
దానిని అక్బర్ కట్టాడు. జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు ఇక్కడ నుంచే మొగలాయి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. చాలా ప్రణాలికతో, అందంగా, ఆనాటి రాచరికానికి తగ్గి హుందా, జాగ్రత్తలు కలిపి నిర్మించిన కోట. ఆగ్రా కోట లో జహంగీర్ పెళ్ళాం నూర్జహాన్ పూలతోటలు పెంచితే, షాజహాన్ భార్య ద్రాక్ష తోటలను పెంచిందిట. షాజహాన్ మధుప్రియుడుట. అందుకని. మొగలాయి చక్రవర్తుల రాజసభ వంటిది, బేగం ల జనానాలు చూశాము.
ఎక్కడైతే శివాజీ ఔరంగజేబుని కలిశాడో ఆ ప్రదేశం చూశాఎక్కడ ఔరంగజేబు షాజహాన్ ని బంధించి ఉంచాడో ఆ బందిఖానా, దానినుంచి తాజ్ మహల్ కనిపిస్తుంది. తాజ్ చూడడానికి షాజహాన్ కోసం చేసిన ఒక కన్నం కూడా ఉంది.
రాజులు, రణాలు,‌ కుట్రలు, కుతంత్రాలు చరిత్ర లో భాగాలు. ఔరంగజేబు సోదరులను చంపి, తండ్రిని ఖైదు చేసి సింహాసనం ఎక్కాడు. అక్బరు, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు వలె ఆలయాలును ధ్వంసం చేశారు. కానీ ఔరంగజేబు కు ఉన్నంత చెడ్డపేరు వారికి రాలేదు. జహంగీర్ సేనానులు కోణార్క్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
తాజ్ మహల్
తాజ్ మహల్ కి ఉన్నంత క్రేజ్ భారతీయులకు మరెందులోనూ లేదు. ఎందుకో ప్రణయానికి తాజ్ మహల్ ను ప్రతీకగా భావిస్తారు. అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళు వచ్చాక ఎన్నో విషయాలు, వివరాలు తెలిసి, విషయం పై కాని, మనిషిపై కాని మనకు అంతవరకు ఉన్న మంచి, చెడు అభిప్రాయాలు నిలవడం లేదు. తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ బేగం ల గురించిన విషయాలు, వివరాలు కూడా అంతే. ఇదివరకటి మజాని, భావుకతని ఉత్సుకతని పాడుచేశాయి. అందుకే మనకు అన్ని విషయాల గురించి అన్ని వివరాలు తెలియనవసరం లేదు. తెలిస్తే మన సంతోషం కాస్తా ఆవిరియైపోతుంది.
షాజహాన్ 13 వ భార్య ముంతాజ్ అనీ, ముంతాజ్ భర్తీని చంపి ముంతాజ్ నుంచి వివాహమాడాడనీ, ఆమె సంతానాన్ని కంటూ అనారోగ్యం కారణంగా పోయిందదని రకరకాల విశేషాలుతో ముఖపుస్తకపు గోడలు రాతలతో నిండిపోయాయి. నాలో తాజ్ మహల్ పై ఉన్న , aura కొద్దిగా తగ్గింది. అయినా తాజ్ మహల్ చూసే వస్తాము కదా?
*********
మా అమృత సరోవర యాత్ర 3
17-12-2016
తాజ్ మహల్ సందర్శనం
మేము ఆగ్రా ఫోర్ట్ చూసి దాని చారిత్రక నేపథ్యం తలుచుకొని, ఆగ్రా లోని ఒక పంజాబీ రెస్టారెంట్లో మంచి భోజనం చేశాము. అక్కడి నుంచి తాజ్ మహల్ కి బయలుదేరాము. యమునా నదికి ఆ ఒడ్డు, ఈ ఒడ్డున ఉన్నాయి, ఆగ్రా కోట, తాజ్ మహల్.
తాజ్ మహల్ భారతీయులు మస్తిష్కంలో వేసిన ప్రణయ ముద్రను ఏ "నిజాలు" తండిచివేయలేవు.
తాజ్ మహల్ చేరేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఒక కిలోమీటరు ముందు వెహికల్స్ ఆపేస్తారు. రిక్షాలలో వెళతారు. గవర్నమెంట్ వారి వాహనము ఉంది. అది ట్రిప్పులు వేస్తూంటుంది.
తాజ్ మహల్ ఉన్న ప్రదేశానికి వెళ్ళే ముందు ఒక అందమైన కట్టడం ఉంది. దాని గుండా లోపలికి వెళితే ఎదురుగా 400 మీటర్ల దూరంలో తాజ్ మహల్ కనిపిస్తూంటుంది. ఫొటోల్లో చూసే అంది చందాల కన్నా ఇంకా బాగుంటుంది.
తాజ్ మహల్ నిర్మాణానికి సందర్శించి, వెనుక ఉన్న యమునా నది సౌందర్యాలు చూసాము. తాజ్ మహల్ అంత క్రితం అక్బరు కట్టించిన ఒక కట్టడానికి, మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన సమయంలో కట్టిన మరొక కట్టడం కూడా తాజ్ మహల్ నిర్మాణానికి స్ఫూర్తి. తాజ్ మహల్ చుట్టూ ప్రదేశాలు, యమునా నదిని తప్పక దర్శించాలి. యమునా నదిలో పున్నమి రోజున యమునా విహారానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిమిత సంఖ్యలో టిక్కెట్లు అమ్ముతారు.
తాజ్ మహల్ సందర్శించిన అనుభవం ఎవరికి వారే పొందాలి. లోపల ఉన్నవి సమాధులు అయినా ఒక చక్కని కట్టడాన్ని చూచిన అనుభవం కలుగుతుంది. రాజులు సొమ్ము రాళ్ళపాలే అయినా, ఇందులోని సోషియాలజీని పక్కకు పెట్టిన రమ్యతని ఆస్వాదించాలి.
ప్రపంచంలో రకరకాల సిద్ధాంతాలుంటాయి. ఎన్నో రకాల దృష్టులుంటాయి. మరెన్నో రకాల అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. మనకి నచ్చినది సంతోషించి, నచ్చని దానిని వదిలేస్తే మనకి హాయిగా ఉంటుంది. ప్రశాంతతను అనుభవిస్తూ జీవించవచ్చు. సిద్ధాంత రాద్ధాంతములలో తగంలుకుంటే ఏ ఆనందమూ లేదు. జీవితమూ వాదనలతో నిస్సారంగా గడిచిపోతుంది. తాజ్ మహల్ వెనుక యమునా నది ఒంపులు, సొంపులు ఆహ్లాదపరుస్తాయి. యమునా లో నీరు నల్లని. నల్లని వాని అనుంగు సఖి.
మధుర, బృందావనం ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాయి. వాటి గురించి తరువాతి భాగంలో.
*********
మా అమృత సరోవర యాత్ర 4
అమృతసర్ సందర్శనం
మా ‌అమృత సరోవర యాత్ర అమృతసర్ చూడడానికి. ఢిల్లీ కాన్ఫరెన్స్ కి వెళుతున్నాము అనుకున్నప్పుడే అమృతసర్ వెళ్ళాలి. అనుకున్నాం.
నాకు ఒక‌ 5, 6 ఏళ్ళ నుంచి అమృతసర్ చూడాలని గాఢంగా అనిపిస్తో‌ ఉంది. ఈ ఢిల్లీ పర్యటనలో తాజ్ మహల్ (మొదటి సారి), అమృతసర్ కలిపాము. తాజ్ మహల్ చూడాలని ఎన్నో ఏళ్లనుంచి‌ అనుకుంటున్నాను. అది ఇప్పుడు ‌వీలుపడింది. ఇది వరకు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు ఢిల్లీ కొంత చూశాము.
తాజ్ మహల్ చూస్తున్నపుడు శ్రీ శ్రీ గారి "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు" కవితా పంక్తులు కవితా ప్రియులైన తెలుగు వారందరికీ తప్పక గుర్తుకు వస్తాయి. కాని‌ ఆ భావం శ్రీ శ్రీ గారిదని ఎక్కువ మంది పొరబడతారు.
ఆ భావాల సొంత దారుడు బ్రెతోల్ట్ బ్రెఖ్ త్. ఈయన ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత, కవి, సాహితీ కారుడు. శ్రీ శ్రీ బ్రెఖ్ త్ భావములను సొంతం చేసికున్నారు.
బ్రెఖ్ త్ రాసిన ఒక జర్మన్ కవిత శ్రీ శ్రీ గారి ఆ ప్రసిద్ధ కవితా పంక్తులకు ఆధారం.‌ఆ కవిత‌ని ఇక్కడ ‌ఉటంకిస్తాను.‌
దాని శీర్షిక "చదువరి యైన పాఠకుని ప్రశ్నలు"
తాజ్ మహల్ చూసిన తర్వాత మధుర, బృందావనం లకు బయలుదేరాము. అప్పటికి సాయంత్రం 6 దాటింది. మధుర చేరేసరికి రాత్రి 8 అయింది. మా బస్ ఢిల్లీ ‌అర్థరాత్రి దాటాక చేరుతుందన్నారు. అప్పుడు మా అమృతసర్ రైలు మిస్ అవుతుంది. అందుకని మేము మధురలో ఆగిపోయి, మధుర మీదుగా ఢిల్లీ, అమృతసర్ వెళ్ళే మా రైలుని మధుర లోనే ఎక్కేద్దామని నిర్ణయించుకున్నాము. మేము మధుర చేరేసరికి మా రైలు మధుర రావడానికి 1-30 గంటలు మాత్రమే ఉంది.
మధుర స్టేషన్ చేరేసరికి మా రైలు 3 గంటల లేట్ గా‌ నడుస్తోందని తెలిసింది. గతి లేక మధుర స్టేషన్ లో వేచి ఉన్నాము. మా రైలు లేట్ పెరిగింది. ఈ రైలు లేటవడం ఈ ప్రయాణంలో మాకు ప్రతి సారి జరిగింది. మొదటగా ఎక్కిన కేరళ ఎక్స్ప్రెస్ 6 గంటలు లేట్ గా హజ్రత్ నిజాముద్దీన్ చేరింది. ఈ‌ రైలు ఇల్లాగే అయింది. మా‌ రైలు‌ వచ్చే వరకు మధురలో వెయిట్ చెయ్యలేక (ప్లాట్ ఫారం‌మీద; రిటైరింగ్ రూమ్‌లు ఇంకో ప్లాట్ ఫాం ‌మీద ఉన్నాయి. లగేజీ ఉంది) ముందు వచ్చిన‌ రైలు మీద న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ చేరాము. అప్పటికి రాత్రి 12 దాటింది.
మా రైలు తెల్లారకట్ట ‌4-30 కు వచ్చేవరకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాల్ లో గడిపాము. తెల్లవారుజామున 4-30 కు మా అమృతసర్ రైలు ఎక్కాము. పొద్దున్న 11 గంటలకు వెళ్ళవలసింది మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళింది.
అంతే క్రితమే మా అబ్బాయి రిజర్వ్ చేసిన ‌హోటల్ రూమ్ కి వెళ్ళి రిఫ్రెష్, రిలాక్స్ అయ్యాము.
అమృతసర్ ఊరు పాత, కొత్తలో కలయిక. పాత భవనములు, కొత్త బిల్డింగ్స్ సహవాసం చేస్తున్న ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. ఊరు పొతే వాసనలు, కొత్త‌ పరిమళాలతోటి అలరారుతోంది. ఉదాహరణకి మా హోటల్ బిల్డింగ్ చాలా కొత్తది,‌ ఫెసిలిటీస్‌ బాగున్నాయి కూడా, కాని ఒక సందులో పాత బజారు మధ్యలో ఉంది.
అమృతసర్ విశేషాలు తరువాయి భాగంలో.

మా అమృత సరోవర యాత్ర 5

18, 19, డిసెంబర్ 2016

సువర్ణ దేవాలయ సందర్శనము

నాకు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అమృతసర్ చూడాలని గాఢంగా ఉంది.
ఢిల్లీ ఎలాగ కాన్ఫరెన్స్ కి వెళుతున్నాము కదా దీనితో కలుపుదాం అని అనుకున్నాను. అలాగే ఆగ్రా సందర్శనం అయ్యాక మధురలో టూరిస్ట్ బస్ దిగిపోయి, ఢిల్లీ రైలు ఎక్కాము. మాకు రిజర్వేషన్ ఉన్న రైలు మధుర మీదుగానే వస్తుంది. కానీ బాగా లేట్ గా నడుస్తోంది. మాకు రిజర్వేషన్ ఢిల్లీ నుంచి ఉంది. అందుకని ఇంకో ముందు రైలులో ఢిల్లీ చేరాము. అక్కడ లేట్ గా వచ్చిన మా రైలు ఎక్కి 7 గంటలు లేటుగా మధ్యాహ్నం 3 గంటలకు అమృతసర్ చేరాము.

ముందుగానే మా అబ్బాయి రిజర్వ్ చేసిన ‌హోటల్ రూమ్ కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి సాయంకాలం 7 గంటలకి సువర్ణ దేవాలయ సందర్శనానికి వెళ్ళాము.

అమృతసర్ శిఖ్ఖులకు గొప్ప తీర్థయాత్రా స్థలం. నాకు చిన్నప్పటి నుంచి చరిత్ర అంటే ఇష్టం. మనదేశంలో గొప్ప శౌర్యవంతమైన, నిజాయితీ కల, కష్టపడే మనస్తత్వం కలిగిన జాతి శిఖ్ లు. మన సైన్యంలో, ఇతర రక్షణ బలాలలో శిఖ్ లు ఎక్కువ.

మొగలాయి చక్రవర్తులను ఎదిరించిన సాహస ‌జాతి శిఖ్ జాతి. నాకు ఆ జాతి పై ఎంతో గౌరవం, మన్నన.
అమృతసర్ ఊరు పాత, కొత్తల కలయిక. రైల్వే స్టేషన్ ప్రాంతం, మా హోటల్ ఉన్న ప్రాంతం పాత ఊరు.
కాన్పూర్, వారణాసిలలా‌ ఉంది.

ఆటో ఎక్కి సువర్ణ దేవాలయానికి వెళ్ళాం. చీకటి పడి పోయింది. దేవాలయం లోనికి పురుషులు ఒక రుమాలు తలకి చుట్టుకొని, స్త్రీలు తలపై కొంగు కప్పుకొని ప్రవేశించాలి. దేవాలయం సరస్సులో వెలుగులతో నిండిపోయి, వెలుగులు చిందిస్తూ ఎంతో బాగుంది.

దేవాలయ ప్రదిక్షణ చేస్తూ, చుట్టూ ఉన్న కట్టడాలు చూస్తూ దేవాలయం క్యూ లోకి ప్రవేశించాము. లోనికి వెళ్లడానికి అరగంట పట్టింది. దేవాలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. మూడు అంతస్తుల లోనూ శిఖ్ లు మతం గ్రంథం గ్రంథసాహెబా ఉంటుంది. చుట్టూ మతం గురువులు కూర్చుని ఉంటారు. మంచి గాయకులుపాడంతూ, జంత్ర తంత్రీ వాద్య గాళ్ళు సంగీతం అందిస్తూ ఉంటారు. వారి గానం ఎంతో శ్రావ్యంగా, భక్తి శ్రద్ధలతో నిండి ఉంది.

మొదటి గ్రంథసాహెబా చాలా పెద్దదిగా ఉంది. ఎంతో మంది భక్తులు డబ్బులు గ్రంథసాహెబా వద్ద వేస్తున్నారు. వరండాలో ఎంతోమంది కూర్చుని గానంలో గొంతు కలుపుతున్నారు. వాతావరణం అంతా ఆధ్యాత్మిక అమృతవాహిని లా ఉంది.

వేదాంతంలో జాగ్రత్ సుషుప్తి దేశ ఉన్నట్టే శిఖ్ ల తత్త్వంలో అమృత వేళ అని మానసిక దశ ఉంది. నిర్మల మానసిక స్థితి అది. గురునానక్ ఇప్పటి లాహోర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శిఖ్ మతాన్ని స్థాపించాడు. ప్రస్తుత పాకిస్థాన్ లో ఎన్నో చారిత్రాత్మక గురుద్వారాలున్నొయి.

రంజిత్ సింగ్ సువర్ణ దేవాలయాన్ని కట్టించాడు. పదిమంది శిఖ్ గురువులు వీరులు, ధీరులుగా
మొగలాయిలతో పోరాడి శిఖ్ మత సంరక్షణని, ప్రాచుర్యాన్ని, అభివృద్ధిని తమ భుజస్కంధాలపై వేసుకుని శిఖ్ మత ఉద్ధరణలు చేశారు. 

మొదటి, రెండవ అంతస్తులలోనూ గ్రంథసాహెబా ఉంటుంది. దాన్ని పఠిస్తూ కొందరున్నారు.
అన్ని అంతస్తుల లోనూ గ్రంథసాహెబా‌ దర్శనం చేసుకుని లంగర్ లో భోజనం చేసి రాత్రికి హోటల్ కి చేరి విశ్రమించాము.

మరునాటి ఉదయం మళ్ళీ సువర్ణ దేవాలయానికి వెళ్ళాం. గ్రంథసాహెబా దర్శనం చేసికున్నాము. తరువాత జలియన్వాలాబాగ్ సందర్శించాము. అప్పటి విషాద సంఘటన గురించి తలుచుకొని
ఎంతో వ్యథ చెందాము.

మధ్యాహ్నం వాఘా బోర్డర్ చూడడానికి టాక్సీలో బయలు దేరాము. మధ్యలో ఒక జాబితాలో భోజనం చేశాము. మా ‌పెద్దకోడలు ఒక పంజాబీ వంటకం రుచిచూశాము. అది ఆవకూరతో చేసే పరోటా లాంటిది. రుచిగానే ఉంది.
సాయంకాలం 4 గంటలకు వాఘా బోర్డర్ చేరాము. స్టేడియంలాంటి స్ట్రక్చర్ లో ఆసీనులమయ్యాము.
చాలా మంది జనం వచ్చారు. అటు పాకిస్థాన్ వైపు ముందు జనం ఎక్కువగా లేరు, కాని నెమ్మదిగా చేరారు. అప్పుడే ఢిల్లీ-లాహోర్ బస్ బోర్డర్ దాటింది. 

5 గంటలకు రిట్రీట్ మొదలైంది. చాలా హుందాగా, హుషారుగా, ఆకర్షణీయంగా జరిగింది. ఒక విధమైన దర్పం, ఆనందం కలిగాయి. గర్వంగా అనిపించింది.

మేము రెండవ సారి సువర్ణ దేవాలయ సందర్శనం లో ఉండగా మా రెండవ అబ్బాయి భావి మామగారు అమ్మాయినిస్తామని ఫోన్ చేశారు. శుభసూచకంగా ఉంది అనుకున్నాం.

రాత్రికి హోటల్ కి చేరి విశ్రమించాము. మరునాడు ఉదయం 11 గంటలకు మా రైలు. 10-30 కే స్టేషన్ చేరాము. మా రైలు ఒక్క 11గంటలు మాత్రం లేట్ అయ్యింది రాత్రి పదిగంటల ప్రాంతంలో బయలు దేరింది. తరువాత ఢిల్లీ చేరుకొని, రాత్రి 10 గంటలకు విజయవాడ కి మా రైలు ఎక్కాము. దారిలో చర్చించు కొని విజయవాడ బదులు హైదరాబాద్ చేరి మా రెండవ అబ్బాయి భావి పత్నిని చూశాం. అదే సమయంలో మా పెద్దకోడలు ప్రెగ్నెంట్ అని తెలిసింది. అప్పుడు మేము చూసిన అమ్మాయే మా రెండవ కోడలు అయింది. అలాగే మాకు ఆగస్టు రెండున మనుమరాలు పుట్టింది. 2017వ సంవత్సరంలో మా కుటుంబం లోనికి ఇద్దరు ముఖ్య సభ్యులు వచ్చి చేరారు.
కథ కంచికి మనం ఇంటికి..

స్త్రీ పురుష సమానత్వం; మతం; మనవాడు మృగచర్మ ధారి పంచముఖుడుస్త్రీలు-ప్రేమాస్పదత;

స్త్రీ పురుష సమానత్వం

నేను ఈ మధ్య సరదా మాటలు వింటున్నాను; సుమారు 30 ఏళ్ళుగా.
అందరూ ఆడవారు, మగవారు సమానం అనడం. అంతవరకూ బాగానే ఉంది. కాని తరువాతి మాటే కొద్దిగా తిరకాసు వ్యవహారం.
అదేమంటే, ఆడవారు మగవారి కన్నా అధికారులుగా ఎక్కువ ఉపయోగం గా ఉంటారు అని. కారణం ఏమిటిట అంటే మాతృమూర్తులుగా‌ వారికి, ప్రేమ, ఓపిక ఎక్కువ ఉంటాయట. స్త్రీ సహజమైన లాలిత్యంతో మృదువుగా వ్యవహరిస్తారట.
మరి ఆడవారు, మగవారు సమానం కాదా? కాదనే అంటారు వీరు. ఆడవారు ఉద్యోగినులుగా మగవారి కన్నా కొద్ది ఎక్కువ సూటబుల్ ట.
అలాగే అమ్మాయిలు అబ్బాయిల కన్నా బాధ్యతలు బాగా తీసికుంటారట. అలా అబ్బాయిలు అమ్మాయిలతో పోలిస్తే తక్కువ ఎఫిషియంట్ ట.
మరి స్త్రీ, పురుష సమానత్వం మాటేమిటి?
*********
మతం

మతం గ్రుడ్డి నమ్మకాలను కలిగించి‌, ప్రోత్సహించేది కాకూడదు. మతం పేరుతో‌ ఎంతో మంది, తోటి మనుషులపై స్వారీ చేయడానికి ప్రయత్నిస్తూంటారు.
మతం పేరుతో, భగవంతుని మాట చెప్పి, తమ పబ్బం గడుపుకునే మనుషులు ఎక్కువై పోయారు. మతం మనశ్శాంతిని ఇవ్వాలి. మంచి పనులవైపు మనసును తిప్పాలి.
భగవంతుని పేరు చెప్పి తమకు సేవ చేయించుకునే స్వాములు, ఆధ్యాత్మిక గురువులు తామరతంపరగా
తయారయ్యారు. మతం ముసుగులో ఏం చేసినా చెల్లుతోంది.
మతం మనసుని బలహీనం చేయకూడదు. దృఢం చేయాలి. మతం అంటే ఇష్టం అనే అర్థమూ ఉంది.
మతం మన సృష్టో, భగవత్ సంకల్పమో తెలియదు.
ప్రాంతాన్ని బట్టి ఒకే మతంలో ఆచారవ్యవహారాలు మారతాయి. కాని జ్ఞానం మారదు. తత్త్వం మనిషికి స్వేచ్ఛనిస్తుంది. మనుషులను బానిసలుగా చేయడానికి మతం ఉద్దేశింపబడలేదు.
ఎందరో సామాన్యులు తమ అరకొర జ్ఞానంతో ఇతరులను నిర్దేశించడానికి, నియమించడానికి ఉవ్విళ్లూరుతూంటారు. వీరు చాల ప్రమాదకారులు.
మత నియమాలతో తికమక పడుతుంటారు. ఇతరులను తికమక పెడుతూంటారు. ఈ మిడిమిడి జ్ఞానులు తప్పుడు నిర్వచనాలతో, వ్యాఖ్యానాలతో మతం స్వరూపమే మార్చేస్తున్నారు. వీరి చేతిలో మతం తన ఉనికినే కోల్పోతోంది.
***********
మనవాడు మృగచర్మ ధారి పంచముఖుడు

గళమునందు గరళము, కన్నులు
బేసి; శరీరమునందే ఒక ఆలి; నెత్తిపై
మరొక ఆమె; తామసులు రాక్షసులు
భక్తులందుదురు; ఆలయములందు
నీరు, పత్రి‌, పుష్పం, బూడిద మాత్రం
నివాసము స్మశానము; అయినను
భోళా శంకరుడు భక్త సులభుడు
జ్ఞాన ప్రదాత, సకల లోక ప్రజ్ఞానము;
శివుడు ఇన్ని సంకటములలో తానున్నను
ఆనందమయుడు శాంతి నిండినవాడు
మౌన స్వరూపుడు త్యాగరాజు విరాగి;
తానే దేవుడయ్యు రామ నామము .సతతము
స్మరించుచు మనకు ఆధ్యాత్మికత బోధించువాడు
మేధా దక్షిణామూర్తి చంద్రమౌళి గజచర్మధారుడు
తాపసి నటరాజు ఢమరుక వాదనం నుంచి మనకు
అక్షరమాలనందించిన అక్షరుడు‌ మనకు అండ
పంచాక్షరీ స్వరూపుడు పంచముఖుడు మనవాడు
***********
విశ్వం యొక్క నిర్మాత, హృదయం పరమాత్మ.
********
స్త్రీలు-ప్రేమాస్పదత

ప్రపంచానికి ప్రేమ గురించి తెలియజేసినది, ప్రేమను నిర్మలంగా అందించినది, అందిచగలిగినది స్త్రీ.
అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా, కోడలిగా, మనుమరాలిగా, చెలిగా, ప్రణయినిగా తనవారిని అలరించ గలిగిన, అలరించే భగవదంశ స్త్రీ. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
స్త్రీ రకరకాల పాత్రల్లో అందించగల, అందిస్తున్న ఈ ప్రేమాభిమానాల వల్లే సంఘం ఇంకా ఆహ్లాద మయంగా ఉంది. లేకపోతే ఒక పిచ్చాసుపత్రిగా ఉండేది. కాని నవీన నాగరికతలో ఇల్లాలికి చోటు లేకుండా పోతోంది. మనుషులు ప్రేమాస్పదులుగా ఉండడానికి, మన జీవితాలలో ఆనందం వెల్లివిరియడానికి స్త్రీలు అందించే ఆప్యాయత అనురాగాలు ఎంతో దోహదం చేస్తున్నాయి.
నాగరికత లేక, అడవుల్లో జంతువుల్లా జీవించే మనకి నాగరికత, సంస్కృతి, ప్రేమాభిమానాలు నేర్పింది, పంచింది, పెంచింది స్త్రీలే.
కాని ఆధునిక జీవనశైలులలో, నాగరికతా పోకడలలో వాతావరణం మారిపోయింది. అనురాగం పంచడం, తిరిగి ఆశించి పొందడం స్త్రీ ప్రకృతి. పసికందులకు తల్లి పాలలా, స్త్రీకి ప్రేమ అందించడం, అందుకోవడం బలం, రోగ నిరోధకం, సహజ లక్షణం. కాని కుహనా మేధావుల ప్రోద్బలంతో తను ఇల్లాలిగా ఇంటో ఉంటూ ఎంతో కోల్పోతున్నాననే భావన, భ్రాంతి ఆడువారిని అతలాకుతలం చేసింది వారి ప్రేమాస్పదతను వారే ఒక బాదరబందీగా తలుస్తున్న రోజులివి.
అనురాగాన్ని పంచక, పెంచక, అందుకోలేక
స్త్రీలు మానసిక రుగ్మతలకు, వైకల్యాలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించడం ఎవరికీ మంచిది కాదు.
********
Fewer the words and more the involvement of heart is success of the prayer.



Tuesday, September 19, 2017

మా ఖాట్మండూ యాత్ర 12; వృత్తి - నివృత్తి; ఫేస్ బుక్ నిండా మేధావులే

మా ఖాట్మండూ యాత్ర 12
24-8-2017
గుహ్యేశ్వరీ దేవ్యాలయ దర్శనం, చంద్రగిరి రోప్ వే
ప్రతి శివాలయంలోనూ అమ్మవారి ఆలయం ఉంటుంది కదా! పశుపతినాథ్ దేవాలయం ప్రాంగణంలో అమ్మవారి ఆలయం కోసం వెతికాను. కనిపించలేదు. ఇద్దరు, ముగ్గుర్ని అడిగాను. ఒకతను ఇక్కడ లేదు, వెనక్కాల ఉంది అన్నాడు. వివరం తెలియలేదు. శృంగేరి మఠం రిప్రజెంటేటివ్ స్వామి వారి దర్శన సందర్భంగా ఆయన్ని అడిగాను. ఆయన ఉందే, గుహ్యేశ్వరీ దేవి ఆలయం, పశుపతినాథ్ ఆలయం వెనుక బాగమతి నది దాటి వెళ్తే ఉంది. తప్పక దర్శించి వెళ్ళండి అన్నారు.
పశుపతినాథ్ ఆలయం వెనుక బాగమతి నది పై చిన్ని వంతెన దాటి 200 మెట్లు ఎక్కి 100 మెట్లు దిగితే అమ్మవారి ఆలయం వచ్చింది. దారిలో చిన్న, చితక ఆలయాలెన్నో ఉన్నాయి. పూజాదికాలకు ఏమీ నోచుకుంటున్నట్టు లేదు. అలా ఉన్నాయి అంతే. అమ్మవారు గుహ్యేశ్వరీ దేవి ఆలయం నేపాల్ గుళ్ళ నమూనాలో ఉంది. బాగమతి నది అమ్మవారి ఆలయం ఎదురుగా ఉంటుంది. అదే తిరిగి పశుపతినాథ్ ఆలయం వెనుక వైపునకు వస్తుంది. బాగమతి నది ఖాట్మండు నగరంలో ఎన్నో మెలికలు తిరిగి ప్రవహిస్తుంది.
గుహ్యేశ్వరీ దేవి ఆలయం చక్కగా ఉంది. అమ్మవారి విగ్రహం ఉండదు. కింద ఊటలా ఉంటుంది. ఆ ప్రదేశంలో పైన ఒక ఆకారంగా అమర్చి ఉంచారు.
లోపల ఇద్దరు పూజారులు ఉన్నారు. ఒకతను చైనా అతనులా ఉన్నాడు. భక్తిగా, శ్రద్ధతో ఆలయం నిర్వహిస్తున్నారు.
అమ్మవారి దర్శనం అయ్యాక మా హోటల్ కి వచ్చి భోజనం చేసి చంద్రగిరి టాక్సీ చేసుకు బయలు దేరాము. వెళ్లి రావడానికి 2500 రూపాయలు బాడుగ. దూరం ఖాట్మండు కి 20 కి.మీ. మేము వెళ్ళే దారే ఇండియా బోర్డుకు వెళుతుంది. బోర్డరు చాలా దూరం. కాని ట్రాఫిక్ విపరీతంగా ఉంది. వర్షం కురిసింది. దారి, రోడ్డు బాగులేదు.
20 కి.మీ. కి 2-30 గంటలు పట్టింది. సాయంత్రం 4-45 కి చంద్రగిరి పర్వతములు చేరాము. అక్కడ రోప్ వే ఉంది. రోప్ వే లో 15 నిమిషాలు ప్రయాణం. టాక్సీ డ్రైవర్ తొందరపెట్టి ముందు టిక్కట్లున్నయో లేదో కనుక్కోండి అన్నాడు. ఉన్నాయి. అవేళ్టికి మావే ఆఖరి టిక్కెట్లు. ఆ టిక్కెట్లు దొరకడం ఎంతో అదృష్టం. లేకపోతే ఇంత ప్రయాణం, హైరానా, ప్రయాస, శ్రమ, డబ్బూ వృథా అయ్యేవి. భగవంతుని కి కృతజ్ఞతలు చెప్పుకున్నాము.
చంద్రగిరి పర్వతములను అధిరోహింప జేసే రోప్ వే ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కుతూంటే, దిగుతూంటే సుందర ప్రకృతి దృశ్యాల సౌందర్యం, చూచి తీరాలి. పైన ఒక శివాలయం ఉంది. పూజారిగారు గుడి మూసేస్తూ మమ్మల్ని చూసి ఆగారు. ఒక స్ఫురద్రూపి అయిన కుఱ్ఱాడు అతను. శృంగేరి మఠం వారి ఆధ్వర్యంలో ఉన్నది ఈ ఆలయం కూడా. కొండపైన ఎంతో బాగుంది. మళ్ళీ రోప్ వే స్టేషన్ కి వచ్చి ఆఖరు ప్రయాణీకులు గా దిగాము. రోప్ వే ప్రయాణం ఒక అందమైన అనుభవం.
ట్రాఫిక్ జామ్ వల్ల వెనక్కి హోటల్ కి వెళ్ళడానికి 3-30 గంటలు పట్టింది. మరునాడు ఎయిర్ ఇండియా విమానంలో ఖాట్మండు-ఢిల్లీ, ఢిల్లీ-హైదరాబాద్ రిజర్వేషన్ ఉంది.
24 ఉదయం 8-30 కి ఖాట్మండు త్రిభువన్ తో విమానాశ్రయానికి చేరాము. త్రిభువన్, మహేంద్ర, జ్ఞానేంద్ర నేపాల్ రాజులు. జ్ఞానేంద్ర తన కుటుంబం అంతనీ కాల్చి చంపేశాడు. తన ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేయడానికి అంగీకరింలేదని. నేపాల్ లో ఇప్పుడు రాచరికం లేదు. ప్రజాస్వామ్యం ఉంది.
మా ఖాట్మండూ - ఢిల్లీ విమానం అరగంట ఆలస్యంగా 11-15 కి బయలుదేరింది. ఢిల్లీ చేరేసరికి మా హైదరాబాద్ కనెక్షన్ విమానం వెళ్ళిపోయింది. మాకు ఎయిర్ లైన్స్ వారు భోజనం ఏర్పాటు చేశారు. సాయంకాలం 6 గంటలు చికాగో-హైదరాబాద్ ఫ్లైట్ లో సీట్లు ఎరేంజ్ చేశారు. అది బోయింగ్ 737 విమానం. బాగా‌ పెద్దది గా ఉంది. రాత్ర 8-30కి రాజీవ్ గాంధీ విమానాశ్రయం లో దిగాము. మా రెండో అబ్బాయి వచ్చి పికప్ చేసుకున్నాడు.
మరునాడు మా రెండో అబ్బాయి, వాడి భార్య క్రొత్త కోడలు లచే వినాయక వ్రతం చేయించి అక్షింతల వేసుకున్నాము. మా పెద్దబ్బాయి కూతురు-మా మనుమరాలిని చూసి వారితో గడిపి ఆగస్టు 29 ప్రొద్దున్న నర్సాపురం ఎక్స్ప్రెస్ లో భీమవరం చేరాము. ఆగష్టు 14 న మొదలైన మా ఖాట్మండూ యాత్ర ముగిసింది.

*****************
వృత్తి - నివృత్తి

యోగః చిత్త వృత్తి నిరోధః
అనే యోగ సూత్రం మనకు పరిచయమే.
చిత్త వృత్తి అంటే ఏమిటి? వృత్తి అంటే ఏమిటి?
వృత్తి నామ అంతఃకరణ పరిణామః
వృత్తి అంటే అంతఃకరణములు పరిణమించుట. మార్పునొందుట.
మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంతఃకరణములు. లోపలి పనిముట్లు.
మన మానసిక కార్యకలాపాలు ఈ నాలుగింటి పరిణామములే.
మనసు బాహ్య భౌతిక ప్రపంచాన్ని విషయముల రూపంలో జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించి, వాటిని ఆంతర ప్రపంచంగా మస్తిష్కంలో భద్రపరుస్తుంది. మరల ఆ విషయ సమూహ సమాహారాన్ని జగత్ గా దృష్టిలోకి తెస్తుంది. తలపులు కలిగే విధము ఇది.

బుద్ధి తర్కాన్నీ, విచక్షణని, నిశ్చయాన్ని, వివేకాన్ని కలిగిస్తుంది.

చిత్తము విషయములు గ్రహించి బడుతున్నపుడు అదే సమయంలో అవి కలిగించే అనుభవములను, విషయానుభవములను గ్రహించి జ్ఞప్తి, జ్ఞాపకములు గా భద్రపరుస్తుంది. ఈ జ్ఞప్తి, జ్ఞాపకములనే వాసనలు అంటారు. వీటినే స్మృతి అనీ అంటారు. వాసనలను కలిగించి మరల వాటిని ప్రేరేపించడమూ చిత్రమే చేస్తుంది. ఆ ప్రేరేపింపబడిన వాసనే భావములు, లేక తలపులు, లేక ఆలోచనలుగా మారుతాయి. చిత్తము స్మరణమూ చేస్తుంది.

వ్యక్తికి, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయ సమాహారమే, సమాచార సమూహమే అహంకారం. దర్పము అనే అర్థం నానుడి లో వచ్చింది. అహంకార మమకారములు వ్యక్తిత్వ స్పృహ పై ఆధారపడి ఉంటాయి.

ఇలా ఈ నాలుగు అంతఃకరణములు విషయములను కాని విషయానుభవములను కాని గ్రహించడమే అంతఃకరణ పరిణామం. దీనినే వృత్తి అంటారు. ఈ నాలుగింటికి ముడి శక్తి ఒకటే. దానిని మాయ అంటారు.

ఈ అంతఃకరణ పరిణామములను నిరోధించు కోవడాన్నే యోగం అంటారు. అంటే మానసిక కార్యకలాపాలను ఉపసంహరించుకునే ప్రయత్నమే యోగం.

అంతఃకరణములు పరిణమించకుండా ఉన్న సహజ, ముందటి స్థితిని నివృత్తి అంటారు. నివృత్తి అంటే లేకుండా చేసికోవడం. చిత్తవృత్తిని లేకుండా చూసుకోవడం. అంతఃకరణములు పరిణమించకుండా చూసుకోవడం. అంతఃకరణములు పరిణమించకుండా ఎలా చూసుకోవాలి అనే విషయం యోగదర్శనం చెబుతుంది.

నివృత్తి స్థితినే మోక్ష స్థితి అని కూడా అంటారు.

వృత్తి, నివృత్తుల మధ్య మనసు, ఇతర అంతఃకరణములు మసలడమే మానసిక కార్యకలాపాలు జరగడం, ఆగడం, నియమింప బడడం. ఇది సరిగా జరిగేటట్టు చూసుకోవడమే యోగాభ్యాసము. యోగ శిక్షణ.

సమస్త సన్మంగలాని భవంతు!
***********
ఫేస్ బుక్ నిండా మేధావులే

ఫేస్ బుక్ నిండా మేధావులే
కవులే, సమాజ సేవకులే;
అంతర్జాలం పుణ్యమా అని
ప్రతి రచయితకూ లైకుల పండగే
పత్రికలలో మాత్రమే ప్రచురించబడే
రోజుల్లో జనానాలో ఉన్న కవులు
కవయిత్రులందరూ రచయితల
జనాభా లోకి వచ్చేసారు; భారత
దేశపు జనాభా వలె అతియైనది?!
కాదు, సాహితీ సృష్టికి వాతావరణం
అనుకూలంగా ఉంది; దమ్మిడీ ఖర్చు లేని
ప్రచురణా స్వాతంత్ర్యం; రసికులైన
పాఠకుల నుంచి రయ్ రయ్ మని
స్పందనలు, ప్రతిస్పందనలు, ప్రశంసలు
నేటి అంతర్జాల సాహితీ కారుల
అదృష్టమే అదృష్టము; రచనల
ప్రయోజనమేమి? ఆ ఒక్కటి
అడగొద్దు; మంది ఎక్కువై మజ్జిగ
పల్చనైంది; లేదా వాదముల రణగొణ ధ్వనుల
ముందు శ్రావ్య గీతాలు వినిపించుటలేదు??
**********
నా హృదయము నీవే; నా హృదయ స్పందనలు ప్రణవ నాదములే;
నీ దరిని చేరటకునై భవసాగరమీది అద్దరిని చేరిన సంసార సంద్రపు
ఈతగాడను; నీ మౌన సంద్రమున కలిసిన నిశ్శబ్ద వ్యక్తిత్వ సంగమమును;
నారాయణా! నేనన్నది పిసరంతైన, నాదన్నది ఇసుమంతైన లేని, అద్వైతిని

Monday, September 18, 2017

మన సుఖ శాంతులు; నాగరికత; మేధావులు - రాజకీయ నాయకులు - గారాబాలు;What fate is worse than this?

మన సుఖ శాంతులు 

మనం సుఖంగా మనశ్శాంతిగా ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళకి కాస్త మర్యాద, గౌరవం ఇస్తూ కొంచెం అభిమానం కూడా కలగలిపితే చాలు. ఏ ధ్యానాలు, ఆధ్యాత్మిక వ్యాపారుల శిష్యరికాలు అవసరం లేదు.
కాని మనం అది తప్ప అన్నీ చేస్తాం మనశ్శాంతి కోసం. మనకి మనశ్శాంతి లభించడం లేదంటే వింతేముంది?
సరియైన మానవ సంబంధాలు కలిగి ఉండకుండా స్వాములు, బాబాలు, అమ్మలు, ఆనందాల చుట్టూ తిరగడం వృథా ప్రయాస. ధ్యానాన్ని మించినది ఆప్యాయత పంచడం. యోగా అక్కర్లేదు అనురాగం పంచడం, పొందడం చేతనైతే.
కాని వినేవాళ్శెవరు? ఆధ్యాత్మికత వ్యాపార వస్తువు గా అమ్మితేనే కాని మనకు ఆకర్షణీయంగా ఉండదు.
ఆ స్వాములు మాత్రం ఏం చేస్తారు మన అజ్ఞానానికి?
ఇంట్లో వాళ్ళని చిన్నచూపు చూస్తూ ఆధ్యాత్మిక వ్యాపారుల చుట్టూ తిరగడం అమాయకత్వానికి పరాకాష్ట.
అమ్మ, నాన్న, భార్య/భర్త ఆక్క/చెల్లి, అన్న/తమ్ముడు ఈయలేని మనశ్శాంతిని భగవంతుడు కూడా ఈయలేడు. ఈ నిజం బుఱ్ఱకెక్కనంతవరకు మనశ్శాంతికై బుఱ్ఱలు బద్దలుకొట్టుకున్నా తరుణోపాయం లభించదు.

************
నాగరికత 

మన వాళ్ళైన మన కుటుంబం లోని తోటి మనుషులకు ఉపయోగ పడడం నేటి మేధావులచే నిషేధింప బడింది.
మనందరం ఈ నిషేధాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాము. మన జీవితాలు డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉన్నాయని " విజ్ఞుల" ఉవాచ. మరి అనారోగ్యాలు, పసితనాలు, వృద్ధాప్యాలు ఎలా గడుస్తాయో? మనది నాగరికతా? గుడ్డెద్దు చేలో పడడమా?
**********
మేధావులు - రాజకీయ నాయకులు - గారాబాలు

నేటి మేధావులందరూ మన హక్కులను గురించే మాట్లాడుతారు.మన బాధ్యతల గురించి ఎవరూ మాట్లాడరు.
బాధ్యత లేని హక్కులు సమాజానికి చేటు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు, సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం మేధావులు నిరంతరం శ్రమ పడుతూంటారు. 

ఆ హడావిడిలో సంఘం శ్రేయస్సు గురించి ఎవరూ పట్టించుకోరు. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. ఎందుకు మాట్లాడినా హక్కుల కోసం మాత్రమే మాట్లాడితే పల్లకీ ఎక్కేవారే కాని మోసే వారుండరు.

ఇంతటి బాధ్యతా రాహిత్యంతో నాయకులు, మేధావులు మనల్ని గారాబం చేస్తున్నారు. మనమూ చంటి పిల్లల లాగా ఆ గారాబాన్ని ఆస్వాదిస్తూ ఎదగడం లేదు. అందుకనే సంఘం, దేశం అల్లల్లాడి పోతున్నాయి.

ఏదో కారణంగా రకరకాల వర్గముల వారిని, స్త్రీ పురుషులను తమ తమ జీవితాలకై కష్టపడనివ్వటం
లేదు. మృగతృష్ణ వంటి అంశాలు చూపించి, సొల్లు కబుర్లు చెప్పి వారిని ఉభయ భ్రష్టులుగా చేస్తున్నారు.
సంఘంలో అందరూ కలిసి సామరస్యం, సౌహార్దాలతో పరస్పరం సాయం చేసుకుంటూ ఎవరి బాధ్యత వారు వహిస్తే నే దేశం, సంఘం ప్రగతి పథంలో నడుస్తాయి. గారాబాలు ఆ వర్గాలకు, దేశానికీ కూడా చేటు.
********
What fate is worse than this?

   God molds us and creates
No nature evolved molding us;
And we appeared after millions of
Years of events and processes
Starting big-bang; through pre-biotic,
Biotic, macro-molecular, species
Evolution, is current scientific information
Whoever created us or whatever
Evolved us; will it make any difference
Once we appeared? Our present aim
Is to live a life of joy and peace;
Let us strive for us
Let us not make it splinter
Pieces by insisting this God
Created us; that God is taking
Care of us; only this religion
Can deliver things to us and
Liberate us from our difficulties
Agonies, disturbances and create
An atmosphere of hell on earth;
But we are particular about creation
Or evolution; we want to prove it
At the cost of our extinction by
Mascaraing one another; what a
Wisdom is ruling our minds?
What fate is worse than this madness?


Saturday, September 16, 2017

దివ్యులు; No Alternative; ఆకర్షణల వలయాలలో

దివ్యులు

రచయితలు రమ్య రమణీయ సాహితీ చిత్రకారులు
రచయితలు సంఘమునకు చదువు చెప్పు చదువరులు; 
రచయితలు సమాజమునకు మార్గదర్శకులు; 
రచయితలు మనవారు మనతోటివారు

సంకటమున నున్న మనుషులకు దారి చూపువారు
తత్త్వమును లౌకికమును సమముగ అందించు అక్షరాస్యులు; 
జ్ఞానమును పెంచి అనవసర అశాంతి పరిజ్ఞానమును 
తుంచి మనసునకు హాయినిచ్చువారు

రాయి వంటి హృదయములను సుందర 
శిల్పములుగ మలుచు చేయి తిరిగిన శిల్పులు
రాగము భావము అనుభవమును కలిగించి
పరిణిత మనస్కులను చేయు పరిపక్వచిత్తులు

అందమును ఆనందమును రుచి చూపించు అందె
వేసిన చేతులు; ప్రజ్ఞానమున సరస్వతీ మూర్తులు

అన్ని శాస్త్రముల కళల జ్ఞానముల
విశేషముల తెలిసిన విద్వాంసులు

రచయితలు భగవంతునికి ప్రతిరూపములు
సంచిత ఆగామి కర్మల తొలగించు దివ్యులు

************

No Alternative

Politicians want to bring development
To Indians through caste, community,
Region, religion and language considerations:

Really can they?
70 years of rhetoric is
Unable to do anything
But fool Indians;

Still Indians believe in
The Promises and manifestos
Of political parties;

Why so?
Because
There is no alternative!

Politicians and intellectuals
Have divided Indians successfully

***********

ఆకర్షణల వలయాలలో

మా నాన్నగారి తరంలో నాటకాలు ఆకర్షణ; 
అంతకు ముందు తరాలలో‌ మేజువాణీలు;

మా తరంలో సినిమాలు ఆకర్షణ; మా అబ్బాయిల
తరంలో టి.వి., వీడియో గేమ్స్ ఆకర్షణ;

ఇప్పుడు అంతర్జాలమున సమయము గడుపుట
ఆకర్షణ; సాంఘిక సాలెగూళ్ళ చిక్కుకొని బాహ్యము
మరచుట ఆకర్షణ; చరవాణుల చిక్కుకొని చిత్రంగా
వర్తించుటయు ఆకర్షణ;

ఆకర్షించే వస్తువు తరతరానికీ మారుతుంది; సమయ
యాపనము తాపముల విరహముల జరుగుతుంది;

ప్రేమయో వయసున సహజమైన ఆకర్షణయో
యువతీయువకుల స్త్రీ పురుషుల కొంత సేపు
పట్టి ఉంచుతుంది; ఏవో బంధముల చిక్కుకొని
జీవితముల గడుపుట అప్పుడూ ఇప్పుడూ తప్పనిది