Tuesday, August 10, 2021

మెళుకువగా నిద్రపోవడం

 మెళుకువగా నిద్రపోవడం


డా. వారణాసి రామబ్రహ్మం

నిద్ర మనందరికీ అవసరమైన, ఇష్టమైన విశ్రాంతి. 

భారతీయ తత్త్వ శాస్త్రం నిద్రని కూలంకషంగా విశ్లేషించింది.

భారతీయ తత్త్వ శాస్త్రం మొత్తం అంత జ్ఞానాన్ని వ్యక్తి కేంద్రంగా పరిశీలించి, పరిశోధించింది. వివరించింది. విశద పరిచింది. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని లోతుగా అధ్యయనం చేసింది. 

మనిషి యొక్క వ్యక్తిత్వానికి మూలమైన భావన "నేను". ఈ నేను చుట్టూనే మనిషి మానసిక, లౌకిక జీవితాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. 

అందుకనే ఉపనిషత్ స్రష్టలు ఈ "నేను" (సంస్కృత పదం అహమ్), తో మొదలు పెట్టి, దాని చుట్టూతానే తత్త్వాన్ని అల్లారు. తరువాత పరిణమించిన నాస్తిక, ఆస్తిక దర్శనములు ఈ పరంపర, సాంప్రదాయాన్నే కొనసాగించారు.

ప్రస్థాన త్రయం - ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాల - పై ఆచార్యుల భాష్యాలు, వ్యాఖ్యానాలు వేదాంతాలను, భగవంతుని ప్రస్తావించాయి. ఈ వేదాంతులు పరస్పర విరుద్ధంగా ఉండడం వాస్తవం. ఆశ్చర్యం.

ఉపనిషత్ ప్రతిపాదిత "అహమ్" "ఇదమ్" శబ్దాల చుట్టుతానే ఈ వ్యాఖ్యానాలు సాగాయి. అన్ని ఉపనిషత్తులు తమ తమ ధోరణిలో ఈ అహమ్, ఇదమ్ శబ్దాలను విశదీకరించాయి.

ఈ క్రింది ఉపనిషత్ వాక్యాలు మనకు సుపరిచితమే. అవి:

అహం బ్రహ్మాస్మి

తత్త్వమసి

అయమ్ ఆత్మా బ్రహ్మ

ప్రజ్ఞానం బ్రహ్మ

రసోsవై సః

ఆనందో బ్రహ్మ

సర్వం ఖలు ఇదం బ్రహ్మ

వీటి తత్పరతే, తాత్పర్య సారాంశమే ఆత్మ జ్ఞానం, లేక బ్రహ్మ జ్ఞానం. 

ప్రస్తుతానికి వస్తే - మెళుకువ గా నిద్రపోవడం -
అంటే ఏమిటి?

ఉపనిషత్తుల ప్రకారం మనకు నాలుగు మానసిక దశలు రోజులో కలిగి, అదృశ్యమై
పోతాయి. మనం పుట్టినప్పటి నుంచి గతించే వరకు రోజులో ఈ మానసిక దశలను పొందుతూ రోజులు గడుపుతాం.

 ఆ నాలుగు మానసిక దశలు:

జాగ్రత్ - మెళుకువ దశ

స్వప్న - కల దశ

సుషుప్తి - గాఢనిద్ర

జాగ్రత్ సుషుప్తి - మెళకువతో కూడిన గాఢనిద్ర

మనిషి మానసిక జీవి. భౌతిక, లౌకిక (సాంఘిక), ఆధ్యాత్మిక ప్రపంచాలలో వర్తిస్తున్నట్టు కనిపించినా, అంతా మానసికమే.
మానసిక కార్యకలాపాల నిర్వహణే. శరీరం. చేసే పనులను కూడా మనసే నియంత్రిస్తుంది.
మనసు స్పర్శ లేక మానసిక, శారీరక కార్యకలాపాలు జరుగవు.

భౌతిక, లౌకిక కార్య నిర్వహణ, అనుభవాలు, ఆలోచనలు, భావాలు, పలుకులు, భౌతిక, లౌకిక, ఆధ్యాత్మిక, తత్త్వ జ్ఞాన సముపార్జనలు, అధ్యయనాలు, అవగాహనలు, మనసు మాధ్యమంలోనే జరుగుతాయి. వాటి తలంపులు, వ్యక్తీకరణ, అధ్యాపనం కూడా మనసే చేస్తుంది. 

మనసు అని మనం సూక్ష్మంగా చెప్పినా, చేసే పనిని బట్టి మనసుకు నాలుగు పేర్లు.అవి:
మనోబుద్ధ్యహంకారచిత్తములు. వీటినే అంతఃకరణములు అంటారు. ఇవి చేసే పనులే మానసిక కార్యకలాపాలు. కార్యక్రమాలు. వీటిని అన్నింటినీ కలిపి "ఇదమ్" అంటారు.

మనసు - గ్రహణ, వ్యక్తీకరణ, కాల, దేశ స్పృహలు; బుద్ధి - తర్కం, విచక్షణ, నిర్ధారణ; అహంకారం - వ్యక్తిత్వ స్పృహ, అహంకార, అహంభావ, మమకారాల భావనలు, వ్యక్తీకరణలు; చిత్తం - అనుభవ, అర్థ, స్ఫూర్తి స్పృహలు, స్మృతులు (పై వాటిని భద్ర పరచడం, మళ్ళీ ప్రేరణ కలిగించి వెలికి తీయడం.

ఇలా ఇదమ్ ఏర్పడుతుంది.

ప్రజ్ఞానం బ్రహ్మ - ఉపనిషత్ మహా వాక్యం ప్రకారం అహం అంటే శుద్ధ గమనిక. గమనించే తెలివి. 

సహజ స్థితిలో ఈ అహం - అదే ఆత్మ, బ్రహ్మము - ఏ విధమైన మానసిక కార్యకలాపాలు జరగని దశలో ఉంటుంది. గమనిక ఉండడం వల్ల, మానసిక, భౌతిక ప్రపంచాలు తెలుస్తూ ఉంటాయి. కాని మానసిక కార్యకలాపాలు జరుగక పోవడం వల్ల ఆత్మ సహజమైన శాంతి మనసు నిండా నిండి ఉంటుంది. ఇదమ్ దృష్టిలో ఉండదు. అందువలని ఆనందం, నిరాకులత్వం, మౌనం సహజత్వాలుగా అనుభవింపబడుతూ ఉంటాయి.

ఈ స్థితినే సత్-చిత్-ఆనంద - సచ్చిదానంద స్థితి అంటారు.

ఈ స్థితి అనుభవంగా ఉండడమే 

మెళుకువగా నిద్రపోవడం. 

దీనిని విశ్రాంత దృష్టి సమయము అంటారు.

ఇది అంతఃకరణముల కార్యకలాపాల విరమణ లేక విరామ స్థితి. 

కాల, దేశ, వ్యక్తిత్వ స్పృహలు లేని నిర్మల మానసిక స్థితి. 

దీనినే అద్వైత స్థితి - దృష్టిలో అహమ్ - శుద్ధ గమనికగా ఉండి, ఇదమ్ (మానసిక కార్యకలాపాలు జరగకుండా, ఆగిపోయి ఉండి దృష్టిలో లేకపోవడం.

జాగ్రత్ అంటే తెలుస్తూ ఉండడం, సుషుప్తి అంటే మానసిక కార్యకలాపాలు జరగకుండా, విరమింపబడి ఉండడం. ఇదే మెళుకువ గా నిద్రపోవడం.

జాగ్రత్ - మెళుకువ, స్వప్న - కల మానసిక దశలలో మానసిక కార్యకలాపాలు జరుగుతూంటాయి. కాల, దేశ, వ్యక్తిత్వ స్పృహలు కలిగి అన్ని శారీరక, మానసిక కార్యకలాపాలు జరుగుతూంటాయి. అన్ని రకముల జ్ఞాన, నైపుణ్య సముపార్జనలు, వ్యక్తీకరణలు జరిగే సమయం. ఈ సముపార్జన, వ్యక్తీకరణలలో సుషుప్తి దేశ కూడా పాల్గొంటూ ఉంటుంది. 

జాగ్రత్, స్వప్న, సుషుప్తి మానసిక స్థితుల ఏక సమయ వ్యవహరణమే, అప్పటి మనసు వ్యాపారమే - అనుభవములు, ఆలోచనలు, భావములు, గ్రహణలు, వ్యక్తీకరణలు, వ్యక్తిత్వ, కాదు, దేశ స్పృహలు ప్రేరేపించ బడడమే, కలగడమే, మన జీవనం. జీవితం.

మెళుకువ దశ సమయంలో జ్ఞాన, కర్మేంద్రియాలు, అంతఃకరణాల సమిష్టి వ్యాపారమే మన వ్యవహారం. ఇప్పటి మనసు దృష్టిని బహిర్ముఖ దృష్టి అంటారు.

అన్ని మానసిక కార్యకలాపాలు జరగడంలో సాయం చేసే కల మానసిక దశ ఉండే సమయంలో జ్ఞానేంద్రియాలు పని చేయవు. బహిర్ భౌతిక ప్రపంచంతో సంబంధం తెగిపోయి ఉంటుంది. ఇప్పటి మనసు దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు.

మెళుకువ, కల మానసిక దశలు ద్వైత స్థితి సమయాలు. ఈ స్థితులలో అన్ని రకాల మానసిక కార్యకలాపాలు జరగడం - ఇదమ్, 
వాటిని గమనించే తెలివిగా అహం, రెండూ దృష్టిలో ఉంటాయి. అందుకే ఇవి ద్వైత - రెండు ఉండే - స్థితులు. మానసిక సృష్టి అయిన విషయ, విషయానుభవ ప్రపంచం, స్మృతులు ప్రేరణ పొంది ఉంటాయి.

సుషుప్తి లేక గాఢనిద్ర మానసిక కార్యకలాపాల విరామ సమయం. అహమ్ ఉన్నా దృష్టిలో ఉండదు. మానసిక కార్యకలాపాలు విరమింప బడి ఉంటాయి కాబట్టి ఇదమ్ కూడా దృష్టిలో ఉండదు. సుషుప్తి కూడా అద్వైత స్థితియే.

ఉన్న మానసిక స్థితులు రెండే - సృష్టి (మానసిక, భౌతిక ప్రపంచాలతో సంబంధం ఉండడం); నిద్ర - మానసిక కార్యకలాపాలు విరమింపబడిన సమయం). 

జాగ్రత్ సుషుప్తి దశలో, అనగా మెళకువగా నిద్రపోయే సమయంలో అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియాలు, రథానికి పూన్చిన గుర్రాలలా ఉండి అదిలిస్తే పరిగెట్టడనికి సిద్ధంగా ఉంటాయి - సంకల్పిస్తే మానసిక కార్యకలాపాలు జరుగుతాయి. సంకల్పం లేకపోతే మనసంతా పూర్ణమైన శాంతి నిండుగా ఉంటుంది.

ఇదండీ మెళుకువ గా నిద్రపోవడం అంటే.

ఈ స్థితినే ముక్తి, మోక్షం, భక్తి, శుద్ధాహం, శుద్ధ జ్ఞానం, ప్రజ్ఞానం అంటారు. ఆత్మ స్థితి అన్నా, బ్రహ్మ స్థితి అన్నా ఇదే. ఇదియే పరమాత్మ స్థితి కూడా.

బ్రహ్మ సత్ జగన్మిథ్యా 
జీవో బ్రహ్మ ఏవ న అపరః 

వాక్యాల సారాంశమూ ఇదే. 

వ్యక్తిత్వ స్పృహ, కాల, దేశ స్పృహలు లేని గమనించే తెలివియే ఆత్మ. బ్రహ్మము.

వ్యక్తిత్వ, కాల దేశ స్పృహలు ఉండడమే జీవ స్థితి. 

ఈ స్పృహలు దృష్టిలో లేకపోవడమే ఆత్మానుభవము. దృష్టిలో ఉండడమే జీవితానుభవం. జీవానుభవం.

వ్యక్తిత్వ స్పృహ లేని జీవుడే బ్రహ్మము.

అన్ని ఆధ్యాత్మిక సాధనల పరమ గమ్యం ఇలా మెళుకువ గా నిద్రపోతూ, విహిత కర్మలను, విధ్యుక్త ధర్మములను నిర్వహించడానికే.

ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!